అన్ని శాఖలకు సీఎస్ దినేష్ కుమార్ ఆదేశం
సచివాలయం,
సెప్టెంబర్ 4: ప్రభుత్వంలోని అన్ని
శాఖలు విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తు సమావేశ మందిరంలో సోమవారం మధ్యాహ్నం విద్యుత్ బకాయిలు
ఎక్కువగా ఉన్న ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై సమీక్షించారు. ముఖ్యంగా బకాయిలు
ఎక్కువగా ఉన్న పంచాయతీరాజ్, నీటిపారుదల, మున్సిపల్,
పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖలు అక్టోబరు 15 నాటికి మొత్తం
చెల్లించాలని చెప్పారు. వివిధ శాఖలు తెలిపిన పలు సమస్యలకు సీఎస్ అక్కడికక్కడే
పరిష్కార మార్గాలను వెల్లడించారు. బకాయిలు చెల్లించే
విధానాలను కూడా సూచించారు. నాబార్డ్ నిధుల నుంచి
విద్యుత్ బకాయిలు చెల్లించమని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించారు. నిర్ణయించిన తేదీ లోపల బకాయిలు చెల్లిస్తామని ఆయా శాఖల అధికారులు సీఎస్ కు
హామీ ఇచ్చారు.
విద్యుత్ చార్జీలను తగ్గించుకునే ప్రత్యామ్నాయ
మార్గాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఎన్టీఆర్ జలసిరి పథకం
కింద 17
వేల సోలార్ పంపుసెట్లను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు
చేయమని సీఎస్ ఆదేశించారు. అలాగే వేస్ట్ టు ఎనర్జీ(వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి) ప్లాంట్లను కూడా త్వరగా
నెలకొల్పడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సోలార్ పంపుసెట్లు, వేస్ట్ టు ఎనర్జీ పనులు పూర్తి చేయడం ద్వారా విద్యుత్
ఆదా అవుతుందని,
ఆ విధంగా వ్యయం తగ్గించుకోవచ్చని సీఎస్ చెప్పారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీ ట్రాన్స్ కో ఎండి కె.విజయానంద్, మునిసిపల్ పాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.కరికాల వళవన్,
పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ఎస్.జవహర్ రెడ్డి,
ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment