May 21, 2017

ఆచ్ఛాదన, అశ్లీలతలేని అందమైన స్త్రీ మూర్తి!

అదే డాక్టర్ మాచిరాజు సృష్టి
    మేళకర్తల రాగాలకు కూడా
   వర్ణ రూపం ఇచ్చే  ప్రయత్నం

         ఆయన కుంచె కదిపినా, గీత గీసినా స్త్రీ రూపం సంతరించుకుంటుంది. స్త్రీ  అంటే ఆయనకు అంతటి గౌరవం, అభిమానం. స్తీ మహాశక్తి స్వరూపిణి. సౌందర్య రాశి. స్త్రీ సౌందర్యం మనసుకి, మాటలకు అందదు.  దానిని రంగులలో, గీతలలో కాన్వాస్పై ఆవిష్కరించే ప్రయత్నాలు ఆయన దీర్ఘకాలంగా కొనసాగిస్తున్నారు.  ఆచ్ఛాదన, అశ్లీలతలేని అందమైన స్త్రీ మూర్తిని సృష్టించగల దిట్ట. ఆయనే 'కళారత్న'డాక్టర్ మాచిరాజు రామచంద్రరావు.   ఆయన వృత్తి వైద్యం. ప్రవృత్తి చిత్రకళ.  వైద్య వృత్తిలో ఊపిరిసలపకుండా ఉన్నప్పటికీ  చిత్రకళపై ఆయనకు మక్కువ ఏమాత్రం తగ్గలేదు. చిత్రకళలో కూడా ఉన్నత స్థాయికి ఎదిగారు.  ఆయన చిత్రకలకు ప్రధాన వస్తువు స్త్రీ మూర్తి. ప్రకృతి దృశ్యాలు - మనసులో మెదిలే భావాలు - ఆలోచనలు - స్త్రీ సౌందర్య రూపాలన్నింటినీ ఆయన కాన్వాస్ మీద ఆవిష్కరించారు. అశ్లీలత గోచరించకుండా అందమైన స్త్రీ రూపాన్ని అంతే అందగా, నగ్నంగా చిత్రించగల కళాపిపాసి. అవన్నీ ఆయన ప్రతిభకు అద్దం పడతాయి. అంతర్జాతీయ స్థాయి చిత్రకారుల కళారీతులను అధ్యయనం చేశారు. దేశ విదేశాల్లో అనేక మంది చిత్రకారులను కలసి వారితో భావాలను పంచుకున్నారు.  సాహిత్య, సంగీతంలో కూడా ఆయనకు ప్రవేశం ఉంది. ఇంగ్లీషు, తెలుగు భాషల్లో దిగ్గజాల రచనలు, కవితలు చదివి ఆయన ఓ గొప్ప తత్వవేత్తగా ఎదిగారు. సాహిత్యంలోని లోతులను ఎంతగా అవగాహన చేసుకుంటారో, సంగీతంలోని మాధుర్యాన్ని అంతగా ఆస్వాదిస్తారు. ఒక్క స్త్రీ సౌందర్యాన్నే కాకుండా, ప్రకృతిలోని అందాలతోపాటు 'వర్ణవిలాసంలో స్వర్ణవినాయకం' అని విఘ్నేశ్వరుని కూడా పలు రూపాలలో చిత్రించారు.  చిత్రకారులకు వినాయకుని రూపం ఓ వరం. 5,6 గీతలతో కూడా ఆ రూపాన్ని చూపించగలరు. మాచిరాజు కూడా వివిధ రంగుల్లో అనేక రూపాలకు జీవం పోశారు. తన అపురూప చిత్రాలతో ఖండాతరవాసులను కూడా ఆయన ముగ్దలను చేశారు. డాక్టర్ మాచిరాజు దేశవిదేశాల్లో హైదరాబాద్, బెంగళూరు, పాండిచేరి, ముంబై, న్యూఢిల్లీలతోపాటు మాంచెస్టర్, లివర్ పూల్, వేల్స్, చెష్టర్ షైర్ వంటి చోట్ల తన ఆర్ట్ ఎగ్జిబిషన్లు నిర్వహించారు.

          పెన్సిల్తో మొదలై జలవర్ణం, తైలవర్ణం చిత్రాల వరకు - సాంప్రదాయ చిత్రాల నుంచి ఆధునిక నైరూప్య చిత్రాల వరకు -  ఒంగోలు నుంచి లండన్ వరకు ఆయన చిత్రకళా ప్రదర్శనల ప్రస్తానం కొనసాగుతోంది. ఆయన ఆలోచనల దొంతరుల నుంచి రూపుదిద్దుకున్న చిత్రాలు  కళాభిమానులను అబ్బుపరుస్తాయి. బాపు, ఎస్ వి రామారావు వంటి సుప్రసిద్ద చిత్రకారుల ప్రశంసలు అందుకున్నారు.   కాల క్రమంలో ఏడాదికేడాది కొత్త ఆలోచనలతో , కొత్త ఆవిష్కరణలతో ఆయన చిత్ర కళలో వైవిద్యం, పరిణతి కనిపిస్తోంది. ఎన్ని ఇజాలను ఆయన అధ్యయనం చేసినా, ఎంతమందిని అభిమానించినా  సాంప్రదాయ, ఆధునిక రీతుల మేళవింపుతో తనదైన ఓ కొత్త శైలిని రూపొందించుకున్నారు.  రంగుల ప్రపంచంలో నిత్యనూతనంగా ప్రయాణించే ఓ స్వాప్నికుడు. కొంగొత్త స్పూర్తితో మాయా సౌందర్యం  అంతఃకోణాన్ని నైరూప్యతతో నూతన పద్దతులలో చిత్రించడం కూడా మొదలుపెట్టారు. నైరూప్య చిత్రాల అస్పష్టతలోంచి స్పష్టత చూపే ప్రయత్నం చేస్తున్నారు. నైరూప్యత అంటే అదో చైతన్య స్రవంతి. సత్య సౌందర్యం. దృశ్యానికి భాష అవసంరలేదు.  కుంచె పట్టుకుంటే ఆయన ఓ తత్వవేత్తయిపోతారు. ఆ రంగుల్లో, ఆ గీతల్లో, ఆ ఒంపుల్లో చెప్పే అంశాలు అనంతం. అదో అద్భుత ప్రపంచం. ఆయన కుంచె నుంచి జాలువారిన  నైరూప్యతలో స్పష్టత వచ్చిన తరువాత, ఆ స్వచ్ఛత, ఆ నిర్మలత్వం, దాని అర్ధం బోధపడటం....ఆ అనుభూతి, ఆ ఆనందం, ఆ హాయి వేరు. అది అనుభవించవలసిందే. వర్ణించడం సాధ్యంకాదు. అదో మధురానుభూతుల మేళవింపు. ఆ రంగుల్లో, ఆ గీతల్లో, ఆ ఒంపుల్లో చెప్పే అంశాలు అనంతం. అదో అద్భుత ప్రపంచం. స్త్రీ మూర్తిని అర్ధం చేసుకోవడం, ఆమె సౌందర్యాన్ని  తెలుసుకోవడమేకాదు సాహిత్యం, సంగీతంలో కూడా ఆయనకు ప్రవేశం ఉంది. వాటిలో కూడా ఆయన  పరిపూర్ణత సాధించారు. జ్ఞాన దృష్టితో రాగాలను కూడా రంగులలోకి మార్చగల సమర్ధుడు. ఇప్పుడు రాగాలను కూడా  వర్ణ రూపంలోకి మార్చే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఆ బృహత్తర కార్యక్రమాన్ని ఓ  తపస్సు, యజ్ఞంలా  కొనసాగిస్తున్నారు.   మేళకర్తల రాగాలకు వర్ణ రూపం    తేవడానికి 15 ఏళ్లుగా డాక్టర్ మాచిరాజు కుంచెతో సృజనాత్మకంగా కుస్తీ పడుతున్నారు.

        ఆయన సృష్టించే చిత్రాలకు ప్రేరణ గురించి ప్రస్తావించినప్పుడు, సమయం - వయసు - సందర్భం... ఏది ప్రభావితం చేస్తే అది కాన్వాస్ మీద ఆవిష్కరణ అవుతుందని చెప్పారు. స్త్రీ మూర్తిని నగ్నంగా చూపుతారన్న విమర్శకు  అందానికి ఆచ్ఛాదన దేనికి? అని ప్రశ్నించారు.  అలా అని స్త్రీని చపలచిత్తంతో చూడనని,  అందమైన దృష్టితోనే చూస్తానని, ఆ దృష్టితోనే తన మదిలో మెదిలిన రూపాన్ని గీస్తానని వివరించారు.  కర్ణాటక సంగీతంలో 72 తల్లి రాగాలు ఉన్నాయని, 72 మేళకర్తల రాగాలను వర్ణరూపంలోకి తీసుకువచ్చే ప్రయత్నం ప్రస్తుతం చేస్తున్నట్లు తెలిపారు.  ఇది తన జీవిత లక్ష్యంగా పేర్కొన్నారు. 15 ఏళ్లుగా ఇది కొనసాగుతోందన్నారు. ఇప్పుడే తుది దశకు వచ్చినట్లు తెలిపారు. దీనిని పూర్తి చేసి ప్రపంచ వ్యాప్తంగా కళా ఉత్సవాలు నిర్వహించాలని అనుకుంటున్నట్లు డాక్టర్ మాచిరాజు అని తన మనసులోని మాటలు చెప్పారు.

-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

May 20, 2017

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యస్థీకరణ చట్టంలోని సెక్షన్ 108ని మరో 2 ఏళ్లు పొడిగించాలి

కేంద్రాన్ని కోరాలని రాష్ట్రం నిర్ణయం

Ø మీడియా సమావేశంలో మంత్రి కాలవ, మీడియా సలహాదారు పరకాల వెల్లడి
Ø రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీలేదు
Ø వివాదాలులేవు-ఇబ్బందులే!
Ø స్థానికత మరో 2 ఏళ్లు పెంచాలి

సచివాలయం, మే 19: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు, ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ 
పరకాల ప్రభాకర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 108ని మరో 2 ఏళ్లు పొడిగించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వారు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయం 1 బ్లాక్ లోని తన కార్యాలయంలో శుక్రవారం చట్టం అమలును పర్యవేక్షించే ఉన్నతాధికారులతో సమావేశమై చట్టం అమలు తీరును, స్థానికత, సెక్షన్ 108, షెడ్యూల్ 9,10 తదితర అంశాలను సమీక్షించారని తెలిపారు. అనంతరం సచివాలయం 1వ బ్లాక్ లోని సమావేశమందిరంలో కాలువ శ్రీనివాసులు, పరకాల ప్రభాకర్ లు సమావేశం వివరాలను మీడియాకు తెలిపారు. చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో పొందుపరిచిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు వంటి 231 సంస్థల విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఏవైనా సమస్యలు, ఇబ్బందులు తలెత్తిగే సెక్షన్ 108 ప్రకారం వాటిని రాష్ట్రపతికి తెలియజేసే అవకాశం ఉందన్నారు. అయితే జూన్ 1తో ఆ సెక్షన్ కాలపరిమితి ముగుస్తుందని, ప్రస్తుతానికి సమస్యలు ఏమీ లేకపోయినా, భవిష్యత్ ను దృష్టిలోపెట్టుకొని ముందు జాగ్రత్తతో ఆ సెక్షన్ ను రెండేళ్లు పొడిగించమని కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఉన్నత విద్యా మండలికి సంబంధించి సుప్రీం కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిందని, దానికి విరుద్దంగా కేంద్రం జారి చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరినట్లు మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. కేంద్ర ఉత్తర్వుల ప్రకారం ఏదైనా సంస్థ ప్రధాన కార్యాలయం ఏ భవనంలో ఉంటుందో దానినే హెడ్ క్వార్టర్ అనాలని, ఆ ప్రాంగణం మొత్తాన్ని పరిగణించరాదు, అయితే ఇది సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్దమని ఆయన తెలిపారు. 9 షెడ్యూల్ లోని 64 సంస్థలకు సంబంధించి షీలా బిడే కమిటీ అధ్యయనం చేసి సిఫారసులు చేసినట్లు. ఇంకా 35 సంస్థల సిబ్బంది విభజన ఆమోదించవలసి ఉందని తెలిపారు.

విభజన చట్టంలోని హక్కులను చాలావరకు రాబట్టామని, అందులో లేనివి కూడా సాధించినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై త్రిసభ్య కమిటీ తరచూ గవర్నర్ తో సమావేశమవుతున్నట్లు తెలిపారు. ఆ సమావేశాలకు తెలంగాణ నుంచి కూడా ప్రతినిధులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఇంకా ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఆ ప్రయత్నాలను ఇంకా ముమ్మరం చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు పొందే విషయంలో రాజీలేదన్నారు. మనకు రావలసినవాటిని సాధించుకోవడంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంతోపాటు అన్ని రకాల అవకాశాలను ఉపయోగించుకుంటున్నట్లు వివరించారు. అయితే ఇంకా పరిష్కారం కాని అంశాలను ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకువెళుతున్నట్లు మంత్రి చెప్పారు. అన్ని అంశాలను తెలియజేస్తూ ఈ నెల 11న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా పరిష్కరించమని ఆ లేఖలో కోరినట్లు చెప్పారు. చట్ట ప్రకారం రావలసినవన్నీ దక్కించుకోవడానికి న్యాయం జరిగే వరకు కేంద్రం ద్వారా ప్రయత్నిస్తామన్నారు. ఏపీకి జరిగే నష్టాన్ని వివరించి రావలసిన ఆస్తులను రాబడతామని చెప్పారు. అలా కాని పక్షంలో సుప్రీం కోర్టుని ఆశ్రయిస్తామన్నారు. త్వరలో తామిద్దరితోపాటు ఉన్నతాధికాలు కలసి ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రిని, హాం శాఖ అధికారులను కలిసి అన్ని అంశాలను వివరిస్తామని చెప్పారు.

వివాదాలు లేవు ఇబ్బందులే : డాక్టర్ పరకాల

ఉన్నత స్థాయిలో దఫదఫాలుగా సమావేశమవుతూ విభజన చట్టంలోని అంశాలను పరిష్కరిస్తున్నట్లు పరకాల ప్రభాకర్ తెలిపారు. విభజన విషయంలో ఇరు రాష్ట్రా మధ్య వివాదాలు ఏమీలేవని, ఇబ్బందులు మాత్రమే ఉన్నాయని, పరిపాలనా పరమైన చర్యలు తీసుకోవలసి ఉంటుదని వివరించారు. ముందు జాగ్రత్త చర్యగా సెక్షన్ 108ని పొడిగించమని కోరుతున్నట్లు తెలిపారు. చత్తీస్ గఢ్, జార్ఖండ్ విడిపోయి ఇంతకాలమైనా వాటికి సంబంధించిన ఆస్తులు తరత్రా విభజనలు ఇంతవరకు పూర్తికాని విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందని, ఆస్తులు, నగదు, భవనాలు, అప్పుల విభజనను పున:పరిశీలించమని విజ్ఙప్తి చేస్తున్నట్లు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలతోపాటు అన్ని విధాల రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు చేయూతనివ్వాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు. కొన్ని క్లిష్టమైన అంశాలు ఉంటాయని, త్వరగా పరిష్కారమవుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. స్థానికత అంశం కూడా జూన్ 1తో ముగుస్తుందని, దానిని మరో రెండేళ్లు పొడిగించాలని కోరుతున్నట్లు తెలిపారు. అన్ని అంశాల్లో న్యాయం పొందేందుకు చివరి వరకు అన్ని విధాల ప్రయత్నిస్తామని, హక్కులను సాధించుకునేందుకు ఎంతవరకైనా వెళతామని, అవసరమైతే న్యాయం కోసం సుప్రీం కోర్టునైనా ఆశ్రయిస్తామని డాక్టర్ పరకాల చెప్పారు.

May 18, 2017

అసభ్యకరమైన వ్యాఖ్యలు భావప్రకటనా స్వేచ్ఛకు నిదర్శనమా?

ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్
·       జస్టిస్ కట్టూ ఇంట్లో ఆడవారిపై ఇటువంటి రాతలు రాస్తే సహిస్తారా?
·       సచివాలయంలోని కంప్యూటర్లపై వైరస్ ప్రభావం లేదు

        
   సచివాలయం, మే 18: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వస్తున్న అసభ్యకరమైన వ్యాఖ్యలు, జుగుప్స కలిగించే అర్ధనగ్న చిత్రాల పోస్టింగ్స్, వాటిని సమర్థిస్తున్న ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ నేతల వ్యవహార శైలిపట్ల ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరంలో గురువారం మధ్యాహ్నం జరిగిన  మీడియా సమావేశంలో ఆయన  మాట్లాడారు. సోషల్ మీడియా అరెస్టులపై  జస్టిస్ కట్టు మాట్లాడిన మాటలకు ఆయన అభ్యంతరం తెలిపారు. ఇటువంటి వాటిని అడ్డుకోవడానికి చట్టాలు ఉన్నాయని, వాటిని అమలు చేయడం ప్రభుత్వ బాధ్యతగా అని ఆయన పేర్కొన్నారు. వారు చేసిన పని రాజ్యాంగ విరుద్ధమైనదని, వారిని అరెస్ట్ చేయడం రాజ్యాంగాన్ని గౌరవించినట్లు అవుతుందన్నారు.  వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ తరువాత క్షమాపణలు చెప్పడం ఆయనకు అలవాటన్నారు. సుప్రీకోర్టుపైన, సుప్రీం కోర్టు జడ్జిలపైన, జర్నలిస్టులపై ఆయన గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పిన విషయాలను గుర్తు చేశారు. వాస్తవాలు తెలిసిన తరువాత ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నామన్నారు. భావప్రకటనా స్వేచ్ఛపై ఈ ప్రభుత్వానికి నమ్మకంలేనట్లు ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తమ ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా అనేక వేదికలపై చెప్పినట్లు పేర్కొన్నారు. నిర్మాణాత్మక విమర్శలు చేయడాన్ని తమ ప్రభుత్వం ఆహ్వానిస్తుందన్నారు.
            వ్యక్తిత్వ హననం, సభ్య సమాజం అసహ్యించుకునే నీచమైన స్థాయిలో చిత్రాలు, భాషను సోషల్ మీడియా పేరుతో వాడడం సబబేనా అని ఆయన ప్రధాన  ప్రతిపక్షాన్ని సూటిగా ప్రశ్నించారు. మనం పలకలేని, ఏ పత్రికలో ప్రచురించడానికి, టీవీలో ప్రసారం చేయడానికి అర్హతలేని భాషను,  మార్ఫింగ్ చిత్రాలను, అర్థనగ్ర చిత్రాలను పోస్టు చేస్తున్నట్లు చెప్పారు. వీటిని వారి పత్రికల్లో ఎందుకు ప్రచురించడంలేదని, టీవీలో ఎందుకు ప్రసారం చేయడంలేదని ఆయన అడిగారు. కట్జూ ఇంట్లోని ఆడవారి మీద ఇలాంటి అసభ్య రాతలు రాస్తే అంగీకరిస్తారా? భావ ప్రకటన స్వేచ్ఛ అని ఊరుకుంటారా? అని  డాక్టర్ పరకాల ప్రశ్నించారు.
                  ప్రస్తుతం సోషల్ మీడియాలో అభ్యంతరక వ్యాఖ్యలు, చిత్రాలు పోస్ట్ చేసినందుకు అరెస్ట్ చేసిన ఇదే ఇంటూరి రవికిరణ్ మీద 31 జులై 2014లో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలే  విశాఖపట్నం జిల్లాలోని జీకే వీధి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అప్పటి ఎఫ్ఐఆర్ కాపీని కూడా చూపారు. కొత్తపల్లి గీత మీద రవికిరణ్ అసభ్య రాతలు, చిత్రాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఆ పార్టీ కార్యకర్తల ఫిర్యాదుపై ఇంటూరి రవికిరణ్, ఇప్పాల రవీంద్ర రెడ్డి అనే ఇద్దరిని  పోలీసులు అరెస్టులు చేశారని, ఆ తరువాత వారు కొన్ని నిబంధనలకు లోబడి బెయిల్ పై విడుదలైనట్లు చెప్పారు. ఆనాడు రవికిరణ్ మీద పెట్టిన కేసు భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమేనా? అప్పుడు ఆ పార్టీ వారు ఒక్కరు కూడా ఏమీ మాట్లాడలేదని చెప్పారు.  ఏడాది కాలంగా పెడుతున్న ఈ పోస్టింగులను ఇప్పుడు తొలగించారు. అరెస్టులు భావ ప్రకటన స్వేచ్ఛకు భంగకరమని నమ్ముతూ వుంటే ఎందుకు  పోస్టింగులు తీసేశారని ఆయన ప్రశ్నించారు. మహిళలను బికినీల్లో చూపించడం, పలకలేని భాషతో వ్యాఖ్యానాలు చేయడం, అక్రమ సంబంధాలు అంటగట్టడం.. తగునా అని ప్రశ్నించారు. డ్రయివర్లతో అక్కచెల్లెళ్లకు అక్రమ సంబంధాలు అంటగట్టడం ఏవిధమైన భావ ప్రకటన స్వేచ్ఛ అని మీరు అనుకుంటున్నారని ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు.   ఇటువంటి పోస్టింగులను తీవ్రంగా పరిగణించి  పౌర సమాజం చర్చించవలసిన అవసరం ఉందన్నారు.  సోషల్ మీడియాలో వస్తున్న అసభ్య రాతలను ఎంతవరకు అమోదించాలనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరగాలన్నారు. ఇందులో వున్న అనౌచిత్యాన్ని పౌరులు ప్రశ్నించనాడే మళ్లీ ఇలాంటి వారు అసభ్యమైన కార్టూన్లు పెట్టడానికి సాహసించరని చెప్పారు. కార్టూన్ అంటే కొంత వ్యంగ్యంగా, వెటకారంగా ఉంటుందని, అది అసభ్యంగా చిత్రీకరించడం కాదన్నారు. తమపై వేసిన కార్టూన్లను చూసిన ప్రముఖులు కూడా నవ్వుకుంటారని,  జవహర్ లాల్ నెహ్రూ మీద కూడా  కార్టూన్లు వేస్తే వాటిని చూసి ఆయన నవ్వుకునేవారని చెప్పారు.

సచివాలయంలో వైరస్ ప్రభావంలేదు
           రాష్ట్ర సచివాలయంలోని కంప్యూటర్లపై రాన్సమ్ వేర్ వన్నా క్రై వైరస్ ప్రభావం చూపిందని ఒక వర్గం మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని డాక్టర్ పరకాల ప్రభాకర్ చెప్పారు. ఈ విషయంలో ప్రజల్లో ఎటువంటి అయోమయం, అనుమానం లేకుండా ఉండేందుకు వివరణ ఇస్తున్నట్లు తెలిపారు. సచివాలయంలో వున్న  సిస్టమ్స్‌ అన్నీ పటిష్టమైన యాంటీ వైరస్‌తో సురక్షితంగా వున్నాయన్నారు. ఎవరూ ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని చెప్పారు. సచివాలయంలో మొత్తం 1350 సిస్టమ్స్ ఉన్నాయని తెలిపారు. వాటిని అన్నిటినీ పరీక్షించారని, ఎటువంటి వైరస్ లేదని చెప్పారు. 9 హార్డ్ డిస్క్ లు మాత్రం వాడటంలేదని, వాటిని తీసివేసినట్లు డాక్టర్ పరకాల తెలిపారు.


May 17, 2017

సిమెంట్ బస్తా రూ.310లకే విక్రయించాలి

మంత్రి మండలి ఉప సంఘం  అదేశం
అంగీకరించిన ఉత్పత్తిదారులు
             సచివాలయం, మే17: రాష్ట్రంలో సిమెంట్ బస్తా తప్పనిసరిగా రూ.310 లకే విక్రయించాలని మంత్రి మండలి ఉప సంఘం ఉత్పత్తిదారులను  అదేశించింది. సచివాలయం 2వ బ్లాకులో బుధవారం ఉదయం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మంత్రి మండలి ఉప సంఘం  సభ్యులు కామినేని శ్రీనివాస్, అచ్చెన్నాయుడులు మూడు అంశాలపై సమావేశమయ్యారు.  వారు ఆయా శాఖ మంత్రులు నారా లోకేష్,  కొల్లు రవీంద్ర, అమర్నాధ్ రెడ్డి, సుజయకృష్ణ రంగారావు, ఉన్నతాధికారులు, ఆయా రంగాలకు చెందినవారితో చర్చించారు.  తొలుత ఫెర్రో ఎల్లాయిస్ రంగంపైన, ఆ తరువాత నిరుద్యోగ భృతి, సిమెంట్ ధరల అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రులు కామినేని శ్రీనివాస్, అచ్చెన్నాయుడులు సమావేశాల వివరాలను మీడియాకు వివరించారు. సామాన్య ప్రజలు ఇబ్బందిపడకుండా సిమెంట్ బస్తా ధర రూ.310 లకు విక్రయించాలని ఉప సంఘం అదేశించిందని, అందుకు ఉత్పత్తిదారులు అంగీకరించినట్లు చెప్పారు. రేపటి నుంచే ఈ ధర అమలు చేస్తారన్నారు. గత నెలలో ఉత్పత్తిదారులతో జరిగిన సమావేశం తరువాత ధరలు కొంత తగ్గినట్లు చెప్పారు. వారం, పది రోజుల తరువాత మళ్లీ సమీక్షిస్తామన్నారు. ఒక వేళ వాళ్లు చెప్పిన ధరకంటే ఎక్కువ అమ్మితే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామన్నారు.  ప్రభుత్వ సహాయాలు నిలిపివేస్తామని హెచ్చరించారు.  మైనింగ్, పవర్ సరఫరా, ప్రభుత్వ చెల్లింపులు వంటివాటిని ఆపివేస్తామన్నారు. పరిశ్రమలవారిని ఇబ్బందిపెట్టే ఉద్దేశం తమకులేదని వారి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తామని చెప్పారు. 
కాంట్రాక్టర్లతో సంబంధంలేకుండా ప్రభుత్వమే చెల్లింపు
ప్రభుత్వ పనులకు సరఫరా చేసే సిమెంటుకు సంబంధించిన డీడీలను కాంట్రాక్టర్లతో సంబంధంలేకుండా ప్రభుత్వమే చెల్లించేవిధంగా నిర్ణయం తీసుకున్నట్లు  మంత్రులు చెప్పారు. హౌసింగ్, ఆర్అండ్ బి, పోలవరం ప్రాజెక్టు, పంచాయతీరాజ్ శాఖల పనులకు ఎక్కువగా సిమెంట్ అవసరం ఉంటుందని తెలిపారు. సమయానికి సిమెంట్ సరఫరా చేయకపోవడం వల్ల కొన్ని పనులు ఆగిపోతున్నట్లు చెప్పారు. అందువల్ల ఏ శాఖకు ఎంత సిమెంట్ కావాలో వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఆ వివరాలను కంపెనీలకు పంపి సరఫరాలో జాప్యం జరుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఫెర్రోఎల్లాయిస్ పరిశ్రమలకు మరో ఏడాది రాయితీ ఇవ్వడానికి సిఫారసు
రాష్ట్రంలోని ఫెర్రోఎల్లాయిస్ పరిశ్రమకు ప్రస్తుతం ఇచ్చే విద్యుత్ రాయితీని మరో ఏడాది పొడిగించడానికి  ప్రభుత్వానికి సిఫారసు చేయాలని మంత్రి మండలి ఉప సంఘం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు తెలిపారు. రాష్ట్రంలో 35 ఫెర్రోఎల్లాయిస్ కంపెనీలు ఉన్నాయని, పవర్ టారిఫ్ పెరగడం వల్ల అప్పట్లో 30 కంపెనీలు మూతపడ్డాయని చెప్పారు. ఆ పరిస్థితుల్లో ఏడాది క్రితం విద్యుత్ ఛార్జీలను రూపాయిన్నర తగ్గించి రెండు ఏళ్లు ఇవ్వాలని ఆలోచన చేసి, ఒక ఏడాదికి అనుమతి ఇచ్చినట్లు వివరించారు.  ఏప్రిల్ తో సంవత్సరం అయిపోయిందని,  2వ సంవత్సరం కూడా రాయితీ పొడిగించమని ఆ పరిశ్రమ వర్గాలు అడిగినట్లు తెలిపారు. గత ఏడాది రాయితీ ఇవ్వడం వల్ల 25 కంపెనీలు తెరిచారని చెప్పారు.  పది వేల మందికి ఉపాధిక కల్పించినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయని, అయితే 6,800 మందికి ఉపాధి కల్పించినట్లు పరిశ్రమల శాఖ వారు తెలిపారని వివరించారు. ఈ నేపధ్యంలో పీఆర్సీ చైర్మన్ కూడా వారికి ఒక ఏడాది రాయితీ ఇవ్వమని సిఫారసు చేశారని చెప్పారు. దాంతో  ఫెర్రోఎల్లాయిస్ కంపెనీల వారితో మాట్లాడి తాము కూడా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని చెప్పామని, అంతేకాకుండా  ఇదే చివరి అవకాశమని వారికి తెలిపినట్లు మంత్రులు చెప్పారు. అయితే వారికి రాయితీ మరో ఏడాది ఇవ్వమని మంత్రి మండలికి సిఫారసు చేయాలని మాత్రమే తాము నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. మంత్రి మండలి నిర్ణయం తరువాత వారికి రాయితీ కొనసాగిస్తారని మంత్రులు కామినేని, అచ్చెన్నాయుడులు చెప్పారు.
నిరుద్యోగ భృతిపై జూలైలో తుది నిర్ణయం
నిరుద్యోగులకు భృతి ఇచ్చే అంశంపై మంత్రి మండలి ఉపసంఘం చర్చించినట్లు  మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. రాష్ట్రలో 12 లక్షల వరకు నిరుద్యోగులు ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. అయితే ఆ సంఖ్యను స్పష్టంగా తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఎన్నికల హామీ ప్రకారం యువతకు  న్యాయం చేస్తామని చెప్పారు. వారికి వివిధ అంశాలలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి ఏ విధంగా ఇస్తున్నారో తెలుసుకొని, మన రాష్ట్రంలో పరిస్థితుల ఆధారంగా ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. నిధులకు కొరతలేదని చెప్పారు. పశ్చిమ బెంగాల్ లో రూ.1000 నుంచి రూ.1500 ఇస్తున్నారని, కొన్ని రాష్ట్రాల్లో వంద, రెండొందలు ఇస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరుని అధ్యయనం చేస్తామని చెప్పారు. ఈ విషయమై జూన్ లో సమావేశమై చర్చిస్తామన్నారు. జూలై నాటికి తుది నిర్ణయం తీసుకుంటామని అచ్చెన్నాయుడు చెప్పారు.

May 15, 2017

ఎమ్మెల్సీలుగా శత్రుచర్ల, వాకాటి ప్రమాణ స్వీకారం

సచివాలయం, మే15: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులుగా కొత్తగా ఎన్నికైన శత్రుచర్ల విజయరామ రాజు, వాకాటి నారాయణ రెడ్డి సోమవారం ఉదయం వెలగపూడి శాసనసభ ప్రాంగణంలోని మండలి అధ్యక్షుని చాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. మండలి అధ్యక్షుడు డాక్టర్ చక్రపాణి వారిచేత ప్రమాణం చేయించారు. శత్రుచర్ల విజయరామ రాజు శ్రీకాకుళం జిల్లా నుంచి, వాకాటి నారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.  

May 14, 2017

ఏపీలో నైపుణ్యత కలిగిన యువశక్తి ఆవిర్భావానికి శిక్షణ

Ø ఏపీ ప్రభుత్వం-బ్రిటిష్ కౌన్సిల్ మధ్య ఒప్పందం
Ø శిక్షణతో లక్ష మంది నైపుణ్యత కలిగిన యువశక్తి ఆవిర్భావం
Ø 17 లక్షల మందికి ఆంగ్ల భాష నేర్పే ప్రాజెక్ట్

            రాష్ట్రంలోని యువత అన్ని అవకాశాలను అందిపుచ్చుకునేవిధంగా, వారి ఇంగ్లీష్ భాషా పరిజ్ఙానం పెంపొందించేందుకు ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఓ ప్రాజెక్టును చేపట్టింది. లక్ష మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో  బ్రిటిష్ కౌన్సిల్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఎంపిక చేసిన ఉన్నత విద్యా సంస్థల్లో, కళాశాలల్లో చదువుకునే యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం కోసం ఈ ప్రాజెక్టు ద్వారా వారి ఆంగ్లభాషా ప్రావీణ్యాన్ని మెరుగుపరుస్తారు. అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీ ద్వారా వారికి భాషలో మెళకువలు నేర్పుతారు. తద్వారా వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నవారికి కూడా వారు పనిచేసే చోట భాషా కౌశల్యం ప్రదర్శించేవిధంగా శిక్షణ ఇస్తారు.

         బ్రిటిష్ కౌన్సిల్ అనేది యూకెకు చెందిన అంతర్జాతీయ సాంస్కృతిక సంబంధాలు, విద్యా అవకాశాలు మెరుగుపరిచే సంస్థ. 1934లో ప్రారంభించిన ఈ సంస్థకు 18 శాతం నిధులను బ్రిటిష్ ప్రభుత్వం సమకూరుస్తుంది.   ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాలతో కలసి అక్కడి సంస్కృతి, కళలు, ఆంగ్లభాష, విద్య, సామాజిక రంగాల్లో కలసి పని చేస్తుంది. యూకే, ఆయా దేశాల మధ్య స్నేహపూర్వక విజ్ఞానాన్ని, ప్రజల మధ్య అవగాహనను పెంపొందిస్తుంది. ఆంగ్ల భాషలో శిక్షణకు సహకరిస్తోంది. తమ దేశానికి చెందిన సాంస్కృతిక వనరులను వినియోగించుకొని అక్కడి ప్రజల జీవితాల్లో మార్పునకు సహకరిస్తూ, విశ్వాసాన్ని కలిగిస్తూ, సంబంధాలను మెరుగుపరుస్తుంది. కౌన్సిల్ ప్రతినిధులు ప్రతి ఏటా రెండు కోట్ల మందికి పైగా ప్రజలను ఆన్ లైన్ లో కలుసుకుంటారు. యూకే-ఇండియా ఇయర్ ఆఫ్ కల్చర్ 2017లో భాగంగా బ్రిటిష్ కౌన్సిల్ అనుబంధ సంస్థ బీసీఈఈఎస్ఐపీఎల్ (బ్రిటిష్ కౌన్సిల్ ఎగ్జామినేషన్ అండ్ ఇంగ్లీష్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) ఏపీతో తమ సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. ఈ ఏడాది పొడవునా అనే కార్యక్రమాలు పండుగ వాతావరణంలో జరుపుతారు.  ఆ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చక్కని ఎకోసిస్టమ్ ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఉండటంతో ఈ సంస్థ ఇక్కడ వ్యవస్థీకృత, సుస్థిరమైన ఓ పైలెట్ ప్రాజెక్టుని నిర్వహిస్తోంది. ఏపీలోని కళాశాలల్లో నాణ్యమైన, ఉత్తమ ఇంగ్లీష్ బోధన జరుగుతోంది. దీని ద్వారా 17 లక్షల మంది విద్యార్థులు తరగతి గదిలోనే ఆంగ్ల భాష సంభాషణా చాతుర్యం మెరుగుపరుచుకొని, ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకోవడానికి, విద్యా, ఉపాధి అవకాశాలను దక్కించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ పైలెట్ ప్రాజెక్టు 15 నెలల పాటు కొనసాగుతుంది. ఆంగ్ల భాషను బోధించే అధ్యాపకులు తమ బోధన విధాలనాలను మెరుగుపరుచుకుంటారు. ఆ విధంగా వారు ఉత్తమ రీతిలో సంభాషణా చాతుర్యాన్ని ప్రదర్శించే విధంగా శిక్షకులు తయారవడానికి అవకాశం ఉంటుందిమాస్టర్ ట్రైనర్లను కూడా అభివృద్ధి పరచుకోవడానికి వీలుకలుగుతుంది. ఆంగ్లం బోధించే ఉపాధ్యాయకులకు నిరంతరం వృత్తిపరమైన శిక్షణ ఇస్తారువిద్యార్థులు ముఖాముఖి, ఆన్ లైన్ ద్వారా శిక్షణ పొందుతారు.
విస్తృతమైన పరిశోధనల ఆధారంగా భాష నేర్చుకునేవారికి అనుకూలంగా ఈ బ్రిటిష్ కౌన్సిల్ కొన్ని విధానాలను రూపొందించింది. అత్యుత్తమ బోధనా వాతావరణాన్ని సృష్టించేవిధంగా, డిజిటల్ కార్యక్రమాలను కూడా తయారు చేశారు. ఆ ప్రకారం నాణ్యమైన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కొన్ని కార్యక్రమాలను రూపొందించారు. ఈ ప్రాజెక్టులో అధ్యాపకులకు కూడా శిక్షణ ఇస్తారు. వారిలో కూడా పోటీ తత్వం ప్రోత్సహిస్తారు. తమ వద్ద నేర్చుకునే విద్యార్థులకు వారు మద్దతుగా నిలిచి, వారు అత్యుత్తమ స్థాయికి ఎదిగేవిధంగా తీర్చిదిద్దుతారు. ఆ విధంగా విద్య పూర్తి చేసుకొని విశ్వవిద్యాలయాల నుంచి, కళాశాలల నుంచి బయటకు వచ్చిన వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.
           
  విద్యార్థులకు విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ద్వారా రాష్ట్రాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేసి, వృద్ధి రేటు వేగంగా పెరిగేవిధంగా కృషి చేయాలన్న పట్టుదలతో ఏపీ సీఎం ఉన్నారు. లక్ష మందికి ఉపాధి నైపుణ్య శిక్షణ ఇప్పించాలన్న ఉద్దేశం ఆయనది. ఈ క్రమంలో ఆయనకు మద్దతుగా నిలవడానికి బ్రిటిష్ కౌన్సిల్బీసీఈఈఎస్ఐపీఎల్ ముందుకు వచ్చాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, స్పోకెన్ ఇంగ్లీష్ స్థాయిని వృద్ధి చేసి రాష్ట్రంలో నైపుణ్యత కలిగిన యువశక్తిని రూపొందించడానికి ఏపీ ప్రభుత్వం, బ్రిటిష్ కౌన్సిల్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఆంగ్ల భాషలో శిక్షణ పొందడం ద్వారా లక్ష మంది ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. వారు ఆధునిక శిక్షణ పద్దతుల ద్వారా ఆంగ్ల భాష అభ్యాసం, సంభాషణా చాతుర్యాన్ని మెరుగుపరుచుకోవడానికి వీలవుతుంది. 21వ శతాబ్ధపు అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అంతర్జాతీయ స్థాయి పని వాతావరణానికి అలవాటుపడతారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన సర్టిఫికెట్ పొందుతారు. ఈ శిక్షణ ద్వారా ఇక్కడి యువత రాష్ట్రంలో వచ్చే కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడమేకాక దేశవిదేశాల్లో ఉపాధి పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకే అత్యధిక అవకాశాలు రావాలన్నది ప్రభుత్వం లక్ష్యం. వివిధ రంగాలకు చెందిన పలు పరిశ్రమలకు కావలసిన మానవ వనరులను ఇక్కడే సమకూర్చాలని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది దోహదపడుతుంది. మౌలిక సదుపాయాలతోపాటు  నైపుణ్యత గలిగిన మానవవనరులు ఇక్కడే లభిస్తే పారిశ్రామికవేత్తలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఇక్కడి యువతలో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ అభివృద్ధి చెందితే వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతోపాటు పెట్టుబడులు రావడానికి అవకాశం ఏర్పడుతుంది.


-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

పవర్ సెక్టార్ లో విప్లవాత్మక మార్పులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

·       స్టోరేజ్‌తో రెండో దశ సోలార్ విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం
·       విద్యుత్ ధరలు తగ్గించే ఆలోచన
·       రెండు కీలక ఒప్పందాలు
·       రెండు ప్రధాన సమస్యలకు పరిష్కారం
·       త్వరలో ప్రజలు ఫస్ట్’  అమలు
·       ఏపీలో మెగా సీడ్ పార్కులు

         సచివాలయం, మే 13: పవర్ సెక్టార్ లో విప్లవాత్మక మార్పులు రానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. 7 రోజుల అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని వచ్చిన సందర్భంగా సచివాలయంలోని 1వ బ్లాక్ లోని సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన అమెరికా పర్యటన సోలార్ ఎనర్జీ స్టోరేజ్‌కు దోహదపడిందని చెప్పారు. ఈ పర్యటన ద్వారా తాను చాలా విషయాలు నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఒక సీఎం అప్ డేట్ అయితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతులను, సాధారణ పౌరులను పట్టి పీడిస్తున్న వ్యవసాయం, విద్యుత్ రెండు ప్రధాన సమస్యలకు ఈ పర్యటనలో ఒక పరిష్కారం  లభించిందని, అందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.  ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్క్ కర్నూలులో నెలకొల్పుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పవన విద్యుత్ ఉత్పాదనకు కూడా జరుగుతున్నట్లు తెలిపారు.  సోలార్, విండ్ ఎనర్జీపైన ఫోకస్ పెట్టినట్లు చెప్పారు.  సోలార్ విద్యుత్‌ స్టోరేజ్ అవసరం అని భావించి టెస్లా కంపెనీతో  సంప్రదించినట్లు చెప్పారు.  మన  ఇంటిపైనే సోలార్ ప్యానల్ పెట్టుకుంటే గృహావసరాలు, కార్లకు అవసరమైన  ఇంధనాన్ని వినియోగించుకునే అవకాశాన్ని  టెస్లా అందిస్తోందని వివరించారు.  రాబోయే రోజుల్లో మొత్తం ఎలక్ట్రికల్ వాహనాలే ఉంటాయన్నారు. రాష్ట్రంలో ఒకప్పుడు రూ.14 లున్న సోలార్ విద్యుత్ యూనిట్ ధర ఇప్పుడు రూ.3.15లకు పడిపోయిందని తెలిపారు. ప్రస్తుతం రాజస్థాన్ లో రూ.2.45లకు లభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సోలార్ స్టోరేజ్‌కు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు.  తొలిదశలో వ్యవసాయ  పంపుసెట్లకు వినియోగించనున్నట్లు తెలిపారు.  సోలార్ ఉత్పాదకత, స్టోరేజ్‌తో రెండో దశ విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు.  గ్రామ స్థాయి, ఫీడర్ స్థాయి విద్యుత్ గ్రిడ్లను రూపొందిస్తామన్నారు. సిలికాన్ వ్యాలీలో వారితో మాట్లాడిన తరువాత ఈ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన  చేసినట్లు చెప్పారు.  భారతదేశ విద్యుత్ రంగాన్ని సమూలంగా మార్చబోతున్న నిర్ణయమన్నారు.  ఇది ఒక విప్లవాత్మక ముందడుగుగా అభివర్ణించారు. విప్లవాత్మకమైన సంస్కరణలతో  విద్యుత్ ఉత్పత్తి పెంచి ధరలను తగ్గించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించి ప్రపంచానికే భారతదేశం ఒక ఆదర్శంగా నిలిచేలా చేయాలన్నదే తన తపనగా సీఎం పేర్కొన్నారు.

నాలెడ్జ్ ఈజ్ వెల్త్ అనినాలెడ్జ్ ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి జరుగుతుందన్నారు.  రాష్ట్రం సమైక్యంగా వున్నప్పుడు ఏ  సెక్టారులో కృషి చేస్తే మనకు ఫలితాలు వస్తాయని ఆలోచించి నాలెడ్జ్ బేస్డ్ సొసైటీ కోసం ప్రయత్నించామని,   అందులో భాగంగానే  రాష్ట్రంలోని 30 ఇంజనీరింగ్ కళాశాలను 350కి పెంచినట్లు వివరించారు. ఐటీ రంగంలో ప్రపంచంలోని ప్రతి నలుగురిలో  ఒకరు భారతీయుడు ఉంటాడని, ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు తెలుగువాడు ఉంటాడని చెప్పారు. అమెరికాలో అత్యధిక తలసరి ఆదాయంతో తెలుగు వారు ముందున్నరన్నారు. ప్రొఫెషనల్స్‌గా సంతృప్తి పడరాదని, ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదగాలని వారికి సలహా ఇచ్చినట్లు చెప్పారు.  కేపీఎంజీ సంస్థ ద్వారా తెలుగువాళ్లు ఎలా ఎదగాలనే అంశంపై అధ్యయనం చేయించినట్లు చెప్పారు.  ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో తెలుగువారు వుండాలనేది తన కోరిక అన్నారు.
              తన అమెరికా పర్యటనలో రెండవ కీలక ఒప్పందం అయోవా యూనివర్శిటీతో జరిగిందన్నారు. అది ఏపీలో  మెగా సీడ్ పార్కు ఏర్పాటు అని తెలిపారు. ఐయోవా యూనివర్విటీ ప్రపంచంలోనే బెస్ట్ యూనివర్విటీ అని చెప్పారు. వ్యవసాయంలో వ్యూహాలను మార్చి హార్టీకల్చర్, ఫిషరీస్, లైవ్ స్టాక్‌పై దృష్టిపెట్టినట్లు తెలిపారు.  రెయిన్ గన్స్, నదుల అనుసంధానం, మొబైల్ లిఫ్టులు వంటి వినూత్న  కార్యక్రమాలను అమలుచేస్తున్నామని చెప్పారు.  ప్రపంచంలో వున్న  బెస్టు టెక్నాలజీని ఏపీకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి నెదర్లాండ్ యూనివర్సిటీ సహకారాన్ని కూడా  తీసుకుంటున్నట్లు తెలిపారు.  ఈ రెండు యూనివర్విటీల సహకారంతో రాష్ట్ర వ్యవసాయరంగంలో వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు.
          
 ప్రపంచంలో అతిపెద్ద ఉత్తమమైన ప్రైవేటు ఆసుపత్రి రోచెస్టర్‌లోని మయో ఆస్పత్రి అని తెలిపారు. పేషెంట్ ఫస్ట్అనే ఆశయంతో పనిచేస్తున్న ఈ సంస్థ వైద్యసేవలతో పాటు వైద్యరంగంలో విస్తృత పరిశోధనలు కూడా నిర్వహిస్తోందన్నారు. అక్కడ చికిత్స పొందుతున్న దేవేంద్ర గౌడ్ ను పరామర్శించినట్లు తెలిపారు. అక్కడి క్రమశిక్షణ తనకు చాలా బాగా నచ్చిందని చెప్పారు.  మయో స్ఫూర్తితో ప్రభుత్వం త్వరలో పీపుల్స్ ఫస్ట్అనే నినాదాన్ని  తీసుకుందని, త్వరలో జరిగే కలెక్టర్ల సదస్సులో దీనిపై ప్రకటన చేస్తానని చెప్పారు.  ఆస్పత్రి, పోలీస్ స్టేషన్, రెవిన్యూ కార్యాలయం ఎక్కడైనా ప్రజలు  ఫస్ట్ అని చెప్పారు.
       సిలికానాంధ్ర యూనివర్శిటీలో మనబడి వంటి కార్యక్రమాలు బాగున్నాయన్నారు.  దాన్ని అభివృద్ది చేయడానికి రూ.6 కోట్లు ఇస్తామని చెప్పినట్లు తెలిపారు.  ఈ వర్శిటీ ద్వారా మన సంస్కృతికి ప్రాధాన్య కల్పిస్తామని చెప్పారు. ఈ పర్యటనలో ప్రవాస తెలుగువారికి సంబంధించిన 55 సంఘాల సభ్యులతో సమావేశమైనట్లు తెలిపారు. తెలుగు  ప్రతిష్ట కోసం వారందరిని కలసికట్టుగా ఉండమని, సేవ చేయడంలో పోటీపడమని వారికి చెప్పినట్లు తెలిపారు.  యుఎస్ఐబీసీ ట్రాన్స్‌ఫార్మేటీవ్ ఛీఫ్ మినిస్టర్ అవార్డును ఇస్తుంటే దాన్ని రాష్ట్రాన్ని బ్రాండింగ్ చేసే ఉద్దేశంతోనే అంగీకరించినట్లు తెలిపారు.  గతంలో ఎన్ని వర్శిటీలు డాక్టరేట్లు ఇస్తానన్నా వద్దన్నానని చెప్పారు.  తన పర్యటనలో ప్రపంచ ప్రఖ్యాత కంపెనల సీఈఓలను కలసినట్లు తెలిపారు.  సిస్కోలో రియల్ టైమ్ కమ్యూనికేషన్ మెకానిజం గమనించాననిరియల్ టైమ్‌లో ప్రపంచంలోని వివిధ దేశాలలో వున్న తమ సంస్థల పెర్ఫామెన్స్  రిపోర్టులు తెలుసుకునే అవకాశం సిస్కో కార్యస్థానంలో ఉన్నట్లు వివరించారు.  గూగుల్ ఎక్స్ కేంద్రంలో డ్రైవర్ లెస్ కార్, బెలూన్స్ బేస్డ్ ఇంటర్నెట్ ప్రయోగాలు చూశానన్నారు.  ప్రపంచంలో మన రాష్ట్రంలోనే ప్రయోగం  చేయడానికి గూగుల్ ఎక్స్ ముందుకొచ్చిందని చెప్పారు.  గూగుల్ ఎక్స్ తన ప్రయోగాలన్నింటికీ ఎపీని  పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడానికి ఒప్పించినట్లు తెలిపారు.  యాపిల్ సీఈవో విలియమ్స్‌ను కలిశాననిఇండియా బిగ్గెస్ట్ మార్కెట్ అని వారికి వివరించి చెప్పానన్నారు.  ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ ఫిన్ టెక్  రంగంలో అగ్రగామి అని, విశాఖను ఫైనాన్సియల్ సిటీగా అభివృద్ది చేయడానికి ఆసక్తి చూపిందని చెప్పారు.
సిస్కో హెడ్ జాన్ ఛాంబర్స్ 1998లో తనతో కలిపి తీసుకున్న ఫోటో చూపించారని తెలిపారు.  క్లౌడ్ మేనేజ్మెంట్‌లో సహకరించేందుకు న్యూటనిక్స్ ముందుకొచ్చిందనిఒక నెలలో రోడ్ మ్యాప్ తీసుకొస్తామని చెప్పారు.  గూగుల్ ఎక్స్, యాపిల్, టెస్లా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, సిస్కో, ఫ్లెక్స్‌ట్రాన్సిక్స్, ఎఆర్‌ఎం హోల్డింగ్స్ వంటి అగ్రశ్రేణి సంస్థలతో సమావేశాల్లో పాల్గొన్నట్లుఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లాతో మాట్లాడినట్లు చెప్పారు.  ఫిన్‌టెక్, డేటా సెంటర్స్, ప్రాసెసింగ్ రంగాల్లో విస్తరణ కోసం ప్రయత్నిస్తున్నామనితమకు ఏపీ బాగా నచ్చిందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ ప్రెసిడెంట్, సీఓఓ జెన్నిఫర్ జాన్సన్‌ నాతో చెప్పారు. పలు కంపెనీలు రాష్ట్రం పట్ల ఆసక్తి చూపించాయన్నారు.  ఈవీఎక్స్‌ సొల్యూషన్స్‌, ఇన్నోవా సొల్యూషన్స్‌లతో కుదిరిన ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి వేల ఉద్యోగాలు రానున్నట్లు చెప్పారు.  ఇల్లినాయిస్‌ 7వ డిస్ట్రిక్ట్‌ అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధి డేని కె. డెవిస్‌ చేతుల మీదుగా లైట్‌ ఆఫ్‌ ద లైఫ్‌ 2017అవార్డు స్వీకరించినట్లు తెలిపారు.

సెమీకండక్టర్, డిస్ ప్లే ఎక్విప్‌మెంట్ తయారీలో ప్రపంచంలోనే ప్రముఖ సంస్థ  అప్లయిడ్ మెటీరియల్స్ కంపెనీ సీఈవో గ్యారీ డికెరన్తోతో మాట్లాడినట్లు చెప్పారు. అప్లయిడ్ మెటీరియల్స్‌ కంపెనీని ఏపీతో ఎలా భాగస్వామిని చేయాలన్న అంశంపై త్వరలో రోడ్‌మ్యాప్‌ సిద్దం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.  ఏపీని క్లౌడ్ హబ్‌గా రూపొందించడంలో ప్రభుత్వానికి సహకారం అందించేందుకు న్యుటనిక్స్ కంపెనీ ముందుకొచ్చిందని చెప్పారు. మరో రెండు నెలల్లో దీనిపై స్పష్టమైన రోడ్ మ్యాప్, ప్రాజెక్ట్ రిపోర్టుతో వస్తామని న్యుటనిక్స్ సీఈఓ ధీరజ్ పాండే చెప్పినట్లు తెలిపారు. 
ప్రముఖ ఆర్కిటెక్ట్ కంపెనీ ఎం మోసెర్ అసోసియేట్స్‌ అమరావతి నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు ఆసక్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు.  ఐటీ దిగ్గజం జోహో సంస్థ సీఈఓ శ్రీధర్ వెంబు తనను కలిశారని, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆయన ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. ఐటీ సేవల రంగంలో పేరొందిన, ప్రవాస తెలుగువారు నిర్వహిస్తున్న  అమెరికాలోని 28 సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపినట్లు తెలిపారు. కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్‌ ఎడ్మంట్ గెరాల్డ్ జెర్రీ బ్రౌన్‌ తోపాటు పలువురు రాజకీయ ప్రముఖులను మర్యాద పూర్వకంగా కలిసినట్లు చెప్పారు.  ఇల్లినాయిస్‌ ఎనిమిదో డిస్ట్రిక్ట్‌ యూఎస్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి రాజా కృష్ణమూర్తితో చికాగోలో సమావేశం జరిగినట్లు తెలిపారు.  ఒకసారి అమరావతిని సందర్శించాలని ఆయనను కోరగా వస్తానని చెప్పినట్లు తెలిపారు. అమెరికాలో స్థిరపడ్డ భారతీయ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశం అయ్యాననిమాతృభూమికి ఎన్నడూ దూరం కావొద్దని, పుట్టిన గడ్డతో నిరంతరం సంబంధాలు నెరపాలని సూచించినట్లు చెప్పారు. అలాగే స్థానికులతో అవగాహనతో ఉండి, వారి క్షేమానికి కూడా కొంత ఖర్చు చేయాలని చెప్పినట్లు తెలిపారు. సైబర్ సెక్యూరిటీ చాలా ముఖ్యమైనదని , దానిపై దృష్టి పెట్టినట్లు చెప్పారు.  టెక్నాలజీని వినియోగించుకోకుండా వదిలిపెట్టలేం. అదే సమయంలో సైబర్ సెక్యూరిటీ అవసరం అని,   కళాశాలల్లో కొత్తగా సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు సీఎం చెప్పారు.  సమావేశంలో సీఎం పక్కన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ కూర్చున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికైన వాకాటి సస్పెన్షన్
 నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన  వాకాటి నారాయణరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆయనపై వచ్చిన ఆరోపణల నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విచారణ తరువాత ఆయనపై ఆరోపణలు నిజం కాదని తేలితే సస్పెన్షన్ తొలగిస్తామన్నారు.


అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...