ఆంధ్రప్రదేశ్ లో మత్స్య పరిశ్రమ అభివృద్ధి
పథంలో దూసుకుపోతోంది. ఉత్పత్తిలోనూ, ఉపాధి అవకాశాల కల్పనలోనూ ఈ రంగం మంచి ఫలితాలను
సాధిస్తోంది. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో ఏపీ దేశంలో అగ్రగామిగా నిలిచింది. మంచినీటి
చేపలు, ఉప్పునీటి (బ్రేకింగ్ వాటర్) రొయ్యలు, ‘వనమి’ రొయ్యల
ఉత్పత్తిలో ఏపీదే అగ్రస్థానం. రాష్ట్రంలో
రెండంకెల స్థిరమైన వృద్ధి రేటును సాధించేందుకు మత్స్య పరిశ్రమను ప్రధాన వృద్ధి
కారకం (గ్రోత్ ఇంజన్)గా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. అదేవిధంగా ఏడాదికేడాది వృద్ధి
రేటు గణనీయంగా పెరుగుతోంది.
అర్ధ సంవత్సరంలో 47.57 శాతం వృద్ధి రేటు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి
ప్రణాళికా సంఘం వారు 2011-12 ధరల ఆధారంగా ఏపీలో చేపలు, రొయ్యల స్థూల ఉత్పత్తిని
లెక్కకడతారు. ఆ వివరాల ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.17,621 కోట్ల
ఉత్పత్తితో 13.56 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, 2015 -16లో రూ.23,397 కోట్ల విలువైన 23.52 లక్షల టన్నుల
ఉత్పత్తితో 32.78 శాతం వృద్ధి రేటు సాధించింది. దాంతో ఈ ఏడాది (2016-17) ఉత్పత్తి
లక్ష్యాన్ని రూ.30,440 కోట్లు (26.40 లక్షల టన్నులు)గా, అర్ధ సంవత్సరం లక్ష్యాన్ని
రూ. రూ.16,430 కోట్లుగా ప్రభుత్వం
నిర్ధేశించింది. ఈ అర్ధ సంవత్సరం (ఏప్రిల్-సెప్టెంబర్)లో లక్ష్యానికి మించి రూ.
17,578 కోట్ల ఉత్పత్తి జరిగింది. గత ఏడాది జరిగిన అర్ధ సంవత్సరం ఉత్పత్తి
రూ.12,329 కోట్లతో పోల్చితే 42.57 శాతం వృద్ధి రేటు సాధించడం జరిగింది. ఈ అర్ధ
సంవత్సరంలో రాష్ట్రంలో ఏ రంగంలోనూ ఇంత వృద్ధి రేటు నమోదు కాలేదు. జాతీయ స్థాయిలో
కూడా ఈ రంగంలో 5.26 శాతం మాత్రమే వృద్ధి రేటు నమోదైంది.
విదేశీ మారకద్రవ్యంలో కీలక పాత్ర
విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి
పెట్టడంలో ఈ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోంది. మన దేశం నుంచి 75 దేశాలకు చేపలు
ఎగుమతి అవుతున్నాయి. 2014-15లో దేశం నుంచి
ఎగుమతి అయిన సముద్ర ఉత్పత్తుల విలువ రూ.35 వేల కోట్లు కాగా, రాష్ట్రం నుంచి ఎగుమతి అయిన వాటి
విలువ దాదాపు 16 వేల కోట్ల రూపాయలు. దేశం నుంచి ఎగుమతి అయ్యే మత్స్య
ఉత్పత్తులలో ఏపీ నుంచి 45 శాతం ఎగుమతి అవుతున్నాయి. ‘వనమి’ రకం రొయ్యలు ఏపీ నుంచే అత్యధికంగా 70 శాతం వరకు విదేశాలకు ఎగుమతి
అవుతున్నాయి. ఇచ్చాపురం నుంచి తడ వరకు 9
జిల్లాలలో 974 కిలో మీటర్ల సముద్రతీరం ఉండటంతో సముద్ర ఉత్పత్తులలో తన ఆధిపత్యాన్ని
ప్రదర్శిస్తూ, దేశ మత్స్య పరిశ్రమ రాజధానిగా ఏపీ వెలుగొందుతోంది.
5 ఏళ్లలో వంద శాతం వృద్ధి లక్ష్యం
వచ్చే అయిదేళ్లలో ఆక్వా ఉత్పత్తులను వంద
శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. చేపలు, రొయ్యల చెరువుల సాగుదార్లకు అనేక రాయితీలు ఇస్తోంది. మత్స్య
శాఖకు సంబంధించిన ఉత్పత్తులు,
ఉపాధి అవకాశాలు పెరగడంతో ప్రభుత్వం నూతన మత్స్య విధానం
ప్రకటించింది. అసైన్డ్ భూముల్లో కూడా
రైతులు రొయ్యలు, చేపల చెరువులను ఏర్పాటు చేసుకునే అవకాశం
కల్పించింది. మత్స్య శాఖ బడ్జెట్ అంచనాలను కూడా ప్రభుత్వం
పెంచింది. గత సంవత్సరం బడ్జెట్ అంచనా రూ.187.19 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేశారు. ఈ
ఏడాది (2016-17) ప్రణాళిక, ప్రణాళికేతర బడ్జెట్ అంచనాలను రూ.339 కోట్లకు పెంచారు.
రైతులకు నాణ్యమైన చేప పిల్లలను అందించాలన్న లక్ష్యంతో గుంటూరు జిల్లా బాపట్లలో
రూ.20 కోట్లతో హేచరీ ఏర్పాటు చేస్తున్నారు. జాలర్ల సంక్షేమానికి కూడా ప్రభుత్వం
అనేక చర్యలు తీసుకుంటుంది. గత సంవత్సరం వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు భృతిగా
రూ.2 వేలు ఇచ్చారు. దానిని ఈ ఏడాది రూ.4వేలకు
పెంచారు. ఈ పథకం ద్వారా 60 వేల 500 మంది ప్రయోజనం పొందుతున్నారు.
10.65 లక్షల మంది ఉపాధి
రాష్ట్రంలో మత్స్య శాఖ ద్వారా
10.65 లక్షల మంది ఉపాధి లభిస్తోంది. మత్స్య సంబంధమైన శాస్త్రీయ పరిశోధనలు,అధ్యయనాలకు ఊతం ఇచ్చే విధంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రభుత్వం
ఆక్వా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏపీలో అపారంగా ఉన్న సముద్ర తీరాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని,
సముద్ర ఉత్పత్తులు పెరగడానికి, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి, ఎగుమతుల
పెరుగుదలకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తులు సాధించడం, మందుల వాడకంలో జాగ్రత్తలు పాటించడం, మత్స్య ఉత్పత్తుల ప్రాసెసింగ్ కు
సంబంధించి ఏపీ ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. ఫలితాలను
సాధిస్తోంది. ప్రభుత్వం
ప్రోత్సాహం వల్ల సముద్ర ఉత్పత్తులు పెరగటమే కాకుండా, ఎక్కువ మందికి ఉపాధి కూడా లభించే
అవకాశం ఉంది.
n శిరందాసు నాగార్జున, - 9440222914
02.01.2017 సోమవారం ఎడిటోరియల్ పేజీ
No comments:
Post a Comment