Nov 10, 2016

మెరైన్ ఎగుమతుల్లో ఏపీ నెంబర్ 1

             
§  ఏపీ నుంచి రూ. 9,328 కోట్ల విలువైన ఎగుమతులు
§  అధిక భాగం రొయ్యలే!
§  విశాఖ నుంచి 1,28,718 టన్నుల ఎగుమతి 
§కృష్ణపట్నం నుంచి 38,412 టన్నుల ఎగుమతి
§  ఎక్కవగా అమెరికాకు ఎగుమతి
§  రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో మెరైన్ రంగం కీలకం
§  ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో అధిక లాభం
§  మెరైన్ బోర్డు ఏర్పాటుయత్నం
  
  మెరైన్ ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోకెల్లా అత్యున్నత స్థానంలో ఉంది. కేంద్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని  మెరైన్ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపీఈడీఏ) తాజా లెక్కల ప్రకారం 2015-16 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 9,45,892 మెట్రిక్ టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.  రూ.30,420.83 కోట్ల ఆదాయం లభించింది. ఎగుమతి అయినవాటిలో ఎక్కువ భాగం రొయ్యలు, చేపలు ఉన్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 5.6 బిలియన్ల అమెరికన్ డాలర్ల ఆదాయం వస్తుందని ఎంపిఈడిఎ అంచనా. సముద్ర ఉత్పత్తులు భారత ఆర్ధిక వ్యవస్థకు గొప్ప వరం. మన దేశంలో 8,129 కిలో మీటర్ల సుదీర్ఘమైన తీరప్రాంతం ఉంది. 9 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్న ఈ తీర ప్రాంతంలో  దాదాపు 31 లక్షల టన్నుల సముద్ర ఉత్పత్తులకు అవకాశం ఉంది.
        రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి తడ వరకు 9 జిల్లాలలో 974 కిలో మీటర్ల సముద్రతీర ప్రాంతం ఉంది. సముద్రం ఉత్పత్తులను పెంచుకోవడానికి అవకాశం మెండుగా ఉంది. ఈ రంగం ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంది.  2015-16లో ఏపీ నుంచి రూ. 9,328 కోట్ల విలువైన 1,67,130 టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.  వీటిలో 98,553 టన్నులు ఒక్క అమెరికాకే ఎగుమతి అయ్యాయి. సముద్ర ఉత్పత్తుల మొత్తం  ఎగుమతులలో  అత్యధిక భాగం 1,58.100 టన్నులు రొయ్యలే ఉన్నాయి. విశాఖపట్నంలో రిజిస్టర్ అయిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులు 61 మంది ఉన్నారు. 2015 -16లో విశాఖపట్నం ఓడ రేవు నుంచి రూ. 7,161 కోట్ల విలువైన 1,28,718 టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. అంతకు ముందు సంవత్సరం 1,15,672 టన్నులు ఎగుమతి అయ్యాయి. 11.28 శాతం వృద్ధి కనిపించింది.  దేశంలో మెరైన్ కార్గోలను  పంపే మేజర్ పోర్టులలో విశాఖపట్నం పోర్ట్ ఒకటి.  కృష్ణపట్నం నుంచి రూ.2,167 కోట్ల విలువైన 38,412 టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. అంతకు ముందు సంవత్సరం 30,690 టన్నులు ఎగుమతి అయ్యాయి. 25.16 శాతం అధికంగా ఎగుమతులయ్యాయి. ఈ లెక్కల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక అభివృద్ధికి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు కీలకం కానున్నాయి.   

       వనామీ, బ్లాక్ టైగర్ వంటి అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నటువంటి విభిన్న వెరైటీల రొయ్యల ఎగుమతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.  ఆక్వా రంగంలో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఆధునిక పద్దతులను అమలు చేయడం ద్వారా ఈ ఏడాది నుంచి ఆదాయాన్ని మరింత పెంచుకొనే వ్యూహరచన చేసింది.  గత నెలలో మూడు రోజుల పాటు విశాఖపట్నంలో జరిగిన 20వ అంతర్జాతీయ సముద్ర ఉత్పత్తుల ప్రదర్శన కూడా ఈ రంగంలో నాణ్యమైన ఉత్పత్తులు, ఎగుమతులు పెరగడానికి దోహదపడుతుంది. ఈ ప్రదర్శనలో దేశవిదేశాలకు చెందిన మూడు వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. 300 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన ద్వారా రాష్ట్రంలోని వ్యాపారులు, రైతులు సముద్ర ఉత్పత్తుల దిగుబడిని పెంచడంలో అనుసరించే ఆధునిక పద్దతులను, ప్రొసెసింగ్, రవాణా, ఎగుమతులలో మెళకువలను తెలుసుకున్నారు. ఈ ప్రదర్శన ద్వారా రాష్ట్రం దేశవిదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షించగలిగింది.
      భారత్ సముద్ర ఉత్పత్తులు ఎక్కువగా అమెరికా దిగుమతి చేసుకుంటుంది. అమెరికాకి దిగుమతి అయ్యే సముద్ర ఉత్పత్తుల్లో భారత్ వాటా 28.46 శాతం.  గడచిన ఏదాడి 1,53,695 టన్నుల సముద్ర ఉత్పత్తులు అమెరికా ఇక్కడి నుంచి దిగుమతి చేసుకుంది. ఆగ్నేయాసియా దేశాలు 24.59 శాతం ఉత్పత్తులను ఇక్కడ నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. యూరోపియన్ యూనియన్ దేశాలు 20.71 శాతం, జపాన్ 8.61 శాతం, మధ్య ఆసియ 5.90 శాతం, చైనా 4.71 శాతం, ఇతర దేశాలు 7.03 శాతం సముద్ర ఉత్పత్తులను భారత దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి.
          
ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
            ఆక్వా రైతులకు మంచి లాభాలు తెచ్చి పెట్టె వాటిలో ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు ప్రధానమైనవి. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆక్వా రైతులు తమ ఉత్పత్తులను చెన్నై లేదా విశాఖపట్నం నుంచి మాత్రమే ఎగుమతి చేస్తున్నారు. రవాణాకు ఆరు గంటలకు పైగా సమయం పట్టడం వల్ల ఉత్పత్తుల నాణ్యతపై దాని ప్రభావం పడుతోంది. మెరైన్ ఉత్పత్తులను యురోపియన్ యూనియన్ ప్రమాణాల ప్రకారం శుద్ధి చేయాలి. మన దేశం నుంచి దాదాపు వంద దేశాలు మెరైన్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. వారు నాణ్యత ప్రమాణాలపై ఎక్కువ దృష్టి పెడతారు. ఆక్వా ఉత్పత్తులకు విలువ మరింత పెరగాలంటే ప్రాసెసింగ్ యూనిట్లు ఉపకరిస్తాయి. ఉత్పత్తి భారీగా  ఉన్నప్పుడు రైతులు వాటిని తక్కువ ధరకే అమ్మకోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అటువంటి సమయంలో ప్రాసెసింగ్ యూనిట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. మంచి ధర లభించే అవకాశం ఉంటుంది. సముద్ర ఉత్పత్తులు (చేపలు, రొయ్యలు) లభ్యమయ్యే ప్రాంతాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల వల్ల పర్యావరణానికి ముప్పు ఉండదన్న అభిప్రాయం కొందరిలో ఉంది. అయితే అది వాస్తవం కాదు. అలాంటి ప్రమాదం ఏమీ లేదని  రాష్ర కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది. ఈ యూనిట్లు ఆరెంజ్ కేటగిరీ కింద వస్తాయి.  అందువల్ల వీటి నుంచి చాలా తక్కువ కాలుష్యం వెలువడుతుంది. శుద్ధి తర్వాత విడుదలయ్యే జలాలు పంటల సాగుకు కూడా ఉపయోగించుకోవచ్చు.

 మెరైన్ బోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలు

           రాష్ట్రంలో మెరైన్ బోర్డు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో మాత్రమే ఇటువంటి బోర్డు ఉంది.  ఆ రాష్ట్రంలో 720 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. 1996లో మహారాష్ట్ర ప్రభుత్వం మారిటైమ్ బోర్డును ఏర్పాటు చేసింది. ఏపీలో మెరైన్ బోర్డు ఏర్పాటైతే సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉంటుంది.  సముద్రతీర ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన,  ఓడరేవుల నిర్వహణ, వాటి అభివృద్ధి, హార్బర్సలో ట్రాఫిక్ నియంత్రణ, సముద్ర జలాలకు సంబంధించిన వ్యవహారాలను ఈ బోర్డు చూసుకుంటుంటుంది.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రష్యా పర్యటనలో రాష్ట్రంలో మెరైన్ రంగం అభివృద్ధికి దోహదపడే చర్చలు జరిగాయి. మెరైన్ రంగంలో ఏపికి సంపూర్ణ సహాయ సహకారాలు అందజేసేందుకు  రష్యాకు చెందిన యునైటెడ్‌ షిప్‌బిల్డింగ్‌ కార్పొరేషన్‌ తన సంసిద్ధత తెలిపింది. 

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...