Oct 31, 2017

మొదటి త్రైమాసికంలో లక్ష్యాలను మించి వ్యవసాయం రంగంలో 27.60 శాతం వృద్ధి


ప్రణాళిక శాఖ అధికారులతో ఆర్థిక మంత్రి యనమల సమీక్ష
Ø వృద్ధి రేటు 11.72 శాతం నమోదు
Ø జాతీయ స్థాయి వృద్ధి రేటు 5.6 శాతం
Ø 1,2 త్రైమాసికాల ఫలితాల సమీక్ష
Ø వెనుకబడిన 7 జిల్లాల్లో కేంద్ర నిధులు రూ.787 కోట్లు ఖర్చు
Ø ఎంపీల నిధులు రూ.333 కోట్లు వ్యయం
Ø ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో ద్రవ్యోల్బణం తక్కువ

         సచివాలయం, అక్టోబర్ 31: రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో లక్ష్యాలను మించి 27.60 శాతం వృద్ధి రేటు నమోదైనట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. సచివాలయం 2 బ్లాక్ లోని తన కార్యాలయంలో మంగళవారం ఉదయం మంత్రి ప్లానింగ్ శాఖ అధికారులతో మొదటి, రెండవ త్రైమాసిక ఫలితాలను  సమీక్షించారు.  అన్ని రంగాల్లో కలుపుకొని జీవీఏ (రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల్లో ఉత్పత్తి విలువ) గత సంవత్సరంతో పోల్చితే  11.72 శాతం వృద్ధి రేటు సాధించినట్లు మంత్రి తెలిపారు. 2016-17 మొదటి త్రైమాసికంలో జీవీఏ రూ. రూ.1,07,099 కోట్లతో వృద్ధి రేటు 12.26 శాతం కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,24,480 కోట్ల జీవిఏతో 16.23 సాధించాలన్నది లక్ష్యంగా నిర్ణయించినట్లు వివరించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో గత సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీవీఏ రూ.18,319 కోట్లతో 22.96 శాతం వృద్ధి రేటు సాధించగా, ఈ ఏడాది రూ.23,120 కోట్లతో 26.21 శాతం సాధించాలని నిర్ణయించినట్లు చెప్పారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పారిశ్రామిక రంగంలో 8.05 శాతం, సేవల రంగంలో 8.67 శాతం వృద్ధి రేటు సాధించినట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో మొదటి త్రైమాసికంలో వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో 2.3 శాతం, పరిశ్రమల రంగంలో 1.6 శాతం, సేవల రంగంలో 8.7 శాతంతో మొత్తం 5.6 శాతం మాత్రమే వృద్ధి రేటు సాధించినట్లు మంత్రి వివరించారు. రెండవ త్రైమాసికం లక్ష్యాలను, సాధించిన ప్రగతిని ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం  సమీక్షించారు. వ్యవసాయం రంగంలో రాష్ట్రంలో సాగు చేస్తున్న భూమి, పంటల వారీగా సాగు, కొత్తగా సాగులోకి వచ్చిన భూమి, పంటల మార్పిడి, వ్యవసాయ ఉత్పత్తుల వివరాలు  పూర్తిగా సేకరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే వ్యవసాయ అనుబంధ రంగంలో ఉద్యానవన పంటలను, మత్స్య పరిశ్రమ ఉత్పత్తులను సమీక్షించారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించి కూడా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు తదితరాల వివరాలు కూడా సేకరించాలని చెప్పారు.
      ఇతర రాష్ట్రాలతో పోల్చితే సేవల రంగంలో వృద్ధి రేటు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో పట్టణీకరణ తక్కువగా ఉన్నందున ఈ రంగంలో వృద్ధి రేటు తక్కువగా ఉందని, పట్టణీకరణ పెరిగితే పరిశ్రమలు, సేవల రంగం వృద్ధి రేటుతోపాటు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయన్న అంశాలను చర్చించారు. పారిశ్రామిక రంగం, పవర్ సెక్టార్, సోలార్ విద్యుత్ తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా పరిశ్రమలు శాఖ, పవర్, మైనింగ్ విభాగాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేయమని మంత్రి ఆదేశించారు.

వెనుకబడిన 7 జిల్లాల్లో కేంద్ర నిధులు రూ.787 కోట్లు ఖర్చు
         రాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.1574 కోట్లు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 1050 కోట్లు మంజూరు చేసినట్లు అధికారులు మంత్రి తెలిపారు. వాటిలో రూ.787 కోట్లు ఖర్చు చేయగా, రూ.770 కోట్లకు సంబంధించి యూసీలు కూడా ఇచ్చినట్లు వివరించారు. రాష్ట్రంలోని 25 మంది లోక సభ సభ్యుల నిధులు రూ.300 కోట్లు మంజూరు కాగా, రూ.240 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఏడుగురు రాజ్యసభ సభ్యులకు రూ.107 కోట్లు మంజూరు కాగా, రూ.93 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మొత్తం 32 మంది ఎంపీల నిధులు రూ.333 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ లో ప్రత్యేక అభివృద్ధి ఫండ్ కు రూ.500 కోట్ల రూపాయలు కేటాయించగా, రూ.437 కోట్లు మంజూరు చేసినట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆ నిధులను శాసనసభ నియోజకవర్గాల వారీగా ఏఏ నియోజకవర్గాల్లో ఎంతెంత ఖర్చు చేశారో ఆ వివరాలు సేకరించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను కూడా సమీక్షించారు. వాటిలో 54 శాతం అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన పనులను ప్రాధాన్యతా క్రమంలో అమలు చేయాలని మంత్రి యనమల ఆదేశించారు. రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థ పనితీరుని, వెబ్ ల్యాండ్ ని  కూడా సమీక్షించారు. ఏపీ శాటిలైట్ అప్లికేషన్ సెంటర్ ద్వారా భూమి వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో ద్రవ్యోల్బణం తక్కువ
          ద్రవ్యోల్బణంపై జరిగిన సమీక్షలో తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ, మహారాష్ట్రలతో  పోల్చితే ఏపీలో ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. సెప్టెంబర్ లో తెలంగాణలో 3.35 శాతం, తమిళనాడులో 5.22, కర్నాటకలో 2.81, కేరళలో 6.35, మహారాష్ట్రలో 4.32 ఉండగా, ఏపీలో 2.59 శాతం మాత్రమే నమోదైనట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా మండలి  ఉపాధ్యక్షులు సి.కుంటుబరావు, ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈఓ సంజయ్ గుప్త, ప్రణాళికా శాఖ ప్రత్యేక కార్యదర్శి పివీ చలపతిరావు, ఆర్థిక, గణాంక శాఖ సలహాదారు డాక్టర్ డి.దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు.

స్పష్టమైన విధానాలతో పారదర్శక పాలన

ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు
అర్ధ సంవత్సరం ఆర్థిక వ్యవహారాలపై సమీక్ష
Ø ప్రతిపక్షాల ‘శ్వేత పత్రం’ డిమాండ్ హాస్యాస్పదం
Ø  ఎఫ్ఆర్ బీఎం చట్టం ప్రకారం  త్రైమాసికం వివరాలు శాసనసభకు సమర్పణ
Ø ఆశాజనకంగాలేని ప్రభుత్వ ఆదాయం
Ø ఆర్థిక నియంత్రణ అవసరం
Ø రూ.10వేల కోట్లకు పైగా మూలధన వ్యయం
Ø 2018-19 బడ్జెట్ ప్రక్రియ ప్రారంభం
        సచివాలయం, అక్టోబర్ 30: మూడేళ్లుగా ఆర్థిక శాఖతోపాటు ఇతర అన్ని శాఖల్లో, అన్ని అంశాల్లో స్సష్టమైన విధానాలతో పారదర్శక పాలన అందిస్తున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. సచివాలయం 2వ బ్లాక్ లోని తన ఛాంబర్ లో సోమవారం ఉదయం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో అర్ధ సంవత్సరం ఆర్థిక వ్యవహారాలను మంత్రి  సమీక్షించారు. అనంతరం తన ఛాంబర్ లోనే  మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజలకు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మాత్రమే ‘శ్వేత పత్రం’ విడుదల చేస్తుందని, ప్రతి పక్షాలు డిమాండ్ చేసినంత మాత్రాన విడుదల చేయవలసిన అవసరంలేదని,  ప్రస్తుతం తాము ‘శ్వేత పత్రం’ విడుదల చేయడంలేదని, చేయం అని ఆయన గట్టిగా చెప్పారు. ఎఫ్ఆర్ బీఎం(ఫిస్కల్ రెస్పాన్సబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్ మెంట్) చట్టం ప్రకారం ప్రతి త్రైమాసికం ఆదాయ,వ్యయాల వివరాలు శాసనసభలో ప్రవేశపెడతామని, రాబోయే శాసనసభ సమావేశాల్లో 2017-18 తొలిత్రైమాసికం పూర్తి వివరాలు ప్రవేశపెడతామన్నారు. అది ‘శ్వేత పత్రం’కు మించి ఎక్కువ విలువైందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ, కాంగ్రెస్ పార్టీలు ‘శ్వేత పత్రం’ కోసం డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా పేర్కొన్నారు. తొలిత్రైమాసికం నివేదిక అర్ధంకాకపోతే ‘శ్వేత పత్రం’కూడా అర్ధం కాదన్నారు.
ఆశాజనకంగాలేని రెవెన్యూ రాబడి
           ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అర్థ సంవత్సరంలో రెవెన్యూ రాబడి ఆశాజనకంగాలేదని మంత్రి చెప్పారు. ఆదాయం పెరుగుదలలో వృద్ధిరేటు ఇబ్బందికరంగా ఉన్నట్లు తెలిపారు. జీఎస్టీ ప్రవేశపెట్టడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం సరిగాలేకపోవడం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, నాన్ రెవెన్యూ ఆదాయం తగ్గడం వల్ల పరిస్థితి ఇలా ఉన్నట్లు వివరించారు. ఎక్సైజ్, మైన్స్ అండ్ మినరల్స్ శాఖల ఆదాయం కొంత మెరుగుగా ఉన్నట్లు తెలిపారు. అదే సమయంలో వ్యయం కూడా ఎక్కువగా అవుతున్నట్లు చెప్పారు. నీటిపారుదల, రోడ్లు,భవనాలు, పంచాయతీరాజ్ వంటి శాఖల్లో వ్యయం ఎక్కువగా అవుతున్నట్లు తెలిపారు. కొన్ని శాఖలు అదనపు బడ్జెట్ కోరుతున్నాయన్నారు. మూలధన వ్యయం రూ.10వేల కోట్లకు పైగా ఖర్చుచేశామని, దీని ద్వారా స్థిరాస్తులు పెరుగుతాయని,  అభివృద్ధిపై ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేస్తుందనడానికి ఇది నిదర్శనంగా పేర్కొన్నారు. మూలధన వ్యయం మంచిదేనని, రెవెన్యూ వ్యయం మంచిదికాదన్నారు. ఉద్యోగులు డీఏ ఇచ్చామని, పీఆర్సీ భారం పెరుగుతోందని చెప్పారు. ఎఫ్ఆర్ బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ. 23,794 కోట్లు రుణం తీసుకోవడానికి అవకాశం ఉందని, ఇప్పటివరకు రూ.16,100 కోట్లు రుణం తీసుకున్నామని, రూ.6వేల కోట్లు వడ్డీ చెల్లించినట్లు మంత్రి వివరించారు. బిల్స్ ఎక్కువ పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక నియంత్రణ అవసరం అన్నారు. వ్యయాలను క్రమబద్దీకరించినట్లు చెప్పారు.  జీతాలు ఆపడంలేదని, పెండింగ్ బిల్స్ కూడా పది రోజుల్లో చెల్లిస్తామని, ఆందోళన అవసరంలేదని చెప్పారు. నవంబర్ 10 నుంచి వర్క్ బిల్లులు అన్నీ చెల్లిస్తామని, కాంట్రాక్టర్లు ఎవరూ పనులు ఆపవలసిన అవసరంలేదన్నారు.

కేంద్రం నుంచి రావలసిన నిధులు
          పోలవరం ప్రాజెక్ట్, గ్రామీణ ఉపాధి హామీపథకం(నరేగా) వంటి పనులకు రాష్ట్ర ప్రభుత్వమే ముందుగా ఖర్చు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. పోలవరానికి సంబంధించి రూ.1000 కోట్లు, నరేగాకు సంబంధించి రూ. 1200 కోట్లు కేంద్రం నుంచి రావలసి ఉందన్నారు. గతంలో నరేగా పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు అందేవని, అందువల్ల తాము ముందుగా చెల్లించేవారమని చెప్పారు. ఇప్పుడు నరేగా నిధులను  కేంద్రం నేరుగా కూలీలకే చెల్లిస్తోందని, అందువల్ల తాము ముందుగా చెల్లించడం సాధ్యం కాదన్నారు.

2018-19 బడ్జెట్ ప్రక్రియ ప్రారంభం
           శాఖలవారీగా 2018-19 బడ్జెట్ ప్రక్రియ ప్రారంభమైనట్లు మంత్రి చెప్పారు.  బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం మార్పులకు సంబంధించి కేంద్రం నుంచి తమకు ఏవిధమైన సూచనలు అందలేదని, అందువల్ల  ఫిబ్రవరి నెలాఖరులోగానీ, మార్చి మొదటి వారంలో గానీ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు.

వ్యయాల క్రమబద్దీకరణకు కమిటీ
             వ్యయాల క్రమబద్దీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ కమిటీలో ఆర్థిక శాఖ కార్యదర్శితోపాటు ఆడిటర్ నరసింహ మూర్తి, మరికొందరు నిపుణులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. 2018-19 బడ్జెట్ రూపొందించడంలో ఈ కమిటీ సలహాలు, సూచనలు అందింస్తుందని చెప్పారు. బడ్జెట్ సక్రమంగా రూపొందించకపోతే ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటాయన్నారు. అప్పులు రెండు రకాలుగా ఉంటాయని, ఒకటి ప్రభుత్వం నేరుగా అప్పు చేయడం, రెండు ఆఫ్ బడ్జెట్ అప్పులని, అంటే ఆర్టీసీ, సివిల్ సప్లైస్, విద్యుత్, నీటిపారుదల వంటి కార్పోరేషన్లు అప్పులు తీసుకోవడం అని వివరించారు. ఈ రకమైన అప్పులు తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తున్నట్లు  చెప్పారు. ఎఫ్ఆర్ బీఎం చట్టం ప్రకారం ప్రభుత్వం అప్పులు తీసుకోవడానికి పరిమితి ఉంటుందని, కార్పోరేషన్లకు ఆ పరిమితి ఉండదని తెలిపారు. కార్పోరేషన్లు తీసుకునే రుణాలకు ప్రభుత్వం హామీ ఉంటుందని చెప్పారు. రైతు సాధికార సంస్థ రూ.2వేల కోట్లు రుణం తీసుకున్నట్లు తెలిపారు. రైతు రుణ మాఫీ పథకం కింద ఈ ఏడాది రూ.3వేల కోట్లు ఇస్తామన్నారు.  వ్యయ నియంత్రణలో భాగంగా ఎక్కవ వడ్డీ రేటుకు తీసుకున్న రుణాలను తక్కువ వడ్డీకి మార్చుతున్నట్లు వివరించారు. గతంలో 10.5 శాతం వరకు వడ్డీ రేట్లు ఉండేవని, ఇప్పుడు వాటిని 7.9 రేటుకు మార్చి వడ్డీ చెల్లింపులు తగ్గిస్తున్నట్లు చెప్పారు.

త్వరలో మరో పది వేల ఉద్యోగాల భర్తీ
          తమ ప్రభుత్వం 20 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని, తొలివిడత పది వేలు భర్తీ చేయడానికి అనుమతి ఇచ్చిందని, ఆ ప్రక్రియ కొనసాగుతోందని, మళ్లీ మరో పది వేల ఉద్యోగాలు భర్తి చేస్తామని చెప్పారు. వివిధ శాఖల నుంచి ఖాళీల సమాచారం సేకరిస్తున్నామని, వివరాలు అందగానే మంత్రి మండలి ఆమోదంతో ఏపీపీఎస్సీకి అందజేస్తామన్నారు. ఈ ఉద్యోగాలే కాకుండా డీఎస్సీ ద్వారా కూడా ఖాళీలను భర్తీ చేసినట్లు చెప్పారు.

జీఎస్టీలో కొంత గందరగోళం వాస్తం
          జీఎస్టీ విషయంలో కొంత గందరగోళం ఉన్న మాట వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. అయితే కొత్తగా ప్రవేశపెట్టిన పన్నుల విధానంలో కొన్ని లోటుపాట్లు ఉండటం సహజం అని,  కాలక్రమంలో అన్నీ సర్ధుకుంటాయని చెప్పారు. కొన్ని వస్తువులపై జీఎస్టీ తగ్గించాలని వినతి పత్రాలు అందజేయడం అనేది నిరంత ప్రక్రియ అన్నారు. నవంబర్ 9, 10 తేదీల్లో గౌహతిలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని చెప్పారు. చింతపండు, గ్రానైట్ వంటి వాటిపై పన్ను తగ్గించాలని అడగనున్నట్లు మంత్రి చెప్పారు.

పెట్రోల్ ధరలపై నిర్ణయం సీఎందే
            సరిహద్దు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఒడిషా రాష్ట్రాలలోని పెట్రోల్ ధరలతో పోల్చితే మన రాష్ట్రంలో ధరలు ఎక్కువగా ఉన్నాయని, దాంతో సరిహద్దు జిల్లాల్లో పెట్రోల్ బంకుల వ్యాపారం పడిపోయి, వారు  నష్టపోతున్నట్లు తెలిపారు. పెట్రోల్ ధరలు తగ్గించే విషయమై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవలసి ఉందని మంత్రి యనమల చెప్పారు.

Oct 30, 2017

లాభసాటిగా సీఎం లండన్ ప్రయాణం


·       ఫలించిన సీఎం ప్రయత్నాలు
·       పెట్టుబడులకు రాష్ట్రంలో అవకాశాలు వివరించిన సీఎం
·       రాష్ట్రాభివృద్ధిపై పలువురు ప్రముఖలతో చర్చలు
·     సహకారం అందిస్తామని యూకే మినిస్టర్ ప్రీతి పటేల్ హామీ
·     ఫిన్‌టెక్ వ్యాలీకి సహకరించడినికి శాంటండర్ సుముఖత
·     ఇండో-యూకే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పనులు డిసెంబర్ లో ప్రారంభం
·     నవంబర్ లో ప్యూర్ సర్కిల్ బృందం ఏపీకి రాక
·     అమరావతి పాలన, న్యాయ నగరాల ఆకృతులలో స్వల్ప మార్పులకు సూచన
·       లండన్‌లో విభిన్న రవాణా వ్యవస్థల నిర్వహణ పరిశీలన

   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రోజుల లండన్ ప్రయాణం రాష్ట్రానికి లాభసాటిగా సాగింది. పరిశీలనలు, చర్చలు, సమాలోచనలు, వరుస ముఖాముఖి సమావేశాలతో ఊపిరి సలపనంత బిజీ షెడ్యూల్ తో జరిగిన ఈ ప్రయాణంలో రాష్ట్రానికి బహుముఖ ప్రయోజనాలు కలిగే విధంగా ఆయన పలువురు ప్రముఖులను కలిశారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి అనేక అంశాలపై చర్చించారు. భారత్, యూకే మధ్య మరి ముఖ్యంగా యూకె-ఆంధ్రప్రదేశ్ మధ్య వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ తదితర రంగాల సంబంధాలు మరింత బలపడేవిధంగా ఆయన ప్రయాణం సాగింది. ప్రతి క్షణాన్ని ఆయన రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి,  పెట్టుబడులు రప్పించడానికి, సాంకేతిక సహాకారం పొందడానికి, రాష్ట్ర సమగ్రాభివృద్ధికే వినియోగించుకున్నారు. ఆయన ప్రయత్నాలు ఫలించాయి.  తనను మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చిన యూకేలోని భారత డిప్యూటీ హైకమిషనర్ దినేశ్ కె.పట్నాయక్ కి కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు, ఓడరేవులు, అంతర్గత జల రవాణా మార్గాల గురించి వివరించి యూరప్, ఇంగ్లండ్ నుంచి పెట్టుబడులు పెట్టే సంస్థలకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వమని  కోరారు.  ‘ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ డైరెక్టర్స్’ (ఐఓడీ) నిర్వహించిన వివిధ సంస్థల సీఈవోల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేశారు.  రాష్ట్రం దేశానికి మధ్య భాగాన ఉండటం, సుదీర్ఘమైన సముద్రతీరం,  రైలు మార్గాలు, రహదారులు, జల రవాణా సదుపాయాలతో దేశం మొత్తానికి అనుసంధానం, నిరంతర విద్యుత్ సరఫరా, సౌర విద్యుత్ ఉత్పత్తికి పెద్దఎత్తున ప్రోత్సహం, వ్యాపార సానుకూలత...వంటి అంశాలు తమకు కలిసి వచ్చేవని, రాష్ట్రం రెండంకెల వృద్ధి రేటు సాధించిందని తెలిపారు. దేశంలో జలకళ-పచ్చదనం నిడిన తొలి రాజధాని అమరావతి 9 నగరాలు, 27 టౌన్‌షిప్పులతో అత్యద్భుత నగరంగా రూపొందుతోందని,   వైజ్ఞానిక, పర్యాటక నగరంగా అందరికీ ఒక ముఖ్య గమ్యస్థానంగా నిలవగలదని పేర్కొన్నారు.   

మర్యాదపూర్వకంగా కలిసిన యూకే మినిస్టర్ (సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్) ప్రీతి పటేల్ తో ఆయన  కొత్త రాష్ట్రం అభివృద్ధి, రాజధాని నిర్మాణం, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, మానవ వనరుల అభివృద్ది సంస్థ,  రాష్ట్రంలో రెండంకెల వృద్ధి రేటు, పాలనా సంస్కరణలు, -ప్రగతి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లు, బిగ్ డేటా, సీసీటీవీ కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, స్పెన్సర్లు తదితర ఐటీ, ఐవోటీ విస్తృత వినియోగం వంటి అనేక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఏపీ ప్రభుత్వానికి అన్నివిధాలుగా సహకారం అందిస్తామని ఆమె సీఎంకు హామీ ఇచ్చారు.  సీఎంతో సమావేశమైన యూకేలోని ప్రముఖ గ్లోబల్ కార్పొరేట్ బ్యాంకింగ్ సంస్థ  శాంటండర్ఇండియా డెస్క్ డైరెక్టర్ ఎడ్వర్ట్ డిక్సన్, ఎక్స్‌ పోర్ట్స్-ఏజన్సీ ఫైనాన్స్ అధిపతి ఫిలిప్స్‌లు ఆంధ్రప్రదేశ్‌ నుంచి వివిధ ఉత్పత్తుల విక్రయాలకు అవసరమయ్యే ఆర్థిక సాయం అందిస్తామని, ఇకపై రాష్ట్రంలోని ఎగుమతిదారులు, యూకేలోని దిగుమతిదారులకు కావాల్సిన ఆర్ధికమద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు.  గుంటూరు నుంచి మిర్చి ఎగుమతుల వ్యవహారాల్లో ఇప్పటికే తాము పాలుపంచుకుంటున్నట్లు, ఇక ముందు ఏపీతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా వున్నట్లు తెలిపారు. ఏపీలో ఎగుమతిదారులు, యూకేలో కొనుగోలుదారుల మధ్య సంధానకర్తగా కూడా వ్యవహరిస్తామని చెప్పారు. ఫిన్‌టెక్ రంగంలోనూ అగ్రగామైన శాంటండర్ఏపీలోని ఫిన్‌టెక్ వ్యాలీకి సహకరించడినికి సుముఖత వ్యక్తం చేశారు. అలాగే ఆహారశుద్ధి, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల వ్యవహారాలలో ఆర్థిక ఊతానికి అంగీకరించారు.ముఖ్యమంత్రితో ముఖాముఖి సమావేశం జరిపిన ఇండో-యూకే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్’(ఐయుఐహెచ్)కు చెందిన అజయ్ రాజన్ గుప్తా అమరావతిలో నెలకొల్పే హెల్త్ సిటీప్రాజెక్టు పనులను ఈ ఏడాది డిసెంబర్ నుంచి మొదలు పెడతామని సీఎంకు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను ప్రముఖ నిర్మాణ సంస్థ  ఎల్ అండ్‌ టీకి అప్పగించినట్టు వెల్లడించారు. 2018 అక్టోబరు నాటికి భవంతుల నిర్మాణం పూర్తి చేసి ప్రాజెక్టు ప్రారంభిస్తామని చెప్పారు.

భారత్‌లో తయారీ కేంద్రాన్ని ప్రారంభించి ఆసియా, ఆగ్నేయాసియా దేశాలకు తమ మార్కెట్‌ను విస్తరించాలని భావిస్తున్న వైద్య పరికరాలు, ఐటీసీ సిస్టమ్స్ తయారీలో అగ్రగామిగా వున్న టెలిమేటిక్, బయోమెడికల్ సర్వీసెస్(టీబీఎస్) గ్రూపు చైర్మన్, యూకేఐబీసీ విదేశీ వ్యవహారాల జనరల్ మేనేజర్ నికోలా పాంగెర్‌ సీఎంతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో తయారీ కర్మాగారాన్ని టీబీఎస్ నెలకొల్పాలని ఆయనకు సీఎం సూచించారు. ఏపీఈడీబీతో తమ భారత ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతారని పాంగెర్ తెలిపారు. పంచదారకు ప్రత్యామ్నాయంగా సహజసిద్ధ చక్కెర (నేచురల్ స్వీటనర్) ను ఆహార, పానీయాల పరిశ్రమలకు అందిస్తున్న ప్రపంచంలోని అగ్రశేణి ఉత్పత్తి సంస్థ ప్యూర్ సర్కిల్ సీఈవో మెగోమెట్ మసగోవ్‌ తనను కలసిన సందర్భంగా సహజసిద్ధ చక్కెర ఉత్పత్తికి అవసరమైన తోటలను దక్షిణ అమెరికా, తూర్పు ఆఫ్రికా, చైనాలలో సాగు  చేస్తున్న విధంగా ఏపీలోనూ ఆ తరహా మొక్కల పెంపకానికి ముందుకురావాలని సీఎం ఆహ్వానించారు.  సానుకూలంగా స్పందించిన మెగోమెట్ మసగోవ్‌ నవంబర్ మొదటి వారం తమ బృందాన్ని రాష్టానికి పంపించేందుకు అంగీకరించారు. తాను కూడా డిసెంబర్ నెలాఖరులో అమరావతి సందర్శిస్తానని చెప్పారు.

అమరావతి నగర ఆకృతులను రూపొందించే ఫోస్టర్ అండ్ పార్టనర్స్‌ అధినేత లార్డ్ ఫోస్టర్‌, ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇంతవరకు రూపొందించి సిద్ధం చేసిన పరిపాలన, న్యాయనగరాల ఆకృతులను పరిశీలించారు. రాజధాని ప్రభుత్వ భవన సముదాయ ఆకృతుల రూపకల్పన తుదిదశకు చేరుకుంది. ముఖ్యంగా హైకోర్టు భవన ఆకృతి దాదాపుగా తుదిరూపానికి వచ్చింది. శాసనసభ భవంతి ఆకృతులలో సీఎం కొద్దిపాటి మార్పులను సూచించారు. హైకోర్టు భవన ఆకృతి దాదాపుగా తుది రూపానికి వచ్చింది. ముఖద్వారం, భవనంలో ఇతర భాగాలలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందని సీఎం  అభిప్రాయపడ్డారు. త్వరలో ఆ మార్పులను పూర్తి చేసి సాధ్యమైనంత వేగంగా నిర్మాణ పనులను ప్రారంభించాలని నిర్దేశించారు. సచివాలయానికి సంబంధించి జరిపిన సమాలోచనలో ఒక స్పష్టత వచ్చింది. మొత్తం 5 టవర్లుగా సచివాలయాన్ని నిర్మిస్తారు. ఇందులో రాష్ట్ర మంత్రుల కార్యాలయాలు, ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాధిపతుల కార్యాలయాల కోసం 4 భారీ టవర్లు ఉంటాయి. వీటికి కొంచెం ఎడంగా సీఎం కార్యాలయం, సీఎం కార్శదర్శుల కార్యస్థానాలు, సాధారణ పరిపాలన శాఖ కార్యాలయం, వీటిన్నింటితో వేరే టవర్ ఉంటుంది. ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి నగరాలలో ఒకటిగా నిలిచే  అత్యద్భుతమైన రాజధానిని నిర్మించడం కోసమే ఇంత పెద్దఎత్తున కసరత్తు చేయాల్సివస్తోందని నార్మన్ సంస్థ ప్రతినిధులకు సీఎం చెప్పారు. దాని నిర్మాణశైలి, ఆకృతులు అసాధారణ రీతిలో, అపూర్వంగా నిలిచేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. నవ్యాంధ్ర ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసేలా, ప్రజాశక్తి ప్రతిబింబించేలా,  వారికి గర్వకారణంగా నిలిచేలా అపూర్వంగా, గొప్పగా, భారతీయత ఉట్టిపడేలా, సహజ వనరులను ఉపయోగించుకునేలా ఆకృతులను రూపొందిస్తున్నామని ఫోస్టర్ సంస్థ రూపకర్తలు క్రిస్ బాబ్, పిడ్రో సీఎంకు వివరించారు.

లండన్ ప్రస్తుత జనాభా 86 లక్షలు. సెంట్రల్ లండన్‌లో 13 లక్షల మంది ఉద్యోగులు ఉంటే, అక్కడ నివసించే ప్రజల సంఖ్య కేవలం లక్ష మాత్రమే. అంటే నిత్యం వస్తూ పోతూ ఉండే వారి సంఖ్య 12 లక్షలు. అక్కడ ట్రాఫిక్ నిర్వహణ ఒక పెద్ద సవాలు. భవిష్యత్ లో రాజధాని అమరావతిలో ఎదురయ్యే సమస్యలను దృష్ఠిలోపెట్టుకొని లండన్‌లో విభిన్న రవాణా వ్యవస్థల నిర్వహణ, కాలుష్య నియంత్రణ వ్యవస్థ, వాహనాలకే కాకుండా, పాదచారులు, సైక్లిస్టులు ప్రయాణించడానికి వీలుగా ఏర్పాటు చేసిన మార్గాలను పరిశీలించారు. అమరావతిలో అత్యుత్తమ రవాణా వ్యవస్థ నెలకొల్పాలన్న కృతనిశ్చయంతో ఉన్న సీఎం అక్కడి నిఘా వ్యవస్థ, వీధుల్లోని కెమెరాలు, బస్ స్టాప్ లు, ప్రయాణికుల రద్దీ వంటి వాటిని కూడా గమనించారు. మొత్తం నగరంలో రైలు, బస్సు, కార్లు, భూగర్భ రైల్వే, ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలన్నింటినీ కమాండ్ సెంటర్ నుంచి నియంత్రంచే విధానాన్ని అక్కడ అధికారులు ముఖ్యమంత్రి బృందానికి ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. లండన్ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, సీఎం ముఖ్యకార్యదర్శి జి. సాయిప్రసాద్, ఇంధన-మౌలికవసతుల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఆర్థికాభివృద్ధి మండలి కార్యనిర్వహణ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ వున్నారు.

-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్-9440222914



అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...