Oct 11, 2017

కాంట్రాక్టర్లను, ఇంజనీర్లను పరుగులు పెట్టిస్తున్న సీఎం


రాత్రి,  పగలు వేగంగా సాగుతున్న‘పోలవరం’ పనులు

Ø 2019 నాటికి ఎన్నికల ముందే పూర్తి
Ø చరిత్రలో నిలిచిపోయేవిధంగా సీఎం పనుల సమీక్ష
Ø త్వరగా పూర్తి చేయాలని  నిరంతరం శ్రమ
Ø రూ.58,319 కోట్లకు  చేరిన అంచనా వ్యయం
Ø కేంద్రం నుంచి నిధులు రాబట్టడానికి తీవ్ర ప్రయత్నాలు
Ø నదులు అనుసందాలించాలన్న దృఢ సంకల్పంతో  చంద్రబాబు
    
    గోదావరి నదిపైన పోలవరం వద్ద చేపట్టిన బహుళార్థ సాధక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కు ఓ వరం. నదుల ద్వారా సముద్రంలో కలిసిపోయే నీటికి అడ్డుకట్టవేయడం, నదులు అనుసంధానం ద్వారా రాష్ట్రం అంతటా నీరు పారించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం. అందులో భాగంగానే గోదావరి-కృష్ణ నదులు అనుసందానం చేశారు.  ఏడాది కాలంలో మెట్ట ప్రాంతం అయిన నందిగామ, కంచికచర్ల, వీరులపాడులతోపాటు మైలవరం, తిరువూరు, నూజివీడు, గన్నవరం సహా, పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు, గోపాలపురం, చింతలపూడి వంటి  తొమ్మిది మెట్ట ప్రాంత నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 7 లక్షల ఎకరాలకు గోదావరి జలాలను అందించారు.  ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా చేయిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుతో తన కలలను సాకారం చేసుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. దాదాపు 30 శాతం పూర్తి అయిన  ప్రాజెక్టును అత్యంత త్వరగా, అవకాశం ఉంటే వచ్చే ఎన్నికలకంటే ముందుగానే పూర్తి చేసి రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకోవాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. ఓ ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నా అత్యంత శ్రద్ధతో ప్రతి సోమవారం వీడియో సమావేశంలో లైవ్ ద్వారా,  ఏరియల్ వ్యూ ద్వారా ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించడం, కొన్ని సోమవారాలు పనులు జరిగే ప్రదేశానికే వెళ్లి సమీక్షించడం, కాంట్రాక్టర్లను, ఇంజనీర్లను పరుగులు పెట్టించే సంఘటనలు చరిత్రలో నిలిచిపోతాయి. స్పిల్‌వే, కాంక్రీట్‌ వర్క్‌, డయాఫ్రంవాల్‌, కాఫర్‌డ్యాం, ప్రధాన డ్యాం, మట్టి పనులకు అత్యంత ఆధునిక యంత్రాలను ఉపయోగిస్తున్నారు.   రాత్రింబగళ్లు చేస్తున్న ఈ పనులలో ఈ వేగం ఇలాగే కొనసాగితే 2019 నాటికి ఎన్నికలకంటే ముందే ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం, నిర్మాణానికి అయ్యే ఖర్చునంతటిని కేంద్ర ప్రభుత్వం భరించడం దీని ప్రత్యేకత. అయితే ప్రాజెక్టు త్వరగా పూర్తి కావడానికి నిర్మాణ బాధ్యతను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికే వదిలివేసింది.  చురుకుగా పనులు చేయించడంతోపాటు కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కూడా సీఎం చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు.  దేశంలోని సాంకేతిక విశ్వవిద్యాలయాల నిపుణులు, కేంద్రంలోని అనుభవజ్ఞులు దీని నిర్మాణంలో, డిజైన్లు రూపొందించడంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు.

 1941లో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు సుదీర్ఘ చరిత్ర ఉంది. గోదావరి నదీజలాల పంపిణీ కోసం  ఉమ్మడి ఏపి, ఉమ్మడి ఎంపీ, మహారాష్ట్రల మధ్య 1969లో ట్రిబ్యునల్  ఎర్పాటైంది. ఈ మూడు రాష్ట్రాల మధ్య 1978 ఆగస్టు ఏడున  పోలవరం ఒప్పందం కుదిరింది. ఈ మేరకు 150 ప్లస్ అడుగులతో పోలవరం నిర్మించేందుకు1979 నవంబర్‌ 27న ఈ మూడు రాష్ట్రాలు గోదావరి ట్రిబ్యునల్ ముందు అంగీకారం తెలిపాయి. 1980లో అప్పటి ఏపీ సీఎం అంజయ్య పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వాస్తవానికి1982లోనే దీని నిర్మాణ పనులను ప్రారంభించారేగానీ, తగిన స్థాయిలో జరగలేదు. ఇప్పుడు పనులలో వేగం పెంచి రాష్ట్రానికి జీవనాడి వంటి ప్రాజెక్టుని పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకుంది. 

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 90 ప్రకారం ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం రామాయప్పేట వద్ద నిర్మాణంలో ఉన్న బహుళార్థసాథక ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు ద్వారా ఒడిస్సా, చత్తీస్ గడ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు కూడా లబ్ది పొందుతాయి. విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలలో 7.21 లక్షల ఎకరాలకు సాగునీరు, 540 గ్రామాల్లోని 28.50 లక్షల మంది ప్రజలకు త్రాగునీటిని అందిస్తుంది. పారిశ్రామిక అవసరాలకు 23. 44 టిఎంసీల నీటి సరఫరాతోపాటు 960 మోగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అంతేకాక జలరవాణాకు, చేపల పెంపకానికి ఉపయోగపడే ఓ బృహత్తర ప్రాజెక్టు ఇది.  గంగా-కావేరి నదుల అనుసంధానంలో పోలవరం పథకం కూడా ఒక భాగం. ఈ పథకంలో భాగంగా 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా నదిలోకి మళ్లిస్తారు. మిగులు జలాలు అధికంగా ఉన్న నదుల నుంచి నీటి కొరత ఉండే నదులకు మళ్లిస్తారు.
 ప్రఖ్యాత ఇంజనీర్ కెఎల్ రావు 1946-47లో ఇచ్చిన నివేదిక ప్రకారం  ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 129 కోట్లు. అప్పట్లో భద్రాద్రి రాముని పేరు మీద దీనిని రామపాద సాగరం అని పిలిచేశారు. ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం 1985-86లో రు.2,665 కోట్లు కాగా, 2009లో ప్రణాళికా సంఘం 2005-06 ధరల ప్రకారం ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.10,151.04 కోట్లుగా పేర్కొంది. అయితే కేంద్ర జలవనరుల శాఖ సలహా కమిటీ 2011 జనవరిలో అప్పటి ధరలలో ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16,010.45 కోట్లుగా నిర్ధారించింది. నూతన భూసేకరణ చట్టం-2013 ప్రకారం భూసేకరణకు, పునరావాస పథకం వ్యయంతో కలిపి లెక్కిస్తే మొత్తం రూ.58,319 కోట్లకు చేరుతుందని అంచనా. బహుళార్థసాఃధక ప్రాజెక్టు అవడం, భూసేకరణ, పునరావాసాల వ్యయం అనూహ్యంగా పెరగడం వల్ల కూడా ప్రాజెక్ట్ వ్యయం అంచనాలకు మూడు రెట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. కేంద్రం నుంచి నిధులు రావడం ఆలస్యం అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పనులను ఆపకుండా జోరుమీద కొనసాగిస్తోంది. ఎప్పటికప్పుడు అయిన వ్యయాన్ని కేంద్రం నుంచి రాబట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతోపాటు మన ఎంపీలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఇటీవల ఢిల్లీ పర్యటలో  ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీకి ప్రాజెక్ట్ పురోగతిని వివరించి, తాజా అంచనాల ప్రకారం భారీగా పెరిగిన నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం కూడా సానూకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్.



No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...