Jan 4, 2017

ఇక గ్రామవీధుల్లోనూ ఎల్ఈడీ బల్బులే!

·       ఎల్ఈడీ బల్బుల వినియోగంపై జన్మభూమిలో విస్తృత ప్రచారం
·       విశాఖలో 48 శాతం విద్యుత్ ఆదా
·       సాధారణ బల్బు కంటే ‘లెడ్’ జీవిత కాలం 4 రెట్లు ఎక్కువ
·       రాష్ట్రంలో 1,90,33,333 బల్బుల పంపిణీ
·       2.32 కోట్ల లెడ్ బల్బుల పంపిణీ లక్ష్యం
·       అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు

           రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల వీధులను  లెడ్ (ఎల్ఈడి-లైట్ ఎమిట్టింగ్ డైయోడ్) బల్బుల వెలుగులతో నింపిన ప్రభుత్వం ఇక అన్ని గ్రామాల వీధులలో కూడా వీటిని అమర్చాలని నిర్ణయించింది.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లె నుంచే శ్రీకారం చుట్టారు. ఈ గ్రామంలోని 120 సాధారణ వీధి బల్బుల స్థానంలో  లెడ్ బల్బులు అమర్చారు. విద్యుత్ ని పొదుపు చేయడానికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లెడ్ బల్బులను వినియోగిస్తోంది.  ఈ బల్బుల వినియోగం వల్ల 45 నుంచి 50 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది. దేశం మొత్తం మీద ఏడాదికి రూ.9,876 కోట్లు ఆదా అయింది. రాష్ట్రానికి వచ్చేసరికి 24,71,809 ఎండబ్లూహెచ్ (మెగావాట్ అవర్స్),  రూ.989 కోట్లు ఆదా అయింది. పీక్ అవర్ డిమాండ్ 495 మెగావాట్స్ కు తగ్గింది. లెడ్ బల్బుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్  దేశంలో  అగ్రభాగాన నిలిచింది. విద్యుత్ ని ఆదా చేయడంలో మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. జాతీయ స్థాయిలో పలు బహుమతులను కూడా గెలుచుకుంది. మునిసిపల్ కార్పోరేషన్లు, మునిసిపాలిటీలు, ఇళ్లలోనూ లెడ్ లైటింగ్ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఓ ఛాలెంచ్ గా తీసుకొని దిగ్విజయంగా అమలు చేస్తోంది. మళ్లీ ఇప్పుడు లెడ్ బల్బుల వినియోగం వల్ల అయ్యే విద్యుత్ ఆదా గురించి  ‘జన్మభూమి-మా ఊరు‘ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కలిగించి, విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బల్బులను వినియోగించి విద్యుత్ ని సాధ్యమైనంత ఎక్కువగా ఆదా చేయాన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు.
 గ్రామవీధుల్లో లెడ్ కాంతులు
            రాష్ట్రంలోని నగర వీధులన్నిటినీ లెడ్ బల్బుల వెలుగులతో నింపేశారు. పట్టణాల వీధుల్లో కూడా పూర్తిగా ఈ బల్బులను అమరుస్తున్నారు. చాలా వరకు పూర్తి చేశారు. ఇక గ్రామ వీధులపై దృష్టి పెట్టారు. విశాఖ నగర వీధుల్లో అత్యధికంగా 95,600 బల్సులను అమర్చారు. ఇక్కడ 48 శాతం విద్యుత్ ఆదా అవుతోంది. విజయవాడలో 32,296 బల్బులు, నెల్లూరులో 18,641, కాకినాడలో 12,310, గుంటూరులో 10,096, అనంతపురంలో 9,912, విజయనగరంలో 9,450, తిరుపతిలో 9,038, ఏలూరులో 7,249, కర్నూలులో 5,353, రాజమండ్రిలో 3,017 బల్సులు అమర్చారు. మునిసిపల్ వీధులలో కూడా ఈ బల్బులే కాంతులు వెదజల్లుతున్నాయి. కావలి వీధుల్లో 6,007 బల్బులు, హిందూపూర్ లో 6,397, నరసరావు పేట వీధుల్లో 4,871 బల్బులు అమర్చారు. మిగిలిన మునిసిపాలిటీలలో ఆయా పట్టణాల పరిధిని బట్టి వెయ్యి నుంచి నాలుగు వేల వరకు ఈ బల్బులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 12,909 గ్రామాల్లోని 25 లక్షల సాధారణ వీధి బల్బుల స్థానంలో లెడ్ బల్బులను అమర్చడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కొన్ని గ్రామాలలో వీటిని అమర్చారు. ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చించారు.  అన్ని గ్రామాలలో ఈ బల్బులను అమరిస్తే ఏడాదికి 165 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందా అవుతుందని అంచనా.
 ఏపీలో 1,90,33,333 బల్బుల పంపిణీ
          ఉజాల(యుజెఏఎల్ఏ-ఉన్నత్ జ్యోతి బై అఫర్డబుల్ లెడ్స్ ఫర్ ఆల్) పథకాన్ని రాష్ట్రంలో 2014 అక్టోబరు 2న ప్రారంభించారు. ఈ పథకం కింద 9 వాట్ల లెడ్ బల్బును రాయితీపైన పది రూపాయలకే ఇచ్చారు.  ఒక్కో ఇంటికి రెండు బల్బులు ఇచ్చారు. ఇళ్లలో  60 వాట్ల బల్బు వాడే స్థానంలో వీటిని వాడుతున్నారు.  ఈ విధంగా ఇళ్లలో వినియోగించే లెడ్ బల్బులను 2016 డిసెంబర్ 31 సాయంత్రానికి  దేశంలో 19,01,15,264 పంపిణీ చేయగా, ఏపీలో 1,90,33,333 పంపిణీ చేశారు. అత్యధికంగా 23,77,951 బల్బులు పంపిణీ చేసి తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 18,84,896 బల్బులతో గుంటూరు జిల్లా రెండవ స్థానం, 18,09,230 బల్బులతో కృష్ణా జిల్లా మూడవ స్థానం దక్కిచ్చుకున్నాయి. 8,98,518 బల్బులు మాత్రమే పంపిణి చేసి విజయనగరం జిల్లా చివరి స్థానంలో ఉంది. మిగిలిన జిల్లాలను పరిశీలిస్తే విశాఖపట్నం జిల్లాలో 18,05,295 బల్బులు, పశ్చిమగోదావరి జిల్లాలో 16,91,638, చిత్తూరు జిల్లాలో 15,93,920, కర్నూలు జిల్లాలో 13, 06,799, ప్రకాశం జిల్లాలో 12,23,142, నెల్లూరు జిల్లాలో 12,02,001, అనంతపురం జిల్లాలో 11,38,845, శ్రీకాకుళం జిల్లాలో 11,15,201,కడప జిల్లాలో 9,85,895 బల్బులు పంపిణీ చేశారు.
 2.32 కోట్ల లెడ్ బల్బుల పంపిణీ లక్ష్యం
          వంద శాతం ఇళ్లలో వినియోగించడానికి మొత్తం 2.32 కోట్ల లెడ్ బల్బులు పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకం మొత్తం అమలయితే 1291 ఎంయు(మిలియన్ యూనిట్స్) విద్యుత్ ను పొదుపు చేయవచ్చని అంచనా. పీక్ అవర్స్ లో లోడ్ ను 620 మెగావాట్స్ కు తగ్గించవచ్చని భావిస్తున్నారు.  60 వాట్స్ సాధారణ బల్బు జీవిత కాలం 1200 గంటలయితే, 6-8 వాట్స్ లెడ్ బల్బు జీవిత కాలం 50 వేల గంటలు. సాధారణ బల్బుతో పోల్చితే లెడ్ బల్బు జీవిత కాలం నాలుగు రెట్లు ఎక్కువ.  అలాగే సాధారణ 60 వాట్స్ బల్బుతో సమానంగా 8 వాట్స్ లెడ్ బల్బు కాంతిని ఇస్తుంది. అంటే చాలా తక్కువ విద్యుత్ తో ఎక్కవ కాంతిని పొందవచ్చు. ఈ బల్బులను వినియోగించడం వల్ల వినియోగదారుల విద్యుత్ బిల్లును చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాలలో అమలు చేశారు. ఓ సర్వే ప్రకారం ఆ జిల్లాలలో 58 వేల మంది వినియోగదారులు ఒక్కో బల్బుకు ఏడాదికి 73.7 యూనిట్స్ విద్యుత్ ను ఆదా చేశారు. ఒప్పందం ప్రకారం 55.65 యూనిట్ల కంటే 33 శాతం విద్యుత్ అదనంగా ఆదా అయింది.
 విశాఖలో 48 శాతం విద్యుత్ ఆదా
        విశాఖపట్నంలో అన్ని వీధి దీపాలు హుద్ హుద్ తుపానుకు ధ్వంసం అయ్యాయి. వాటి స్థానంలో లెడ్ బల్బులను అమర్చారు. 92 వేల లెడ్ వీధి బల్బులను 45 రోజులలో అమర్చి రికార్డు సృష్టించారు. ఈ లెడ్ బల్బుల వల్ల నెలకు 40 నుంచి 45 శాతం వరకు విద్యుత్ ఆదా అయింది. ఆ ప్రకారం 2015 సంవత్సరం మొత్తం మీద విద్యుత్ బిల్లు రూ.4.23 కోట్లు తగ్గింది. ప్రస్తుతం విశాఖలో 48 శాతం విద్యుత్ ఆదా అవుతోంది.  రాష్ట్రంలోని 111 మునిసిపాలిటీలలో 5.7 లక్షల వీధి బల్బుల స్థానంలో లెడ్ బల్బులను అమర్చటానికి పూనుకున్నారు. ఇప్పటికే చాలావరకు మునిసిపాలిటీలలో బల్బులు మార్చారు. రాష్ట్రంలోని 12,909 గ్రామాలలోని సాధారణ వీధి దీపాల స్థానంలో లెడ్ లైట్లను బిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో మొత్తం 25 లక్షల లెడ్ వీధి లైట్లను అమర్చినట్లైతే ఏడాదికి 165 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయ్యే అవకాశం ఉంది.
 అంతర్జాతీయ స్థాయిలో ప్రసంశలు
         రాష్ట్రంలో జరుగుతున్న లెడ్ లైటింగ్ కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు లభించాయి. ప్రపంచ బ్యాంక్, ఫ్రాన్స్ లోని అంతర్జాతీయ ఎనర్జీ ఏజన్సీ (ఐఇఏ) వంటి సంస్థలు పనితీరును మెచ్చుకున్నాయి. పారిస్ లో జరిగిన సిఓపి-21 సమ్మిట్ లో లెడ్ వీధి లైట్ల వినియోగం ద్వారా గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ)లో  ఆదా అయిన విద్యుత్ అంశాన్ని చర్చించారు. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా,చైనా, ఇండియా,సౌత్ ఆఫ్రికా) వర్కింగ్ గ్రూప్ సమ్మిట్ లో భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టునే ప్రదర్శించి, ఇతర దేశాలకు ఓ రోల్ మోడల్ గా నిలిచింది.

జన్మభూమి మొదటి రెండు రోజుల్లో  58,017 ఇళ్లు మంజూరు
ü  ‘జన్మభూమి’లో దరకాస్తుల సేకరణ, ఇళ్ల మంజూరు
ü 2017-18లో 5 లక్షల ఇళ్ల నిర్మాణం
ü రాష్ట్రంలో ప్రతి పేదవానికి గృహ భద్రత
ü 2022 నాటికి అందరికీ గృహ వసతి

           రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేదవానికి గృహ భద్రత కల్పించాలని ప్రభుత్వ నిర్ణయించింది. పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం బృహత్తర ప్రణాళిక రూపొందించింది. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. పేద,మధ్య తరగతి వారికి తక్కువ ధరలకు గృహవసతి కల్పించాలన్న ధృసంకల్పంతో అపార్ట్ మెంట్ల నిర్మాణం చేపట్టింది. మరో పక్క రాష్ట్రంలోని ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేస్తున్నారు. దానిని ఆధార్ తో అనుసంధానం చేసి ఇల్లు లేని ప్రతి పేదవానికి గృహ భద్రత కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. కనీస అవసరాలలో భాగంగా పేదలందరికీ సముచితమైన అనువైన గృహ వసతి కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణ పథకం కింద గ్రామాలలో నిర్మించే ఒక్కో ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం లక్షా 50 వేల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఈ పథకం కింద ఒక్కో నియోజకవర్గానికి 1250 ఇళ్లు కేటాయించారు. ఇవి కాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో 55 వేల ఇళ్లు నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణానికి కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం చొప్పున రెండు లక్షల రూపాయలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. పట్టణ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించే ఇళ్లకు రూ.3.5 లక్షలు ఖర్చు చేస్తారు. ఇందులో రూ.1.5 లక్షలు  కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. రూ.25వేలు లబ్దిదారుడు భరించాలి.  మిగిలిన రూ.75 వేలు బ్యాంకులు రుణాలుగా ఇస్తాయి. ఆ రుణాన్ని లబ్దిదారుడు తిరిగి చెల్లించవలసి ఉంటుంది.

13 జిల్లాలకు 2,37,842 ఇళ్లు కేటాయింపు
           రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాలకు ఈ నెల 4వ తేదీ నాటికి ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద ప్రభుత్వం 2,37,842 ఇళ్లు కేటాయించింది. ఈ గృహాలు పొందడానికి 1,54,408 మంది అర్హులను ఎంపిక చేసింది. 2022 నాటికి అందరికీ గృహ వసతి కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. అందరికీ అనువైన గృహవసతి అనే విధానం కింద 2022 నాటికి పది లక్షల ఇళ్లు నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2017-18లో 5 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జన్మభూమి-మా ఊరు 4వ విడత కార్యక్రమంలో కుటుంబ భద్రతకు రూపొందించిన 15 సూత్రాలలో గృహ భద్రతను చేర్చారు. ఈ నెల 2 నుంచి 11వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో కొత్త ఇళ్లను పొందడానికి అర్హులను ధృవీకరిస్తున్నారు. ఇళ్లను మంజూరు చేస్తున్నారు.

మొదటి రెండు రోజుల్లో 58,017 ఇళ్లు మంజూరు
        జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో మొదటి రెండు రోజుల్లో ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద 58,017 ఇళ్లు మంజూరు చేశారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే ఈ రెండు రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలో 7,264, ఇళ్లు, విజయనగరం జిల్లాలో 4,938, విశాఖపట్నం జిల్లాలో 4,512, తూర్పుగోదావరి జిల్లాలో 6,220, పశ్చిమగోదావరి జిల్లాలో 4,716, కృష్ణా జిల్లాలో 4,590 ఇళ్లు మంజూరు చేశారు. గుంటూరు జిల్లాలో 5,426, ప్రకాశం జిల్లాలో 3,181, నెల్లూరు జిల్లాలో 3,441, చిత్తూరు జిల్లాలో 3,590, కడప జిల్లాలో 2,519, అనంతపురం జిల్లాలో 5,113, కర్నూలు జిల్లాలో 2,487 ఇళ్లు మంజూరు చేశారు. పట్టణ గృహ నిర్మాణ పథకం కింద అన్ని ప్రాధమిక సౌకర్యాలతో ఇళ్లను నిర్మిస్తారు. ఈ ఇళ్లకు నీరు, పారిశుధ్యం, విద్యుత్, రోడ్లు, గ్యాస్ కనెక్షన్ వంటి సౌకర్యాలు కల్పిస్తారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...