May 10, 2019


‘సువిధ’లో ఎంటర్ చేసిన తరువాతే ఫలితాల వెల్లడి

వీడియో కాన్ఫరెన్స్ లో ఎన్నికల సంఘం ఐసీటీ డైరెక్టర్

రిటర్నింగ్ అధికారి మాత్రమే ఫలితాల ప్రకటన చేస్తారు

                    సచివాలయం, మే 10: ఎన్నికల సంఘం వెబ్ సైట్ ‘సువిధ’ (suvidha.eci.gov.in)లో ఎంటర్ చేసిన తరువాతే ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని రిటర్నింగ్ అధికారుల(ఆర్ఓ)కు భారత ఎన్నికల సంఘం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ(ఐసీటీ) డైరెక్టర్ కుశాల్ పాఠక్ చెప్పారు. ఎన్నికల అధికారులతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ నెల 23న కౌంటింగ్ సందర్భంగా, అంతకు ముందు ఆర్వోలు, ఏఆర్వోలు సాంకేతికంగా, డేటా పరంగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆయన వివరించారు. రౌండ్ల వారీగా ఎప్పటికప్పుడు ఫలితాలు ప్రజలందరూ తెలుసుకోవడానికి రిజల్ట్స్(results.eci.gov.in)అనే వెబ్ సైట్ ఉంటుందని, అలాగే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా సువిధ యాప్ ఉంటుందని తెలిపారు. ఆర్వోలు, ఏఆర్వోలు తీసుకోవలసిన జాగ్రత్తలు సులభమైన విధానాలతో నాలుగు అంచలుగా ఉంటాయని చెప్పారు. రౌండ్ల వారీగా డేటాని ‘సువిధ’లో ఆర్వోలు, ఏర్వోలు మాత్రమే ఎంటర్ చేయాలన్నారు. డేటాని చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలని చెప్పారు. డేటాని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల బయట ఫలితాల వెల్లడికి డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి 5 నిమిషాలకు డేటాని అప్ డేట్ చేయాలని చెప్పారు. రిటర్నింగ్ అధికారి మాత్రమే ఫలితాలు ప్రకటిస్తారని తెలిపారు.

           ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఆర్వోలు, ఏర్వోలు ఎంతమంది ఉంటే అన్ని చక్కగా పని చేసే కంప్యూటర్లు ఉండాలని చెప్పారు. వాటిలో లైసెన్ పొందిన యాంటి వైరస్ ని అప్ డేట్ చేసుకోవాలన్నారు. సైబర్ సెక్యూరిటీ దృష్ట్యా  పెన్ డ్రైవ్ లు, సీడీలు వాడకూడదని చెప్పారు.  ప్రతి కంప్యూటర్ కనీసం 8 ఎంబిపీఎస్ స్సీడుతో ఉండాలని, అంతకంటే ఎక్కవ స్పీడ్ ఉంటే మంచిదన్నారు. ప్రతి కంప్యూటర్ కు ప్రత్యేక ఐపీ అడ్రస్ ఉండాలని చెప్పారు. ఎక్సెల్ లో ప్రావీణ్యం ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ ని అక్కడ నియమించాలన్నారు.  ప్రింటర్, స్కానర్, ఇతర స్టేషనరీని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బీఎస్ఎన్ఎల్ ద్వారా ఇంటర్ నెట్ కనెక్షన్ ని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. బీఎస్ఎన్ఎల్ అందుబాటులో లేని చోట అందుబాటులో ఉన్న ఏ నెట్ వర్క్ నైనా వాడుకోవచ్చని తెలిపారు. 8 గంటల పవర్ జనరేటర్ ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.
          ఈ నెల 9 నుంచి 15 తేదీ వరకు నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్య, స్త్రీ, పురుషులు, ఇతరులు, మొత్తం ఓటర్ల వివరాలు, పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పారు. ఓటర్ల సంఖ్యలో మార్పులు ఉంటే ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని మాత్రమే మార్చాలన్నారు. మే 23న ఓట్ల లెక్కంపు జరుగనున్నందున, 21వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య రిహార్సల్ చేసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపునకు ముందే ఎన్ని రౌండ్లు లెక్కించాలో నిర్ధారించుకోవాలని చెప్పారు. ఈవీఎం ఓట్లను రౌండ్ల వారీగా వెబ్ సైట్ లో  ఎంటర్ చేయాలని, ప్రతి రౌండ్ ఒక ప్రింట్ అవుట్ తీసుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్లు, తిరస్కరించిన ఓట్ల వివరాలు కూడా నమోదు చేసుకోవాలని చెప్పారు. ఒక నియోజకవర్గంలో మొత్తం ఓట్లు, పోలైన వాటిలో అర్హత కలిగిన ఓట్లు, నోటా, తిరస్కరించిన, టెండర్డ్ ఓట్ల వివరాలు, పోటీ చేసిన అభ్యర్థులకు పోలైన ఓట్ల వివరాలు ఉన్న ఫామ్ 21ఇ పైన ఆర్వో తప్పనిసరిగా సంతకం చేయాలని కుశాల్ పాఠక్ చెప్పారు. ఎన్నికల సిబ్బంది వ్యక్తం చేసిన పలు అనుమానాలను ఆయన నివృత్తి చేశారు. సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు సీఈఓ సుజాత శర్మ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.



No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...