కాపు-బ్రాహ్మణ
ఫైనాన్స్ కార్పొరేషన్లు
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను సమాజంలో అందరితో సమానంగా ఎదిగేలా
అవకాశాలు కల్పించడంతో పాటు అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా వెనుకబడిన కాపులు, బ్రాహ్మణుల అభ్యున్నతికి
ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. కాపులకు రూ. వెయ్యి కోట్లు, బ్రాహ్మణులకు రూ. 75 కోట్లు కేటాయించింది.
గతేడాది 58,685 మంది కాపు యువతకు స్వయం ఉపాధి పథకం కింద ఆర్ధిక సాయం చేయాలని లక్ష్యం
పెట్టుకోగా, 52,776 మందికి సాయం అందించింది. అలాగే చిన్నచిన్న సంఘాలుగా ఏర్పడే వారికి ఎంఎస్ఎంఈ(సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల) పథకం కింద రూ. 250 కోట్లను కనీసం వెయ్యి గ్రూపులకు ఇవ్వాలని
నిర్ణయించింది. 2016-17లో విదేశీ విద్యా దీవెన పథకం కింద విదేశాల్లో చదివేందుకు 398 మంది కాపు విద్యార్దులు
అర్హత సాధించగా, 352 మంది ఇప్పటికే విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పథకం కోసం 34.30 కోట్లు వ్యయం చేసింది. ఈ
పథకానికి ఈ విద్యాసంవత్సరం మరింత స్పందన వచ్చింది. 510 మంది విద్యార్ధులు విదేశాల్లో చదివేందుకు
ఆసక్తి కనబరుస్తూ దరఖాస్తులు సమర్పించారు. బలహీన వర్గావర్గాల కుటుంబాలకు ప్రభుత్వం
‘చంద్రన్న
పెళ్లి కానుక’ పథకం
ప్రకటించింది. వివాహ కానుక కింద ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.25 వేల వంతున పెళ్లిఖర్చులకు
ఇవ్వనుంది. ఆదరణ పథకం ద్వారా బలహీన వర్గాల
వారందరికీ అత్యంత అధునాతన పనిముట్లు ఇవ్వనుంది. సివిల్స్,
బ్యాంకింగ్ సహా వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి
శిక్షణ ఇప్పించే విద్యోన్నతి పథకం కింద గతేడాది 5,796 మంది కాపు అభ్యర్ధులు ఎంపికయ్యారు. వీరంతా
దాదాపు 50
ప్రముఖ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. కాపు యువతలో నైపుణ్యాభివృద్ధికి
శిక్షణ ఇవ్వడంతో పాటు విజయవాడ, తిరుపతిలో జాబ్ మేళాలు నిర్వహించింది. ఇంటర్మీడియేట్ చదివే
పేద కాపు విద్యార్ధులకు రూ. 6 వేలు, డిగ్రీ ఇంకా ఉన్నత విద్యాభ్యాసం చేసే వాళ్లకు రూ. 10 వేల చొప్పున ఉపకార
వేతనాలు ఇస్తోంది. గత విద్యా సంవత్సరం 3.3 లక్షల మంది కాపు విద్యార్ధులకు ఉపకార వేతనాల
కోసం రూ. 238
కోట్లు కేటాయించింది. ప్రతి జిల్లా కేంద్రంలోనూ రెండు ఎకరాల విస్తీర్ణంలో ఒకొక్కటి
రూ. 5
కోట్ల వ్యయంతో కాపు భవనాలను నిర్మిస్తోంది.
కాకినాడ, ఏలూరు, కడప, తిరుపతి, నెల్లూరులో ఇప్పటికే
భూకేటాయింపులు పూర్తికాగా కర్నూలు, గుంటూరు, అనంతపురం, విజయనగరంలో భూమిని గుర్తించారు.
బ్రాహ్మణులకు విజయవాడలో
బ్రాహ్మణ కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంకును ప్రారంభించారు. అరుంధతి పేరుతో బ్రాహ్మణ
మహిళా సంఘాలకు, వశిష్ట
పేరుతో బ్రాహ్మణ పురుషుల సంఘాలకు రుణాలు అందిస్తున్నారు. కశ్యప ఆహార-ఆవాస పథకం
కింద బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన 6,500 మంది వృద్ధులు,
వితంతువులకు నెల నెలా రూ.1,000 చొప్పున బ్యాంక్ ఖాతాలలో
బ్రాహ్మణ కార్పోరేషన్ జమ చేస్తోంది. ఇందుకోసం ఏడాదికి రూ. 7 కోట్లు
వినియోగిస్తోంది.
ముస్లిం మైనారిటీలకు గత ఆర్ధిక సంవత్సరంలో ఆదరణ, రోషిణి పథకాల కింద 13,022 మంది
లబ్దిదారులకు రూ. 180 కోట్ల సాయం అందించింది. దుల్హన్ పథకం కింద పేద ముస్లిం
యువతుల వివాహానికి ఈ సంవత్సరం బడ్జెట్లో రూ. 60 కోట్లు కేటాయించింది. 2016-17లో ఇదే పథకం 10,954 మందికి ప్రయోజనం చేకూర్చింది. ఉర్దూ
ఘర్-షాదీఖానాల కోసం రూ. 15 కోట్లు కేటాయించింది. మైనారిటీ విద్యార్థులు విదేశాలకు
వెళ్లి విద్యను అభ్యసించడానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకం కింద ఏడాదికి 500 మందిని విదేశాలకు పంపాలని
లక్ష్యంగా పెట్టుకుంటే ఇంతవరకు 100 మంది దరఖాస్తు చేసుకున్నారు. దేశంలో తొలిసారి
ఎక్కడా ఇవ్వనంతగా ఆదాయంలేని మసీదుల ఇమామ్లకు రూ. 5 వేలు, మౌజన్లకు రూ. 3 వేలు పారితోషికం ఇస్తోంది. మసీదుల్లో
ప్రార్థనలు నిర్వహించే పలు ఇమామ్లు ఎంతో పేదరికంలో మగ్గుతున్నారు. వారి
జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కడపలో రూ.
12
కోట్లతో అధునాతన హజ్ హౌస్ నిర్మాణంతో పాటు,
కర్నూలులో రూ. 3 కోట్లతో మినీ హజ్ హౌస్,
విజయవాడలో మరో హజ్ హౌస్ ఏర్పాటుకు ప్రభుత్వం
కట్టుబడి వుంది. మైనారిటీ విద్యార్ధుల కోసం ఆరు రెసిడెన్షియల్ పాఠశాలలను
నిర్వహిస్తోంది. మసీదులు, షాదీఖానాల మరమ్మతులకు నిధులు కేటాయిస్తోంది. 2015-16లో 51 మసీదులు, 52 షాదీఖానాలను, 2016-17లో 39 మసీదులు, 74 షాదీఖానాలను అభివృద్ధి పరిచింది.
ఉర్దూ భాషాభివృద్ధి కోసం రూ. 20 కోట్లు కేటాయించిన ప్రభుత్వం కర్నూలులో ఉర్దూ
యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. ఉర్దూ ఘర్
నిర్మాణానికి మరో రూ. 12 కోట్లు ఖర్చు పెడుతోంది. 2,200 ఉర్దూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం రూ. 50 వేల చొప్పున ఆర్ధిక సాయం
చేస్తోంది. వేల కోట్ల విలువైన వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఎన్నో చర్యలు తీసుకుంది.
అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తుల స్వాధీనానికి వక్ఫ్ యాక్ట్ 1995ను సమర్ధవంతంగా వినియోగిస్తోంది. ముస్లింలు, క్రైస్తవులు మక్కా, జెరూసలెం సందర్శించేందుకు
ఆర్ధిక సాయం అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్
కొత్తగా చర్చిలు నిర్మించేందుకు రూ. లక్ష నుంచి రూ. 3 లక్షలు ఇవ్వాలని భావిస్తోంది.
వృద్ధులు, వికలాంగులకు అండ
వికలాంగులకు నెలనెలా రూ. 1,500 పింఛను ఇస్తున్న
ప్రభుత్వం వారు కులాంతర వివాహాలు చేసుకుంటే రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు సాయం చేస్తోంది. 5,500 మంది విభిన్న
ప్రతిభావంతులకు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్లు ఇస్తోంది. వికలాంగుల కోసం విజయవాడలో
ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, అంధుల కోసం కాకినాడ,
అనంతపురంలో పాఠశాలలు ఏర్పాటు చేస్తోంది.
వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీతో పాటు ప్రభుత్వం చేపట్టే గృహనిర్మాణంలో
వారికి 3
శాతం రిజర్వేషన్ కల్పించాలని, 2,500 మోటరైజ్డ్ ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు ఈ ఏడాది
పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంమ్మీద వికలాంగుల సంక్షేమానికి ఈ
ఏడాది రూ.89.51 కోట్లు కేటాయించింది. అలాగే ఏ ఆదరణ లేని వయోవృద్ధుల కోసం విశాఖపట్నం, గుంటూరు, అనంతపురంలో పీపీపీ
పద్ధతిలో వృద్ధాశ్రమాలు నిర్మించనుంది. 18 నుంచి 70 సంవత్సరాల వయసు కలిగిన
అసంఘటితరంగ కార్మికులకు చంద్రన్న బీమాతో ఆపన్నహస్తం అందిస్తోంది. ప్రమాదంలో మృతి
చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల వరకు పరిహారం,
సహజ మరణానికి రూ. 30 వేలు, ప్రమాదంలో అంగవైకల్యం ఏర్పడితే రూ. 3,62,500 ఇచ్చి
ఆదుకుంటోంది. చంద్రన్న బీమా కింద 2.13 కోట్ల మంది రక్షణ పొందుతున్నారు. బీమాదారుని
మరణ సమాచారం తెలిసిన 48 గంటలలోపు మండలాల్లోని బీమామిత్ర ద్వారా అంత్యక్రియలకు రూ.5,000 అందించడమే కాకుండా క్లెయిమ్కు
కావలసిన పత్రాల జారీచేయడంలో కూడా ‘బీమామిత్ర’ ఉద్యోగులు పర్యవేక్షిస్తారు. చంద్రన్న బీమా
పాలసీదారులు ప్రమాదంలో మరణిస్తే వారి
పరిహారానికి అవసరమైన ప్రాథమిక నివేదిక, దర్యాప్తు,
శవ పంచనామా,
మరణ ధృవీకరణ పత్రం నిర్ణీత గడువులోగా వెబ్సైట్లో
ఉంచుతారు. ఈ ధృవపత్రాల జారీలో జాప్యం కారణంగా పరిహారం అందడంలో ఆలస్యం జరిగితే కఠిన
చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఇప్పటివరకు సుమారు 30వేల పైచిలుకు క్లయిములకు
పరిహారం అందింది. చంద్రన్న బీమా కోసం ప్రస్తుతం పోర్టల్ వుండగా, త్వరలో ఒక ప్రత్యేక యాప్ను
ప్రభుత్వం తీసుకురానుంది.
-
శిరందాసు
నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్.
No comments:
Post a Comment