Nov 10, 2016

అమరావతి మెడలో నవ నగర మణిహారం



       ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి,  మండలాలలోని 25 రెవెన్యూ గ్రామల(29 గ్రామాలు)పరిధిలో 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎక్కడ ఏమి నిర్మించాలనేది ఈ మాస్టర్ ప్లాన్ లో పొందుపరిచారు. చారిత్రకంగా నాగరికత వెలసిల్లిన ప్రాంతాలు, నగరాలు అన్నీ నది ఒడ్డునే ఉన్నాయి. ఇప్పుడు మనకు నది ఒడ్డున ఇంతటి విశాల నగర నిర్మాణం జరగడం ఆంధ్రుల అదృష్టం.  అమరావతి మహానగరంలో అంతర్భాగంగా 9 నగరాలు నిర్మిస్తారు. అమరావతి లోపల చుట్టూ ఈ నవ నగరాలు ఓ మణిహారంలా ఉంటాయి. క్రమశిక్షణకు, పారదర్శకమైన పాలనలో పేరుగాంచిన సింగపూర్ ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ ను రూపొందించి గత మే నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉచితంగా అందజేసింది. ప్రపంచ శ్రేణి నగరంగా అభివృద్ధి చేయడానికి అనువుగా దీనిని తయారు చేశారు. రాజధాని అంటే కేవలం  పరిపాలనకే పరిమితం కాకుండా ఆర్థిక, సామాజిక, విద్య, వైద్యం, పరిశోధన, పర్యాటకం, ఆతిథ్యం, కళలు, సాంస్కృతిక, వాణిజ్య, సాంకేతిక కార్యకలాపాలకు ముఖ్య కేంద్రంగా నిలవాలన్నది సీఎం చంద్రబాబు నాయుడి ఆకాంక్ష. ఇవన్నీ వస్తే ఉపాధి అవకాశాలు వాటంతట అవే వస్తాయి.
      వాస్తవానికి  విభజన జరగడంతో రాష్ట్రం అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఇంకా ఎదుర్కొంటూనే ఉంది.  అయినా రాజధాని నిర్మించుకోవడం రాష్ట్రం తక్షణ కర్తవ్యం. ప్రణాళిక ప్రకారం రాజధాని నిర్మించుకునే అవకాశం కొద్ది మందికి మాత్రమే వస్తుంది. అటువంటి అవకాశం మనకు వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ఆధునికంగా నిర్మించిన నగరాల సరసన నిలిచేవిధంగా దీనిని నిర్మించతలంచారు చంద్రబాబు నాయుడు. అందుకే దేశంలోనే కాకుండా  ప్రపంచంలోని అనేక ప్రముఖ నగరాలను సందర్శించి, అక్కడి కట్టడాలను పరిశీలించారు. మన దేశంలోని గాంధీనగర్, జైపూర్, నయారాయ్ పూర్, ఛండీగఢ్, అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసి, ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రా, బ్రెజిల్ లోని బ్రాసిలియా, మలేషియాలోని పుత్రజయ, కిజకిస్తాన్ రాజధాని ఆస్థానా వంటి నగరాలను సీఎం స్వయంగా సందర్శించారు. అక్కడి కట్టడాలను వీక్షించారు. ఈ నగర ప్లాన్లను అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. వీటిలో కొన్ని వాటర్ ఫ్రంట్ నగరాలు, మరికొన్ని గ్రీన్ ఫీల్డ్ ప్లాన్డ్ నగరాలు ఉన్నాయి. ఆయా నగరాలలో కార్యకలాపాలను, ప్లాన్లను పరిశీలించిన తరువాత అమరావతి మహానగరంలో అంతర్భాగంగా 9 నగరాలుగా నిర్మించాలని నిర్ణయించారు. 1.ప్రభుత్వ పరిపాలన నగరం 2. న్యాయ నగరం 3. ఆర్థిక నగరం 4.విజ్ఞాన నగరం 5.ఎలక్ట్రానిక్స్ నగరం 6. ఆరోగ్య నగరం 7. ఆటల నగరం 8. మీడియా నగరం 9.పర్యాటక నగరం. దేశ,విదేశాలలో పలు నగరాలను చూసి, వాటి స్ఫూర్తితో ఈ విధంగా ప్రత్యేక నగరాలు నిర్మించాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. అంతేకాకుండా కట్టడాలన్నీ మన సంస్కృతి ప్రతిబింభించే విధంగా ఉండాలన్న అభిప్రాయంతో ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయా రంగాలకు సంబంధించిన అత్యంత ఆధునిక వసతులతోపాటు విద్య, వైద్యం, సాంకేతిక, రవాణా సౌకర్యాలన్నీ ఈ నగరాలలో అందుబాటులో ఉంటాయి. వివిధ అంశాలకు సంబంధించి 9 నగరాలు నిర్మించినప్పటికీ అన్ని నగరాలలో ఆయా అంశాలు అందుబాటులో ఉంటాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. విశాలమైన రోడ్లు, వాటిలో సైకిల్ ట్రాక్ లు,  పచ్చదనం పరిచినట్లు పచ్చికబయళ్లు, పూల మొక్కలు, చల్లదనాన్ని ఇచ్చే చెట్లు, ఫౌంటెన్లు.... ఇలా అందమైన ఓ సుందర నగరం ఏర్పడుతుంది.  ఈ నగరాలను కలుపుతూ మెట్రో రైలు మార్గం నిర్మిస్తారు.


         ప్రస్తుతానికి సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అందించినప్పటికీ, ఈ 9 నగరాలలో నిర్మించే భవనాలకు సంబంధించిన ప్లాన్లను ఆమోదించవలసి ఉంది. ఆయా భవనాల ఆకృతులు రూపొందించవలసిందిగా అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ ను ప్రభుత్వం కోరింది. మలేషియాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హ్యారిస్ గ్రూప్ కంపెనీల’ చైర్మన్ హ్యారిస్  అమరావతి రాజధానిలో వివిధ భవనాల కోసం రూపొందించిన ఆకృతులను గత నెలలో సీఎం చంద్రబాబు నాయుడుకు  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. వివిధ దేశాలలో పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన అనుభం ఉన్న ఈ సంస్థ  రాజధానిలో నిర్మించే ట్విన్ టవర్స్ కు సంబంధించి పలు నమూనాలు చూపించింది.  ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, చరిత్ర, కళలు, బౌద్ధిజం.. మొదలైన అంశాలు ప్రతిబింబించేవిధంగా వాటిని రూపొందించారు. అయితే సీఎం వాటిని ఖరారు చేయలేదు. మరి కొందరు అంతర్జాతీయ ఆర్టిటెక్ట్ లు రూపొందించిన ప్లాన్లను కూడా చూసి, ఉత్తమమైన వాటిని ఎంపిక చేయాలన్న ఆలోచనతో సీఎం ఉన్నారు. ప్లాన్లు ఖరారైన తరువాత, నగరాల నిర్మాణానికి ప్రభుత్వం  టెండర్లను పిలుస్తుంది. ఇప్పటికే రాజధానిలో కొన్ని రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. మరికొన్ని రోడ్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవనున్నట్లు సీఆర్డీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ చెప్పారు. రోడ్ల నిర్మాణం జరిగి, భవనాల నిర్మాణం కూడా మొదలైతే ఈ ప్రాంతంలోని స్థలాలకు మంచి ధరలు వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చి, ఫ్లాట్లు పొందిన రైతులు లాభపడే అవకాశం ఉంది. ఇదంతా జరగడానికి రెండు మూడేళ్ల సమయం పడుతుందని జైన్ చెప్పారు. 
   విజయవాడ, గుంటూరుల నుంచే కాకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి కూడా అమరావతికి అనుసంధానం చేస్తూ ఆరు లైన్ల రోడ్లు నిర్మిస్తారు.  రాజధాని అమరావతి అభివృద్ధి కోసం సింగపూర్, జపాన్, చైనా, రష్యా, యునైటెడ్ కింగ్ డమ్ తదితర దేశాలతోనూ, అంతర్జాతీయ వ్యాపార సంస్థలతోనూ వాణిజ్యం, పెట్టుబడులు, ఉమ్మడి సంస్థలు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రణాళికలు, స్మార్ట్ నగరాలు, సంప్రదాయేతర ఇంధన వనరులు, విద్య, వైద్యం, పర్యావరణం, రవాణా వ్యవస్థలు, సామాజిక సంక్షేమం మొదలైన రంగాలలో పరస్పర సహకారం కొరకు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఇంకా చేసుకుంటూనే ఉంది. ఈ 9 నగరాల నిర్మాణం పూర్తి అయితే మహాఅద్భుతంగా అమరావతి మహానగరం రూపుదిద్దుకుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరంలేదు. 

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...