Sep 2, 2017

చరిత్రలో నిలిచిపోయే ‘అమరావతి ప్రకటన’


స్పీకర్ కోడెల అధ్యక్షతన సుదీర్ఘ చర్చల అనంతరం తుదిరూపం
సీఎం చేతులు మీదగా త్వరలో ఆవిష్కరణ

      ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద రావు ఆధ్వర్యంలో మహిళా సాధికారితపై అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్న అమరావతి ప్రకటన చరిత్రలో ఓ చారిత్రక ఘట్టంగా నిలిచిపోనుంది.
మహిళా సాధికారితకు కావలసిన అన్ని అంశాలను, గ్రామీణ మహిళ మొదలుకొని పట్టణ మురికివాడలలో నివసించే మహిళలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్య,ఆర్థిక, ఆరోగ్యపరమైన అన్ని అంశాలు  ఆమూలాగ్రం చర్చించి దీనిని రూపొందించారు. విజయవాడకు సమీపంలో కృష్ణా-గోదావరి నదుల  పవిత్ర సంగమం వద్ద 2017 ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు మూడు రోజులపాటు జరిగిన జాతీయ మహిళాపార్లమెంట్ లో పాల్గొన్న రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి మహిళలు, యువతులు, విద్యార్థుల అనుభవాల సారంతో జరిగిన ఉపన్యాసాలు, చర్చలు, సిఫారసులు, తీర్మానాలకు సంక్షిప్త రూపమే ఈ ప్రకటన. మహిళా పార్లమెంట్ లో అమెరికా, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలు, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రముఖ మహిళలతోపాటు దాదాపు 25 వేల మంది పాల్గొన్నారు. చారిత్రక అంశాలతోపాటు ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో అంశాలను  సుదీర్ఘంగా చర్చించారు. పరిష్కార మార్గాలను సూచించారు. ఈ పార్లమెంట్ లో మహిళలు కనపరిచన స్పందన స్పూర్తితో ప్రస్తుత తరానికి, భావితరాలకు మార్గదర్శకంగా ఉండే విధంగా అమరావతి ప్రకటనరూపొందించమని సీఎం సూచించారు. దాంతో డాక్టర్ కోడెల ప్రభుత్వంలోని ముఖ్య అధికారులు, దేశంలోని, రాష్ట్రంలోని పలువురు మహిళా ప్రముఖులను ఒక చోట సమావేశపరచి ప్రకటన రూపొందించడానికి పూనుకున్నారు. ఈ ప్రకటన రూపొందించడంలో రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత దావ్రా కీలక పాత్ర పోషించారు. ఎండోమెంట్స్ కమిషనర్ వైవి అనురాధ రెండు సమావేశాలలో పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రకటన ముసాయిదాను తయారు చేయడానికి 8 మంది ఎడిటోరియల్ బోర్డు సభ్యులను నియమించారు. వారు ప్రధానమైన పది అంశాలతో ఒక ముసాయిదాని రూపొందించారు.  1.స్త్రీ విద్య, 2. మహిళల న్యాయపరమైన హక్కులు, 3.మహిళల ఆరోగ్యం, సమతుల ఆహారం, 4.పారిశ్రామిక రంగంలో మహిళలు, 5. పరిశోధన, నూతన ఆవిష్కరణల్లో మహిళలు, 6.రాజకీయాల్లో మహిళలు, 7. మహిళల సమాజిక భద్రత, 8.స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో మహిళల పాత్ర, 9.మహిళల సామాజికాభివృద్ధి, 10.మహిళలు - డిజిటల్ విద్య అనే అంశాల ప్రాతిపదికగా మహిళలకు సంబంధించిన అన్ని సమస్యలను ప్రస్తావించారు. ఈ ముసాయిదాపై ప్రభుత్వంలోని ముఖ్య అధికారులు, మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, దేశంలోని, రాష్ట్రంలోని పలు రంగాలకు చెందిన మహిళలు, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యార్థినులు మూడుసార్లు జరిగిన సమావేశాల్లో  పాల్గొని అనేక అంశాలను చర్చించారు.

మహిళలు, విద్యార్థినులు, బాలికలు, పిల్లలకు సంబంధించి చిన్న చిన్న అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. గ్రామీణ స్థాయి పేద మహిళలు మొదలుకొని  పట్టణ స్థాయి పేద మహిళలు, అసంఘటిత కార్మిక మహిళలు, ఒంటరి మహిళలు, గర్భినీ స్త్రీలు, పసిపిల్లల స్థితిగతులపై ప్రతి అంశాన్ని చర్చించారు. పాఠశాల స్థాయిలో విద్యార్థినులకు సౌకర్యాలు, ఉపాధిపై అవగాహన, స్వీయరక్షణ, మహిళల న్యాయపరమైన హక్కులు, ఆస్తి హక్కు,  వ్యభిచార కూపంలోకి నెట్టబడే బాలికలు, హిళల సమస్యలు,  వృత్తి విద్య, గ్రామీణ పరిశ్రమలు, డ్రైవింగ్ లో శిక్షణ, మహిళా పారిశ్రామికవేత్తలకు రుణ సౌకర్యం కల్పించడం, పన్నుల మినహాయింపు, ప్రత్యేక మహిళా పారిశ్రామిక జోన్ల ఏర్పాటు, సైబర్ సెక్యూరిటీ, సినిమా, టీవీ, సోషల్ మీడియా నుంచి రక్షణ, అన్ని రంగాల్లో సమాన అవకాశాలు... తదితర అన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా అందరూ స్త్రీని గౌరవిస్తూ ఆచరించదగిన మార్గదర్శకాలు ఇందులో ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వాలకు, స్వచ్ఛంద సంస్థలకు, ప్రతి వ్యక్తికి, మహిళలకు సూచనలు, సలహాలు అందించే విధంగా ఉంటుంది.  వివాదాలకు తావులేకుండా అంతర్జాతీయ స్థాయిలో విస్తృత అంశాల ప్రాతిపదికన ఈ ప్రకటనను రూపొందించారు. రాజకీయాలకు అతీతంగా  మహిళలకు సంబంధించి ఇటువంటి ప్రకటన రూపొందించడం ఓ గొప్ప అవకాశంగా భావించవచ్చు. శాసనసభాపతి డాక్టర్ కోడెల అధ్యక్ష్యతన  మూడు సార్లు జరిగిన సమావేశాల్లో  జస్టిస్ జీ.రోహిణి, అమరావతి రాజధాని నగరాభివృద్ధి, నిర్వహణ సంస్థ ఎండీ లక్ష్మీ పార్థసారధి, రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత దావ్రా, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ, ఎండోమెంట్స్ కమిషనర్ అనురాధ, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి సునిత,  పాఠశాల విద్య కమిషనర్ సంధ్యారాణి, ప్లానింగ్ శాఖ సెక్రటరీ సంజయ్ గుప్త, పద్మావతి మహిళా విశ్వవిద్యలయం ప్రొఫెసర్లు ఎ.జయశ్రీ, పి.విజయలక్ష్మి, డీఎం మమత, డిబీ కృష్ణ కుమారి, యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఏపీ సెక్రటరీ జనరల్ ఎల్.జయరాములు, ఆంధ్రప్రదేశ్ మహిళా పారిశ్రామికవేత్తల సంఘం అధ్యక్షురాలు కె.రమాదేవి, జి.జానకీ రామచంద్రన్ వంటి వారు  పాల్గొని చర్చించి, తమ అమూల్యమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. తుది ప్రకటన ముద్రణ దశలో ఉంది. దీనిని రూపొందించడంలో కృషి చేసిన మహిళల  సమక్షంలో త్వరలో ముఖ్యమంత్రి దీనిని ఆవిష్కరిస్తారు.

శిరందాసు నాగార్జున, డెవలప్ మెంట్ జర్నలిస్ట్, 9440222914.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...