Jan 5, 2020

జీఎన్‌రావు  కమిటీ నివేదిక
13.09. 2019 : అమరావతి సహా అన్ని జిల్లాలు, ప్రదేశాలు సమానంగా అభివృద్ధి చెందేందుకు ఉపకరించే సలహాలు, సూచనలివ్వాలంటూ జి.ఎన్‌.రావు కమిటీ ఏర్పాటు. కమిటీ కన్వినర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎస్ రావు,  సభ్యులుగా ప్రొఫెసర్ మహవీర్, డాక్టర్ అంజలీ మోహన్, డాక్టర్ శివానందరెడ్డి, ప్రొఫెసర్ కేటీ రవిచంద్రన్, ప్రొఫెసర్ అరుణాచలం.
v 08.11.2019 జీఎన్‌ రావు కమిటీకి భారీగా లేఖలు, ఈమెయిల్స్‌(ఆంధ్రజ్యోతి): జి.ఎన్‌.రావు కమిటీకి ఇప్పటి వరకు సుమారు 25 వేల లేఖలు, ఈ-మెయిల్స్‌ అందినట్లు  తెలిసింది. 13 జిల్లాలూ సరిసమానంగా పురోగమించేందుకు తోడ్పడే వినతులు కూడా ఉన్నట్లు సమాచారం.
v రాజధాని కమిటీని రద్దు చేయమని  హైకోర్టులో గుంటూరు రైతుల పిటిషన్‌ : రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జీఎన్‌రావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీని రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా బోరుపాలెం గ్రామానికి చెందిన రైతులు సీహెచ్‌ శివలింగయ్య, సీహెచ్‌ రామారావు హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ సీఆర్‌డీఏ చట్ట నిబంధనలకు విరుద్ధంగా కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. చట్టసభ ద్వారా ఏర్పాటైన సీఆర్‌డీఏపై పునఃసమీక్ష జరిపే అధికారం కూడా ఈ కమిటీకి లేదని పిటిషన్‌లో వివరించారు. ఈ నేపథ్యంలో కమిటీని నియమిస్తూ జారీచేసిన జీవోను రద్దు చేయాలని అభ్యర్థించారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిని తరలించినా, నిర్మాణం ఆలస్యం చేసినా భూములిచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు.
నివేదిక సమర్పణ
v 20.12.2019 : జీఎన్‌రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ రాష్ట్రంలో 10,600 కిలోమీటర్లు పర్యటించి, 125 పేజీలతో కూడిన నివేదిక ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి  అందజేసింది.
v   మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్‌లో ఉన్నట్లు రాష్ట్రంలో అమరావతి, విశాఖపట్నంలో శాసన (లెజిస్లేచర్‌) వ్యవస్థ ఉండాలి.  శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేయాలి.

v అసెంబ్లీ అమరావతిలో ఉన్నా.. వేసవికాల సమావేశాలు విశాఖలో, శీతాకాల సమావేశాలు అమరావతిలో నిర్వహించాలి.
v  విశాఖలో సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాలు, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుచేయాలి.
v అమరావతిలో హైకోర్టు బెంచ్, సీఎం క్యాంపు కార్యాలయం, రాజ్‌భవన్‌ ఉండాలి.
v అమరావతిలో భూమి తీరు, వరద ప్రభావం తదితర అంశాల కారణంగా రాజధాని కార్యకలాపాలను ఇతర నగరాలకు వికేంద్రీకరించాలి. ఇక్కడ దాదాపుగా పూర్తయిన నిర్మాణాలను వినియోగంలోకి తీసుకురావాలి.
v అమరావతిలో ప్రతిపాదిత నిర్మాణాల్ని తగ్గించాలి. ఎన్జీటీ ఆదేశాల ప్రకారం రివర్‌ ఫ్రంట్‌ నిర్మాణాలు ఉండరాదు.
v   సీడ్‌ యాక్సిస్‌ రోడ్డును జాతీయ రహదారికి అనుసంధానించాలి.
v  నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
v నివేదిక ప్రకారం విజయనగరంతో కలిపి విశాఖపట్నం మెట్రో రీజన్‌ఏర్పాటు
v విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు.
v . సచివాలయం, అసెంబ్లీ(వేసవికాల) విజయనగరంలో ఏర్పాటు..
v అమరావతిలో హైకోర్టు ధర్మాసనం ఉంటుంది. మంగళగిరి కాంప్లెక్స్‌ లో సీఎం క్యాంప్‌ కార్యాలయం, రాజ్‌ భవన్‌ ఉంటాయి. అసెంబ్లీ శీతాకాల, వర్షాకాల సమావేశాలు ఇక్కడ జరుగుతాయి.
v కర్నూలులో ప్రధానమైన హైకోర్టు ఉంటుంది. దీనికి అనుబంధంగా 2 వేర్వేరు ధర్మాసనాలు ఏర్పాటవుతాయి.
v సచివాలయాన్ని విశాఖ, అమరావతిలో సమాంతరంగా నడపాలి.  
v ట్రైబ్యునళ్లను కూడా 3 నగరాల మధ్య విభజించాలి.
v   జీఎన్‌రావు  : పట్టణీకరణంతా మధ్య, ఉత్తర కోస్తాలోనే కేంద్రీకృతమైంది. దక్షిణకోస్తా, సీమ ప్రాంతాల్లో పట్టణీకరణ తక్కువ. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ ఏపీకి తప్పనిసరి. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఏపీని నాలుగు ప్రాంతాలుగా చూడాలి. శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఉండాలి. అమరావతిలో టెంపరరీ అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ మాత్రమే. వరద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కేంద్రీకరించకూడదు. పర్యావరణానికి చేటు చేయని అభివృద్ధి ఉండాలి.  సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీస్, అసెంబ్లీ విశాఖలో ఉండాలి. హైకోర్ట్ బెంచ్‌, అసెంబ్లీ భవనం, రాజ్‌భవన్‌ అమరావతిలో ఉండాలి, హైకోర్టు కర్నూలులో ఉండాలి.
v అమరావతిలో రాజధానికి సంబంధించిన నిర్మాణాలు వద్దు. ఇప్పటికే పెట్టిన వ్యయం వృథా కాకుండా చూడాలి. తుళ్లూరు ప్రాంతంలో గత ప్రభుత్వం చాలా పెట్టుబడి పెట్టింది. అందువల్ల ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణాల్ని పూర్తి చేసి శాఖల వారీగా వాడుకోవాలి.
v ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న పనులను సమీక్షించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. మొత్తం నిధులు అమరావతిలోనే కేంద్రీకరించడం సరైంది కాదు. పర్యావరణ సమస్యలున్న చోట అభివృద్ధి పనులు తగ్గించాలి. అవసరం మేరకే క్వార్టర్లు, అపార్ట్‌ మెంట్లు నిర్మించాలి. అమరావతిలో డిజైన్లన్నీ భారీ ఖర్చుతో కూడినవి కావడంతో వీటిని మార్చి.. ఉన్న వనరులతో మిగతా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలి.
v  డిజైన్లను మరోసారి పునఃపరిశీలించాలి. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ నేపథ్యంలో అవసరాల మేరకు ప్రభుత్వ విభాగాల కోసం భవనాలు నిర్మించాలి. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అదే విధానం అవలంబించాలి. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించుకునేలా, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ తర్వాత ఇక్కడ ఉండాల్సిన ప్రభుత్వ విభాగాలు కార్యకలాపాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు ఉండాలి. అమరావతి ప్రాంతంలో రైతులంతా తమకు భూములు ఇవ్వాలని కోరారు. అదే విషయాన్ని ప్రభుత్వానికి సూచించాం.
v   2 వేల మంది రైతులతో మాట్లాడాం: జీఎన్‌ రావు
రాజధాని, అభివృద్ధి అంశాలపై కమిటీ సభ్యులమంతా అధ్యయనం చేశాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించాం. ప్రజాభిప్రాయ సేకరణకు అనుగుణంగా నివేదిక ఇచ్చాం. రాష్ట్రంలో చాలా ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు చాలా వెనకబడితే.. మరికొన్ని అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. వాటి మధ్య సమతూకం సాధించాలి. ఇందుకోసం రెండంచెల వ్యూహాన్ని సూచించాం. ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘమైన తీర ప్రాంతంతో పాటు పలు నదులు, అడవులు ఉన్నాయి. అభివృద్ధి వల్ల పర్యావరణం పాడవకుండా పలు సూచనలు చేశాం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అందుకే అన్ని ప్రాంతాల్ని దృష్టిలో పెట్టుకుని సూచనలు ఇచ్చాం. మాకు మొత్తం 38 వేల విజ్ఞాపనలు అందగా.. 2 వేల మంది రైతులతో నేరుగా మాట్లాడాం.
v జిల్లాలకు వెళ్ళి.. అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారో అన్న దానిపై ప్రజాభిప్రాయ సేకరణ చేశాం. వాటికి అనుగుణంగా అంతా ఒకేచోట కాకుండా అందరికీ అన్నీ అనుకూలంగా ఉండేలా సూచనలు చేశాం. సమగ్ర పట్టణాభివృద్ధి, ప్రణాళిక కోసం ప్రయత్నించాం.  పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని నాలుగు రీజియన్‌లుగా విభజించాలని సూచించాం. తుళ్లూరు ప్రాంతానికి వరద ముప్పు ఉంది. రాజధానికి అనుకూలం కాదు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన భూమిని ఇవ్వాలి. రాజధాని ఎక్కడో చెప్పడం మా పని కాదు. సుస్ధిర అభివృద్ధి లక్ష్యంగా ప్రాంతాల వారీగా అభివృద్ధి, సమతుల్యతపై కొత్త మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేశాం.  మేము రైతులతో మాట్లాడలేదన్నది అవాస్తవం.
v  ప్రాంతీయ అసమానతల్ని తగ్గించాలి : జీఎన్ రావు
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం మెరుగైన సూచనలు చేశాం. ఆంధ్రప్రదేశ్‌లో పట్టణీకరణ మధ్య, ఉత్తర కోస్తాలోనే ఉంది. అందువల్ల ప్రాంతాల మధ్య అభివృద్ధిసమతూకంపై అధ్యయనం చేసి సూచనలిచ్చాం. అదే సమయంలో రాష్ట్రంలోని అభివృద్ధి వల్ల పర్యావరణం దెబ్బతినకూడదు. పర్యావరణాన్ని రక్షించుకుంటూనే అభివృద్ధి సాగాలి. రాష్ట్రంలో రాయలసీమ బాగా వెనకబడడంతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా తీరానికి దూరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. అడవుల్ని పరిరక్షించడంతో పాటు మరిన్ని పెంచాలి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడాన్ని ప్రోత్సహించకూడదు. బీడు భూములను వినియోగంలోకి తీసుకురావాలి.
v తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి
రాష్ట్రంలోని విశాల తీర ప్రాంతంతో పాటు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు దాదాపు 900 కి.మీ. తీర ప్రాంతమంతా అభివృద్ధి చేయాలి. ఆర్థిక పురోగతితో పాటు, ఉపాధి కల్పన దిశగా పనులు చేపట్టాలి. గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి, మహేంద్రతనయ తదితర నదుల పరీవాహక ప్రాంతాలను అభివృద్ధి చేసి.. అక్కడ అన్ని వసతులు కల్పించాలి. ఈ ప్రక్రియలో భాగంగా కాలువల్ని అభివృద్ధి చేయడంతో పాటు కొత్త వాటి నిర్మాణం చేపట్టాలి.
v  రాయలసీమలో అనంతపురం, కర్నూలు జిల్లాలను అభివృద్ధి చేయడం ద్వారా ప్రాంతీయ అసమానతలు తగ్గించేందుకు కృషి చేయాలి. అమరావతిలోని కొన్ని అధికార వ్యవస్థలను ఆ ప్రాంతానికి తరలించడం ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి చెంది అక్కడి ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
v  అన్ని జిల్లాల్లోని సహజ వనరుల మేరకు సమగ్ర మార్గదర్శకాలను రూపొందించి అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించాలి.
v  గిరిజనులు, మత్స్యకార వర్గాలకు కూడా తగిన ప్రాధాన్యమిస్తూ వారి అభివృద్ధికి అనుగుణంగా పెట్టుబడి, అభివృద్ధి ప్రణాళిక తయారుచేయాలి.
v  రాయలసీమలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను అత్యధిక ప్రాధాన్యమిచ్చి పూర్తి చేయాలి. ఆ ప్రాంతంలో జలవనరుల్ని పూర్తి సామర్థ్యం మేరకు సద్వినియోగం చేసుకోవాలి.
v   పొడవైన తీర ప్రాంతంలోని వైవిద్య భరితమైన పర్యావరణం, మడ అడవులు, బీచ్‌ల్ని పరిరక్షిస్తూ అభివృద్ధి చేయాలి.
v   పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ కొత్త పోర్టులు ఏర్పాటు చేయాలి. రెండు పోర్టుల మధ్య కనీస దూరం, రోడ్డు, రైలు సౌకర్యాల్ని దృష్టిలో పెట్టుకుని కొత్త పోర్టులు నెలకొల్పాలి.
v   విద్యుత్‌ సరఫరా సమస్యలు తలెత్తకుండా, ప్రభుత్వమే సౌర విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరాపై దృష్టి పెట్టాలి.
v పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలి. తక్కువ వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. అనంతరం అధిక వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టి పూర్తి చేయాలి. తద్వారా ఎక్కువ ఆయకట్టుకు నీటిని అందించవచ్చు.
v   డెల్టా కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. లీకేజీలు అరికట్టి.. ఆయకట్టుకు సమర్ధంగా నీటిని అందించేందుకు కాలువల వ్యవస్థను ఆధునికీకరించాలి.
v  పరీవాహక ప్రాంతం ఆధారంగా గొలుసుకట్టు చెరువులను మైక్రో వాటర్‌షెడ్‌ విధానంలో అభివృద్ది చేయాలి. నీటి యాజమాన్య పద్ధతులను అమలు చేసి.. అధిక ఆయకట్టుకు నీటిని అందించడంపై దృష్టి సారించాలి.
v   రోడ్ల విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చెట్లను నరికేస్తున్న నేపథ్యంలో భారీగా చెట్ల పెంపకాన్ని చేపట్టి.. పచ్చదనాన్ని పెంచాలి.
v  ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు  
1.     ఉత్తరాంధ్ర:  శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం
2.      మధ్య కోస్తా: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా
3.     దక్షిణ కోస్తా: గుంటూరు, ప్రకాశం, నెల్లూరు
4.     రాయలసీమ: వైఎస్సార్, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం
v అన్ని ప్రాంతాల అభివృద్ధికి వనరులు, అవకాశాలకు అనుగుణంగా విస్తృత విధానాలు, వ్యూహాలు అమలు చేసి ప్రాంతీయ సమానాభివృద్ధి సాధించాలి.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...