May 8, 2019

13న కలెక్టర్ కార్యాలయాల వద్ద బీసీల ధర్నా



ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన పిలుపు
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించాలి

విజయవాడ, మే 8: త్వరలో రాష్ట్రంలో జరుగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో మాదిరిగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ  ఈ నెల 13న జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించాలని రాష్ట్రంలోని బీసీలకు, కుల సంఘాలకు బీసీ సంక్షేమ సంఘం పిలుపు ఇచ్చింది. ఆ రోజు సోమవారం గ్రీవెన్స్  డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని ఈ సంఘం నిర్ణయించింది. విజయవాడ లబ్బీపేట శ్యామ్ నగర్ కాలనీలో బీసీ నేతలు ఏర్పాటు చేసిన విలేకరుల  సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర రావు మాట్లాడారు. రిజర్వేషన్లను మొత్తం 50 శాతం మించకుండా బీసీల రిజర్వేషన్లను 27 శాతానికి కుదిస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ తెలిపారని, ఈ విధానం వల్ల బీసీలు తీవ్రంగా నష్టపోతారని ఆయన తెలిపారు. బీసీల ఆర్థిక, సాంఘీక స్థితిగతుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అందజేయలేదన్నారు. ఆ వివరాలు అందజేస్తే బీసీలకు రిజర్వేషన్ శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఉమ్మడి ప్రభుత్వం గానీ, ఇప్పుడు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు గానీ ఉద్దేశపూర్వకంగానే ఆ వివరాలు సుప్రీం కోర్టుకు అందజేయలేదన్నారు. ఎన్నికల సమయంలో  రాజకీయ పార్టీల నేతలు  బీసీల ఓట్ల కోసం జయహో బీసీ, బీసీ అధ్యయన కమిటీలు, సామాజిక న్యాయం అంటూ నినాదాలు చేస్తూ ఒకరికి ఒకరు పోటీపడి మరీ ఊకదంపుడు ఉపన్యాలు చేస్తుంటారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. 2018లోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించవలసి ఉందని, అయితే బీసీల రిజర్వేషన్ కు కోత పడితే వారి ఆగ్రహానికి గురి కావలసి వస్తుందని, ఆ ప్రభావం సాధారణ ఎన్నికలపై పడుతుందని, ఆ ఎన్నికల తరువాత నిర్వహిస్తున్నారని చెప్పారు. బీసీలకు న్యాయం జరగాలన్న ఉద్దేశం వారికి లేదని, ఏ కాడకీ వారి సీట్లు పెంచుకోవడానికే వారు ప్రధాన్యత ఇస్తారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని 1994 పంచాయతీరాజ్, మున్సిపల్  చట్టంలో పొందుపరిచిన ప్రకారం 3వ వంతు స్థానాలు బీసీలకు రిజర్వు చేసిన విధంగా పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల సందర్భంగా ప్రధాన రాజకీయ పార్టీలలోని బీసీ నేతలు నోరుమెదపకుండా ఉండటం క్షమించరాని విషయం అన్నారు. రాజకీయ పార్టీలు బీసీలకు రిజర్వేషన్ స్థానాలను మాత్రమే కేటాయిస్తాయి, రిజర్వు కాని స్థానాలను కేటాయించడం కల్ల అన్నారు. బీసీ నాయకులు కదలాలని ఆయన పిలుపు ఇచ్చారు. హక్కుల కోసం ముందుకు రావలసిన అవసరం ఉందన్నారు. బీసీలకు న్యాయంగా రావలసిన సీట్లు కేటాయించకుండా, బీసీలకు ద్రోహం చేసే రాజకీయ పార్టీలలో కొనసాగే బీసీ నాయకులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని శంకరరావు హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు కమ్మరి క్రాంతి కుమార్, ఎన్.కనకారావు, కేశవరావు, అప్పారావు, సూరిబాబు, యు.గోపి, ఎం.రవి కిరణ్, సతీష్, మహిళా నాయకురాలు రమణి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...