కేంద్ర ప్రత్యేక పరిశీలకులు వినోద్ జట్షీ
సచివాలయం, మే 19: రీపోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు గుమిగూడకుండా చూడాలని,
అవసరమైతే అదనపు బలగాలను పంపాలని కేంద్ర ప్రత్యేక పరిశీలకులు వినోద్ జట్షీ ఎన్నికల
అధికారులకు చెప్పారు. సచివాలయం 5వ బ్లాక్
మొదటి అంతస్తులోని కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఆదివారం ఉదయం ఆయన సందర్శించారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని 7 పోలింగ్ కేంద్రాలను ఆన్ లైన్ లో
పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల లోపల, బయట పరిస్థితులను గమనించారు. ఒక కేంద్రంలో
ఎక్కువ మంది ఓటర్లు ఉండటాన్ని గమనించిన ఆయన ఓటర్లు ఎక్కువ మంది కేంద్రం లోపల
ఉండకుండా చూడాలన్నారు. అవసరమైతే రిజర్వు పోలీస్ బలగాలను తీసుకోమని చెప్పారు. ఏడు కేంద్రాలలో ఎక్కడ నుంచైనా ఫిర్యాదు ఫోన్స్
ఏమైనా వచ్చాయా? అని అడిగి తెలుసుకున్నారు. ఒక పోలింగ్ స్టేషన్ బయట టీడీపీ, వైసీపీ
ఏజంట్లు గొడవ పడినట్లు జాయింట్ సీఈఓ నాగమణి తెలిపారు. ఏ విధమైన ఫిర్యాదులు
అందలేదని చెప్పారు. 11 గంటలు దాటిన తరువాత
ఓటర్లు ఎక్కువ మంది పోలింగ్ కేంద్రాలకు వస్తున్నట్లు చెప్పారు. 11 గంటల సమయం వరకు
ఏప్రిల్ 11 జరిగిన పోలింగ్ శాతానికి, ఇప్పుడు జరిగిన పోలింగ్ శాతానికి వ్యత్యాసం
అడిగి తెలుసుకున్నారు.
ఆ తరువాత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
గోపాల కృష్ణ ద్వివేది, అదనపు సీఈఓ సుజాత శర్మలతో మధ్యాహ్నం వరకు కౌంటింగ్ అంశాల
గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఓట్ల లెక్కింపు రోజున తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలని,
తరువాత ఈవీఎంలు లెక్కించాలని, చివరగా వీవీప్యాట్స్ లెక్కించాలని వినోద్ జట్షీ చెప్పారు. 175 శాసనసభ
నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గం నుంచి ర్యాండమ్ గా 5 పోలింగ్ కేంద్రాల
వీవీప్యాట్స్ ని తీసుకోవాలన్నారు. ఈవీఎంల ఓట్లకు, వీవీప్యాట్స్ ఓట్లకు వ్యత్యాసం
ఉంటే వి వీవీప్యాట్స్ ఓట్ల లెక్కింపునే
ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. తుది ఫలితాలు వెల్లడించే ముందు ఓట్ల
వివరాల షీట్ పైన రిటర్నింగ్ అధికారి తప్పనిసరిగా సంతకం చేయాలని వినోద్ జట్షీ చెప్పారు. ఓట్ల లెక్కింపు రోజు
టీవీలు, కంప్యూటర్లు కండిషన్ లో ఉండేలా, టీవీలను తగిన ప్రదేశంలో అమర్చాలని గోపాల
కృష్ణ ద్వివేది ఐటీ అధికారులను ఆదేశించారు.
No comments:
Post a Comment