Jul 7, 2019

కొత్త ప్రభుత్వంలో సంచలనాలు


v పాలనలో నూతన అధ్యాయం
v సాహసోపేతంగా, వేగంగా నిర్ణయాలు
v అన్ని శాఖల్లో విప్లవాత్మక మార్పులు
v రైతులకు అత్యంత ప్రాధాన్యత

         నూతన ప్రభుత్వం అనేక సంచలనాలకు తెరతీసింది. నిర్ణయాలు చాలా వేగంగా జరిగిపోతున్నాయి.  అన్ని శాఖలలో సమూల మార్పులు చేస్తోంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి, ప్రజలకు ఇచ్చిన హామీలను సాధ్యమైనంత త్వరగా నెరవేర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అవినీతిపై ఉక్కు పాదం మోపాలని నిర్ణయించింది. అవినీతికి తావులేని పాలన అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రధాన ధ్యేయం. అందులో భాగంగా అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే ఇంటికి పంపుతానని మంత్రులను కూడా హెచ్చరించారు. ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీటవేసింది.
ముఖ్యంగా రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న రైతుల సమస్యలన్నిటినీ ఒకేసారి పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ‘రైతు ప్రభుత్వం’ అనే ముద్ర వేసుకోవాలన్న తపనతో ఉంది.  ప్రజలు ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలిపేవిధంగా నూతన సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరూ ఊహించని విధంగా అత్యంత వేగంగా తన నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. ఆయన తీసుకునే కీలక నిర్ణయాలు చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే వృద్ధాప్య పెన్షన్ పెంచుతూ తొలి సంతకం చేశారు.  రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ వర్కర్లు, పోలీసులు, హోం గార్డులు, రిసోర్స్ పర్సన్స్, తల్లులు, పిల్లలు, పేదలకు ఇంటి స్థలాలు, గృహ నిర్మాణం, నూతన ఇసుక పాలసీ, విద్యా, సహకార రంగ సంస్కరణలు, గ్రామ వాలంటీర్ల నియామకం, అగ్రిగోల్డ్ బాధితులు, నాణ్యమైన బియ్యం పంపిణీ, ఆస్పత్రులలో సౌకర్యాల మెరుగు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ... వంటి కోట్ల మందికి ప్రయోజనం కలిగించే పలు కీలక నిర్ణయాలు తొలి మంత్రి మండలి సమావేశంలోనే తీసుకున్నారు. ఈ నిర్ణయాలను అమలు చేయడానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఆడంబరాలకు పోకుండా అన్ని కార్యక్రమాలు నిరాడంబరంగా నిర్వహించడంతోపాటు ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వ ఆదాయం పెంచడానికి ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు ప్రభుత్వంపై సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రతి నిర్ణయం అమలు జరిగే తేదీని కూడా ప్రకటించడం ఈ ప్రభుత్వం ప్రత్యేకత.

            జగన్మోహన రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 12 రోజులలోనే ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను పరిశీలిస్తే ఈ ప్రభుత్వం పని తీరు అర్థమవుతుంది. రూ.2 వేలుగా ఉన్న అవ్వా, తాతల పెన్షన్‌ను రూ. 2,250కు పెంచారు. దానిని దశలవారీగా ఏడాదికి రూ.250 చొప్పున రూ. 3 వేల వరకు పెంచుతారు.  ‘వైఎస్ఆర్ రైతు భరోసా’  పథకం కింద రైతులకు అందజేసే ఏడాదికి ఇచ్చే రూ.12,500  రబీ నుంచే అందజేస్తారు.  అక్టోబర్ 15న దీనిని ప్రభుత్వం  ప్రారంభించనుంది. ఈ పథకం కింద  రైతు ఖాతాల్లోకి నేరుగా ఈ డబ్బు జమ చేస్తారు. ఇందు కోసం ప్రభుత్వానికి మొత్తం రూ. 13,125 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. వ్యవసాయం అంటే పండుగలా రైతులు భావించేలా చేయడంతోపాటు ప్రభుత్వ సేవలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్న పట్టుదలతో సీఎం ఉన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక అల్లాడుతున్న రైతుకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేద రైతులకు ఉచితంగా బోర్లు వేస్తారు. ఇందుకోసం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక రిగ్గ్ ని అందుబాటులో ఉంచుతారు. రైతులకు కనీస మద్దతు ధర(ఎంఎస్ పీ) లభించే ఏర్పాట్లు చేస్తారు. ఇందు కోసం  రూ.3000 కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధిని బడ్జెట్‌లో పెట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. గిట్టుబాటు ధరను సీజన్ ప్రారంభం (తొలకరి)లోనే ప్రకటిస్తారు.వ్యవసాయంఅనుబంధ రంగాలలోని వివిధ అంశాలను అధ్యయనం చేసేందుకు రైతులకు దశ దిశ నిర్దేశించేందుకు ఆయా రంగాల్లోని నిపుణులుఅధికారులతో వ్యవసాయ కమిషన్‌ ఏర్పాటు చేస్తారు.  పరపతి విధానం మొదలు వ్యవసాయ సంక్షోభం వరకు పలు అంశాలను వ్యవసాయ కమిషన్‌ అధ్యయనం చేసి,  ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది.  స్థానిక ఉత్పత్తుల నిల్వకు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక శీతల గిడ్డంగి ఒక వేర్‌ హౌస్అవసరం మేరకు ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు నిర్మిస్తారు.  సహకార రంగంలోని డైరీలకు పాలు పోసే రైతులకు లీటరుకు నాలుగు రూపాయల బోనస్‌ చెల్లిస్తారు.  మూతపడిన సహకార రంగ చక్కెర మిల్లులను 
పునరుద్ధరిస్తారు. వ్యవసాయం వల్ల తీవ్రంగా నష్టపోయి దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు కన్నుమూస్తే వారికి రూ.7 లక్షల ఎక్స్‌ గ్రేషియో చెల్లించే అవకాశం ఉంది. విపత్తుల నిధి కోసం కేంద్రం ఇచ్చే రూ. 2 వేల కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 2 వేల కోట్లు కలసి మొత్తం రూ. 4 వేల కోట్లతో  ఓ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తుంది. ధాన్యం కొనుగోలుబియ్యం సేకరణ వంటి వ్యవహారాలలో ఉత్తమ ఫలితాలను సాధించేందుకు పౌరసరఫరాల విభాగం వ్యవసాయ శాఖతో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నారు . పంటల బీమా ప్రీమియం చెల్లించే బాధ్యత ప్రభుత్వమే తీసుకోనుంది. రైతులకు వడ్డీ లేని రుణాలు అందించడంతోపాటు విపత్తుల సమయంలో సకాలంలో పంట నష్ట పరిహారం ఇప్పించడానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.  అక్టోబర్ 2న గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తారు. వాటికి కీలక బాధ్యతలు అప్పగించి అక్కడే  రైతులకు నాణ్యమైన విత్తనాలుఎరువులుపురుగుమందులు లభించే ఏర్పాట్లు చేస్తోంది.  నకిలీ విత్తనాలు విక్రయించే కంపెనీలు డీలర్లపై  క్రిమినల్‌ కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపాలనిఅందుకు అవసరమైతే చట్టాలు కూడా సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడానికి వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నారు. భూ యజమానులకు నష్టంలేకుండా కౌలుదారులకు సాయం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రబీ నాటికి కౌలు రైతులను గుర్తిస్తే వారికి కూడా ప్రభుత్వ రాయితీలు ప్రయోజనాలుఇతర సాయం అందించే ఏర్పాట్లు చేస్తారు. వారికి 11 నెలల కాలానికి ప్రత్యేక కార్డులు అందజేస్తారు. ఉద్యోగులు అందరి డిమాండ్ సీపీఎస్ రద్దు. అందుకు మంత్రి మండలి అంగీకరించింది. ఇందు కోసం ఆర్ధిక శాఖ మంత్రి  చైర్మన్ గా,  కార్యదర్శులు  సభ్యులుగా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాణ్యమైన బియ్యంతోపాటు మరో ఆరు రకాల నిత్యావసర వస్తువులను ప్యాక్‌ చేసి గ్రామ వాలంటీర్ల ద్వారా పేదల ఇంటి ముంగిటికే చేర్చాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.  ముందుగా ప్రకటించిన ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల మంది గ్రామ వాలంటీర్లను  ఆగస్ట్ 15 నాటికి నియమించే అవకాశం ఉంది.  సెప్టెంబర్‌ 1 నుంచి ఆ వస్తువుల పంపిణీ చేపడతారు. పేదల జీవితాలను నాశనం చేస్తున్న మద్యం అమ్మకాలను క్రమంగా తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. బెల్టు షాపులను మూసివేయిస్తారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనాన్ని  రూ. 1000 నుంచి రూ. 3వేలకు పెంచారు. వైద్య,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పని చేసే ఆశా వర్కర్ల జీతాలను ఒక్కసారిగా రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచారు. శాంతిభద్రతల పరిరక్షణలో  పండుగ-పబ్బం లేకుండా అనుక్షణం పని ఒత్తిడితో  అలుపెరుగకుండా శ్రమిస్తున్న పోలీసుల సేవలను ప్రభుత్వం గుర్తించింది. వారికి వారానికి ఒక రోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకు విధివిధానాలు రూపొందించడానికి ఒక కమిటీని కూడా వేశారు. 
తమ బిడ్డను బడికి పంపే ప్రతి పేద తల్లికి ‘అమ్మ ఒడి’ పథకం కింద ఏడాదికి రూ.15వేల ఆర్థిక సహాయం అందిస్తారు. వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం(రిపబ్లిక్ డే)రోజున దీనిని ప్రారంభిస్తారు.  ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో దేనికి పంపినా ఈ సహాయం అందిస్తారు. అర్హతఅనుభవం ఆధారంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి విధి విధానాలు రూపొందించడానికి ఆర్ధిక విద్యుత్ వైద్య  పంచాయితీ రాజ్విద్య పురపాలక శాఖల మంత్రులతో మంత్రి మండలి ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు,  కన్సల్టెన్సీలను వెంటనే రద్దు చేస్తారు. లాభాపేక్ష లేని సంస్థలకు ఆ బాధ్యతలు అప్పగించి ఆ ఉద్యోగులకు లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటారు. ఇందు కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. అన్ని శాఖల్లోని పారిశుద్ధ్య కార్మికులకు రూ.18 వేలు జీతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలకు లబ్ది చేకూరే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ఓ సవాలుగా ప్రభుత్వం స్వీకరించింది. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో సీఎం జగన్మోహన రెడ్డి ఉన్నారు. కేంద్రం నుంచి రావలసిన నిధులను త్వరితగతిన మంజూరు చేయించడానికి కావలసిన అన్ని చర్యలను తీసుకోవడానికి ప్రభుత్వం అధికార యంత్రాగాన్ని సిద్ధం చేస్తోంది.  ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం భవిష్యత్ లో మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని విధంగా సీఎం జగన్మోహన రెడ్డి  సాహతోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేశం ఏపీ వైపు చూసే విధంగా రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలన్నదే సీఎం లక్ష్యం.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Jul 6, 2019


పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు
           
  యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి శ్రీకారం చుట్టారు. ప్రక్షాళన మొదలు పెట్టారు. నిజాయితీ, సమర్థతల ఆధారంగా అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. అంతే కాకుండా పోలీసుల జీవితాలు, వారి సాదకబాదకాలు తెలుసుకొని వారి కుటుంబాలలో కూడా వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చూడని కోణంలో ఈ ప్రభుత్వం వారికి, వారి కుటుంబానికి మధ్య పెరిగిన దూరాన్ని గమనించింది. ఎండనక, వాననక, రాత్రి పగలు వారు చేసే శ్రమని, వృత్తి పరంగా వారు ఎదుర్కొనే ఇబ్బందులను తెలుసుకుంది. భార్యా పిల్లలతో గడపడానికి అవకాశం లేని వారి విధుల తీరుని  గుర్తించింది.  వారు కూడా కుటుంబంతో నవ్వుతూ బతకాలని వారికి వారాంతపు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. దేశంలో ఎక్కడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ రకంగా ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. పోలీసుల జీవన శైలిలో మార్పు రావడం ద్వారా ప్రజలు, బాధితుల పట్ల వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. వారు కుటుంబంతో గడపడం ద్వారా మరింత ఉత్తేజంగా పని చేయడానికి అవకాశం ఉంటుంది.  అదే విధంగా వారు ప్రజలను కూడా నవ్వుతూ పలకరించాలని సూచిస్తోంది. వారి బాధలు సావదానంగా వినాలని  చెబుతోంది. ఆ విధంగా వారి జీవితాలలో మార్పు తీసుకురావడంతోపాటు వారు ప్రజలతో మెలిగే తీరు స్నేహపూర్వకంగా ఉండాలన్నది ప్రభుత్వ  ఆలోచన. ఈ క్రమంలో రాష్ట్రంలోని పోలీస్ శాఖ పని విధానం, వారి వ్యవహర శైలి దేశంలో నెంబర్ వన్ గా ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఆ స్థాయికి రావడానికి కావలసిన స్వేచ్ఛను కూడా ప్రభుత్వ ఆ శాఖకు ఇచ్చింది. ఆ స్వేచ్ఛ ఎంతవరకు అంటే అక్రమాలు, అన్యాయాల్లో ఎమ్మెల్యేల మాట కూడా వినవలసి అవసరంలేదు. అదే సమయంలో దాదాపు రెండు లక్షల మందికి ప్రతినిధిగా ఉండే ఎమ్మెల్యేలకు మిగిలిన విషయాలలో తగిన గౌవరం ఇచ్చి వారితో కలిసి పనిచేయాలి. అక్రమ వ్యవహారాలలో తాను జోక్యం చేసుకోనని సీఎం స్పష్టం చేశారు. పోలీసులు ప్రజల సేవకులు.   బలహీన వర్గాల పట్ల  సానుకూల దృక్పథంతో ఉండాలి. దళితులు, పేదలు, బడుగు వర్గాల పట్ల వారి  పోకడలో మార్చురావాలి. మహిళల హక్కులను కాపాడాలి.  సమాజంలో బలహీనులు, గొంతు ఎత్తలేనివారిని గుర్తించి వారికి సహాయం అందించాలి.  ఇందు కోసం ప్రతి పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిబ్బంది కొరతను పరిగణనలోకి తీసుకొని నూతన నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇబ్బందులు, బాధలు, వేధింపులు నిరాశా పూర్వక వాతావరణం నుంచి బాధితులు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు  వస్తారు. ఆప్యాయతతో నవ్వుతూ వారిని ఆహ్వానించి,  వారి ఫిర్యాదులను స్వీకరించాలి. వారి ఇబ్బందులు తెలుసుకొని సమస్యలు అవగాహన చేసుకొని వారికి సేవ చేయాలి. సైబర్ నేరాలను అదుపు చేయడానికి పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తారు.  ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో అనుసరించే విధానాలను పరిశీలించి వాటిలో ఉత్తమమైనవాటిని ఇక్కడ అనుసరిస్తారు.
 మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తారు.  ఉదయం 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు  ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఫిర్యాదు ఇచ్చినవారికి రశీదు ఇస్తారు. ప్రతి పిర్యాదు ఎప్పటికి పరిష్కరిస్తారో అందులో రాస్తారు. ప్రజలలో విశ్వసనీయత పెంచేవిధంగా పూర్తి పారదర్శకత, బాధ్యతతో వ్యవహరిస్తారు. ఎస్పీ, ఆ పైస్థాయి అధికారులు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీలు చేస్తారు. ఫిర్యాదులను పరిష్కరించినది లేనిది ర్యాండమ్ గా పరిశీలిస్తారు. పోలీస్ వ్యవస్థలోని పూర్తి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచడానికి జిల్లా పోర్టల్ ను ప్రారంభిస్తారు.  అందులో ఎఫ్‌ఐఆర్‌లు, లైసెన్స్‌ లు, అనుమతులు... వంటి వాటినన్నిటిని పోస్ట్ చేస్తారు. పోలీసు అధికారుల పనితీరుపై బాధితులు, ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తారు. అవినీతిని పూర్తిగా నిర్మూలించడంతోపాటు ఎప్పటికప్పుడు పోలీసుల పనితీరుపై ఉన్నతాధికారులు నివేదికలు తెప్పించుకుంటారు. ఆ నివేదికలఆధారంగా వారికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వ్యవహారం మొత్తం శాస్త్రీయంగా నిర్వహిస్తారు. పోలీస్ వ్యవస్థను ప్రజలకు అత్యంత చేరువ చేసి, సదభిప్రాయం కలిగించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. విశ్వసనీయత, పారదర్శకత, సమస్యల పరిష్కారంలో వేగం, మంచి ప్రభుత్వం, అవినీతి రహితపాలన, సరైన విధానాలు, నంబర్‌ ఒన్‌ పోలీసింగ్‌ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Jul 5, 2019


‘ఏక భారత్’ దిశగా సమాయత్తం!
ఒకే దేశం-ఒకే చట్టం-ఒకే పన్ను- ఒకే ఎన్నికలు-ఒకే కార్డు
          
       

  ఒకే దేశం – ఒకే చట్టం అన్న దిశగా భారత సమాజాన్ని సమాయత్తం చేయవలసిన అవసరం ఉంది.  విభిన్న భాషలు, మతాలు, సంస్కృతులు సమ్మిళితమైన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది వినడానికి ఇంపుగా ఉంటుంది. అందులో గాఢతలేదు. బలీయమైన బంధంలేదు. దేశం ఒకటే, రాజ్యాంగం ఒకటే. అయినప్పటికి 29 రాష్ట్రాలలో 29 రకరకాల చట్టాలు ఉన్నాయి. ఏకత్వం అనేది  లోపించింది. దేశ మొత్తం జనాభాలో ఏకత్వం అనే భావన బలీయంగా ఏర్పడవలసిన అవసరం ఉంది.  భారత సమాజంలో అందుకు తగిన నేపధ్యాన్ని కేంద్రం ఏర్పరచవలసిన అవసరం ఉంది.  ఒకే దేశం - ఒకే చట్టం - ఒకే ఎన్నికలు - ఒకే కార్డు – ఒకే రకమైన రిజర్వేషన్ విధానాలు -  స్త్రీ, పురుషులిద్దరికీ సమన్యాయం -  ఉమ్మడి పౌర స్మృతి - ఒకే పన్ను .... వెరసి  ‘ఏక భారత్’ భావన ప్రతి పౌరుడిలో ఏర్పడాలి. ఆధార్ కార్డుతో మొదలైన ఈ కార్యక్రమం ఒక్కక్కటిగా ‘ఏక భారత్’ బలపడే దిశగా సాగుతోంది.  ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ప్రజ అంటూ 'ఏక్తా భారత్' అనే నినాదంతో  జనసంఘ్ పార్టీ పుట్టింది. కాల క్రమంలో అది భారతీయ జనతా పార్టీగా ఏర్పడింది. ఆ పార్టీ పరిపాలన ఈ లక్ష్యాలను దృష్టిలోపెట్టుకొని కొనసాగుతోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే చట్టం అమలులో ఉండాలన్నది వారి భావన.    భిన్న మతాలు, విభిన్న సంస్కృతులు గల భారత దేశం వంటి పెద్ద దేశంలో ఈ 'ఒకే విధానం' సాధ్యం కాదని కొందరు చెబుతారు. మతాలను, సాంప్రదాయాలను, విభిన్న సంస్కృతులను గౌరవిస్తూనే ‘ఏక భారత్’ను సృష్టించడానికి అవకాశం ఉంది. ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు, ఇబ్బందులు ఉంటాయి. సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. అయినా అది సాధించిన నాడే మనం భారతీయులుగా సంపూర్ణత్వాన్ని పొందగలం. మానసికంగా ప్రతి పౌరుడు ఏక భావనతో ఉంటాడు. ఒక్కసారిగా ఈ మార్పు సాధ్యం కాదు. క్రమక్రమంగా ఒక్కో అంశంలో కొద్దికొద్దిగా మార్పులు తీసుకురావాలి. దేశంలో ఒకే కార్డు విధానం, అదే ఆధార్ కార్డు అమలులోకి వచ్చింది. 2009 జనవరి 28న ఆధార్ వ్యవస్థ ఏర్పడింది.
ఆధార్ కార్డు వల్ల అనేక అంశాలలో అటు ప్రభుత్వానికి, ఇటు పౌరుడికి ఎంతో సౌలభ్యంగా ఉంది. ఈ కార్డు దేశమంతటా చెల్లుబాటు అవుతోంది. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా ఆ తరువాత మార్పులు చేర్పులతో ఆధార్ కార్డు విధానాన్ని మెరుగుపరిచి మంచి ఫలితాలు సాధిస్తున్నారు.  ఒకే దేశం - ఒకే పన్ను అనే నినాదంతో 2017 జూలై 1న కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో కూడా మార్పులు చేర్పులు చేసి మెరుగైన ఫలితాలు సాధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
               ఇప్పుడు ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ విధానం వల్ల పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే లక్షలాది మంది కూలీలు ప్రయోజనం పొందనున్నారు. దేశ వ్యాప్తంగా 612 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను రేషన్ షాపుల ద్వారా ఏటా 81 కోట్ల మందికి పంపిణీ చేస్తున్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం సమర్ధవంతంగా అమలు చేయడంలో భాగంగా ప్రజా పంపిణీ విధానంలో మార్పులు తీసుకువచ్చి ఈ పథకాన్ని ప్రవేశ పెట్టాలన్న ఆలోచనలో కేంద్రం ప్రభుత్వం ఉంది. రేషన్ కార్డు ద్వారా ప్రస్తుతం స్వగ్రామంలోనే రేషన్ సరుకులు తీసుకునే వీలుంది.  ఈ పథకం అమలైతే లబ్దిదారులు దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాల నుంచి వేలాది మంది ఉపాధి కోసం చెన్నై, హైదరాబాద్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు వలస వెళుతుంటారు. బీహార్ నుంచి లక్షల సంఖ్యలో కూలీలు దేశమంతటికి వలస వెళుతుంటారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి అనేక మంది పనుల కోసం దక్షిణాది రాష్ట్రాలకు వస్తుంటారు. ఇటువంటి లక్షల మంది ఒకే రేషన్ కార్డు పథకం ద్వారా వారు పని చేసే ప్రాంతాలలోనే ప్రతి నెల రేషన్ పొందగలుగుతారు. ఇది ఓ అద్వితీయమై ఆలోచన. ఉపాధి కోసం వలస వెళ్లే అందరికీ లబ్ది చేకూరుతుంది. ముందుగా ఈ పథకాన్ని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అమలు చేస్తారు. తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న యోచనలో కేంద్రం ఉంది.
                దేశంలో ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటంతో పరిపాలనకు అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓటర్లు ఎక్కువమంది ఉండటంతో వ్యయం కూడా అధికంగానే అవుతుంది. ఈ నేపధ్యంలో 'ఒకే దేశం-ఒకే ఎన్నికలు' అన్న భావనను కేంద్రం ముందుకు తీసుకువచ్చింది. ఇప్పుడు దేశమంతటా అదే చర్చ జరుగుతోంది. భవిష్యత్ లో లోక్ సభ, రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనలో కేంద్రం ఉంది. పలు ప్రాంతీయ పార్టీలు కూడా దీనికి మద్దతు పలుకుతున్నాయి. బీసీలు, మైనార్టీలు, గిరిజనుల రిజర్వేషన్లకు సంబంధించి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో చట్టం అమలులో ఉంది. రాజ్యాంగ మూల సూత్రాలకు ఇది విరుద్ధం. దీని వల్ల అనేక మంది నష్టపోతున్నారు.  అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన చట్టం ఉండాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. రిజర్వేషన్లకు సంబంధించి దేశంలో ఒకే చట్టం ఉండాలని తెలంగాణ శాసనసభలో ఒక తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపారు. విస్తృత స్థాయిలో దేశంలో చర్చ జరిగే అంశాలలో ఉమ్మడి పౌర స్మృతి మరొకటి. ప్రస్తుతం  హిందూ, ముస్లిం, క్రైస్తవ.. అన్ని మతాలకు సంబంధించిన 'పర్సనల్ లా'లను సంస్కరించవలసి ఉంది.  ఒకేసారి ఉమ్మడి పౌర స్మృతి గురించి మాట్లాడితే ఛాందసవాదులు అందుకు అంగీకరించరు. అందువల్ల చట్టాలను కొంచెం కొంచెంగా సంస్కరించుకుంటూ పోవాలి. మొదట వివాహ వయస్సును సవరించి,  ఆ తర్వాత ఒక్కొక్కటిగా విడాకులు, మనోవర్తి అంశాలను,  వివాహ రిజిస్ట్రేషన్ విధానాలను సంస్కరించాలి. అలా చేయడం వల్ల ఎక్కువ వ్యతిరేకత వ్యక్తం కాదు. ఆ విధంగా దేశవ్యాప్తంగా ఒకే చట్టం, ఒకే ఎన్నికలు, ఒకే రిజర్వేషన్, ఒకే పన్ను, ఒకే కార్డు, ఒకే విధానం అమలు చేయాలి. కేవలం చట్టాలను మార్చినంత మాత్రాన సమాజం మారిపోదు. మార్పు రావాలంటే సమాజం అందుకు సిద్ధంగా ఉండాలి. లేదా సమాజాన్ని అందుకోసం సిద్ధం చేయాలి. ప్రస్తుతం అలా సమాజాన్ని సిద్ధం చేసే ప్రయత్నాలలో కేంద్రం ఉంది.   అంతర్కగతంగా అటువంటి ఆలోచనలతోనే కేంద్రం ఒక్కొక్కటిగా సంస్కరణలు చేస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అలా చేయడం వల్ల భారత సమాజం కూడా  ‘ఏక భారత్’ దిశగా సమాయత్తమయ్యే అవకాశం ఉంది.
 -     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914


Jul 4, 2019

నియామకాలు

రోజా... APIIC ఛైర్మన్ 8978068888

మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా వాసి రెడ్డి పద్మ

 CRDA ఛైర్మన్‌గా ఆళ్ల రామకృష్ణారెడ్డి   9912471247

ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మోహన్‌బాబు 91609 99907

ఆర్టీసీ ఛైర్మన్‌గా అంబటి రాంబాబు  9440307999

 కాపు కార్పొరేష‌న్ ఛైర్మన్‌గా గ్రంధి శ్రీనివాస్
8816234487, 8816234850, 9912104449

బ్రాహ్మణ కార్పొరేష‌న్ ఛైర్మన్ ప‌ద‌విని ద్రోణంరాజు శ్రీనివాస్‌  9848185917

పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ ఛైర్మన్‌గా యేసుర‌త్నం  8978681555

సివిల్ స‌ప్లయిస్ క‌మిష‌న్ ఛైర్మన్‌గా ఆమంచి కృష్ణమోహ‌న్  9704046661

ఎస్సీ క‌మిష‌న్ ఛైర్మన్‌గా మోషేన్ రాజు 
వ‌క్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా మ‌హ్మద్ ముస్తఫా  9394152907, 0863-2238223

భూమ‌న క‌రుణాక‌ర రెడ్డిని రాయ‌ల‌సీమ అభివృద్ధి మండలి ఛైర్మన్‌  9393603818

Jul 3, 2019


తండ్రిని మించిన తనయుడు
          
 
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డితో పోల్చితే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన రెడ్డి తండ్రిని మించిపోయారు. పాలనలో, వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో సంచనాలు సృష్టిస్తున్నారు. ఎవరూ ఊహించని రీతిలో, గతంలో ఎవరూ తీసుకోనివిధంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన హామీలకు మించి  డాక్టర్ వైఎస్ నిర్ణయాలు తీసుకున్నారు. అమలు చేశారు. ఇప్పుడు జగన్ కూడా నెల రోజుల్లోనే  అంతకు మించిన నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

                ప్రభుత్వ పాలనతోపాటు కొన్ని పథకాల వల్ల కొందరు ముఖ్యమంత్రులు చరిత్రలో చిరస్తాయిగా నిలిచిపోతారు. కిలో రెండు రూపాయలకు బియ్యం పథకంలో ఎన్ని మార్పులు చేసినా ఆ క్రెడిట్ ఎన్టీ రామారావుకే దక్కుతుంది. అలాగే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలలో ఎన్ని మార్పులు చేసినా, ఎలా అమలు చేసినా వాటిని డాక్టర్ వైఎస్ పథకాలుగానే ప్రజలు గుర్తుంచుకుంటారు. పేద  ప్రజల ఆరోగ్యానికి, బడుగు, బలహీన వర్గాల పిల్లల ఉన్నత చదువులకు డాక్టర్ వైఎస్ ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్ మెంట్ ను ఆయన పెట్టుబడిగా భావించారు. ఆయన ఆశించిన విధంగా ఆ పథకం అద్వితీయమైన ఫలితాలను సాధించింది. పేద, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూర్చింది. ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పేద కుటుంబాలకు చెందిన ఇంజనీర్లు దేశం నలుమూలలే కాకుండా, విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా స్థిరపడ్డారంటే అది ఆయన చలవే. తండ్రిని మించిన ఆలోచనలతో జగన్ ముందుకు వచ్చారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటూ అతి తక్కువ కాలంలోనే రాజకీయంగా నిలదొక్కుకున్నారు. తండ్రితో పోల్చుకుంటే తక్కువ సమయంలోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే తక్కువ సమయంలోనే ఎక్కువ పోరాటం చేశారు. తండ్రి కంటే ఎక్కువగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మొండిగా ఒక్కడే నిలబడ్డారు. ఘన విజయం సాధించారు.
             అధికారం చేపట్టిన రోజు నుంచే ఎన్నికల హామీ నవరత్నాల అమలుకు జగన్ పూనుకున్నారు. తండ్రి మాదిరిగానే ఆరోగ్యానికి, విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీని అలాగే కొనసాగిస్తూ, విద్య విషయంలో జగన్ మరో అడుగు ముందుకు వేశారు. తండ్రి మాదిరిగానే విద్య కోసం చేసే వ్యయాన్ని పెట్టుబడిగానే భావిస్తున్నారు. విద్యా హక్కు, ఉచిత విద్య అమలులో ఉన్నా పేదరికం, ఆర్థిక, కుటుంబ పరిస్థితుల కారణంగా దేశంలోని తల్లులు తమ పిల్లలను బడికి పంపించలేని పరిస్థితులు ఉన్నాయి. ఏ తల్లి అయినా తమ బిడ్డలు చదువుకోవాలనే అనుకుంటుంది. అయితే దరిద్రం అందుకు అనుకూలించనివ్వదు.  దానిని గమనించిన జగన్ పిల్లలను బడి బాట పట్టించడానికి, వారి భవిష్యత్ కు బంగారు బాట వేయడానికి నవరత్నాలలో అత్యంత ముఖ్యమైన ‘అమ్మ ఒడి’ పథకం ప్రవేశపెట్టనున్నారు. ఈ పథకం వల్ల తమ పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏడాదికి రూ.15వేలు అందుతాయి. అంటే నెలకు రూ.1,250లు. అలా ఒకటవ తరగతి నుంచి  పదవ తరగతి ఇస్తారు. దానిని ఇంటర్ వరకు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇక రాష్ట్రంలోని ప్రతి తల్లి తన బిడ్డ ఆడ పిల్ల అయినా, మగ పిల్లవాడైనా బడికి పంపుతుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో బడికి వెళ్లే పిల్లల సంఖ్య పెరుగుతుంది. మధ్యలో బడి మానివేసే వారి సంఖ్య తగ్గుతుంది. అక్షరాస్యత పెరుగతుంది.  జగన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. అంతేకాకుండా అతి తక్కువ కాలంలోనే అక్రమ కట్టడాలను కూల్చివేయాలన్న నిర్ణయం తీసుకొని, అమలు చేయడం  సాహసోపేతమైన చర్యలకు నిదర్శనం. రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాలు, పొలాలు, వాగులు, కాలవలు, చెరువులు, రోడ్లు, చివరికి స్మశానాలు కూడా ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టారు. వాటిని అన్నిటిని వెంటనే  కూల్చివేయవలసిన అవసరం ఉంది.  పర్యావరణ పరిరక్షణకే కాకుండా, ట్రాఫిక్ కష్టాలను తొలగించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. బడా బాబుల భవనాలే కూల్చివేస్తున్నందున ఇక భవిష్యత్ లో ఎవరూ ఈ విధంగా అక్రమ కట్టడాలు కట్టడానికి పాల్పడరు. ఇది ఓ మంచి పరిణామం. ప్రపంచంలో ఎక్కడ ఏ మంచి మార్పు జరిగినా కొన్ని నష్టాలు తప్పవు. అది సహజం. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. మంచి భవిష్యత్ కు మార్గం ఇది.  ఇటువంటి వాటికి ఎవరో ఒకరు నాంధి పలకాలి. ఇక్కడ అది జగన్ ద్వారా జరుగుతోంది. ఇక ముందు ముందు ఈ యువ సీఎం ఎటువంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూద్ధాం.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...