Feb 12, 2020

రాజధానిలో కేంద్రం భాగస్వామ్యం

v అమరావతిని రాజధాని ప్రాంతంగా ఏర్పాటుచేయాలని అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించింది. ఆ ఆమోదం తర్వాతే అమరావతికి నిధులు విడుదల చేసింది. అంతేకాదు...అవసరాన్ని బట్టి అటవీ భూములను కూడా రాజధాని కోసం డీనోటిఫై చేసేందుకు అంగీకరించింది. పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు భూ కేటాయింపు కోసం డబ్బు కూడా చెల్లించాయి. అందుకే రాజధాని అమరావతిలో కేంద్రం కూడా భాగస్వామే.
v   రాష్ట్ర విభజన అనంతరం, రాజధాని ఎక్కడుండాలన్నది నిర్ణయించేందుకు శివరామకృష్ణన్‌ కమిటీని కేంద్రం నియమించింది. తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి వదిలిపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి, విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించింది. దీనికి అప్పటి సభలో ప్రాతినిథ్య పార్టీలైన టీడీపీ, వైసీపీ, బీజేపీ మద్దతిచ్చాయి. ఆనాడు తీర్మానం కూడా ఏకగ్రీవమే. ఏ ఒక్క పార్టీ, ఒక్క ఎమ్మెల్యే కూడా వ్యతిరేకత తెలపలేదు. అదే తీర్మానాన్ని నాడు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. దాన్ని కేంద్రం ఆమోదించి..అమరావతిని రాజధానిగా గుర్తించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనలను అమలుచేసింది. ఈ చట్టంలోని సెక్షన్‌ 94(3)ప్రకారం రాజధానిలో అవసరమైన సదుపాయాలు...అంటే రాజ్‌భవన్‌, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టులాంటి వాటి ఏర్పాటుకు, నిర్మాణానికి నిధులివ్వాలి. దీని ప్రకారమే రాజధానికి రూ.1500కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. సచివాలయం, శాసనసభ, శాసనమండలి, హైకోర్టు భవనాల నిర్మాణం జరిగింది. విజయవాడ, గుంటూరుల్లోను అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటుకు వెయ్యికోట్ల రూపాయలను కేంద్రప్రభుత్వం ఇచ్చింది. దీన్ని కూడా రాజధానికి ఇచ్చిన లెక్కల్లోనే కేంద్రం చూపించింది. పునర్విభజన చట్టం సెక్షన్‌ 94(4)ప్రకారం..రాజధాని నిర్మాణం కోసం అవససరమైతే అటవీ భూములను డీనోటిఫై చేసేందుకు కూడా కేంద్రం సహకరించింది. ఎయిమ్స్‌ నిర్మాణం కోసం, ఇతర చోట్ల ఇలాంటి మినహాయింపు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను కేంద్రం సానుకూలంగానే పరిశీలించింది.
కేపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ మినహాయింపు
v రాజధాని రైతులకు కేపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ మినహాయుంపు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. కేపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ అంటే లాభాల మీద వేసే పన్ను. ఒక వ్యక్తికి ఉన్న ఆస్తులు...ఇళ్లు, అపార్ట్‌మెంట్‌, షేర్లు, పొలాలు, స్థలాలు...ఇవన్నీ మూలధన స్థిరాస్థులు. ఇలాంటివాటిని కొనుగోలు చేసిన విలువ కంటే ఎక్కువకు అమ్మినప్పుడు వచ్చే లాభంపై పన్ను వేస్తారు. ఈ పన్ను ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అమరావతిలో రైతుల పొలాలు విక్రయించినప్పుడు కూడా ఈ క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ కట్టాలి. అయితే ఇక్కడంతా రైతులు ఉన్నందున రాజధాని పరిధిలోని 29 గ్రామాల వరకు ఈ పన్నుకు మినహాయింపు ఇవ్వాలని నాటి రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. చివరకు కేంద్రం అంగీకరించి ఈ పన్ను మినహాయింపు ఇచ్చింది. తనకు వచ్చే ఆదాయాన్ని వదులుకుంది.
కేంద్ర సంస్థలకు భూమి
v   కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాజధానిలో భూమిని తీసుకున్నాయి. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వలేదు. కేటాయించిన భూములపై సుమారు రూ.175 కోట్ల ధర వసూలుచేసింది. భారత సైన్యం, రైల్‌ టెల్‌ కార్పొరేషన్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ సెంటర్‌ తదితర సంస్థలు భూమిని తీసుకున్నాయి. రాజధాని కాబట్టే ఇక్కడ తమ కార్యాలయాలు పెట్టేందుకు ముందుకొచ్చాయి. డబ్బులు చెల్లించి భూమిని తీసుకున్నాయి. రాజధానిలో భూములు తీసుకోవడం, వాటికి డబ్బు చెల్లించడం ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం రాజధానిలో భాగస్వామి అయింది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...