· మొదటి
త్రైమాసికంలో వృద్ధి రేటు 12.26 శాతం
·
వ్యవసాయ రంగంలో 22.96 శాతం వృద్ధి
· మత్స్య పరిశ్రమలో 34.14 శాతం వృద్ధి
· రికార్డు
స్థాయిలో 349.54 శాతం పెరిగిన రొయ్యల ఉత్పత్తి
సమర్థవంతమైన పాలన, ఆర్థిక వృద్ధి
సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బహుముఖ వ్యూహాలు ఫలిస్తున్నాయి. పాలన
వేగవంతం చేసేందుకు ప్రారంభించిన ఏడు మిషన్లు (ప్రాధమిక రంగం, సామాజిక సాధికారిత,
పరిజ్ఞాన నైపుణ్యాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పారిశ్రమలు, మౌలికసదుపాయాలు, సేవల
రంగం), ఐదు గ్రిడ్లు (గ్యాస్, వాటర్, ఫైబర్, రోడ్, పవర్) మరో ఐదు (నీరు-చెట్టు,
బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, పేదరికంపై గెలుపు, పరిశుభ్ర-ప్రజారోగ్యం)
ప్రచార కార్యక్రమాలు నిర్ణీత వ్యవధిలో నిర్ధేశించిన లక్ష్యాలు చేరుకోవడానికి
ఉపయోగపడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మొదటి త్రైమాసిక (ఏప్రిల్-జూలై)
రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్ డీఫీ) రూ.1,10,583 కోట్లు లక్ష్యం కాగా, రూ.
రూ.1,07,099 కోట్లు నమోదైంది. అంటే 97 శాతం లక్ష్యానికి చేరుకోగలిగింది.
రాష్ట్ర ప్రణాళికా శాఖ విడుదల చేసిన
వివరాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో రాష్ట్రం స్థూల ఉత్పత్తి (జిఎస్
డిపి) వృద్ధి రేటు 10.99 శాతం సాధించి దేశంలోనే అగ్రభాగాన నిలిచింది. దేశ సగటు
వృద్ధి రేటు 7.57 శాతం కంటే 3.42 శాతం అధికంగా సాధించింది. ఈ ఏడాది 15.91 శాతం
వృద్ధి రేటు సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జీఏవీ (గ్రాస్
వ్యాల్యూ యాడెడ్) 12.26 శాతం వృద్ధి రేటు సాధించింది. గత సంవత్సరం మొదటి
త్రైమాసికంలో జీఏవీ రూ.95,403 కోట్లు ఉండగా, ఈ ఏడాది అదే కాలంలో రూ.1,07,099
కోట్లు నమోదైంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగంలో 22.96 శాతం, పరిశ్రమల రంగంలో 10.49
శాతం, సేవల రంగం 10.16 శాతం వృద్ధి రేటు నమోదయ్యాయి. వ్యవసాయం, దాని అనుబంధ
రంగాలలో గత ఏడాది మొదటి త్రైమాసికంలో జీఏవీ రూ.14,898 కోట్లు కాగా, ఈ ఏడాది అదే
కాలంలో 18,319 కోట్లుగా లెక్క తేలింది.
జాతీయ స్థాయిలో 7.30 శాతం వృద్ధి
కేంద్ర గణాంక కార్యాలయం విడుదల చేసిన
వివరాల ప్రకారం ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జాతీయ స్థాయిలో జీఏవీ రూ.27,38,318తో 7.30 శాతం వృద్ధి రేటు
నమోదైంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో 1.80 శాతం, పరిశ్రమల రంగంలో 6.03 శాతం,
సేవల రంగంలో 9.53 శాతం వృద్ధి రేటుగా లెక్క తేలింది.
మత్స్య పరిశ్రమ వృద్ధి రేటు 34.14
రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాలను
పరిశీలిస్తే ప్రధాన
వృద్ధి కారకం (గ్రోత్ ఇంజన్)గా ప్రభుత్వం గుర్తించిన మత్స్య పరిశ్రమ అత్యధికంగా 34.14
శాతం వృద్ధిరేటు సాధించి అగ్రభాగాన నిలిచింది. మంచి నీటి రొయ్యల ఉత్పత్తి రికార్డు
స్థాయిలో 349.54 శాతం పెరిగింది. లైవ్
స్టాక్ (పశువులు, గొర్రెలు, మేకల పెంపకం) రంగంలో 14.67 శాతం వృద్ధి రేటు నమోదైంది.
అలాగే పాల ఉత్పత్తిలో 14.24 శాతం, మాంసం ఉత్పత్తిలో 12.68 శాతం, గుడ్ల ఉత్పత్తిలో
14.95 శాతం పెరుగుదల కనిపించింది.
రాష్ట్రంలో
సరాసరి తలసరి ఆదాయం గత ఏడాదే లక్ష రూపాయలు దాటి రికార్డు సృష్టించింది.
పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో ఏపీ మొదటి స్థానానికి ఎగబాకింది. విద్యుత్ రంగంలో
లోటు నుంచి మిగులుకు చేరింది. 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందిస్తూ రికార్డు
నెలకొల్పింది. అన్ని రంగాలలో సమ్మిళిత వృద్ధితో స్థిరమైన రెండంకెల వృద్ధి
సాధించాలన్నది ప్రభుత్వ ధ్యేయం. ఆ దిశగా అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రణాళికలు ఆచరణలో
అద్వితీయమైన విజయాలు సాధిస్తున్నాయి. ఈ క్రమంలో 2022 నాటికి దేశంలో అత్యంత
అభివృద్ధి చెందిన మూడు రాష్ట్రాలలో ఒకటిగా ఏపీని నిలపాలన్న ప్రభుత్వ లక్ష్యం తప్పక
నెరవేరుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం అవసరంలేదు.
No comments:
Post a Comment