Nov 23, 2016

అమరావతిలో సుందరీకరణ మొదలు


·       వెలగపూడితోనే ప్రారంభం
·       కడియం, బెంగళూరు, కోల్ కత్తాల నుంచి మొక్కలు
·       వెలగపూడిలో రూ.4.5 కోట్లు, తుళ్లూరులో రూ.80 లక్షల ఖర్చు
·       శంకుస్థాపన ప్రదేశానికి ఉద్యానవన శోభ
     
       నూతన రాజధాని అమరావతిలో పచ్చదనం, సుందరీకరణ పనులు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఈ మహానగరాన్ని అత్యంత ఆధునికంగా, సకల సౌకర్యాలతో పచ్చదనం, జలకళ(బ్లూ-గ్రీన్) ఉట్టిపడేవిధంగా అద్భుతంగా నిర్మించాలన్న ధృడ సంకల్పంతో ఉన్నారు. అందులో భాగంగానే వెలగపూడి గ్రామం వద్ద తాత్కాలిక సచివాలయం(ఐజీసీ-ఇంటెర్మ్ గవర్నమెంట్ కాంప్లెక్స్) నిర్మించారు. రాజధాని నిర్మాణం తొలిదశ పనులు త్వరితగతిన జరిగే ఏర్పాట్లు చేశారు.  పచ్చికబయళ్లు, మోండో గడ్డి, మొక్కల పెంపకం, నడక దారుల నిర్మాణం వంటి సుందరీకరణ పనులు కూడా వెలగపూడి నుంచే ప్రారంభించారు. ఐజీసీ, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం పరిసరాలన్నీ ఆహ్లదకరంగా ఉండేవిధంగా అనువైన  వాతావరణం కల్పించడానికి  పచ్చదనం పరుస్తున్నారు. ఇందుకోసం తాత్కాలిక సచివాలయంలోని 5 బ్లాకులతోపాటు పరిసరాలలో 4 కోట్ల 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పనులు జరుగుతున్నాయి. బ్లాకులవారీగా పచ్చదనం నింపుతున్నారు.  ఇప్పటికే రకరకాల పూల మొక్కలు, పచ్చని చెట్లతో కళకళలాడుతోంది.
కడియం, బెంగళూరు, కోల్ కత్తాల నుంచి మొక్కలు
     పూల మొక్కలకు ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడియం, కోల్ కత్తా, బెంగళూరుల నుంచి  పలు రకాల మొక్కలు తెస్తున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 92 వేల మొక్కలు నాటి కనువిందు చేయనున్నారు. 32,469 చదరపు మీటర్లలో పచ్చికబయళ్లు ఏర్పాటు చేస్తున్నారు. 42వేల మోండో గడ్డి మొక్కలు పెంచడానికి ఏర్పాట్లు చేశారు. ఒక కిలో మీటర్ వాకింగ్ ట్రాక్ నిర్మించనున్నారు. మరో 1342 మొక్కలతో నేలంతటినీ పచ్చదనంతో నింపారు. వందల రకాల పూల మొక్కలతోపాటు గడ్డి మొక్కలను కూడా తీసుకువస్తున్నారు.  ఇక్కడ ఏర్పాటు చేయతలపెట్టిన పార్కులలో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొక్కల పెంపకానికి కావలసిన మట్టిని తీసుకువచ్చి, చదును చేసి సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి బ్లాక్‌ ఎదురుగా రెండున్నర ఎకరాల్లో పార్కును ఏర్పాటు చేస్తారు. ఈ పార్క్‌ ని రకరకాల పూల మొక్కలతో నింపుతారు. వాటిలో కొన్ని 360 రోజులూ పూస్తూనే ఉంటాయి.  పౌంటేన్లు ఏర్పాటు చేస్తారు.  పచ్చికబయళ్లు ఏర్పాటు చేస్తారు.  శాసనసభ  భవనం ముందు కూడా పార్కు ఏర్పాటు చేయడానికి పనులు జరుగుతున్నాయి. 

పచ్చదనంతో నిండిన తుళ్లూరు చెరువు పరిసరాలు
        
  తుళ్లూరులో చెరువు పరిసరాలను పచ్చదనంతో నింపేస్తున్నారు. ఇక్కడ 80 లక్షల రూపాయల అంచనాలతో పనులు చేపట్టారు. వివిధ రకాల 107 మొక్కలు నాటారు. 8,421 పూలు పూసే గుబురు మొక్కలను ఏర్పాటు చేస్తున్నారు. 646 కొబ్బరి చెట్లు నాటారు.  2,200 చదరపు మీటర్ల స్థలంలో పచ్చికబయళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఆకర్షణీయంగా, అత్యంత సుందరంగా తీర్చిదిద్దడానికి  వివిధ రూపాలలో కత్తిరించిన (టాపియరీ) 98 మొక్కలను ఏర్పాటు చేస్తారు.


                                 వెలగపూడి  వద్ద తాత్కాలిక సచివాలయం
                             శంకుస్థాపన ప్రదేశానికి ఉద్యానవన శోభ
           
 నూతన రాజధాని నిర్మాణానికి ఉద్దండరాయునిపాలెంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాన చేసిన ప్రదేశం పూల తోటను మరిపించేవిధంగా రూపొందిస్తున్నారు. ఇక్కడ 2,168 చదరపు మీటర్ల ప్రాంతాన్ని పచ్చికబయళ్లుతో నింపుతున్నారు. మరో 260 చదరపు మీటర్ల ప్రాంతంలో మొక్కలను ఆకర్షణీయంగా కత్తిరించి హద్దుగోడలు ఏర్పాటు చేస్తారు. అలాగే 50 చదరపు మీటర్ల నేలని పచ్చదనంతో నింపుతారు. వివిధ రకాల 12 మొక్కలను కూడా నాటారు.


జారీ చేసినవారు: రిసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగం,  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
apspecialnews@gmail.com

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...