Apr 12, 2018


అసంతృప్తి వ్యక్తం చేసిన శాఖలకు లేఖలు రాయండి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్టీజీకి ఆదేశాలు
ప్రజల ఫిర్యాదులపై సమీక్ష

               
సచివాలయం, ఏప్రిల్ 12: ప్రజలు ఎక్కువ అసంతృప్తి వ్యక్తం చేసిన శాఖాధికారులకు లేఖలు రాయమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ ఆర్టీజీ(రియల్ టైమ్ గవర్నెన్స్) సీఈఓ బాబు.ఏ ను ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని సీఎస్ సమావేశ మందిరంలో గురువారం మధ్యాహ్నం ప్రభుత్వ పథకాలపై వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సీఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఏ  అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో ఆ అంశాలను వివరిస్తూ, ఇక ముందు వారి సంతృప్తి స్థాయి పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలలో పేర్కొనమని తెలిపారు. భవిష్యత్ లో ఆయా శాఖల పని తీరులో మార్పు రాకపోతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేమని సీఎస్ చెప్పారు. వివిధ పథకాలపై ప్రజల సంతృప్తి స్థాయిని  పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎస్ కు బాబు వివరించారు. 19 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 34 పథకాలపై ఐవీఆర్ఎస్ (ఇంట్రాక్టివ్ వాయిస్ రెర్సాన్ సిస్టం) ద్వారా సమాచారం సేకరించి ప్రజల సంతృప్తి స్థాయిని గణిస్తున్నట్లు బాబు తెలిపారు. రాష్ట్రం మొత్తం మీద వివిధ పథకాలకు సంబంధించి ప్రజల సంతృప్తి స్థాయి జనవరిలో 62 శాతం, ఫిబ్రవరిలో 61 శాతం, మార్చిలో 66 శాతం, ఏప్రిల్ లో ఇప్పటి వరకు 70 శాతం ఉన్నట్లు వివరించారు. మార్చి నెలలో పెన్షన్ పథకాలపై 78 శాతం మంది, ఆరోగ్య పథకాలపై 75 శాతం, పౌరసరఫరాల విభాగంపై 74 శాతం, పవర్ పై 72, రోడ్లు భవనాల శాఖపై 67 శాతం, అర్బన్ హైసింగ్ పై 62, సంక్షేమ శాఖపై 57 శాతం, గ్రామీణ గృహ నిర్మాణ పథకంపై 51 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు వివరించారు.
వివిధ పథకాలపై ప్రజలను అడిగే ప్రశ్నలు,  వివిధ రకాల పించన్లు, గృహ నిర్మాణ, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు వంటి పథకాలకు  వచ్చిన దరకాస్తులు, ఆ పథకాలకు అర్హులు, అత్యంత అర్హత కలిగినవారు, అనర్హులు, ఇళ్లు ఉన్నవారు కూడా దరకాస్తు చేయడం, కొత్త రేషన్  కార్డుల జారీ, గతంలో ఇళ్లు పొందినవారు కూడా ఇంటి కోసం దరకాస్తు చేయడం వంటి అనేక అంశాలను సమీక్షించారు.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...