May 31, 2019

సీఎం జగన్ ప్రసంగంతో స్పష్టత

సంక్షేమానికి, అవినీతి రహిత పాలనకు పెద్దమీట

            నూతన ముఖ్యమంత్రిగా ఈ నెల 30న బాధ్యతలు స్వీకరించిన  వైఎస్ జగన్మోహన రెడ్డి తొలి ప్రసంగంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ స్పష్టత వచ్చింది. ప్రభుత్వంలో విప్లవాత్మక మార్పులకు, కొత్త ఒరవడికి  నాంది పలికారు. పాలనలో వేగం, సంక్షేమానికి పెద్దపీట వేయడంతోపాటు అవినీతి రహిత పాలన అందించడమే కొత్త ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ పనుల విషయంలో ప్రజలు ఇప్పటి వరకు విసిగిపోయిన వాటికి నూతన సీఎం పరిష్కారం చూపారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగవసిన పనిలేకుండా వారికి కావలసిన పనులు వేగంగా జరగడం, వారి సమస్యలను నేరుగా సీఎం కార్యాలయానికి తెలియజేసే అవకాశం కల్పించడం వంటి చర్యలు వెంటనే చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తారు. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వృద్ధాప్య పెన్షన్ ని వైఎస్ ఆర్ పింఛన్ పేరుతో రూ.2 వేల నుంచి రూ.2250లకు పెంచుతూ సీఎం తొలి సంతకం చేశారు. దానిని ఏడాదికి రూ.250 చొప్పున పెంచుతూ రూ.3వేల వరకు పెంచుతారు. ‘నవరత్నాల’ అమలులో కులం, మతం, ప్రాంతం, పార్టీతో సంబంధంలేకుండా అర్హులు అందరికీ అమలు చేస్తారు. ప్రతి ప్రభుత్వ పథకం లబ్దిదారుని ఇంటికే చేరే ఏర్పాట్లు చేస్తారు. అందు కోసం ప్రతి గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఓ యువ వాలంటీర్ ని నియమిస్తారు. వారికి నెలకు రూ.5వేలు గౌరవ వేతనం ఇస్తారు. ప్రజలకు ప్రభుత్వం నుంచి జరగవలసి పనుల్నీ ఈ వాలంటీర్లే చూసుకుంటారు. ప్రతి పౌరుడి గౌరవాన్ని కాపాడాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.   సిఫారసుకు తావులేకుండా, లంచం అన్న మాట వినపడకుండా పాలన కొనసాగించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రజలకు లంచాల సమస్య ఎదురైనప్పుడు, అర్హులకు ఏదైనా పథకం అందకపోయినా  వెంటనే ప్రభుత్వానికి తెలియజేయడానికి ఓ కాల్ సెంటర్ ని ఏర్పాటు చేస్తారు. దానిని నేరుగా సీఎం కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. అవకతవకలు జరిగినట్లు తేలితే వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు. పాలనలో మార్పుల ప్రకియ వెంటవెంటనే వేగంగా జరిగిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్ట్ 15వ తేదీ నాటికి 4 లక్షల మంది వాలంటీర్లను నియమించడంతోపాటు కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తారు. పాలనను ప్రజలకు చేరువ చేస్తారు.  అందులో భాగంగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తారు.  పెన్షన్, రేషన్ కార్డ్,  ఇంటి స్థలం ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ  వంటివాటికి సంబంధించి ఏదైనా  ఇక్కడ దరకాస్తు చేసుకుంటే 72 గంటల్లో ప్రభుత్వం నుంచి స్పందన వస్తుంది. కాంట్రాక్ట్ విధానంలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమ కార్యక్రమాల అమలు చేయడంలో   ఆరు నెలల నుంచి ఏడాది కాలం లోపలే పాలనలో అద్వితీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

May 30, 2019



కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లు !
 
          ప్ర్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్ని ఆర్థిక పరిస్థితుల రీత్యా ముఖ్యమంత్రి పదవి ఓ సవాల్ లాంటిది. అత్యంత దారుణంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంతోపాటు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, ఎన్నికల మేనిఫెస్టో అమలు, రాజధాని రైతులకు ఇచ్చిన హామీలు వంటి ముఖ్య అంశాలు ఈ నెల 30న నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోయే  వైఎస్ జగన్మోహన రెడ్డి ముందున్నాయి. పరిపాలనా వ్యవస్థలో సమూల మార్పులు, వివిధ శాఖల ప్రక్షాళన, పాదర్శక పాలన, దుబార వ్యయం నియంత్రణ వంటి ఆలోచనలతో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు. అన్నిటికంటే ముఖ్యం పొరుగురాష్ట్రాలతో సఖ్యత, కేంద్రంతో సత్ సంబంధాలు నెరపాలన్న ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేశారు. అదే సరైన విధానంగా ఆయన భావిస్తున్నారు.  అదేవిధంగానే ఆయన వ్యవహరిస్తున్నారు.  రాష్ట్రం విడిపోయిన నేపధ్యంలో రాజధాని నిర్మాణం అత్యంత ముఖ్యమైనది. ఓ పెద్ద యజ్ఞం లాంటిది. అందులో జరిగిన అవకతవకలను సరిదిద్దవలసి ఉంది. రైతులకు సంబంధించి తలెత్తిన సమస్యలను పరిష్కరించాలి. కేంద్రంతో సాన్నిహిత్యంగా ఉంటూ రాష్ట్రానికి రావలసిన నిధులు రాబట్టుకోవాలి. రాష్ట్రానికి అత్యంత ప్రధానమైన, పూర్తిగా కేంద్రం వ్యయంతో నిర్మించే పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలి. 2014లో రాష్ట్ర విభజన సమయంలో రూ.97 వేల కోట్లుగా ఉన్న రుణ భారం కాస్తా రూ.2.58 లక్షల కోట్లకు చేరిందని అంచనా. అంతేకాకుండా ప్రభుత్వంలోని  కార్పొరేషన్‌లు, ఇతర సంస్థలు ప్రభుత్వ గ్యారంటీతో తీసుకున్న అప్పులు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి.  ప్రభుత్వం చెల్లించవలసిన బిల్లులూ తక్కువ ఏమీలేవు. ఈ పరిస్థితులలో కేంద్రం సహాయ సహకారాలు తీసుకోవలసిన అవసరాన్ని జగన్మోహన రెడ్డి గుర్తించారు. ఆడంబరాలకు పోకుండా అవకాశం ఉన్న మేరకు ప్రభుత్వ దుబారా ఖర్చులను తగ్గిస్తూ ఆర్థిక శాస్త్రవేత్తలు, ఇతర నిపుణుల సలహాలు తీసుకొని ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలన్న ఆలోచనతో ఆయన ఉన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని నిరాడంబరంగా నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఇది ఓ శుభపరిణామం.
                  నవరత్నాలలో భాగమైన  ‘వైఎస్ఆర్ రైతు భరోసా’ ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.12.50 వేల  చొప్పున 4 ఏళ్లలో 50 వేలు చెల్లించడం - వడ్డీ లేని పంట రుణాలు, ఉచిత బోర్లు – వైఎస్ హయాంలో ఎందరో జీవితాలను నిలిపిన ఆరోగ్యశ్రీ , యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన - వృద్దాప్య ఫించన్ రూ.3 వేలకు పెంపు, పింఛన్​ అర్హత వయసు 65 నుంచి 60 ఏళ్లకు కుదింపు - విద్యార్థులకు పూర్తి ఫీజు రీఇంబర్స్‌ మెంట్‌తోపాటు ఏడాదికి 20 వేల స్టైఫండ్ - పేదల కోసం ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు కట్టించడం – జలయజ్ఞం - పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇచ్చే "అమ్మఒడి" పథకం,  స్వయం సహాయక సంఘాల రుణ మాఫి - దశల వారీగా మద్యపాన నిషేధం లాంటి హామీలకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంది. వీటన్నిటితోపాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, మహిళలకు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ముఖ్యంగా రైతులు, యువత, పేదలు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

             2011 మార్చి 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆయన ఎదుర్కొన్నన్ని సమస్యలు ఈ దేశంలో ఏ యువనేత ఎదుర్కోలేదు. తండ్రి అకాల మరణం - ఆ తరువాత రాజకీయ పరిణామాలు,  తనకు అండగా నిలిచిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు - ఉప ఎన్నికలలో దాదాపు అన్ని సీట్లు గెలుపు  - అనేక కేసుల్లో ఇరికించడం జైలు జీవితం 2014 ఎన్నికల్లో ఒంటరి పోరాటం అధికారం చేజిక్కకపోయినా పట్టుదలతో పోరాటం కొనసాగింపు ప్రజా సంక్షేమ పథకాల అధ్యయనం అన్ని వర్గాల వారిని ఆకర్షించేవిధంగా నవరత్నాల రూపకల్పన రాజధాని రైతుల పక్షాల పోరాటం -ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదం పార్టీ ఎంపీల రాజీనామా - కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసానికి పార్టీ నేతల నోటీసులు టీడీపీని ఇరుకున పెట్టడం 2019 ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు ప్రత్యేక వ్యూహం బీసీలకు అధికంగా టిక్కెట్లు ఇవ్వండం అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే విధంగా ప్రచారంలో నూతన వరవడి – ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడగటం - టీడీపీ వారి విమర్శలను వ్యూహాత్మకంగా ఎదుర్కోవడం ...... వంటివాటితో సాగింది ఆయన రాజకీయ పోరాటం.  ఎన్నో ఒడిదుడుకులను, ఆటుపోట్లను ఎదుర్కొని ఘనవిజయం సాధించారు. ముందుగా తాము ఊహించిన, ఆశించిన విధంగా తమపై ఎంతో నమ్మకంతో  అత్యధికంగా 151 శాసనసభా స్థానాలలో గెలిపించడంతో బాధ్యత పెరిగినట్లుగా జగన్ భావిస్తున్నారు. ఆ నమ్మకాన్ని చెదరనివ్వకుండా ఆరు నెలల లోపలే ఉత్తమ ముఖ్యమంత్రి అనిపించుకునే రీతిలో పనులు చేయాలన్న తపనతో ఆయన ఉన్నారు. తండ్రికి మించిన పట్టుదలతో ఒంటరి పోరాటం చేసి 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడుని ఎదుర్కొని ఘన విజయం సాధించిన జగన్ అంతే పట్టుదలతో  ప్రత్యేక హోదా సాధించి, రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తారని, తమకు న్యాయం చేస్తారని రైతులు, మహిళలు, యువత, అన్ని వర్గాల ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. తనకు ప్రజలు ఇచ్చిన అద్వితీయమైన మద్దతుని దృష్టిలో పెట్టుకొని  జగన్మోహన రెడ్డి సుపరిపాలన అందిస్తారని ఆశిద్ధాం.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

May 27, 2019


కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి
కొత్త ప్రభుత్వానికి సంఘం అధ్యక్షుడు సుమన్ విజ్ఞప్తి
నూతన సీఎం జగన్మోహన రెడ్డికి అభినందనలు
          అమరావతి, మే 27: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కొత్తగా ఏర్పడే వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రభుత్వానికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.సుమన్ సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్మోహన రెడ్డికి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం తరపున అభినందనలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా  రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్న కొత్త ప్రభుత్వ న్యాయం చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలలో దాదాపు లక్షా 80వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. తమకు ఉద్యోగ భద్రత, పే స్కేల్, టైమ్ స్కేల్, సమాన పనికి సమాన వేతనం లేదని పేర్కొన్నారు. క్రమబద్ధీకరణ ఊసే లేదన్నారు. 2015 - 2018 మధ్య కాలంలో జరిగిన శాసనసభ సమావేశాలలో కాంట్రాక్ట్,  అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ (పర్మినెంట్) చేయమని కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మీరు చేయకపోతే తాము అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తామని అసెంబ్లీ సాక్షిగా గట్టిగా చెప్పారని గుర్తు చేశారు. అంతేకాకుండా 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో ఆదోనిలో మాట్లాడుతూ అన్ని శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విద్యార్హతలు ఆధారంగా అవకాశం ఉన్నంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హతల ఆధారంగా పర్మినెంట్ చేయాలని, ఆరోగ్యశ్రీ వర్తింపచేయాలని, పెన్షన్ వర్తింపజేయాలన్నారు. రెండు సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి  ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సుమన్  కోరారు.


May 23, 2019

ఓబీసీలకు క్రీమిలేయర్ నిబంధన ఎత్తివేయాలి



బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు డిమాండ్
                అమరావతి, మే 22:  ఓబీసీలకు క్రీమిలేయర్ నిబంధన ఎత్తివేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు  బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేంద్రరాష్ట్ర ప్రభుత్వం  బీసీ సాధారణ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు క్రిమిలేయర్ వర్తించదని తెలిపారు.  గ్రూప్ 3, గ్రూప్ 4 స్థాయిలో మొదట ఉద్యోగ నియామకం పొంది ప్రమోషన్ ద్వారా జిల్లా అధికారి అయినా,  వారి వార్షికాదాయం రూ.8 లక్షలు దాటినా వారు కూడా క్రీమిలేయర్ కిందకు రారని, వారి పిల్లలు ఓబిసిలుగా పరిగణించాలని తెలిపారు. ఐఏఎస్ఐపీఎస్ఐఎఫ్ఎస్, గ్రూప్ వన్ ఉద్యోగాలలో నియామితులైనవారు, తల్లిదండ్రులు నేరుగా గ్రూప్ 2 ఉద్యోగంలో నియమితులైన వారి పిల్లలు మాత్రమే క్రిమిలేయర్ కిందకు వస్తారని వివరించారు. సాధారణ ఉద్యోగులు ఉపాధ్యాయుల వార్షిక ఆదాయము రూ.8 లక్షలు దాటినా వారి పిల్లలకు క్రిమిలేయర్ వర్తించదని చెప్పారు. అయితే చాలా మంది రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్లు క్రిమిలేయర్ పై సరైన అవగాహన లేక సాధారణ బిసి ఉద్యోగులు ఉపాధ్యాయుల వార్షికాదాయం రూ.8 లక్షలు దాటితే,  వారి పిల్లలకు ఓబిసి సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని పేర్కొన్నారు. దాంతో వారి పిల్లలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఐఐటి ఇంజనీరింగ్, మెడికల్ వంటి కోర్సులలో రిజర్వేషన్లు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. ఈ విధంగా బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.  ఈ నేపధ్యంలో క్రీమిలేయర్ నిబంధన ఎత్తివేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీఎస్టీవికలాంగులుమహిళలు వంటి తొమ్మిది వర్గాల వారు రిజర్వేషన్లు పొందుతున్నారని  వారికెవరికీ లేనిక్రీమిలేయర్ నిబంధన ఒక్క బీసీ వర్గానికే ఎందుకు విధించారని ఆయన ప్రశ్నించారు.  రిజర్వేషన్ల సిద్ధాంతానికి పునాది సామాజిక వివక్షసాంఘిక వెనుకబాటుతనం విద్యారంగంలో వెనుకబాటుతనమే కానీ ఆర్థిక వెనుకబాటుతనం  కాదన్నారు. ఈ విషయాన్ని రాజ్యాంగం ప్రకారం నియమించిన రెండు జాతీయ కమిషన్లు మండల్ కమిషన్కాకా కలేల్కర్ కమిషన్ రిపోర్టుల్లో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. రాజ్యాంగ రచయితల దృక్పథంలో గానీసామాజిక శాస్త్రవేత్తల దృక్పథంలో గానీ కేవలం సామాజిక వివక్ష కారణంగానే రిజర్వేషన్లు పెట్టాలని స్పష్టం చేశారన్నారు. రిజర్వేషన్లపై అనేక సిద్ధాంతపరమైన చర్చలు జరిగాయనిసమాజాన్ని సమాజ నిర్మాణాన్ని లోతుగా అధ్యయనం చేసిన సామాజిక శాస్త్రవేత్తలు కూడా కులపరమైనవిధానాన్ని ఆధారంగా తీసుకొని రిజర్వేషన్లు పెట్టాలని సూచించారని తెలిపారు. బీసీలకు కల్పించిన 27 శాతం రిజర్వేషన్లను పూర్తిగా అమలు చేయకుండా క్రీమిలేయర్ నిబంధన పెట్టడం అన్యాయమని, ఆ షరతును వెంటనే తొలగించాలని ఆయన కోరారు. కేంద్రంలో వెనుకబడిన కులాల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేసిన రోజునే బీసీల సమస్యలు పరిష్కారమవుతాయని,  ఆశించిన లక్ష్యాలను  సాధించగలుగుతామని శంకరరావు స్పష్టం చేశారు.

May 20, 2019

ప్రభుత్వ స్టడీ సర్కిల్స్ ను పటిష్ట పరచాలి


బీసీ  సంక్షేమ  సంఘం  రాష్ట్ర  అధ్యక్షుడు  కేసన

                           అమరావతి, మే 20:  నిరుద్యోగ   యువతను    పోటీ  పరీక్షలకు  సిద్దం చేయడానికి  ప్రభుత్వం  ఏర్పాటు  చేసిన  బీసీ స్టడీ  సర్కిల్స్,  ఏపీ   స్టడీ  సర్కిల్స్ లో  సౌకర్యాలు  మెరుగుపరచాలని    బీసీ  సంక్షేమ  సంఘం  రాష్ట్ర  అధ్యక్షుడు  కేసన  శంకర రావు  బీసీ  సంక్షేమ  శాఖ ముఖ్య   కార్యదర్శి  బి.ఉదయ లక్ష్మికి   విజ్ఞప్తి  చేశారు.   ఈ మేరకు  సోమవారం   మధ్యాహ్నం   సచివాలయంలోని  బీసీ  సంక్షేమ శాఖ  కార్యాలయంలో    అసిస్టెంట్    సెక్రటరీ  ఎస్ .హనుమంతరావును    కలిసి    ఒక  వినతి పత్రాన్ని అందజేశారు.   అట్టడుగు  వర్గాల యువత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న సదుద్ధేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన ఈ స్టడీ సర్కిళ్ల వ్యవస్థ ఎంతగానో ఉపయోపడుతోందని శంకర రావు చెప్పారు. అయితే  స్టడీ సర్కిళ్లకు సొంత భవనాలు లేవని, ప్రస్తుతం నిర్వహించే స్టడీ సర్కిళ్లలో పోటీ పరీక్షలకు అధ్యయనం చేయడానికి తగిన సౌకర్యాలు గానీ, అనువైన వాతావరణ గాని లేదని తెలిపారు. అలాగే వసతి, భోజన సౌకర్యాలు కూడా లేవని చెప్పారు. 2004 సంవత్సరంలో నిర్ణయించిన ధరల ప్రకారం స్టైఫండ్, మెటీరియల్స్, ఫ్యాకల్టీ రెమ్మూనరేషన్ ఉన్నాయని వివరించారు. ఆ ధరలతో ప్రస్తుత అవసరాలు తీరే అవకాశంలేదన్నారు. ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో ఫ్యాకల్టీకి ఇచ్చే రెమ్మూనరేషన్ ఎక్కవగా ఉండటంతో ఇక్కడకు సమర్థులైన బోధకులు వచ్చే అవకాశం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే యువతకు ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో భోజన, మెటీరియల్ వంటి అవసరాలు తీర్చుకోవడం కష్టం అని తెలిపారు.
                ప్రభుత్వ స్టడీ సర్కిళ్లను ఉపయోగించుకోకుండా, ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో యువతకు కోచింగ్ ఇప్పించడం వల్ల ప్రభుత్వానికి అధిక వ్యయం అవుతుందిన చెప్పారు. ఆ ఖర్చులో 25 శాతంతోనే ప్రభుత్వ స్టడీ సర్కిళ్లలో సౌకర్యాలు మెరుగుపరిస్తే ఫలితం ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. సొంత భవనం నిర్మించడంతోపాటు స్టడీ సర్కిళ్లలో మెరుగైన ఆడియో, వీడియో వ్యవస్థని, జిరాక్స్ మిషన్ ని, గ్రంథాలయాన్ని, ప్రతి శిక్షణా తరగతిలో కూర్చొని రాసుకోవడానికి అనువుగా బెంచీలు ఏర్పాటు చేయాలని, అధ్యయనానికి వీలుగా ప్రశాంత వాతావరణం కల్పించాలని శంకర రావు కోరారు.  స్టడీ సర్కిల్ నిర్వహణకు గ్రూప్-1 స్థాయి డైరెక్టర్ ని నియమించాలని, కాంట్రాక్ట్ ప్రాతిపదిన నియమించి 15 ఏళ్లు పూర్తి అయిన ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ యువత ప్రైవేటు హాస్టళ్ల ఉండి శిక్షణ పొందేందుకు స్టైఫండ్ నెలకు కనీసం రూ.4000 ఇవ్వాలన్నారు. సివిల్స్, బ్యాంకింగ్, ఆర్ఆర్ బి తదితర ఉద్యోగాలతోపాటు గ్రూప్-1, II, III, IV  సర్వీస్ ఉద్యోగాలకు మంచి కోచింగ్ ఇచ్చే ఏర్పాటు చేయాలని కోరారు. స్టడీ సర్కిళ్లలో ఇచ్చే కోచింగ్ వివరాలు నిరుద్యోగ యువతకు అందుబాటులో ఉంచాలన్నారు.  స్టడీ సర్కిళ్లను బలోపేతం చేసి మంచి ఫ్యాకల్టీని నియమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని శంకరరావు కోరారు.  వినతి పత్రం ఇచ్చిన వారిలో సంక్షేమ సంఘం నాయకులు కుమ్మర క్రాంతి కుమార్, నాగలింగం, దాసరి అప్పారావు, గోపి కృష్ణ, మేకా రవి, వెంకట్, శేఖర్ తదితరులు ఉన్నారు. 

కుల వ్యవస్థ వల్ల నష్ట ఎవరికి?

·       జనాభా దామాషా ప్రకారం హక్కులు దక్కని బీసీలు
·       సమాన అవకాశాల కమిషన్ వల్ల సమన్యాయం


  ప్రపంచంలో ఎక్కడాలేని కుల వ్యవస్థ మన దేశంలో ఉంది. భారతీయ సమాజంలో నరనరాన వేళ్లూనుకుంది. మనుధర్మాన్ని పాటించిన  ఈ వ్యవస్థలో ఉన్నత కులాలు లేదా అగ్రకులాలు లేదా ఆధిపత్య కులాలు (ఓసీలు) రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఉన్నత స్థానంలో ఉండటమే కాక సర్వ సుఖాలు అనుభవించారు. అనుభవిస్తున్నారు.  వేల సంవత్సరాల నుంచి ఎస్టీ, ఎస్సీ, బీసీలు అత్యంత దారుణమైన వివక్షకు గురై, అణచివేయబడి తీవ్రంగా నష్టపోయారు. స్వాతంత్ర్యం సాధించిన తరువాత డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ పుణ్యమా అంటూ రాజ్యాంగం ద్వారా ఎస్టీ, ఎస్సీ కులాల పరిస్థితి కొంత మెరుగుపడింది. జనాభా దామాషా ప్రకారం వారికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. రాజ్యాధికారంలో భాగస్వాములయ్యారు. రాజ్యాంగపరంగా వారికి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు కేటాయిస్తున్నారు. కుల వ్యవస్థ కొనసాగుతున్న క్రమంలో వృత్తి నైపుణ్యంలో అగ్రస్థానంలో ఉన్న బీసీ కులాల పరిస్థితిలో మార్పులేదు. ఆనాడు, ఈనాడు ప్రధాన వృత్తులు, ముఖ్యంగా చేనేత, బంగారు వస్తువుల తయారీ, వడ్రంగి వంటి అత్యత నైపుణ్యత కలిగిన సున్నితమైన వృత్తులు వారే చేస్తున్నారు. ఎస్టీ, ఎస్సీ కులాల మాదిరిగా రాజ్యాంగపర రక్షణ లేకపోవడంతో బీసీలు రాజ్యాధికారంలో భాగస్వాములు కాలేకపోతున్నారు. జనాభా దామాషా ప్రకారం ఉద్యోగ అవకాశాలు పొందలేకపోతున్నారు. 52 శాతం జనాభా ఉంటే ఉద్యోగాలలో 25 నుంచి 27 శాతం మాత్రం రిజర్వేషన్ కల్పించారు. ఆ రిజర్వేషన్ కూడా సక్రమంగా అమలు జరగడంలేదు. అధికార గణంలో ఉన్న ఆధిపత్య కులాల వారు ఎక్కడికక్కడ వారిని తొక్కేస్తున్నారు. వారికి రావలసిన అవకాశాలను కూడా వారికి దక్కకుండా అడ్డుపడుతున్నారు. ఏపీపీఎస్సీలో కూడా అదే ధోరణి కొనసాగుతోందని బీసీలు గగ్గోలుపెడుతున్నారు. శాసనసభలో దామాషా ప్రకారం వారికి ప్రాతినిధ్యంలేదు. రాజ్యాంగపరమైన హక్కు లేకపోవడం వల్లే వారి పరిస్థితి ఇలా ఉంది. యాంత్రీకరణ, ఆధునిక పోకడలతో కుల వృత్తులు క్షీణించడంతో వారిలో కొందరి బతుకులు మరింత దయనీయంగా తయారయ్యాయి.

            కుల వ్యవస్థ కొనసాగడం వల్ల అటు ఉన్నత కులాలు, ఇటు ఎస్సీ, ఎస్టీలు బాగానే లబ్ది పొందుతున్నారు. ఓసీలు జానాభా దామాషా ప్రకారం మూడు, నాలుగు రెట్లు రాజ్యాధికారంలో, ఉద్యోగాలలో భాగం పొందుతున్నారు. ఎస్సీ, ఎస్టీ కులాల వారు జనాభా దామాషా ప్రకారం పొందగలుగుతున్నారు. చిత్రమైన పరిస్థితి ఏమిటంటే బీసీలు అత్యంత దారుణంగా నష్టపోతున్నారు. అధ్వాన్నంగా ఉన్న వారి పరిస్థితిని ఇంకా దిగజార్చడానికి ఇతరులను కూడా తీసుకువచ్చి బీసీలలో కలిపారు. ఇంకా కలపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న కొందరు ఉద్దేశపూర్వకంగానే వారిని దెబ్బతీస్తున్నారు. అటు ప్రైవేటు రంగంలో, ఇటు ప్రభుత్వ రంగంలో ఉన్నత పదవులలో ఇతరులు ఉంటుంటే దిగువ స్థాయి ఉద్యోగాలు బీసీలు చేస్తున్నారు. కేంద్రంలోని  ఉద్యోగాలలో  బీసీలు పది శాతం మంది కూడా లేరు. అంటే బీసీలు ఏ స్థితిలో ఉన్నారో  అర్ధం చేసుకోవచ్చు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు హక్కులు దక్కలేదు. ఇక దక్కే అవకాశం కూడా కనుచూపుమేరలో కనిపించడంలేదు. ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగించే అంశం ఇది.

              డాక్టర్ అంబేద్కర్ కుల నిర్మూలనను ప్రతిపాధించారు. అయితే అది తగిన రీతిలో కార్యరూపం దాల్చలేదు. దేశంలోని పరిస్థితులు కూడా అందుకు అనుకూలంగా లేవు. ముఖ్యంగా రాజకీయ నాయకులు అందుకు సిద్ధంగాలేరు. కుల వ్యవస్థను వారు అనుకూలంగా మలుచుకుంటారు. ఏ ప్రాంతంలోనైనా, ఏ గ్రామంలోనైనా కమ్మ- రెడ్డి, కాపు - యాదవ, మాల – మాదిగ పేర్లతో వారిని విడగొట్టి లబ్ది పొందడం వారికి తేలిక.  అన్నివిధాల అత్యధిక లాభం పొందే ఆధిపత్య కులాల వారు గానీ, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ పొందుతున్న ఎస్సీ,ఎస్టీ కులాల వారు గానీ  కుల నిర్మూలన ఉద్యమం పట్ల అసలు ఆసక్తి చూపరు. ఆ ఉద్యమం బలపడితే వారికి ఏమీ లాభం ఉండదు. కుల వ్యవస్థ కొనసాగితేనే వారు  ఎక్కువ లబ్దిపొందడానికి అవకాశం ఉంటుంది. చివరికి మనకి అర్ధమయ్యేది ఏమిటంటే కుల వ్యవస్థ కొనసాగడం వల్ల తీవ్రంగా నష్టపోయేది బీసీ కులాలవారే.
ఈ పరిస్థితులలో తెలంగాణ బీసీ కమిషన్ సూచించిన విధంగా మన రాష్ట్రంలో కూడా సమాన అవకాశాల కమిషన్ ను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది.  ప్రభుత్వ, ప్రైవేటుతో పాటు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించే విధంగా ఆ కమిషన్‌ పని చేయాలి. ఏ ఒక్క సామాజిక, మత, కుల, భాష, ఇతర వర్గాల వారికి పక్షపాతం కానీ, విరోధం కానీ లేకుండా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా దానిని రూపొందించాలి. ఉద్యోగాల నియామకం, గృహ నిర్మాణం, ఆరోగ్య పరిరక్షణ, అభివృద్ధి పథకాలను ఈ కమిషన్ పరిధిలో చేర్చితే  అందరికీ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

May 19, 2019


  అవసరమైతే అదనపు బలగాలు

కేంద్ర ప్రత్యేక పరిశీలకులు వినోద్ జట్షీ
  
       సచివాలయం, మే 19: రీపోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు గుమిగూడకుండా చూడాలని, అవసరమైతే అదనపు బలగాలను పంపాలని కేంద్ర ప్రత్యేక పరిశీలకులు వినోద్ జట్షీ ఎన్నికల అధికారులకు చెప్పారు.  సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులోని కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఆదివారం ఉదయం ఆయన సందర్శించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని 7 పోలింగ్ కేంద్రాలను ఆన్ లైన్ లో పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల లోపల, బయట పరిస్థితులను గమనించారు. ఒక కేంద్రంలో ఎక్కువ మంది ఓటర్లు ఉండటాన్ని గమనించిన ఆయన ఓటర్లు ఎక్కువ మంది కేంద్రం లోపల ఉండకుండా చూడాలన్నారు. అవసరమైతే రిజర్వు పోలీస్ బలగాలను తీసుకోమని చెప్పారు.  ఏడు కేంద్రాలలో ఎక్కడ నుంచైనా ఫిర్యాదు ఫోన్స్ ఏమైనా వచ్చాయా? అని అడిగి తెలుసుకున్నారు. ఒక పోలింగ్ స్టేషన్ బయట టీడీపీ, వైసీపీ ఏజంట్లు గొడవ పడినట్లు జాయింట్ సీఈఓ నాగమణి తెలిపారు. ఏ విధమైన ఫిర్యాదులు అందలేదని చెప్పారు.  11 గంటలు దాటిన తరువాత ఓటర్లు ఎక్కువ మంది పోలింగ్ కేంద్రాలకు వస్తున్నట్లు చెప్పారు. 11 గంటల సమయం వరకు ఏప్రిల్ 11 జరిగిన పోలింగ్ శాతానికి, ఇప్పుడు జరిగిన పోలింగ్ శాతానికి వ్యత్యాసం అడిగి తెలుసుకున్నారు.
              ఆ తరువాత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది, అదనపు సీఈఓ సుజాత శర్మలతో మధ్యాహ్నం వరకు కౌంటింగ్ అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఓట్ల లెక్కింపు రోజున తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలని, తరువాత ఈవీఎంలు లెక్కించాలని, చివరగా వీవీప్యాట్స్ లెక్కించాలని వినోద్ జట్షీ చెప్పారు. 175 శాసనసభ నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గం నుంచి ర్యాండమ్ గా 5 పోలింగ్ కేంద్రాల వీవీప్యాట్స్ ని తీసుకోవాలన్నారు. ఈవీఎంల ఓట్లకు, వీవీప్యాట్స్ ఓట్లకు వ్యత్యాసం ఉంటే వి వీవీప్యాట్స్ ఓట్ల లెక్కింపునే ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. తుది ఫలితాలు వెల్లడించే ముందు ఓట్ల వివరాల షీట్ పైన రిటర్నింగ్ అధికారి తప్పనిసరిగా సంతకం చేయాలని వినోద్ జట్షీ చెప్పారు. ఓట్ల లెక్కింపు రోజు టీవీలు, కంప్యూటర్లు కండిషన్ లో ఉండేలా, టీవీలను తగిన ప్రదేశంలో అమర్చాలని గోపాల కృష్ణ ద్వివేది ఐటీ అధికారులను ఆదేశించారు.

ఆన్ లైన్ లో రీపోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీఈఓ

       సచివాలయం, మే 19: సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది ఆదివారం ఉదయం రీపోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల లోపల సిబ్బంది పనితీరుని, బయట ఓటర్లు బారులు తీరి ఉండటాన్ని ఆయన గమనించారు. పోలింగ్ కేంద్రం లోపలకు ఇతరులు ఎవరూ రావడానికి వీలులేదని, ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే పోలింగ్ అధికారికి ఫోన్ చేసి కనుక్కోమని కంట్రోల్ రూమ్ లోని అధికారులను ఆదేశించారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే తనకు తెలియజేయమని చెప్పారు. ఏజంట్లు అందరూ ఉన్నారో లేరో కూడా గమనించమని వారికి చెప్పారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా వారికి ఫోన్ చేసి అడుగుతున్నామని, 7 కేంద్రాలలో రీపోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లు  జాయింట్ సీఈఓ నాగమణి సీఈఓకి వివరించారు. ఆ తరువాత అదనపు సీఈఓ సుజాత శర్మ కూడా కంట్రోల్ రూమ్ కు వచ్చి పోలింగ్ జరుగుతున్న తీరుని ఆన్ లైన్ లో పరిశీలించారు.
ఈవీఎం, వీవీప్యాట్ల కథా కమామిషు!
          






          ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో బ్యాలెట్ బాక్సుల స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)ను ప్రవేశపెట్టడంతో ఎన్నికల వ్యవస్థలో విప్లవాత్మక మార్పు వచ్చింది. అయితే ఈ ఈవీఎంలు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏదో ఒక రకమైన వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ట్యాంపరింగ్ (దురుద్దేశంతో పాడుచేయడం) వంటి వివాదాలు చెలరేగుతున్నాయి. సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే నారా చంద్రబాబు నాయుడు వంటివారితోపాటు దేశంలోని 22 జాతీయ, ప్రాంతాయ పార్టీలు  కూడా వీటిని వ్యతిరేకించడం ఆలోచనలకు తావిస్తోంది. ప్రపంచం వ్యాప్తంగా 120 దేశాల్లో వీటిని వినియోగించడంలేదు. 20 దేశాలలో మాత్రమే వినియోగిస్తున్నారు. మన దేశంలో మెజారిటీ రాజకీయ పక్షాలు ఈవీఎంలను విశ్వసించడంలేదు. వాటి నిర్వహణ,  వినియోగంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బ్యాలెట్ బాక్సుల స్థానంలో ఈవీఎంలను ప్రవేశపెట్టాలన్న ఆలోచన  భారత ఎన్నికల సంఘా(ఈసీఐ)నికి 1977లో వచ్చింది. వీటిని తయారు చేసే బాధ్యతను హైదరాబాద్ లోని భారత ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ సంస్థ(ఈసీఐఎల్)కు అప్పగించింది. పలు దశల తరువాత ఈసీఐఎల్, బెంగుళూరులోని భారత్ ఎలక్ట్రానిక్ కార్పోరేషన్(బీఈఎల్)లు కలిసి సంయుక్తంగా ఈవీఎంలను తయారు చేయడం మొదలుపెట్టాయి. ఈవీఎంలను దేశంలో మొట్టమొదటిసారిగా 1982లో కేరళ రాష్ట్రంలోని పారూర్ శాసనసభ నియోజకవర్గంలోని 50 పోలింగ్ కేంద్రాలలో ప్రవేశపెట్టారు. అప్పుడే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వాటి వినియోగానికి సంబంధించి నిర్ధిష్టమైన చట్టంలేదని ఆ ఎన్నికను సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఆ తరువాత వాటిని వినియోగించలేదు. 1989 ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించే విధంగా 1988 డిసెంబర్ లో ప్రజాప్రాతినిధ్య చట్టం-1951కి  సవరణ చేశారు. 1998లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాలలో జరిగిన 25 నియోజకవర్గాల్లో వినియోగించారు. దాంతో వాటి గురించి ప్రజలకు బాగా తెలిసింది. ఆ తరువాత 1999లో 45 పార్లమెంట్ నియోజకవర్గాల్లో, 2000లో హర్యానాలో 45 శాసనసభ నియోజకవర్గాల్లో, 2001లో తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, పశ్చిమ బెంగాల్ లలో అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో వీటిని వినియోగించారు. 2004లో లోక్ సభ సాధారణ ఎన్నికల్లో దేశంలోని 543 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పది లక్షలకుపైగా ఈవీఎంలను వినియోగించారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ఈసీఐఎల్ ఆధ్వర్యంలో ఉన్నత ప్రమాణాలతో, కట్టుదిట్టమైన భద్రత నిఘా మధ్య తయారైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అనుమానాలకు తావులేదని ఈసీఐ పేర్కొంది. 2010లో నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో వీటిని తయారు చేసినట్లు  తెలిపింది. ఈవీఎంలను ట్యాంపర్‌ చేయడం సాధ్యం కానేకాదని స్పష్టం చేసింది.

         కాల క్రమంలో ఈవీఎంల ఆకృతిలో మార్పులు తీసుకువచ్చారు. వీటి వినయోగానికి సంబంధించి ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు సాంకేతికపరమైన మార్గదర్శకాలను, సూచనలను ఇస్తూ వస్తోంది. ఈవీఎంల జీవిత కాలపరిమితి 15 ఏళ్లు. 1989-90లో తయారు చేసిన ఈవీఎంలు అన్నింటిని ధ్వంసం చేయాలని నిర్ణయించారు. నిపుణులు రూపొందించిన నిబంధనల ప్రకారం వాటిని ధ్వంసం చేస్తారు. 2010 అక్టోబర్ 4న జరిగిన అఖిల పక్షాల సమావేశంలో ఈవీఎంల వాడకంపై రాజకీయ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీపీఏటి) వ్యవస్థ గురించి చర్చకు వచ్చింది. ఆ తరువాత సాంకేతిక నిపుణుల కమిటీ పలుసార్లు సమావేశమై ఈవీఎంలతోపాటు వీవీపీఏటీ వ్యవస్థకు రూపకల్పన చేశాయి. బీఈఎల్, ఈసీఐఎల్ వాటిని తయారు చేశాయి. 2011లో జమ్మూ, కాశ్మీర్ లోని లడఖ్, కేరళలోని తిరువనంతపురం, మేఘాలయలోని చిరపుంజి, తూర్పు ఢిల్లీలో, రాజస్థాన్ లోని జైసల్మేర్ లలో వీవీపీఏటీ వ్యవస్థ క్షేత్రస్థాయి పరీక్ష కోసం నమూనా ఎన్నికలు నిర్వహించారు. రాజకీయ పార్టీల సీనియర్ నేతలు, పౌరసమాజ సభ్యులు, నిపుణుల సూచనలు, సలహాల మేరకు ఈ వ్యవస్థ రెండవ వెర్షన్ తయారు చేశారు. ఎన్నికల సంఘం ఈవీఎంలతోపాటు వీవీపీఏటీలను వాడటానికి వీలుగా 2013లో ఎన్నికల నిర్వహణా నియమాలు-1961కి సవరణ చేశారు.
ఓటర్లు తమ ఓటు తాము వేయాలనుకున్నఅభ్యర్థికి పడిందా, లేదా అనేది సరిపోల్చుకోవడానికి ఈ వీవీప్యాట్ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఇందులో ప్రింటర్, డిస్ప్లే యూనిట్ ఉంటాయి. ఓటరు ఓటు వేసినప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థి క్రమ సంఖ్య, పేరు, గుర్తుని వీవీపిఏటీ ఒక పేపరు స్లిప్ పై ముద్రిస్తుంది. స్క్రీన్ పైన ఆ స్లిప్ 7 సెకండ్లు కనిపిస్తుంది. ఆ తరువాత ఆ స్లిప్ కట్ అయి సీలువేసిన డ్రాప్ బాక్స్ లో పడుతుంది. నాగాలాండ్ లోని నోక్సేన్ శాసనసభ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఈవీఎంలతోపాటు వీవీప్యాట్లను వినియోగించారు. 2014 లోక్ సభ సాధారణ ఎన్నికల్లో 8 నియోజకవర్గాల్లో, 2019లో దేశ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వీటిని వినియోగించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తరువాత ఒక్కో శాసనసభ నియోజకవర్గంలో ర్యాండమ్ గా ఒక పోలింగ్ స్టేషన్ కు సంబంధించిన  వీవీప్యాట్ స్లిప్ లను తప్పనిసరిగా లెక్కించాలన్న నిబంధన ఉంది.

ఇదిలా ఉండగా, దేశంలోని 22 రాజకీయ పార్టీలు ప్రతి నియోజకవర్గంలో ఈవీఎంల ఓట్లతోపాటు కనీసం 50 శాతం వీవీప్యాట్ స్లిప్ లను లెక్కించాలని ఎన్నికల సంఘాన్ని కోరాయి. సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేశాయి. వీవీపాట్ లో 7 సెకండ్లు కనిపించవలసిన గుర్తు మూడు సెకండ్లు మాత్రమే కనిపిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.  వీవీపాట్ స్లిప్ లను 50 శాతం లెక్కించాలంటే ఆరు రోజులు సమయం పడుతుందని, అందుకు భారీగా అదనపు సిబ్బంది కావాలని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు తెలిపింది.   బ్యాలెట్‌ విధానంలో ఒక నియోజకవర్గంలో ఓట్లు లెక్కించేందుకు 16 గంటల సమయం పడుతుందని వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించేందుకు ఆరు రోజులు సమయం ఎందుకు అన్న సందేహాన్ని  ప్రతిపక్షాలు  లేవనెత్తాయి. ఎన్నికల సంఘం తెలిపిన వివరాలను పరిగణనలోకి తీసుకొని 50 శాతం వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించాలన్న రివ్యూ పిటిషన్ ను సుప్రీం కోర్టు మే 7న  తిరస్కరించింది. ప్రతి నియోజకవర్గం నుంచి ఐదు వీవీప్యాట్‌ స్లిప్ లను లెక్కించాలని సుప్రీం కోర్టు ఏప్రిల్ 8న తీర్పు ఇచ్చింది.  ఆ ప్రకారం ప్రతి శాసనసభ నియోజక వర్గంలో  ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తరువాత ర్యాండమ్ గా 5 పోలింగ్‌ బూత్‌లను ఎంపిక చేసి, అక్కడి వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కిస్తారు. వీవీ ప్యాట్‌ స్లిప్ ల లెక్కింపునే పరిగణనలోకి తీసుకుంటారు. 5 పోలింగ్‌ బూత్‌ల్లోని వీవీ ప్యాట్‌ స్లిప్పులకు ఈవీఎంలలోని ఓట్లకు తేడా ఉంటే,  అప్పుడు ఆ శాసనసభ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్‌ బూత్‌ల్లోని వీవీప్యాట్‌ స్లిప్ లను లెక్కిస్తారు. ఈసీఐ చెబుతున్న ప్రకారం ఈవీఎం ఓట్లకు, వీవీప్యాట్ ఓట్లకు తేడా రావడానికి అవకాశం లేదు. అందువల్ల ఈవీఎం ఓట్లతోనే ఫలితాలలో స్సష్టత వస్తుంది. పటిష్టమైన సమాచార, మీడియా వ్యవస్థ ఉన్నందున మే 23వ తేదీ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైతే, మధ్యాహ్నానికి అనధికారికంగా ఫలితాలు వెల్లడవుతాయి. అయిదు బూత్‌ల్లోని  వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించి, అధికారికంగా ఫలితాలు ప్రకటించడానికి రాత్రి వరకు సమయం పట్టే అవకాశం ఉంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

May 13, 2019

14న మంత్రి మండలి సమావేశం



          సచివాలయం, మే 13: ఈ నెల 14వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మంత్రి మండలి సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. సచివాలయంలోని 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ హాలులో ఈ సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి మండలి రెవిన్యూ విభాగం, ఆర్టీజీఎస్ లకు సంబంధించిన ఫని తుఫాను ఉపశమన కార్యక్రమాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలకు సంబంధించి రాష్ట్రంలో త్రాగునీటి పరిస్థితి, వ్యసాయం, సహకార, ఉద్యానవన, పశుసంవర్ధక, డెయిరీ, మత్స్య, రెవెన్యూ శాఖలకు సంబంధించి కరువు, రుతువులలో వచ్చే మార్పుల పరిస్థితులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతోపాటు ఉపాధి అవకాశాలు తదితర అంశాలను సమీక్షిస్తారని వివరించారు.

May 10, 2019


‘సువిధ’లో ఎంటర్ చేసిన తరువాతే ఫలితాల వెల్లడి

వీడియో కాన్ఫరెన్స్ లో ఎన్నికల సంఘం ఐసీటీ డైరెక్టర్

రిటర్నింగ్ అధికారి మాత్రమే ఫలితాల ప్రకటన చేస్తారు

                    సచివాలయం, మే 10: ఎన్నికల సంఘం వెబ్ సైట్ ‘సువిధ’ (suvidha.eci.gov.in)లో ఎంటర్ చేసిన తరువాతే ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని రిటర్నింగ్ అధికారుల(ఆర్ఓ)కు భారత ఎన్నికల సంఘం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ(ఐసీటీ) డైరెక్టర్ కుశాల్ పాఠక్ చెప్పారు. ఎన్నికల అధికారులతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ నెల 23న కౌంటింగ్ సందర్భంగా, అంతకు ముందు ఆర్వోలు, ఏఆర్వోలు సాంకేతికంగా, డేటా పరంగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆయన వివరించారు. రౌండ్ల వారీగా ఎప్పటికప్పుడు ఫలితాలు ప్రజలందరూ తెలుసుకోవడానికి రిజల్ట్స్(results.eci.gov.in)అనే వెబ్ సైట్ ఉంటుందని, అలాగే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా సువిధ యాప్ ఉంటుందని తెలిపారు. ఆర్వోలు, ఏఆర్వోలు తీసుకోవలసిన జాగ్రత్తలు సులభమైన విధానాలతో నాలుగు అంచలుగా ఉంటాయని చెప్పారు. రౌండ్ల వారీగా డేటాని ‘సువిధ’లో ఆర్వోలు, ఏర్వోలు మాత్రమే ఎంటర్ చేయాలన్నారు. డేటాని చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలని చెప్పారు. డేటాని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల బయట ఫలితాల వెల్లడికి డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి 5 నిమిషాలకు డేటాని అప్ డేట్ చేయాలని చెప్పారు. రిటర్నింగ్ అధికారి మాత్రమే ఫలితాలు ప్రకటిస్తారని తెలిపారు.

           ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఆర్వోలు, ఏర్వోలు ఎంతమంది ఉంటే అన్ని చక్కగా పని చేసే కంప్యూటర్లు ఉండాలని చెప్పారు. వాటిలో లైసెన్ పొందిన యాంటి వైరస్ ని అప్ డేట్ చేసుకోవాలన్నారు. సైబర్ సెక్యూరిటీ దృష్ట్యా  పెన్ డ్రైవ్ లు, సీడీలు వాడకూడదని చెప్పారు.  ప్రతి కంప్యూటర్ కనీసం 8 ఎంబిపీఎస్ స్సీడుతో ఉండాలని, అంతకంటే ఎక్కవ స్పీడ్ ఉంటే మంచిదన్నారు. ప్రతి కంప్యూటర్ కు ప్రత్యేక ఐపీ అడ్రస్ ఉండాలని చెప్పారు. ఎక్సెల్ లో ప్రావీణ్యం ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ ని అక్కడ నియమించాలన్నారు.  ప్రింటర్, స్కానర్, ఇతర స్టేషనరీని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బీఎస్ఎన్ఎల్ ద్వారా ఇంటర్ నెట్ కనెక్షన్ ని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. బీఎస్ఎన్ఎల్ అందుబాటులో లేని చోట అందుబాటులో ఉన్న ఏ నెట్ వర్క్ నైనా వాడుకోవచ్చని తెలిపారు. 8 గంటల పవర్ జనరేటర్ ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.
          ఈ నెల 9 నుంచి 15 తేదీ వరకు నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్య, స్త్రీ, పురుషులు, ఇతరులు, మొత్తం ఓటర్ల వివరాలు, పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పారు. ఓటర్ల సంఖ్యలో మార్పులు ఉంటే ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని మాత్రమే మార్చాలన్నారు. మే 23న ఓట్ల లెక్కంపు జరుగనున్నందున, 21వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య రిహార్సల్ చేసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపునకు ముందే ఎన్ని రౌండ్లు లెక్కించాలో నిర్ధారించుకోవాలని చెప్పారు. ఈవీఎం ఓట్లను రౌండ్ల వారీగా వెబ్ సైట్ లో  ఎంటర్ చేయాలని, ప్రతి రౌండ్ ఒక ప్రింట్ అవుట్ తీసుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్లు, తిరస్కరించిన ఓట్ల వివరాలు కూడా నమోదు చేసుకోవాలని చెప్పారు. ఒక నియోజకవర్గంలో మొత్తం ఓట్లు, పోలైన వాటిలో అర్హత కలిగిన ఓట్లు, నోటా, తిరస్కరించిన, టెండర్డ్ ఓట్ల వివరాలు, పోటీ చేసిన అభ్యర్థులకు పోలైన ఓట్ల వివరాలు ఉన్న ఫామ్ 21ఇ పైన ఆర్వో తప్పనిసరిగా సంతకం చేయాలని కుశాల్ పాఠక్ చెప్పారు. ఎన్నికల సిబ్బంది వ్యక్తం చేసిన పలు అనుమానాలను ఆయన నివృత్తి చేశారు. సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు సీఈఓ సుజాత శర్మ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.



May 8, 2019

13న కలెక్టర్ కార్యాలయాల వద్ద బీసీల ధర్నా



ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన పిలుపు
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించాలి

విజయవాడ, మే 8: త్వరలో రాష్ట్రంలో జరుగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో మాదిరిగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ  ఈ నెల 13న జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించాలని రాష్ట్రంలోని బీసీలకు, కుల సంఘాలకు బీసీ సంక్షేమ సంఘం పిలుపు ఇచ్చింది. ఆ రోజు సోమవారం గ్రీవెన్స్  డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని ఈ సంఘం నిర్ణయించింది. విజయవాడ లబ్బీపేట శ్యామ్ నగర్ కాలనీలో బీసీ నేతలు ఏర్పాటు చేసిన విలేకరుల  సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర రావు మాట్లాడారు. రిజర్వేషన్లను మొత్తం 50 శాతం మించకుండా బీసీల రిజర్వేషన్లను 27 శాతానికి కుదిస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ తెలిపారని, ఈ విధానం వల్ల బీసీలు తీవ్రంగా నష్టపోతారని ఆయన తెలిపారు. బీసీల ఆర్థిక, సాంఘీక స్థితిగతుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అందజేయలేదన్నారు. ఆ వివరాలు అందజేస్తే బీసీలకు రిజర్వేషన్ శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఉమ్మడి ప్రభుత్వం గానీ, ఇప్పుడు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు గానీ ఉద్దేశపూర్వకంగానే ఆ వివరాలు సుప్రీం కోర్టుకు అందజేయలేదన్నారు. ఎన్నికల సమయంలో  రాజకీయ పార్టీల నేతలు  బీసీల ఓట్ల కోసం జయహో బీసీ, బీసీ అధ్యయన కమిటీలు, సామాజిక న్యాయం అంటూ నినాదాలు చేస్తూ ఒకరికి ఒకరు పోటీపడి మరీ ఊకదంపుడు ఉపన్యాలు చేస్తుంటారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. 2018లోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించవలసి ఉందని, అయితే బీసీల రిజర్వేషన్ కు కోత పడితే వారి ఆగ్రహానికి గురి కావలసి వస్తుందని, ఆ ప్రభావం సాధారణ ఎన్నికలపై పడుతుందని, ఆ ఎన్నికల తరువాత నిర్వహిస్తున్నారని చెప్పారు. బీసీలకు న్యాయం జరగాలన్న ఉద్దేశం వారికి లేదని, ఏ కాడకీ వారి సీట్లు పెంచుకోవడానికే వారు ప్రధాన్యత ఇస్తారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని 1994 పంచాయతీరాజ్, మున్సిపల్  చట్టంలో పొందుపరిచిన ప్రకారం 3వ వంతు స్థానాలు బీసీలకు రిజర్వు చేసిన విధంగా పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల సందర్భంగా ప్రధాన రాజకీయ పార్టీలలోని బీసీ నేతలు నోరుమెదపకుండా ఉండటం క్షమించరాని విషయం అన్నారు. రాజకీయ పార్టీలు బీసీలకు రిజర్వేషన్ స్థానాలను మాత్రమే కేటాయిస్తాయి, రిజర్వు కాని స్థానాలను కేటాయించడం కల్ల అన్నారు. బీసీ నాయకులు కదలాలని ఆయన పిలుపు ఇచ్చారు. హక్కుల కోసం ముందుకు రావలసిన అవసరం ఉందన్నారు. బీసీలకు న్యాయంగా రావలసిన సీట్లు కేటాయించకుండా, బీసీలకు ద్రోహం చేసే రాజకీయ పార్టీలలో కొనసాగే బీసీ నాయకులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని శంకరరావు హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు కమ్మరి క్రాంతి కుమార్, ఎన్.కనకారావు, కేశవరావు, అప్పారావు, సూరిబాబు, యు.గోపి, ఎం.రవి కిరణ్, సతీష్, మహిళా నాయకురాలు రమణి తదితరులు పాల్గొన్నారు.

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...