మహిళాసాధికారితకు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.
అత్యధిక మంది
మహిళలు తమ కుటుంబాలను చక్కదిద్దుకోవడంతోపాటు వివిధ రంగాల్లో వారు చూపే చొరవను, వారి
సామర్ధ్యాన్ని గుర్తించింది. స్వశక్తితో ఎదగడానికి ప్రభుత్వం
అన్నివిధాల ప్రోత్సహిస్తోంది. స్వయం సహాయక బృందాల ద్వారా అతి
తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తూ వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సహాయపడుతోంది. రాష్ట్రంలోని
7 లక్షల మహిళా
స్వయం సహాయక సంఘాలలోని 70.91 లక్షల మంది సభ్యులే ఒక సైన్యంగా ప్రభుత్వం
వివిధ కార్యక్రమాల అమలును చేపట్టింది. పరోక్షంగా వారికి ఉపాధి కల్పించడంతో
పాటు, వారి ఆదాయ
మార్గాలను రెట్టింపు చేసేందుకు ప్రయత్నిస్తోంది.
ఆర్ధికసాయం,
రుణాలపై
వడ్డీని మాఫీ చేస్తోంది. ఈ ఏడాది బడ్జెట్లో డ్వాక్రా సంఘాలకు
ప్రభుత్వం రూ.1,600 కోట్లు,
మహిళా
సాధికార సంస్థకు రూ. 400 కోట్లు కేటాయించింది. మహిళల ఆత్మగౌరవంతో పాటు ఆరోగ్యంపైనా
దృష్టిపెట్టిన ప్రభుత్వం దీపం పథకం కింద 100 శాతం గ్యాస్ కనెక్షన్ల
లక్ష్యాన్ని త్వరలో చేరుకోనుంది. గ్రామాల్లో ఎల్పీజీ కనెక్షన్లకు
ప్రభుత్వం రూ.350 కోట్లు కేటాయించింది. అన్న అమృత హస్తం పథకాన్ని ప్రస్తుతం
104 ఐసీడీఎస్
ప్రాజెక్టుల్లో అమలు చేస్తున్నారు. దీని ద్వారా 2.80 లక్షల గర్భిణీ మహిళలు
లబ్దిపొందుతున్నారు. దీనిని మరో 157 ఐసీడీఎస్ ప్రాజెక్టులకు విస్తరించి
4.59 లక్షల మంది
గర్భిణీలకు పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.
13
జిల్లాల్లోనూ మహిళల కోసం సఖి పేరుతో ఒక ఉద్యోగి సెంటర్లు ఏర్పాటు చేసింది. మహిళలకు
ప్రత్యేకంగా 181 హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉంచింది.
మహిళను శక్తి
స్వరూపిణిగా భావించే ప్రభుత్వం కృష్ణా-గోదావరి నదుల పవిత్ర సంగమం దగ్గర
మూడు రోజుల పాటు ‘నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్’ సదస్సు నిర్వహించి దేశం దృష్టి
విజయావాడవైపు చూసేలా చేసింది. మహిళల రాజకీయ-సామాజిక సమస్యలు చర్చించి,
భవిష్యత్
వైపు అడుగులు వేయడానికి అనువుగా అంతర్జాతీయ స్థాయిలో అమరావతి ప్రకటన విడుదల
చేయనుంది. జాతీయ మహిళాపార్లమెంట్ లో పాల్గొన్న
రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి మహిళలు, యువతులు,
విద్యార్థుల
అనుభవాల సారంతో జరిగిన ఉపన్యాసాలు, చర్చలు,
సిఫారసులు, తీర్మానాలకు
సంక్షిప్త రూపమే అమరావతి ప్రకటన. గ్రామీణ స్థాయి పేద మహిళలు
మొదలుకొని పట్టణ స్థాయి పేద మహిళలు, అసంఘటిత
కార్మిక మహిళలు, ఒంటరి మహిళలు, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లల
స్థితిగతులపై ప్రతి అంశాన్ని చర్చించారు. పాఠశాల స్థాయిలో విద్యార్థినులకు
సౌకర్యాలు, ఉపాధిపై అవగాహన, స్వీయరక్షణ,
మహిళల
న్యాయపరమైన హక్కులు, వ్యభిచార కూపంలోకి నెట్టబడే బాలికలు, మహిళల
సమస్యలు, మహిళలకు వృత్తి విద్య, గ్రామీణ పరిశ్రమలు, డ్రైవింగ్ లో
శిక్షణ, మహిళా పారిశ్రామికవేత్తలకు రుణ సౌకర్యం కల్పించడం, పన్నుల మినహాయింపు, ప్రత్యేక
మహిళా పారిశ్రామిక జోన్ల ఏర్పాటు, సైబర్ సెక్యూరిటీ, సినిమా, టీవీ, మీడియా నుంచి
రక్షణ, అన్ని రంగాల్లో సమాన అవకాశాలు తదితర అనేక అంశాలను చర్చించి ప్రకటనలకు
తుది రూపం ఇచ్చారు. స్త్రీ విద్య,
మహిళల
న్యాయపరమైన హక్కులు, మహిళల ఆరోగ్యం,
సమతుల ఆహారం, పారిశ్రామిక
రంగంలో, పరిశోధన, నూతన ఆవిష్కరణల్లో, రాజకీయాల్లో
మహిళలు, వారి సమాజిక భద్రత, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను
సాధించడంలో వారి పాత్ర,
సామాజికాభివృద్ధి, మహిళల
డిజిటల్ విద్య తదితర అనేక అంశాలతో దీనిని
రూపొందించారు. త్వరలో దానిని విడుదల చేస్తారు.
వివిధ పథకాల ద్వారా పేదలకు ఇళ్లు నిర్మించడమే
కాకుండా ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి తప్పనిసరిగా వుండేలా ప్రభుత్వం చర్యలు
తీసుకుంటోంది. మహిళల ఆత్మగౌరవం కాపాడేందుకు
ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మిస్తూ ఓడీఎఫ్ రాష్ట్రం కోసం కృషిచేస్తోంది. స్వచ్ఛ భారత్
మిషన్ కింద గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన లేకుండా చూసేందుకు ఇంకా 7.50 లక్షల మరుగుదొడ్లు నిర్మించాల్సి
వుండగా, ఇందుకోసం ఈ
ఏడాది రూ.100 కోట్ల నిధులు వినియోగించాలని
నిర్ణయించింది. అదేవిధంగా ప్రజారోగ్యానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేసింది.
ఎన్టీఆర్
వైద్య పరీక్ష, ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్య రక్ష,
చంద్రన్న
సంచార చికిత్స, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, ముఖ్యమంత్రి పట్టణ వైద్య కేంద్రాలు,
108 సర్వీసు,
తల్లీబిడ్డ
ఎక్స్ప్రెస్, బసవతారకం మదర్ కిట్స్, ఎన్టీఆర్ బేబీ కిట్స్,
అన్న అమృత
హస్తం, బాలామృతం,
గోరు ముద్దలు,
గిరి
గోరుముద్దలు, ప్రభుత్వాసుపత్రుల్లో పరిశుభ్రత, ఉచిత డయాలసిస్,
మహిళలకు
మాస్టర్ హెల్త్ చెకప్లతో అందరికీ ఆరోగ్య భద్రత కల్పిస్తోంది.
చిన్నారులకు
పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 38.50 లక్షల మంది విద్యార్ధులకు మధ్యాహ్న
భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠాశాలలలో విద్యార్ధులకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన
విద్యను అందిస్తోంది. రాష్ట్రంలోని 1,641 పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు
ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో 31,596 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వగా,
4005 మంది విద్యార్ధులకు ప్రతిభ అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. తొమ్మిదో
తరగతి చదువుకునే విద్యార్ధినులకు సైకిళ్లను పంపిణీ చేసింది.
ఈ ఏడాది
నుంచి 8, 9 తరగతుల
విద్యార్థులకు కూడా సైకిల్స్ పంపిణీ చేస్తున్నారు.
18 నుంచి 70 సంవత్సరాల వయసు కలిగిన అసంఘటితరంగ
కార్మికులకు చంద్రన్న బీమాతో ఆపన్నహస్తం అందిస్తోంది.
ప్రమాదంలో
మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల వరకు పరిహారం,
సహజ మరణానికి
రూ. 30 వేలు,
ప్రమాదంలో
అంగవైకల్యం ఏర్పడితే రూ. 3,62,500 ఇచ్చి ఆదుకుంటోంది. చంద్రన్న
బీమా కింద 2.13 కోట్ల మంది రక్షణ పొందుతున్నారు. బీమాదారుని
మరణ సమాచారం తెలిసిన 48 గంటలలోపు మండలాల్లోని బీమామిత్ర ద్వారా అంత్యక్రియలకు రూ.5,000 అందించడమే కాకుండా క్లెయిమ్కు కావలసిన పత్రాల
జారీచేయడంలో కూడా ‘బీమామిత్ర’ ఉద్యోగులు పర్యవేక్షిస్తారు. చంద్రన్న బీమా పాలసీదారులు ప్రమాదంలో మరణిస్తే వారి పరిహారానికి అవసరమైన
ప్రాథమిక నివేదిక, దర్యాప్తు, శవ పంచనామా, మరణ ధృవీకరణ పత్రం నిర్ణీత గడువులోగా వెబ్సైట్లో ఉంచుతారు. ఈ ధృవపత్రాల
జారీలో జాప్యం కారణంగా పరిహారం అందడంలో ఆలస్యం జరుగకుండా ప్రభుత్వం చర్యలు
తీసుకుంటోంది. ఇప్పటివరకు సుమారు 30వేల పైచిలుకు క్లయిములకు పరిహారం
అందింది. చంద్రన్న బీమా కోసం ప్రస్తుతం పోర్టల్ వుండగా,
త్వరలో ఒక
ప్రత్యేక యాప్ను కూడా ప్రభుత్వం తీసుకురానుంది.
-
శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్.