సచివాలయం, నవంబర్ 30: సచివాలయం ఒకటవ బ్లాక్ మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ మందిరంలో
డిసెంబర్ 1వ తేదీ శుక్రవారం
సాయంత్రం 5 గంటలకు మంత్రి మండలి సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్
కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు,
ముఖ్య కార్యదర్శులు,
కార్యదర్శులు సచివాలయ నియమనిబంధనలను అనుసరించి
సకాలంలో ప్రతిపాదనలు పంపాలని ఆయన పేర్కొన్నారు.
Nov 30, 2017
2న ఈద్-మిలాదున్-నబి సెలవు
సచివాలయం,
నవంబర్ 30: ఈద్-మిలాదున్-నబి సందర్భంగా ప్రభుత్వం ఇంతకు ముందు ప్రకటించిన డిసెంబర్
1వ తేదీ శుక్రవారం సెలవు దినానికి బదులుగా
2వ తేదీ శనివారం సాధారణ సెలవు
దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఉత్తర్వులు జారీ
చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కోరిక మేరకు
ఈ మార్పు చేసినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆడపిల్లల రక్షణ కోసం ఊయల పథకం
ప్రభుత్వ
విప్ యామిని బాల
సచివాలయం,
నవంబర్ 30: ఆడపిల్ల రక్షణ కోసం ప్రభుత్వం త్వరలో ఊయల పథకం ప్రవేశపెట్టనుందని
ప్రభుత్వ విప్ యామిని బాల చెప్పారు. శాసనసభ ప్రాంగణం మీడియా పాయింట్ వద్ద గురువారం
మధ్యాహ్నం ఆమె మాట్లాడారు. ఆడ పిల్లలు పుడితే కొందరు రోడ్ల ప్రక్కన, మురుగు కాలువలలో పడవేయడం లేదా వడ్ల గింజ వేసి
చంపేయడం వంటివి చేస్తున్నారని, ఇక ముందు అలా కాకుండా అమ్మాయిలు వద్దు అనుకొన్నవాళ్ళు ఆ
పిల్లలను ప్రభుత్వం ఏర్పాటు చేసే ఊయలలో
వేస్తే, ఆ
పిల్లల పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, అదే ఊయల పథకం అని ఆమె వివరించారు. అలా
ఊయలలో ఉంచిన పిల్లలను ఎవరైనా పిల్లలు లేనివారు పెంచుకోవడానికి ముందుకు వస్తే
వారికి ఇచ్చే ఆలోచన కూడా ఉందని తెలిపారు. ఈ రోజు శాసనసభలో మహిళాసాధికారితపై చర్చ
జరిగినట్లు చెప్పారు. మహిళా పార్లమెంట్, మహిళా సాధికారితపై పది అంశాలతో విడుదల
చేసిన అమరావతి ప్రకటన, పోటీ తత్వం, అసహనం, ఒత్తిడి తదితర అంశాలపై సభ్యులు చక్కగా
మాట్లాడినట్లు తెలిపారు. మహిళల ముందడుగుతోనే కుటుంబానికి మేలు జరుగుతుందన్నారు.
మహిళలు మంచి ఆలోచన తో ఉంటే ఆ కుటుం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
సమాజంలో మానవ
సంబంధాలు కొరవడుతున్న కారణంగా నేటి మహిళ అనేక సమస్యలు ఎదుర్కొంటుందన్నారు. మహిళా
గొంతు వినిపించే అవకాశం కల్పించిన స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు
ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. మహిళా విద్యతోనే సమాజంలో మార్పు వస్తుందని
ఎన్టీఆర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశారని, అలాగే మహిళలకు ఆస్తి
హక్కు కల్పించిన ఘనత కూడా ఆయనదేనన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు, ఉన్నత
స్థానం కల్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వజ్ర సంకల్పంతో పని
చేస్తున్నారని కొనియాడారు. ఉన్నత విద్య, నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా
మహిళలు ఎదుగుదలకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. రాజకీయంలో మహిళలు
అధికంగా ఉన్నారంటే ఆ ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. పొదుపు అనేది ఓ మ్యాజిక్ అని,
దాని ద్వారా మహిళలు ఎదగడానికి డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేశారని, నేడు ఈ
గ్రూపుల్లో 70 లక్షల మంది మహిళలు ఉన్నారని వివరించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి
నిలదొక్కుకోవలసిన అవసరం ఉందన్నారు. మహిళా
కమిషన్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నారని యామిని బాల చెప్పారు.
Nov 28, 2017
డిసెంబర్ 2 వరకు అసెంబ్లీ సమావేశాలు
సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు
సచివాలయం,
నవంబర్ 28:
శాసనసభ,
శాసన మండలి సమావేశాలు డిసెంబర్ 2వ తేదీ శనివారం వరకు జరుగుతాయాని
సమాచార,
పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. శాసనసభ ప్రాంగణం మీడియా పాయింట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల కమిటీ, శాసనమండలి చైర్మన్ ఫరూక్ అధ్యక్షతన శాసన మండలి వ్యవహారాల కమిటీ సమావేశాలు
జరిగాయని తెలిపారు.
రాబోయే మూడు రోజుల్లో చర్చించవలసిన అంశాలపై సభ్యులు అభిప్రాయాలు తెలిపారని
చెప్పారు.
మిలాద్-ఉన్- నబీ సందర్భంగా డిసెంబర్ 1వ తేదీన సెలవని
చెప్పారు.
29వ తేదీన కార్పోరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, అక్కడి విద్యార్థుల సమస్యలు, వారిపై ఒత్తిడి తదితర
అంశాలతోపాటు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రంపై చర్చించాలని తీర్మానించినట్లు వివరించారు. 30న మహిళా సాధికారిత, బాలల హక్కులపై చర్చిస్తారని, అలాగే విభజన చట్టంలోని హామీల అమలు తీరు, కొన్ని అంశాల అమలులో
జరిగే జాప్యం వంటి కీలక అంశాలపై చర్చిస్తారన్నారు. డిసెంబర్ 2
చివరి రోజు రాష్ట్రాభివృద్ధికి వచ్చే పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, యువజన విధానం, మౌలిక సదుపాయాలపై
చర్చిస్తారని చెప్పారు. ఈ నెల 29,30 తేదీల్లో రెండు రోజులు 14 బిల్లులపై రెండు సభల్లో చర్చ జరుగుతుందని తెలిపారు. అలాగే ప్రజా ప్రధాన్యత ఉన్న అంశాలపై చర్చ జరుగుతుందని మంత్రి కాలవ చెప్పారు.
ఇప్పటి వరకు 9 అంశాలపై చర్చ
ఇప్పటి వరకు 344వ నిబంధన కింద,
ప్రశ్నోత్తరాల సమయంలో 9 అంశాలపై చర్చ
జరిగినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతి, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చించామన్నారు. శాసనసభ,
శాసన మండలి సభ్యులను పోలవరం ప్రాజెక్ట్ వద్దకు తీసుకువెళ్లినట్లు తెలిపారు. వారు పట్టిసీమను కూడా సదర్శించారన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపైన, చంద్రన్న బీమాపైన చర్చ
జరిగినట్లు చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకం పనులపైన, ఫలితాల పైన అర్థవంతమైన చర్చ జరిగినట్లు తెలిపారు.
అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ,
మైనార్టీ,
మహిళా సంక్షేమం, కాపు, బ్రాహ్మణుల సంక్షేమంపై
కూడా చర్చించినట్లు చెప్పారు. సుస్థిర
ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు, విద్యుత్ రంగ విజయాలపైన, పట్టణ,
గ్రామీణ ప్రాంత గృహ నిర్మాణంపైన చర్చించినట్లు వివరించారు. ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ, సీజనల్ వ్యాధులపై చర్చ
జరుగుతున్నట్లు చెప్పారు.
సభలో ప్రతిపక్షం
లేకపోయినా అధికార పక్షం, మిత్ర పక్షమైన బీజేపీ సభ్యులు నిర్మాణాత్మకంగా
మాట్లాడి,
మంత్రుల నుంచి సమాధానాలు రాబట్టారన్నారు. కొందరైతే చక్కగా మాట్లాడి మంత్రులను
నిలదీశారని చెప్పారు. ప్రతిపక్షం లేకపోయినా సమర్థవంతంగా శాసనసభ సమావేశాలు
నిర్వహించడానికి నిదర్శనం ఏపీ శాసనసభ సమావేశాలనని మంత్రి కాలవ అన్నారు.
Nov 27, 2017
మాజీ న్యాయమూర్తి ప్రతిపక్షనేతగా మాట్లాడటం భావ్యంకాదు
రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ ఎం.లింగారెడ్డి
సచివాలయం, నవంబర్ 27: సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి వి.గోపాల గౌడ ప్రతిపక్షనేత లాగా మాట్లాడటం భావ్యంకాదని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ ఎం.లింగారెడ్డి హితవు పలికారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం సాయంత్రం ఆయన మాట్లాడారు. రాజధాని భూసమీకరణకు సంబంధించి గౌడ చేసిన వ్యాఖ్యలను లింగారెడ్డి ఖండించారు. ఓ మాజీ న్యాయమూర్తి రాజకీయ నాయకునిలా,రాజకీయపరమైన లక్ష్యంతో ప్రజలను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేయడం, సొంత భాష్యాలు చెప్పడం బాధాకరం అన్నారు. శివరామ కృష్ణన్ కమిటీ నివేదికను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారని, ఒక నివేదికలోని మంచీ చెడులను సమీక్షించి దానిని అమలు చేయాలా? లేదా? అనే నిర్ణయం తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందన్నరు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సౌకర్యంగా, సమదూరంలో ఉండాలని అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించినట్లు వివరించారు. ఇక్కడ నుంచి అనంతపురం జిల్లాలోని కర్నాటక సరిహద్దు ప్రాంతం 420 కిలోమీటర్లు, శ్రీకాకుళం జిల్లాలోని ఒడిస్సా సరిహద్దు ప్రాంతం 520 కిలో మీటర్లు ఉంటుందని, ధనికొండలో రాజధాని ఏర్పాటు చేస్తే ఆ దూరం అనంతపురం జిల్లా వారికి 320, శ్రీకాకుళం జిల్లా వారికి 620 కి.మీ. అవుతుందని చెప్పారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉండగా, రెండేళ్లకే ఎందుకు వచ్చారని అడగడం విడ్డూరంగా ఉందన్నారు. ఏ ప్రాజెక్ ని అయినా త్వరగా పూర్తి చేయమని ఎవరైనా డిమాండ్ చేస్తారని, రెండేళ్లకే ఇక్కడ భవనాలు నిర్మించుకోని వచ్చే విమర్శించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పట్టిసీమను త్వరగా పూర్తి చేసి సాగునీరు అందిస్తున్నామన్నారు. మాజీ న్యాయమూర్తులు ఈ విధంగా మాట్లడటం భావ్యం కాదన్నారు. తాను కూడా కాన్ స్టిట్యూషన్ లా లో మాస్టర్ డిగ్రీ చేశానని, ల్యాండ్ పూలింగ్ ఏ విధంగా న్యాయవిరుద్దమైన చర్య అవుతుందని లింగారెడ్డి ప్రశ్నించారు. భూ సేకరణ రెండు రకాలని ఒకటి రైతులు స్వచ్చందంగా భూమి ఇవ్వడం అని, దానినే భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) అంటారని, రెండు భూ సేకరణ అంటారని తెలిపారు. 20 వేలకు పైగా రైతులు 33 వేలకు పైగా ఎకరాలు స్వచ్చందంగా ఇచ్చారని చెప్పారు. వారిలో వంద మంది కూడా కోర్టుకు వెళ్లలేదంటే మిగిలినవారందరూ సహకరించినట్లే గదా అని అన్నారు. 2013 చట్టం ప్రకారం అయితే బలవంతంగా భూమి సేకరించవలసి ఉంటుందని చెప్పారు. గ్రామ సభలు నిర్వహించారని, ఆ సభల్లో 99 శాతం మంది రైతులు ఒప్పుకునే స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్నారు. ఆ గ్రామ సభల్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆందోళన కూడా చేశారని తెలిపారు. ఆందోళనలు కూడా చేస్తే గ్రామసభలు నిర్వహించలేదనడం ఏమిటని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణానికి హాని ఉంటే సంబంధిత కోర్టు స్టే ఇచ్చి ఉండేదని అన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది అయినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే నిర్మాణం ఆలస్యం అవుతుందని చెప్పారు. అలాగే రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపితేనే త్వరగా పూర్తి అవుతుందన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి ప్రణాళిక రూపొందించే బాధ్యత సింగపూర్ కంపెనీకి ఇవ్వడమేమిటని అడగటంలో అర్ధంలేదన్నారు. మన దేశానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య విదేశాలకు వెళ్లి ప్రాజెక్టులు నిర్మించలేదా? అలాగే ఎంతోమంది మేథావులు విదేశాల్లో అనేక పనులు చేస్తున్నారని, అలాగే ఆయా దేశాలకు చెందినవారు వారివారి అనుభవం ఆధారంగా ఇక్కడ పని చేస్తారని, ఇప్పుడు ప్రపంచం చాలా చిన్నదైపోయిందని, ఆ విధంగా సంకుచితంగా ఆలోచించకూడదని అన్నారు.ఓ ప్రతిపక్ష నేతగా, పోటీ కాంట్రాక్ట్ దారునిగా మాట్లాడినట్లు ఉందన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే లాంటి వారే కోర్టుకు వెళ్లారని, ఆ పార్టీకి చెందిన రైతులు ఎవరూ వెళ్లలేదని చెప్పారు. రాజ్యాంతం ప్రసాధించిన ప్రాథమిక హక్కులకు భంగం కలుగకుండా భావి తరాల కోసం ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా భూమి సమీకరించినట్లు తెలిపారు. రాజధాని అంటే భవనాలు, పరిపాలనే కాదని, ఆర్థిక, విద్య, వైద్యం తదితర అన్ని రకాల కార్యకలాపాలు ఉంటాయని అన్నారు. ప్రతిపక్షం వారు నిర్వహించే సభల్లో మాట్లాడేవారు ప్రభుత్వంపై బురదజల్లే విధంగా, ప్రతిపక్షంలా రాజకీయ దురుద్దేశంతో మాట్లాడవద్దని సలహా ఇచ్చారు.
క్రిస్మస్ కంటే ముందే చంద్రన్న కానుక
సంక్రాంతి, క్రిస్మస్ కు సంబంధించిన చంద్రన్న కానుకలు క్రిస్మస్ కంటే ముందే ఇస్తామని లింగారెడ్డి చెప్పారు.ప్రభుత్వం రూ.300 నుంచి రూ.350 కోట్ల వరకు ఖర్చు చేస్తుందని, ప్రతి పైసా సద్వినియోగం చేస్తామని, ఎక్కడైనా దుర్వినియోగం అయినట్లు తెలిస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదని హెచ్చరించారు. అవకతవకలు జరిగినట్లు తెలిస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. కందులు, శనగలకు సంబంధించి పప్పు దిగుబడి నిష్పత్తి ఆధారంగా టెండర్లు ఖరారు చేస్తామని, అయితే అందులో తేడాలు ఏమైనా ఉంటే విచారించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తేడా ఉన్నట్లు తేలితే టెండర్లును రద్దు చేస్తామని, అవినీతి జరిగితే చర్యలు తీసుకుంటామని లింగారెడ్డి చెప్పారు.
‘అమరావతి ప్రకటన’ ఓ గొప్ప అవకాశం
Ø ఈ నెల 27న విజయవాడలో విడుదల
Ø అంతర్జాతీయ స్థాయిలో చర్చకు అవకాశం
Ø అన్ని వర్గాల మహిళల సమస్యల ప్రస్తావన
Ø 10 అంశాలుగా విభజన
Ø ప్రపంచదేశాల మహిళా అభివృద్ధికి దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో
రాజకీయాలకు అతీతంగా మహిళా సాధికారితపై రూపొందించిన ‘అమరావతి
ప్రకటన’ ఓ చారిత్రక ఘట్టం కానుంది. మహిళా
సాధికారితకు సంబంధించి అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. బాలికలు మొదలుకొని వృద్ధుల వరకు,
గ్రామీణ స్థాయి నుంచి పట్టణ మురికివాడలలో నివసించే మహిళల వరకు,
విద్యార్థులు, యువతులు ఎదుర్కొంటున్న విద్య,
ర్యాగింగ్, గృహ హింస, లైంగిక
వేధింపులు, మహిళల భద్రత, ఆర్థిక,
ఆరోగ్యపరమైన అన్ని అంశాలతోపాటు మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సమస్యల వరకు
న్యాయ నిపుణులు, ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారులు,
విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, విద్యార్థులు
ఆమూలాగ్రం సుదీర్ఘంగా చర్చించిన తరువాత దీనిని రూపొందించారు. అందు
వల్ల నవంబర్ 27న ఈ ప్రకటన
వెలువడిన తరువాత అంతర్జాతీయ స్థాయిలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద
రావు ఆధ్వర్యంలో దీనిని సిద్ధం చేశారు. విజయవాడ
సమీపంలో ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా-గోదావరి నదుల
పవిత్ర సంగమం తీరాన 2017 ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు మూడు
రోజులపాటు జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్ లో పాల్గొన్న రాష్ట్ర,
జాతీయ, అంతర్జాతీయ స్థాయి మహిళలు,
యువతులు, విద్యార్థుల అనుభవాల సారంతో జరిగిన ఉపన్యాసాలు,
చర్చలు, సిఫారసులు, తీర్మానాలకు
సంక్షిప్త రూపమే ఈ ప్రకటన. ఆ సదస్సులో
అమెరికా, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాల,
రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖ మహిళలు, విద్యార్థులు దాదాపు 25 వేల మంది
పాల్గొన్నారు. చారిత్రక
అంశాలతోపాటు ప్రస్తుత సమాజంలో రాజకీయాలు, కార్పోరేట్ కంపెనీల్లో, గ్రామీణ, పట్టణ మహిళలు, ప్రాథమిక పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు అన్ని స్థాయిల్లో మహిళలు
ఎదుర్కొంటున్న లింగ వివక్ష, జీవన శైలి, సామాజిక, ఉద్యోగ భద్రత వంటి ఎన్నో అంశాలను
సుదీర్ఘంగా చర్చించారు. అనేక పరిష్కార మార్గాలను కూడా సూచించారు. ఈ పార్లమెంట్ లో మహిళా స్పందన, వారి స్పూర్తితో ప్రస్తుత తరానికి,
భావితరాలకు మార్గదర్శకంగా ఉండే విధంగా ‘అమరావతి
ప్రకటన’ రూపొందించారు. ప్రభుత్వంలో
ఉన్నత స్థానాల్లో ఉన్న ముఖ్య అధికారులు, దేశంలోని,
రాష్ట్రంలోని పలువురు మహిళా ప్రముఖులను డాక్టర్ కోడెల 4,5 సార్లు ఒక చోట సమావేశపరచి ఈ ప్రకటన తయారు చేశారు. ఈ ప్రకటన రూపొందించడంలో రాష్ట్ర రవాణా,
రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలు నిర్వహించి, యునిసెఫ్ విధులు నిర్వహించేదుకు ఇటీవల కేంద్ర
సర్వీసులకు వెళ్లిన సుమిత దావ్రా కీలక పాత్ర పోషించారు.
ప్రకటన ముసాయిదాను తయారు
చేయడానికి 8 మంది ఎడిటోరియల్ బోర్డు సభ్యులను నియమించారు. వారు ప్రధానమైన పది అంశాలతో ఒక ముసాయిదాని
రూపొందించారు. 1.స్త్రీ విద్య,
2. మహిళల న్యాయపరమైన హక్కులు, 3.మహిళల ఆరోగ్యం,
సమతుల ఆహారం, 4.పారిశ్రామిక రంగంలో
మహిళలు, 5. పరిశోధన, నూతన ఆవిష్కరణల్లో మహిళలు,
6.రాజకీయాల్లో మహిళలు, 7. మహిళల సమాజిక భద్రత,
8.స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో మహిళల పాత్ర,
9.మహిళల సామాజికాభివృద్ధి, 10.మహిళలు - డిజిటల్ విద్య అనే అంశాల ప్రాతిపదికగా మహిళలకు
సంబంధించిన అన్ని సమస్యలను ప్రస్తావించారు. శాసనసభాపతి డాక్టర్ కోడెల అధ్యక్ష్యతన
జరిగిన సమావేశాల్లో జస్టిస్ జీ.రోహిణి, అమరావతి
రాజధాని నగరాభివృద్ధి, నిర్వహణ సంస్థ ఎండీ లక్ష్మీ పార్థసారధి,
రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత
దావ్రా, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ, ఎండోమెంట్స్
కమిషనర్ అనురాధ, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ
శాఖ కార్యదర్శి సునిత, పాఠశాల విద్య
కమిషనర్ సంధ్యారాణి, ప్లానింగ్ శాఖ సెక్రటరీ సంజయ్ గుప్త,
విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు ఎ.జయశ్రీ,
పి.విజయలక్ష్మి,
డీఎం మమత, డిబీ కృష్ణ కుమారి,
యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఏపీ సెక్రటరీ జనరల్ ఎల్.జయ రాములు, ఆంధ్రప్రదేశ్
మహిళా పారిశ్రామికవేత్తల సంఘం అధ్యక్షురాలు కె.రమాదేవి, జి.జానకీ రామచంద్రన్ వంటి వారితోపాటు అధ్యాపకులు,
విద్యార్థినులు పాల్గొని ఈ
ముసాయిదాలోని అంశాలను లోతుగా చర్చించి, తమ అనుభవాలను
కూడా జోడించి తమ అమూల్యమైన సూచనలు,
సలహాలు ఇచ్చారు.
ఈ చర్చల్లో మహిళలు,
విద్యార్థినులు, బాలికలు, పిల్లలకు
సంబంధించి చిన్న చిన్న అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. గ్రామీణ, పట్టణ పేద మహిళలు, అసంఘటిత కార్మిక మహిళలు,
ఒంటరి మహిళలు, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లల
స్థితిగతులపై ప్రతి అంశాన్ని చర్చించారు. పాఠశాల స్థాయిలో విద్యార్థినులకు సౌకర్యాలు, ఉపాధిపై
అవగాహన, స్వీయరక్షణ, మహిళల న్యాయపరమైన హక్కులు,
ఆస్తి హక్కు, బలవంతంగా వ్యభిచార
కూపంలోకి నెట్టబడే బాలికలు, మహిళల సమస్యలు, కరాటే శిక్షణ, వృత్తి విద్య,
గ్రామీణ పరిశ్రమలు, డ్రైవింగ్ లో శిక్షణ,
మహిళా పారిశ్రామికవేత్తలకు రుణ సౌకర్యం కల్పించడం,
పన్నుల మినహాయింపు, ప్రత్యేక మహిళా పారిశ్రామిక జోన్ల ఏర్పాటు,
సైబర్ సెక్యూరిటీ, సినిమా, టీవీ,
సోషల్ మీడియా నుంచి రక్షణ, అన్ని
రంగాల్లో సమాన అవకాశాలు, సమాన పనికి
సమాన వేతనం... తదితర అన్ని
అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించారు.
రాజకీయాలకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా అందరూ స్త్రీని గౌరవిస్తూ
ఆచరించదగిన మార్గదర్శకాలు ఇందులో ఉంటాయి. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉండే విధంగా, అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వాలకు,
స్వచ్ఛంద సంస్థలకు, ప్రతి వ్యక్తికి, మహిళలకు
సూచనలు, సలహాలు అందించే విధంగా ఈ ప్రకటన ఉంటుంది. వివాదాలకు
తావులేకుండా అంతర్జాతీయ స్థాయిలో విస్తృత అంశాల ప్రాతిపదికన ఈ ప్రకటనను
రూపొందించారు. రాజకీయాలకు
అతీతంగా మహిళలకు సంబంధించి ఇటువంటి ప్రకటన
రూపొందించడం ఓ గొప్ప అవకాశంగా భావించవచ్చు. ప్రపంచదేశాల మహిళా అభివృద్ధికి దిశానిర్దేశం చేయడమేకాక అన్ని విధాల మహిళలకు
సహాయపడేవిధంగా దీనిని రూపొందించారు. అత్యంత
ప్రతిష్టాత్మకంగా మహిళా సాధికారితపై రూపొందించిన ఈ ప్రకటనను నవంబర్ 27న విజయవాడ సిదార్థ గ్రౌండ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారు. ఈ కార్యక్రమ
నిర్వహణలో మహిళా మంత్రులు, ఎంపీలు,
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు కీలకపాత్ర
పోషిస్తారు. వివిధ రంగాలకు
చెందిన ప్రముఖ మహిళలు పాల్గొంటారు.
-శిరందాసు నాగార్జున, డెవలప్ మెంట్ జర్నలిస్ట్, 9440222914.
Subscribe to:
Posts (Atom)
అసామాన్యుల స్ఫూర్తి గాథలు
రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...
-
ఒకే వేదికపైకి 19 చేనేత కులాలు విజయవాడలో భారీ బహిరంగ సభ ఆలోచన రాజకీయ అధికారం కోసం పోరాటం రాజకీయంగా , ఆర్థికంగా , సామా...
-
తాడి ప్రకాష్ THE ETERNAL SONG OF ELURU ROAD ------------------------------------------------------------------- పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు...
-
v రాయలసీమకు మహర్ధశ v ఆ 4 జిల్లాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ v వ్యవసాయంలో అగ్రగామి శింగనమల v పట్టుదలతో ముచ్చుమర్రి ఎత్తిపోతల...