- 38 లక్షల 10 వేల ఎకరాలపై రూ.9,270 కోట్లు రుణాలు
- అత్యధిక రుణాలు పొందిన గుంటూరు, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాలు
- మొదటి స్థానంలో భీమవరం మండలం
- గత ఏడాది మొదటి 3 స్థానాల్లో వెనుకబడిన జిల్లాలే!
రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో
ఇప్పటి వరకు 38,10,305 ఎకరాల వెబ్ ల్యాండ్ పై రూ.9,270 కోట్ల రుణాలు మంజూరు
చేశారు. రికార్డుల డిజిటలైజేషన్ లో భాగంగా భూముల వివరాలన్నింటిని రెవెన్యూ శాఖవారు
ఆన్ లైన్ లోకి ఎక్కిస్తున్నారు. ఈ విధంగా
ఆన్ లైన్ లో ఎక్కించిన భూములను వెబ్ ల్యాండ్ అంటారు. సర్వే ఇబ్బందులు, వంశపారంపర్య
హక్కులకు సంబంధించి వివాదాలు ఉన్న భూములు తప్ప దాదాపు రాష్ట్రంలోని అన్ని భూముల
వివరాలు ఆన్ లైన్ లోకి ఎక్కించారు. దీంతో అటు ప్రభుత్వానికి, ఇటు బ్యాంకులకు,
ప్రజలకు వెసులుబాటు ఏర్పడింది. రెవెన్యూ
రికార్డులు డిజిటలైజేషన్ అయినందువల్ల రైతులు రుణాలు పొందడానికి ఎక్కువ ఇబ్బందులు
పడవలసిన అవసరంలేదు. వెబ్ ల్యాండ్ పై
ఇచ్చిన రుణాల వివరాలను అన్ని బ్యాంకుల వారు ఏ రోజుకారోజు సీఎం డ్యాష్ బోర్డులో
ఎక్కిస్తారు. ఏ జిల్లాలో ఏ బ్యాంకు ఎన్ని ఎకరాలపై ఎంత మంది రైతులకు, ఎంత రుణం
ఇచ్చిందో పూర్తి వివరాలు అందులో పొందుపరుస్తారు. ఏ గ్రామంలో ఏ బ్యాంకు ఎంత మందికి,
ఎంత రుణం ఇచ్చిందో అందరూ తెలుసుకునే అవకాశం ఉంది. పారదర్శకతకు ఇది ఓ పక్కా
నిదర్శనం.
మొదటి స్థానంలో గుంటూరు జిల్లా
సీఎం
డ్యాష్ బోర్డు ప్రకారం నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం వరకు రాష్ట్రంలోని 13 జిల్లాలలో 38,10,305
ఎకరాలపై 10,19,810 మంది రైతులకు రూ.
9,270.89 కోట్లు రుణాలుగా ఇచ్చారు. అత్యధికంగా రుణాలు ఇచ్చిన జిల్లాలలో గుంటూరు,
కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాలు వరుసగా మూడు స్థానాలలో ఉన్నాయి. గుంటూరు జిల్లాలో
రూ.1462.89 కోట్లు, కర్నూలు జిల్లాలో రూ.1163.95 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో
రూ. 1161.07 కోట్లు రుణాలుగా ఇచ్చారు. రూ.160.33 కోట్ల రూణాలు పొంది విజయనగరం
జిల్లా చివరి స్థానంలో ఉంది. మిగిలిన జిల్లాలను పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లాలో
రూ. 289.12 కోట్లు, విశాఖపట్నం జిల్లాలో రూ. 230.80 కోట్లు, తూర్పుగోదావరి
జిల్లాలో రూ.554.41 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.673.33 కోట్లు, ప్రకాశం జిల్లాలో
రూ.684.13 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ.430.65 కోట్లు, చిత్తూరు జిల్లాలో రూ.728
కోట్లు, కడప జిల్లాలో రూ. 705.91 కోట్లు, అనంతపురం జిల్లాలో 1026.30 కోట్లు
రుణాలుగా ఇచ్చారు.
అత్యధిక రుణాలు పొందిన భీమవరం మండలం
రాష్ట్రంలోని
అన్ని జిల్లాలలో అత్యధికంగా రుణాలు ఇచ్చిన మండలాలను పరిశీలిస్తే పశ్చిమగోదావరి
జిల్లా భీమవరం మండలం రూ.191.55 కోట్ల రుణాలతో మొదటి స్థానంలో నిలిచింది. గుంటూరు
జిల్లా గుంటూరు మండలంలో 115.76 కోట్లు, కర్నూలు జిల్లా ఆదోని మండలంలో రూ. 81.11
కోట్లు, అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో రూ. 67.29 కోట్లు, శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం
మండలంలో రూ.25.44 కోట్లు, విజయనగరం జిల్లా సాలూరు మండలంలో రూ. 22.55 కోట్లు,
విశాఖపట్నం జిల్లా విశాఖ రూరల్ మండలంలో రూ. 24.97 కోట్లు రుణాలు ఇచ్చారు. తూర్పుగోదావరి
జిల్లా కాకినాడ అర్బన్ మండలంలో రూ. 53.06 కోట్లు, కృష్ణా జిల్లా విజయవాడ అర్బన్
మండలంలో రూ. 64.72 కోట్లు, ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలో రూ. 44.28 కోట్లు, నెల్లూరు
జిల్లా ఆత్మకూరు మండలంలో రూ.47.05 కోట్లు, చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో
రూ.34.41 కోట్లు, కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో రూ.55.26 కోట్లు రుణాలు
ఇచ్చారు.
గత ఏడాది మొదటి 3 స్థానాల్లో వెనుకబడిన జిల్లాలే!
ఇదిలా
ఉండగా, గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో 17,75,722 మంది రైతులకు రూ.11,870.32 కోట్లు
వెబ్ ల్యాండ్ రుణాలు ఇచ్చారు. గత ఏడాది మొదటి మూడు స్థానాలలో వెనుక బడిన జిల్లాలే
ఉన్నాయి. రూ.2,412.64 కోట్ల రుణాలతో అనంతపురం జిల్లా మొదటి స్థానంలో, రూ.1,468.46
కోట్లతో ప్రకాశం జిల్లా రెండవ స్థానంలో, రూ.1,404.59 కోట్లతో కర్నూలు జిల్లా మూడవ
స్థానంలో ఉన్నాయి.
జారీ చేసినవారు : సమాచార పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
No comments:
Post a Comment