May 30, 2023

ఆదాయంలో ఏపీని అధిగమించిన తెలంగాణ



రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ అనేక విధాల లాభపడుతోంది. రాజకీయ, పరిపాలన, ఆర్థిక కారణాలు ఏవైనాకానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం బాగా వెనుకబడిపోతోంది.పారిశ్రామిక, సాఫ్ట్ వేర్ రంగాలలో తెలంగాణ దూసుకుపోతోంది.  ఓ పక్క తెలంగాణలో అనేక కొత్త పరిశ్రమలు వస్తుంటే, ఏపీలో మాత్రం కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నపరిశ్రమలు కూడా తరలిపోవడం లేదా మూతవేయడం జరుగుతోంది.  ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు ఆర్థిక వ్యవస్థల్లో అనేక మార్పులు వచ్చాయి. 

వనరులు,  జనాభా, నైపుణ్యం కలిగిన మానవ వనరుల విషయంలో ఆంధ్రప్రదేశ్ పై చేయిగా ఉంది. విభజన తర్వాత మొదటిసారిగా ఆదాయంలో తెలంగాణ ఏపీని అధిగమించింది.  జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం  ఏపీ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వనరుగా ఉంది. తెలంగాణతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఏపీలో అవి బాగా తగ్గాయి. కాగ్ నివేదికల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏపీ  కంటే తెలంగాణ ఆదాయం రూ.1067 కోట్లు పెరిగింది. ఈ దిగువ పట్టికను పరిశీలిస్తే ఏడాదికేడాది ఆదాయ గణాంకాలలో రెండు రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలను, ఆదాయంలో తెలంగాణ దూసుకుపోతూ ఏపీని అధిగమించిన తీరును గమనించవచ్చు.  

2021-22తో పోల్చితే 2022-23లో  తెలంగాణ ఆదాయం రూ.31,881 కోట్లు పెరగగా,   ఏపీ ఆదాయం రూ.5,730 కోట్లు మాత్రమే పెరిగింది. దీంతో ఏపీకి మించి తెలంగాణ రూ.1067 ఆదాయం అధికంగా సంపాదించింది. 2022-23లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రూ.36,048 కోట్లు గ్రాంట్లు అందగా, తెలంగాణకు రూ.13,179 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే తెలంగాణ కంటే ఏపీకి రూ. 22,869 కోట్లు ఎక్కువ గ్రాంట్ వచ్చింది. అయినప్పటికీ ఆదాయంలో తెలంగాణ మొదటిసారిగా ఏపీని అధిగమించింది. అనేక కారణాల వల్ల ఏపీలో జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ వంటి రాబడులు తగ్గాయి. 2021-22లో జీఎస్టీ రూపంలో తెలంగాణకు రూ.34,489 కోట్లు రాగా, ఏపీకి రూ.34,262 కోట్లు వచ్చాయి. 2022-23లో తెలంగాణ   జీఎస్టీ ఆదాయం రూ.41,888 కోట్లకు పెరిగింది. ఏపీ జీఎస్టీ ఆదాయం మాత్రం రూ.38,840 కోట్లకు మించలేదు. సేల్స్ ట్యాక్స్‌ రాబడిలో కూడా  ఏపీ వెనుకబడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్, మద్యంపై విక్రయ పన్ను ద్వారా తెలంగాణకు రూ.29,604 కోట్లు రాగా, ఏపీకి రూ.18,004 కోట్లు మాత్రమే వచ్చాయి. 2021-22లో ఏపీకి వచ్చిన  సేల్స్ ట్యాక్స్ కంటే ఇది రూ.2,900 కోట్లు తక్కువ.


2022-23 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాల ద్వారా  తెలంగాణ రూ.18,470 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా, ఏపీ రూ.14,798 కోట్లు మాత్రమే ఆర్జించింది. తెలంగాణతో పోలిస్తే స్టాంపుల రిజిస్ట్రేషన్ల ఆదాయంలో కూడా ఏపీ వెనుకబడిపోయింది. 2022-23లో రిజిస్ట్రేషన్ల ద్వారా ఏపీకి రూ.8,022 కోట్లు రాగా, తెలంగాణకు రూ.14,228 కోట్లు వచ్చాయి. 2021-22తో పోలిస్తే తెలంగాణ రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.2 వేల కోట్లు పెరగ్గా, ఏపీ ఆదాయం రూ.400 కోట్లు మాత్రమే పెరిగింది. ప్రభుత్వ భూముల విక్రయం ద్వారా 2022-23లో  తెలంగాణకు రూ.19,553 కోట్ల పన్నుయేతర ఆదాయం వచ్చింది. ప్రభుత్వ భూములు అమ్మి ఆదాయం సమకూర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం భావించి 2021లో మిషన్‌ ఏపీ బిల్డ్‌ను ప్రారంభించింది. అయితే, హైకోర్టు అడ్డు చెప్పడంతో ఏపీ ప్రభుత్వం ఆ ఆలోచనను విరమించుకుంది. దీంతో ఏపీ ప్రభుత్వం  ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి భారీ వడ్డీకి వేల కోట్లు అప్పులు తీసుకుంది. 2022-23లో ఏపీకి రూ.6031 కోట్లు మాత్రమే పన్నేతర ఆదాయం వచ్చింది. చెత్త పన్ను, ఆస్తిపన్ను, ఇంటిపన్ను, పెట్రోల్‌, డీజిల్‌పై సెస్‌, రోడ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌ల ద్వారా తెలంగాణతో పోలిస్తే ఏపీ ఆదాయం బాగానే ఉంది. 2022-23లో ఏపీకి రూ.9,109 కోట్లు రాగా, తెలంగాణకు రూ.8,430 కోట్లు మాత్రమే వచ్చాయి. 

 విదేశీ పెట్టుబడులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిపార్ట్ మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్( డీపీఐఐటీ) నివేదిక ప్రకారం 2019 అక్టోబరు నుంచి 2022 డిసెంబర్ వరకు  తెలంగాణ 7వ స్థానంలో ఉంటే, ఏపీ 14వ స్థానంలో ఉంది. మిగిలిన పొరుగు రాష్ట్రాలు కర్ణాటక 2వ స్థానంలో, తమిళనాడు 5వ స్థానంలో ఉన్నాయి. తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం ఈ స్థితిలో ఉండటం బాధాకరం.  ఆంధ్రప్రదేశ్ లో 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఏపీలోని ఇతర ప్రాంతాలతోపాటు ఈ తీరం వెంట భూగర్భంలో అపారమైన ఖనిజ సంపద నిక్షిప్తమై ఉంది. రాష్ట్రంలో నైపుణ్యత కలిగిన మానవ వనరులు అందుబాటు ఉన్నాయి.  అయినా, పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు రాష్ట్రానికి ఎందుకు రావడంలేదు? ఉన్న పరిశ్రమలు ఎందుకు మూతపడుతున్నాయి? ఆదాయంలో ఎంతుకు ఇంత వెనుకబడిపోతున్నామో ఆలోచించవలసిన అవసరం అందరికీ ఉంది.

-శిరందాసు నాగార్జు, సీనియర్ జర్నలిస్టు- 9440222914


May 1, 2023

దూరదర్శన్ న్యూస్ హెడ్ గా డాక్టర్ జీకే


విజయవాడ,విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రాల ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ గుత్తికొండ కొండలరావు (జీకే) పదోన్నతిపై  విజయవాడ దూరదర్శన్ కేంద్రం న్యూస్ హెడ్(ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్)గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. దూరదర్శన్ లోని వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.   జర్నలిజంలో డాక్టరేట్ చేసిన జీకే ప్రాంతీయ వార్తా విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు.  రోజుకు 16 గంటలు జర్నలిస్టుగా పని చేయడం జీకేకు హాబీ.  దూరదర్శన్ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ గా తగిన వ్యక్తికి  ప్రమోషన్ లభించింది. ఆకాశవాణి వార్తా విభాగం అధిపతిగా కొండలరావు అలుపెరగని శ్రామికుడిగా పని చేశారు.

  పశ్చిమగోదావరి జిల్లా తిరుపతి పురంలో 1965 మార్చి 10వ తేదిన  గుత్తికొండ సత్తిరాజు, గుత్తికొండ వెంకట నాగరత్నం గార్లకు డాక్టర్ గుత్తికొండ కొండలరావు జన్మించారు. తెలుగు కథకు ప్రపంచ ఖ్యాతిని సాధించిన పాలగుమ్మి పద్మారావు స్వగ్రామం కూడా ఇదే.  కొండలరావు  ప్రాథమిక విద్యాభ్యాసం అంతా తిరుపతిపురం, బల్లిపాడు, అత్తిలిలో జరిగింది. ఆంగ్ల సాహిత్యంలో బీఏ నర్సాపురంలోని వైఎన్ కళాశాలలో చదివారు. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. అదే విశ్వవిద్యాలయంలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ పోస్టు గ్రాడ్యుయేషన్ లో గోల్డ్ మెడల్ సాధించారు.

బాబాయి, మెకానికల్ మెరైన్ ఇంజనీర్ గుత్తికొండ సత్యనారాయణ, చిన్నక్క స్వర్ణలతల ప్రోత్సాహం, ప్రోద్భలంతో కొండలరావు ఈ స్థాయికి ఎదిగారు.ఆంధ్రవిశ్వవిద్యాలయంలో  ఆచార్య పి.బాబీవర్థన్  ప్రోత్సాహం, సహాయసహకారాలతో జర్నలిజంలో డాక్టరేట్ పూర్తి చేశారు. పీహెచ్‌డీ కోసం ఆయన రాసిన ‘ట్రైబల్ అండ్ ఇంటర్‌నెట్’ అనే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. జీకే మొదట్లో కొద్దికాలం ఈనాడులో పనిచేశారు. ఆ తరువాత ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్)కు ఎన్నికయ్యారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ)లో ముంబై, విజయవాడలలో పని చేశారు. క్షేత్రస్థాయి ప్రచార విభాగం( డైరెక్టరేట్ ఫీల్డ్ పబ్లిసిటీ)లో శ్రీకాకుళంలోని మారుమూల ప్రాంతాల్లో, మత్స్యకార గ్రామాల్లో పని చేశారు. క్షేత్రప్రచారాధికారిగా జీకే ఉత్తర కోస్తాలో ఎంతో సేవచేశారు. ఆ తర్వాత ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా సేవలందించారు. తర్వాత విజయవాడ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అధిపతిగా అంకితభావంతో పనిచేసి అందరి మన్ననలు పొందారు. 

జర్నలిజం పట్ల ఆసక్తితోపాటు ఆ రంగంలో డాక్టరేట్ సాధించిన అనుభవంతో పని రాక్షసుడిలా ఆకాశవాణి కోసం పని చేశారు.కరోనా సమయంలో ఆకాశవాణిలో ‘జింగిల్స్’ వంటి కొత్త ప్రయోగాలతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు.  12వేలకు పైగా జింగిల్స్ ప్రసారం చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. కరోనాపై శ్రోతలకు అవగాహన కల్పించడంలో కూడా కొండలరావు క‌ృషి అద్వితీయం.జింగిల్స్ విషయంలో కొండలరావు ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హిరిచందన్ కూడా కొండలరావును ప్రత్యేకంగా అభినందించారు. పలు విశ్వవిద్యాలయాల్లో  జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహించిన సెమినార్లలో ఆయన పరిశోధనా పత్రాలను సమర్పించారు. శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలోని జర్నలిజం విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యునిగా వ్యవహరిస్తున్నారు. ఆయన రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు అనేకం జాతీయ, అంతర్జాతీయ స్థాయి జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. జీకే సేవలను గుర్తించిన తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా   ఏప్రిల్ 14న  విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళా క్షేత్రంలో ‘విశిష్టసేవారత్న’ పురస్కారంతో సత్కరించింది. 

                                -శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్


అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...