· కలెక్టర్లకు
ఆదేశాలు
·
మచిలీపట్నం పోర్టుకు భూ సమీకరణ
· భావనపాడు
పోర్ట్ భూ సేకరణ
రాష్ట్రంలో
వివిధ ప్రాజెక్టులు, పలు రకాల అభివృద్ధి పనుల కోసం త్వరితగతిన భూమిని సమీకరించాలని
ప్రభుత్వం నిర్ణయించింది. పోర్టులు, రోడ్లు, జల మార్గాలు, బీచ్ కారిడార్ తదితరాలకు
నిర్ణయించిన ప్రకారం భూ సమీకరణ జరపాలని
ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆయా జిల్లాల్లో భూముల ధరలు, స్థానిక
పరిస్థితుల ఆధారంగా భూ సమీకరణ లేక భూ సేకరణ చేస్తారు. ఈ భూ సమీకరణ ప్రక్రియ కోసం రెవెన్యూ,
సర్వే సిబ్బందిని కేటాయించి, వారిని రిలీవ్ చేయాలని అందరు జిల్లా కలెక్టర్లకు
ఆదేశాలిచ్చారు. మచిలీపట్నం పోర్టుకు సంబంధించి భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్)కు
నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు.ఏ
భూ సమీకరణ పనులు వేగవంతం చేశారు. త్వరలోనే ఆయన భూమిని సమీకరించి ప్రభుత్వానికి
అప్పగించే అవకాశం ఉంది. రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరకు అనుసరించిన
పద్దతులనే పోర్టు నిర్మాణానికి సమీకరించే భూముల
విషయంలో కూడా అనుసరిస్తున్నారు. ఇందు కోసం పట్టా భూములు 14 వేల ఎకరాలు, ప్రభుత్వ
భూమి 5200 ఎకరాలను సమీకరిస్తారు. పోర్టు
నిర్మాణ పనులను 2017లో పార్రంభించి, 2018 నాటికి పూర్తి చేయాలన్నది ప్రభుత్వ
లక్ష్యం. పోర్ట్ మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి కన్సెల్టెంట్ ని నియమించే
ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
భావనపాడు పోర్టు: శ్రీకాకుళం జిల్లా భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్టు కోసం
2050 ఎకరాల భూ సేకరణను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంతబొమ్మాళి మండలం
భావనపాడు, మర్రిపాడు, దేవునల్తాడ గ్రామాల పరిధిలో ఈ భూమిని సేకరిస్తారు. ఆ మేరకు
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కు ప్రభుత్వం తగిన సూచనలు, సలహాలు కూడా ఇచ్చింది. ఈ పోర్టు నిర్మాణ టెండర్ ని అంతర్జాతీయంగా
పేరుపొందిన ప్రముఖ నౌకా నిర్మాణ సంస్థ అదానీ కంపెనీ దక్కిచ్చుకుంది. అందువల్ల
భూసేకరణ జరిగిన వెంటనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
అంతర్గత జల మార్గం: రాష్ట్రంలో అంతర్గత జల మార్గాన్ని అభివృద్ధి చేసి, జల
రవాణాకు ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్లపై ట్రాఫిక్ను
తగ్గించడంతోపాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ సామగ్రిని తరలించేందుకు జల రవాణా ఉపయోగపడుతుంది.
కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు బకింగ్హామ్ కెనాల్ను పునరుద్ధరించి కాలువలు, నదులను
అనుసంధానం చేసుకుంటూ ఈ జల మార్గం రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా ఇటు కృష్ణా, అటు గోదావరి నదుల మధ్య భూ సేకరణకు సంబంధించి ఇప్పటికే సర్వే పూర్తి
చేశారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో అంతర్గత జల
మార్గం కోసం భూమిని గుర్తించారు. ఆ భూమిని సేకరించడాన్ని వేగవంతం చేశారు. ఇన్ల్యాండ్ వాటర్ వేస్ ప్రాజెక్ట్లో
భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో 74 కిలోమీటర్ల పొడవునా ఏలూరు కాలువను ఆధునీకరిస్తారు.
నిడదవోలు–ఏలూరు మధ్య ప్రధాన కాలువను వెడల్పు చేసి ఓడల ద్వారా
సరుకుల రవాణా చేసేందుకు వీలుగా 35 గ్రామాలు, ఏలూరు, తాడేపల్లిగూడెంలలో భూసేకరణ
చేపడుతున్నారు.
బీచ్ కారిడార్: పర్యాటక
రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు కాగల బీచ్ కారిడార్
ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి
విజయనగరం జిల్లా భోగాపురం వరకు బీచ్ కారిడార్ గా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని తూర్పుగోదావరి,
విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో గుర్తించవలసి ఉంది. ఈ బాధ్యతలను ఆయా కలెక్టర్లకు
అప్పగించారు. కాకినాడ నుంచి భోగాపురం వరకు 170 నుంచి 180 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ బీచ్ రోడ్డును కూడా నిర్మిస్తారు.
లాజిస్టిక్స్ పార్కులు: విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నంలలో లాజిస్టిక్స్
పార్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖలో 98 ఎకరాల్లో, కాకినాడలో 89 ఎకరాల్లో, కృష్ణపట్నంలో 142 ఎకరాల్లో ఈ పార్కులను
నెలకొల్పుతారు. రెండేళ్లలో వీటిని ప్రారంభిస్తారు.
No comments:
Post a Comment