Jan 28, 2017

మిరప ఎగుమతికి ప్రోత్సాహం

·       గుంటూరు జిల్లాలో 82వేల హెక్టార్లలో మిరప సాగు
·       పురుగుల మందు వాడకం తగ్గింపు
·       సస్యరక్షణతో ఉత్పత్తి, నాణ్యత పెంపు
·       గుంటూరు నుంచి 40 శాతం  ఎగుమతి
·       76 గ్రామాల్లో 10 వేల ఎకరాల్లో  సస్యరక్షణలో మిరప పంట సాగు

           పురుగుల మందుల వాడకం తగ్గించి మిరపకాయల నాణ్యత, ఉత్పత్తిని పెంచి ఎగుమతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎగుమతులు పెరిగితే విదేశీ మారకద్రవ్యం సమకూరడమే కాక,  రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చే అవకాశం ఉంటుంది. మిరప ఉత్పత్తి, నాణ్యత పెంచడానికి గుంటూరు జిల్లాలోని ఉద్యానవన శాఖ తగిన ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. ఈ జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం(2015-16)లో 64వేల హెక్టార్లలో మిరప పండించగా, ఈ ఏడాది 82 వేల హెక్టార్లలో మిరప పండిస్తున్నారు.  మిరప సాగు చేసే 60 శాతం ప్రాంతంలో హైబ్రీడ్ రకాలనే పండించేవారు. తేజశ్విని, ఇండామ్ 5, యుఎస్ 341, బీఐజేఓ 273, అగ్నిరేఖ, వండర్ హాట్, బాడిగి వంటి రకాలను నాటేవారు. అయితే ఇవి హెక్టార్ కు సరాసరి 6.25 మెట్రిక్ టన్నుల దిగుబడి ఇచ్చేవి. మిగిలిన 40 శాతం మిరప సాగు చేసే భూములలో ఎల్సీఏ334, ఎల్సీఏ625, సరపూడి, సూపర్ 10, సూపర్ 20 వంటి రకాలను పండిస్తారు. ఈ రకాలు హెక్టారుకు సరాసరి 5 మెట్రిక్ టన్నుల దిగుబడిని మాత్రమే ఇచ్చేవి. దీనిని దృష్టిలోపెట్టుకొని మిరప ఉత్పత్తితోపాటు నాణ్యత కూడా పెంచడానికి ఉద్యానవన శాఖ గుంటూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా పది వేల ఎకరాలను ఎంపిక చేసింది.  ఈ భూమిలో మిరప సాగు చేసే రైతులకు అధికారులు, శాస్త్రవేత్తలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు.

గుంటూరు జిల్లాలో పండే ఉత్పత్తిలో  40 శాతం ఎగుమతి
           గుంటూరు ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే మిరప కాయలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరున్న విషయం తెలిసిందే. ఇక్కడి రేగడి నేలల్లో పండే మిరపకు ఘాటుతోపాటు రుచి కూడా ఎక్కువే. అందువల్ల ఈ పంటకు డిమాండ్ ఎక్కువ. ఈ ప్రాంతంలో పండే మిరపలో దాదాపు 40 శాతం విదేశాలకు ఎగుమతి చేస్తారు. అయితే ఎగుమతి చేసిన ఎండు మిర్చిలో పురుగుమందుల శేషాలు ఉన్నాయని అనేక సార్లు తిప్పి పంపారు. దాంతో  ప్రభుత్వం మిరప నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఉత్పత్తిలో సస్య రక్షణ చర్యలు చేపట్టి మిరపకాయలను యూరప్, అమెరికాలకు  ఎగుమతి చేయాలని నిర్ణయించింది. దీనికి కావలసిన చర్యలు తీసుకోవలసిందిగా ఉద్యానవన శాఖను ఆదేశించింది. దాంతో ఆ శాఖ మిరపపంటలో పురుగుల మందుల వాడకాన్ని తగ్గించేవిధంగా రైతులను ప్రోత్సహిస్తోంది.

76 గ్రామాల్లో పది వేల ఎకరాల్లో సస్యరక్షణ మిరప సాగు
            ఎండు మిర్చిలో పురుగుమందుల శేషాలు లేకుండా ఉండేదుకు తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలను రైతులకు తెలియజెబుతోంది. అంతే కాకుండా గుంటూరు జిల్లాలో పది క్లస్టర్లలో 22 మండలాల్లోని 76 గ్రామాలను ఎంపిక చేసింది. ఆ గ్రామాల్లో పది వేల ఎకరాల్లో నాణ్యత గల మిరప పంట పండించడానికి ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టింది. దాదాపు ఏడు వేల మంది రైతులు ఈ భూమిని సాగు చేస్తున్నారు. ఒక్కో క్లస్టర్ ను ఒక ఉద్యానవన శాఖాధికారి, ఒక వ్యవసాయ మల్టిపర్పస్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్(ఎంపీఈఓ) పర్యవేక్షిస్తుంటారు. సస్యరక్షణతో మిరప సాగు చేయడంలో మిరప శాస్త్రవేత్తలు, ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు శిక్షణ ఇచ్చారు. అధికారుల పర్యవేక్షణలోనే తేజా, ఎండామ్5, ఎల్సీఏ334, వీఎస్341, బాడిగ వంటి హైబ్రీడ్ రకాలను సాగు చేస్తున్నారు.
అంతే కాకుండా వారు తరచూ పంట పొలాలను సందర్శిస్తూ రైతులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వేపతో తయారు చేసిన మందులనే వాడే విధంగా వారిని ప్రోత్సహిస్తున్నారు. పంటకు చీడ పట్టకుండా, పట్టినా తక్కువ స్థాయిలో పురుగుల మందులను వాడుతూ రైతులు మిరప పంట పండిస్తున్నారు. రైతులు సస్య రక్షణ చర్యలను అమలు చేయడంతో పురుగుల మందులు చల్లడాన్ని 50 శాతం వరకు తగ్గించారు. అంతేకాకుండా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మిరప పంటను సాగు చేయడంలో కూడా రైతులను ప్రోత్సహించారు. దాంతో పండు మిరపలో పురుగుల మందు అవశేషాలు తగ్గడంతోపాటు ఉత్పత్తి వ్యయం కూడా తగ్గింది. ఈ విధంగా చేయడం వల్ల మిరప ఎగుమతి దారులు పొలాల్లోనే రైతుల నుంచి మిరపను కొనుగోలు చేసే అవకాశం ఏర్పడింది. తద్వారా రైతులు ఒక మెట్రిక్ టన్నుకు రూ.15 వేల రూపాయల వరకు అదనంగా లాభం పొందే అవకాశం ఉంది. పది వేల హెక్టార్లలో సస్యరక్షణ చర్యల ద్వారా పండించిన పంట దాదాపు 50 వేల మెట్రిక్ టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా  రైతులకు రూ.50 కోట్ల రూపాయల వరకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఎగుమతిదారులు కూడా నాణ్యమైన మిరపను యూరప్, అమెరికాలకు ఎగుమతి చేసి విదేశీమారకద్రవ్యాన్ని ఆర్జిస్తారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి కూడా పెరిగి ఆర్థిక వృద్ధికి ఇది దోహతపడుతుంది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...