§ 25,217 మంది రైతుల నుంచి 31,989 ఎకరాల సమీకరణ
§
ప్రధాన వెబ్ సైట్ లో
పూర్తి వివరాలు
§
డ్యాష్ బోర్డులో అన్ని
విభాగాల వివరాలు వెల్లడి
§ డిజిటలైజేషన్ లో దూసుకుపోతున్న ఏపీ
డిజిటలైజేషన్
లో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం అన్ని రంగాలలో పారదర్శకత ప్రదర్శిస్తోంది. డిజిటలైజేషన్
రంగంలో దేశంలో ఏపీ ప్రభుత్వం ప్రథమ స్థానం సాధించి, అవార్డు పొందిన విషయం
తెలిసిందే. రాష్ట్రంలోని పలు శాఖలలో డిజిటలైజేషన్ వల్ల పారదర్శకత, జవాబుదారీతనం
పెరిగినట్లు, అక్రమార్జనకు కళ్లెంపడి అవినీతి
తగ్గినట్లు నీతిఅయోగ్ ప్రశంసించింది. రాజధాని
ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ)కు సంబంధించి కూడా సీఎం డ్యాష్ బోర్డు
మాదిరి డ్యాష్ బోర్డుని ఏర్పాటు చేశారు. ఈ
డ్యాస్ బోర్డులో సీఆర్డీఏకు సంబంధించిన అన్ని విభాగాల వివరాలు పొందుపరిచారు. ఏపీ
ఇ-ప్రొక్యూర్ మెంట్, నా ఇటుక – నా అమరావతి వంటి లింకులను కూడా ప్రధాన వెబ్ సైట్ లో
ఉంచారు. 8,603 చదరపు కిలోమీటర్ల సీఆర్డీఏ పరిధిలో 217
చదరపు కిలోమీటర్లలో నూతన రాజధాని అమరావతిని నిర్మిస్తారు. రాజధాని నిర్మాణానికి
సంబంధించి ఎంత భూమి కావాలి, ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎంత సేకరించారు, ఎంత మంది
రైతులు భూములు ఇచ్చారు, ఎంతమంది భూమిలేని పేదలకు పెన్షన్ ఇస్తున్నారు, మాస్టర్
ప్లాన్, టెండర్లు, ఆమోదించిన, ఆమోదించని ప్లాన్లు తదితర వివరాలన్నింటిని ప్రధాన వెబ్ సైట్ లో ఉంచారు.
12 అంశాలతో డ్యాష్ బోర్డు
ప్రధాన వెబ్ సైట్ కు అనుబంధంగా ఇప్పుడు 12
అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిపేందుకు ఓ డ్యాష్ బోర్డు ఏర్పాటు చేశారు. ల్యాండ్
పూలింగ్ స్కీమ్(ఎల్పీఎస్), ఒకేసారి రైతుల రుణ మాఫీ, భూములిచ్చిన రైతులకు వార్షిక
చెల్లింపు, బిల్డిండ్ పెనలైజేషన్ స్కీమ్(బీపీఎస్), అమరావతి స్కిల్ డెవలప్ మెంట్
ఇన్ స్టిట్యూషన్(ఏఎస్ డీఐ), మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్-నరేగా),
అమరావతి, అమరావతిలో భూమి లేని నిరుపేదల పెన్షన్ (ఏఎల్ పీపీ), బయోమెట్రిక్ హాజరు,
ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, పరిసరాల పచ్చదనం, అమరావతిలో ఎన్టీఆర్ క్యాంటిన్ అంశాలకు
సంబంధించి సమగ్ర సమాచారం పొందుపరచడానికి ఈ డ్యాష్ బోర్డు ఏర్పాటు చేశారు. ఇందులో మూడు
అంశాలు (ఉచిత ఆరోగ్యం, ఉచిత విద్య, బయోమెట్రిక్ హాజరు) తప్ప మిగిలిన
వివరాలన్నింటినీ అప్ డేట్ చేశారు. నరేగాకు సంబంధించి మెయిన్ వెబ్ సైట్ లింగ్
ఇచ్చారు.
25,217 మంది రైతుల నుంచి 31,989 ఎకరాల సమీకరణ
డ్యాష్ బోర్డులో తెలిపిన ప్రకారం నూతన
రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం 27,625 మంది రైతుల నుంచి 34,095.8322 ఎకరాలు సమీకరించాలని
నిర్ణయించింది. ఇప్పటి వరకు 25,217 మంది రైతుల నుంచి 31,989.5913 ఎకరాలు సమీకరించింది.
ఇంకా 2115 మంది రైతుల నుంచి 1175.8978 ఎకరాలు సమీకరించవలసి ఉంది. ఏ గ్రామంలో ఎంత
భూమి సమీకరించారో, ఎంత సమీకరించాలో, పట్టా భూమి, అసైన్డ్ భూమి, దేవాదాయ శాఖ
భూమి... తదితర వివరాలు కూడా ఇక్కడ అప్ డేట్ చేశారు.
రూ.88.67
కోట్ల రుణాలు రద్దు: రైతుల రుణాల రద్దులో భాగంగా రాజధాని పరిధిలోని గ్రామాల రైతుల
రుణాలను ఒకేసారి రద్దు చేశారు. మొత్తం 27 గ్రామాలలోని 20,355 మంది రైతులకు చెందిన
రూ.88.67 కోట్ల రుణాలను ఒకేసారి రద్దు చేశారు. గ్రామాల వారీగా వివరాలను కూడా ఇక్కడ
ఉంచారు.
వార్షిక చెల్లింపులు రూ.136 కోట్లు: స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన
రైతులకు ప్లాట్లు కాకుండా భూ సారం ఆధారంగా ఏడాదికి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు
పది సంవత్సరాలపాటు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఆ ప్రకారం వార్షిక
చెల్లింపులలో భాగంగా 31,987.84 ఎకరాలకు 26,776 మంది రైతులకు ఇప్పటి వరకు ప్రభుత్వం
రూ.136.71 కోట్లు విడుదల చేసింది. గ్రామాలు, యూనిట్ల వారీగా పూర్తి వివరాలు ఇందులో
ఉంచారు.
బీపీఎస్ కింద 6429 దరకాస్తులు: బిల్డింగ్ పెనలైజేషన్ పథకం కింద సీఆర్డీఏకు
ఇప్పటి వరకు 6429 దరకాస్తులు వచ్చాయి. వాటిలో 1813 ప్రొసీడింగ్ లెటర్ దశలో
ఉన్నాయి. 4491 పరిశీలనలో ఉన్నాయి. 125 దరకాస్తులను తిరస్కరించారు. వ్యక్తిగతంగా
దరకాస్తు ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి బీపీఎస్ సైట్ లింక్ కూడా అక్కడే ఇచ్చారు.
ఏఎస్ డీఐ:
అమరావతి స్కిల్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూషన్
ద్వారా 483 మందికి శిక్షణ ఇప్పించారు. వారిలో 386 మందికి ఉపాధి కల్పించారు. 225
మందికి నేరుగా ఉపాధి కల్పించారు. గ్రామాల వారీగా ఎంతెంతమందికి ఉపాధి కల్పించారో
పూర్తి వివరాలు పొందుపరిచారు.
ఏఎల్ పీపీ కింద 22,021 మందికి పెన్షన్:
అమరావతి గ్రామాలలో భూమి లేని నిరుపేదల పెన్షన్ (ఏఎల్ పీపీ) పథకం కింద ఒక్కొక్క
కుటుంబానికి నెలకు రూ.2,500 ఇస్తున్నారు.
ఇప్పటివరకు 22,021 కుటుంబాలకు రూ.104.60 కోట్లు విడుదల చేశారు. గ్రామాల
వారీగా పూర్తి వివరాలు డ్యాష్ బోర్డులో పొందుపరిచారు.
పరిసరాల పచ్చదనం, సుందరీకరణ: సీఆర్డీఏ
ప్రాంతంలో, రాజధాని పరిధిలో పరిసరాల పచ్చదనం, సుందరీకరణ పనుల వివరాలను ఇక్కడ
పొందుపరిచారు. గన్నవరం- తాడిగడప క్రాస్ రోడ్డులో రూ.95 లక్షల రూపాయలతో పనులు
చేస్తున్నారు. గన్నవరం-నిడమానూరు రోడ్డుకు ఇరువైపుల సుందరీకరణకు నాలుగు కోట్ల
రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నిడమానూరు-రామవర్పాడు రింగ్ రోడ్డు వరకు రూ.68
లక్షలతో పనులు చేపట్టారు. భవానీపురం నుంచి ఇబ్రహీంపట్నం వరకు పూల మొక్కలు,
పచ్చికబయళ్లు ఏర్పాటు కోసం మూడు కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. అమరావతి పరిధిలో
వెలగపూడిలో రూ.4.5 కోట్లు, తుళ్లూరులో రూ.80 లక్షల ఖర్చు చేసి పచ్చదనం
నింపుతున్నారు. కడియం, బెంగళూరు, కోల్ కత్తాల నుంచి మొక్కలు తెప్పిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి ఉద్దండరాయునిపాలెంలో
శంకుస్థాన చేసిన ప్రదేశం పూల తోటను మరిపించేవిధంగా చేశారు. ఇక్కడ 2,168 చదరపు
మీటర్ల ప్రాంతాన్ని పచ్చికబయళ్లుతో నింపారు. అన్ని ప్రాంతాల ఫొటోలతోసహా ఆ వివరాలను
డ్యాష్ బోర్డులో ఉంచారు.
అమరావతిలో ఎన్టీఆర్ క్యాంటిన్: అమరావతిలో పెట్టిన ఎన్టీఆర్ క్యాంటిన్ ద్వారా
85,399 మందికి లంచ్, బ్రేక్ ఫాస్ట్ అందించారు. జూన్ 25 నుంచి ఏ నెలలో ఎంత మందికి
ఆహారం అందజేశారో వివరాలు తెలిపారు. ఇడ్లీ, పొంగల్, పెరుగన్నం, సాంబారన్నం వంటివి
ఎంత పరిమాణంలో అందజేశారో కూడా వివరాలు పొందుపరిచారు.
ఈ విధంగా
సీఆర్డీఏలో జరిగే ప్రతి పనికి సంబంధించిన పూర్తి వివరాలను దాపరికంలేకుండా ఈ డ్యాష్ బోర్డులో పొందుపరిచారు. నూతన రాజధాని
నిర్మాణంలో అన్ని అంశాలకు సంబంధించి సమగ్ర వివరాలు అందరూ తెలుసుకునే ఏర్పాట్లు చేశారు. ఈ
విధంగా పారదర్శకతలో దేశంలో ఏపీ అగ్రభాగాన నిలిచింది.
జారీ
చేసినవారు: రిసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగం, సమాచార,
పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
apspecialnews@gmail.com