Mar 7, 2018

రాష్ట్రాభివృద్ధిపై కేంద్రానికి చిత్తశుద్ధిలేదు



ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ రెడ్డి
             సచివాలయం, మార్చి 7: కేంద్రానికి మన రాష్ట్రంపై అంకిత భావం గానీ, అభివృద్ధి విషయంలో చిత్తశుద్ధి గానీ లేదని ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ రెడ్డి విమర్శించారు. శాసనసభా ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం ఉదయం ఆయన మాట్లాడారు. విభజన హామీలకు సంబంధించిన 19 అంశాలను కేంద్రం వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 29 సార్లు ఢిల్లీ వెళ్లి హామీల విషయం గుర్తు చేసి వేడుకున్నా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు. రాష్ట్రాభివృద్ధికి తాము నిధులు కావాలని కోరితే,  సైనికులకు కేటాయించిన బడ్జెట్లో నుంచి ఇవ్వాలా? అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెటకారంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. బుందేల్ ఖండ్ కి రూ.20 వేల కోట్లు, ఎన్నికల  ముందు ఉత్తరప్రదేశ్ కు రూ.80 వేల కోట్లు ప్రకటించారని, తమకు ఎందుకు ఇవ్వరో  సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు కాంగ్రెస్ అన్యాయం చేసి మట్టి కరిసిందని,  అదే పరిస్థితి మీకు వస్తుందని హెచ్చరించారు.
పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కు రూ.7740 కోట్లు ఇవ్వాలని, అయితే ఇప్పటికి రూ.4321 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు.  రాష్ట్రానికి రావలసిన 11 జాతీయ సంస్థలలో ఇంకా 2 పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. రాజధాని నిర్మించే బాధ్యత తనదేనన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికి  భవనాల నిర్మాణానికి కేవలం రూ. 1500 కోట్లు, డ్రైనేజీ నిర్మాణానికి రూ.1000 కోట్లు ఇచ్చారని వివరించారు.  పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలకు విలువలేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. బలం ఉందిగదా అని హామీలు నెరవేర్చకపోతే ప్రజలు దానికి తగిన విధంగా స్పందిస్తారని పల్లె హెచ్చరించారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...