Ø ఈ నెల 27న విజయవాడలో విడుదల
Ø అంతర్జాతీయ స్థాయిలో చర్చకు అవకాశం
Ø అన్ని వర్గాల మహిళల సమస్యల ప్రస్తావన
Ø 10 అంశాలుగా విభజన
Ø ప్రపంచదేశాల మహిళా అభివృద్ధికి దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో
రాజకీయాలకు అతీతంగా మహిళా సాధికారితపై రూపొందించిన ‘అమరావతి
ప్రకటన’ ఓ చారిత్రక ఘట్టం కానుంది. మహిళా
సాధికారితకు సంబంధించి అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. బాలికలు మొదలుకొని వృద్ధుల వరకు,
గ్రామీణ స్థాయి నుంచి పట్టణ మురికివాడలలో నివసించే మహిళల వరకు,
విద్యార్థులు, యువతులు ఎదుర్కొంటున్న విద్య,
ర్యాగింగ్, గృహ హింస, లైంగిక
వేధింపులు, మహిళల భద్రత, ఆర్థిక,
ఆరోగ్యపరమైన అన్ని అంశాలతోపాటు మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సమస్యల వరకు
న్యాయ నిపుణులు, ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారులు,
విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, విద్యార్థులు
ఆమూలాగ్రం సుదీర్ఘంగా చర్చించిన తరువాత దీనిని రూపొందించారు. అందు
వల్ల నవంబర్ 27న ఈ ప్రకటన
వెలువడిన తరువాత అంతర్జాతీయ స్థాయిలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద
రావు ఆధ్వర్యంలో దీనిని సిద్ధం చేశారు. విజయవాడ
సమీపంలో ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా-గోదావరి నదుల
పవిత్ర సంగమం తీరాన 2017 ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు మూడు
రోజులపాటు జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్ లో పాల్గొన్న రాష్ట్ర,
జాతీయ, అంతర్జాతీయ స్థాయి మహిళలు,
యువతులు, విద్యార్థుల అనుభవాల సారంతో జరిగిన ఉపన్యాసాలు,
చర్చలు, సిఫారసులు, తీర్మానాలకు
సంక్షిప్త రూపమే ఈ ప్రకటన. ఆ సదస్సులో
అమెరికా, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాల,
రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖ మహిళలు, విద్యార్థులు దాదాపు 25 వేల మంది
పాల్గొన్నారు. చారిత్రక
అంశాలతోపాటు ప్రస్తుత సమాజంలో రాజకీయాలు, కార్పోరేట్ కంపెనీల్లో, గ్రామీణ, పట్టణ మహిళలు, ప్రాథమిక పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు అన్ని స్థాయిల్లో మహిళలు
ఎదుర్కొంటున్న లింగ వివక్ష, జీవన శైలి, సామాజిక, ఉద్యోగ భద్రత వంటి ఎన్నో అంశాలను
సుదీర్ఘంగా చర్చించారు. అనేక పరిష్కార మార్గాలను కూడా సూచించారు. ఈ పార్లమెంట్ లో మహిళా స్పందన, వారి స్పూర్తితో ప్రస్తుత తరానికి,
భావితరాలకు మార్గదర్శకంగా ఉండే విధంగా ‘అమరావతి
ప్రకటన’ రూపొందించారు. ప్రభుత్వంలో
ఉన్నత స్థానాల్లో ఉన్న ముఖ్య అధికారులు, దేశంలోని,
రాష్ట్రంలోని పలువురు మహిళా ప్రముఖులను డాక్టర్ కోడెల 4,5 సార్లు ఒక చోట సమావేశపరచి ఈ ప్రకటన తయారు చేశారు. ఈ ప్రకటన రూపొందించడంలో రాష్ట్ర రవాణా,
రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలు నిర్వహించి, యునిసెఫ్ విధులు నిర్వహించేదుకు ఇటీవల కేంద్ర
సర్వీసులకు వెళ్లిన సుమిత దావ్రా కీలక పాత్ర పోషించారు.
ప్రకటన ముసాయిదాను తయారు
చేయడానికి 8 మంది ఎడిటోరియల్ బోర్డు సభ్యులను నియమించారు. వారు ప్రధానమైన పది అంశాలతో ఒక ముసాయిదాని
రూపొందించారు. 1.స్త్రీ విద్య,
2. మహిళల న్యాయపరమైన హక్కులు, 3.మహిళల ఆరోగ్యం,
సమతుల ఆహారం, 4.పారిశ్రామిక రంగంలో
మహిళలు, 5. పరిశోధన, నూతన ఆవిష్కరణల్లో మహిళలు,
6.రాజకీయాల్లో మహిళలు, 7. మహిళల సమాజిక భద్రత,
8.స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో మహిళల పాత్ర,
9.మహిళల సామాజికాభివృద్ధి, 10.మహిళలు - డిజిటల్ విద్య అనే అంశాల ప్రాతిపదికగా మహిళలకు
సంబంధించిన అన్ని సమస్యలను ప్రస్తావించారు. శాసనసభాపతి డాక్టర్ కోడెల అధ్యక్ష్యతన
జరిగిన సమావేశాల్లో జస్టిస్ జీ.రోహిణి, అమరావతి
రాజధాని నగరాభివృద్ధి, నిర్వహణ సంస్థ ఎండీ లక్ష్మీ పార్థసారధి,
రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత
దావ్రా, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ, ఎండోమెంట్స్
కమిషనర్ అనురాధ, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ
శాఖ కార్యదర్శి సునిత, పాఠశాల విద్య
కమిషనర్ సంధ్యారాణి, ప్లానింగ్ శాఖ సెక్రటరీ సంజయ్ గుప్త,
విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు ఎ.జయశ్రీ,
పి.విజయలక్ష్మి,
డీఎం మమత, డిబీ కృష్ణ కుమారి,
యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఏపీ సెక్రటరీ జనరల్ ఎల్.జయ రాములు, ఆంధ్రప్రదేశ్
మహిళా పారిశ్రామికవేత్తల సంఘం అధ్యక్షురాలు కె.రమాదేవి, జి.జానకీ రామచంద్రన్ వంటి వారితోపాటు అధ్యాపకులు,
విద్యార్థినులు పాల్గొని ఈ
ముసాయిదాలోని అంశాలను లోతుగా చర్చించి, తమ అనుభవాలను
కూడా జోడించి తమ అమూల్యమైన సూచనలు,
సలహాలు ఇచ్చారు.
ఈ చర్చల్లో మహిళలు,
విద్యార్థినులు, బాలికలు, పిల్లలకు
సంబంధించి చిన్న చిన్న అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. గ్రామీణ, పట్టణ పేద మహిళలు, అసంఘటిత కార్మిక మహిళలు,
ఒంటరి మహిళలు, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లల
స్థితిగతులపై ప్రతి అంశాన్ని చర్చించారు. పాఠశాల స్థాయిలో విద్యార్థినులకు సౌకర్యాలు, ఉపాధిపై
అవగాహన, స్వీయరక్షణ, మహిళల న్యాయపరమైన హక్కులు,
ఆస్తి హక్కు, బలవంతంగా వ్యభిచార
కూపంలోకి నెట్టబడే బాలికలు, మహిళల సమస్యలు, కరాటే శిక్షణ, వృత్తి విద్య,
గ్రామీణ పరిశ్రమలు, డ్రైవింగ్ లో శిక్షణ,
మహిళా పారిశ్రామికవేత్తలకు రుణ సౌకర్యం కల్పించడం,
పన్నుల మినహాయింపు, ప్రత్యేక మహిళా పారిశ్రామిక జోన్ల ఏర్పాటు,
సైబర్ సెక్యూరిటీ, సినిమా, టీవీ,
సోషల్ మీడియా నుంచి రక్షణ, అన్ని
రంగాల్లో సమాన అవకాశాలు, సమాన పనికి
సమాన వేతనం... తదితర అన్ని
అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించారు.
రాజకీయాలకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా అందరూ స్త్రీని గౌరవిస్తూ
ఆచరించదగిన మార్గదర్శకాలు ఇందులో ఉంటాయి. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉండే విధంగా, అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వాలకు,
స్వచ్ఛంద సంస్థలకు, ప్రతి వ్యక్తికి, మహిళలకు
సూచనలు, సలహాలు అందించే విధంగా ఈ ప్రకటన ఉంటుంది. వివాదాలకు
తావులేకుండా అంతర్జాతీయ స్థాయిలో విస్తృత అంశాల ప్రాతిపదికన ఈ ప్రకటనను
రూపొందించారు. రాజకీయాలకు
అతీతంగా మహిళలకు సంబంధించి ఇటువంటి ప్రకటన
రూపొందించడం ఓ గొప్ప అవకాశంగా భావించవచ్చు. ప్రపంచదేశాల మహిళా అభివృద్ధికి దిశానిర్దేశం చేయడమేకాక అన్ని విధాల మహిళలకు
సహాయపడేవిధంగా దీనిని రూపొందించారు. అత్యంత
ప్రతిష్టాత్మకంగా మహిళా సాధికారితపై రూపొందించిన ఈ ప్రకటనను నవంబర్ 27న విజయవాడ సిదార్థ గ్రౌండ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారు. ఈ కార్యక్రమ
నిర్వహణలో మహిళా మంత్రులు, ఎంపీలు,
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు కీలకపాత్ర
పోషిస్తారు. వివిధ రంగాలకు
చెందిన ప్రముఖ మహిళలు పాల్గొంటారు.
-శిరందాసు నాగార్జున, డెవలప్ మెంట్ జర్నలిస్ట్, 9440222914.
No comments:
Post a Comment