పరిశ్రమల శాఖ మంత్రి అమరనాధరెడ్డి
· చిత్తూరు-నెల్లూరు జిల్లాలు కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్ గా ఎంపిక
· స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు యోచన
· పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ
· ఆన్ లైన్ ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాల చెల్లింపు
· పారిశ్రామిక అభివృద్ధి కోసం కొత్త పాలసీల రూపకల్పన
· ఎంఓయులు జరిగిన వాటిలో 137 పరిశ్రమల ఉత్పత్తి ప్రారంభం
· పరిశ్రమలకు భూ కేటాయింపుల సరళీకరణ
· దేశంలో మొదటిసారిగా జిల్లా స్థాయి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు
సచివాలయం, జూన్ 14: యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్(యుఎన్ఓ) ప్రకటించిన ప్రకారం ఈ నెల 27న జరిగే సూక్ష,చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రల(ఎంఎస్ఎంఈ) దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఏపీఎంఎస్ఎంఈ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ వాణిజ్యం, వాణిజ్యం, ప్రభుత్వ రంగ సంస్థల శాఖల మంత్రి ఎన్. అమరనాధరెడ్డి చెప్పారు. సచివాలయంలోని 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో బుధవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పోరేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారన్నారు. సూక్ష,చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రల ద్వారా అత్యధిక మందికి ఉపాధి లభించే అకాశం ఉందని, అందు వల్ల ప్రభుత్వం ఆ రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాష్ట్రంలో 19,193 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈల ద్వారా 2.26 లక్షల మందికి ఉపాధి లభించినట్లు వివరించారు. చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అభించే అవకాశం ఉంటుందని, అందువల్ల ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 175 శాసనసభ నియోజకవర్గాల్లో 101 నియోజకవర్గాల్లో ఈ పార్కుల కోసం భూములు ఎంపిక చేసినట్లు తెలిపారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా భూములు గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడంలో భాగంగా ఆ సంస్థలకు అవార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ రంగంలో మూతపడిన పరిశ్రమలను పున:ప్రారంభించేందుకు రూ.160 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్
మన రాష్ట్రంలో ఉన్న 974 కిలోమీటర్ల కోస్తా తీరం పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉంది. ఉపాధి కూడా అత్యధిక మందికి లభించే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో నెల్లూరు-చిత్తూరు జిల్లాల్లోని 50 కిలోమీటర్ల ప్రాంతాన్ని కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్ గా కేంద్రం ఎంపిక చేసినట్లు మంత్రి చెప్పారు. దీంతో ఆ ప్రాంతంలోని యువతకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ గా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కారిడార్ అభివృద్ధికి ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాక్ రూ.5500 కోట్లు, ఇతర బ్యాంకులు రూ. 4 వేల కోట్లు, ఏపీ ప్రభుత్వం రూ.1500 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతోపాటు చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ కూడా అభివృద్ధి పరుస్తున్నట్లు చెప్పారు. నూతనంగా ప్రారంభించే పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి లభించే విధంగా వారికి ఆయా పరిశ్రమల్లో అవసరాలమేరకు ఇంజనీరింగ్ కాలేజీల్లో స్కిల్ డెవలప్ మెంట్ లో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. ఇందు కోసం కాలేజీల్లో ప్రత్యేక క్లాసులు నిర్వహించేవిధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. అదేవిధంగా నెల్లూరు-చిత్తూరు జిల్లాల మధ్య స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు తెలిపారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో జిల్లా స్థాయి ర్యాంకులు
ప్రపంచం బ్యాంకు 2016 నివేదిక ప్రకారం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని మంత్రి చెప్పారు. పరిశ్రామిక రంగంలో మనం అనుసరించే విధానాల ఆధారంగా ఈ ర్యాంక్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో జిల్లా స్థాయిలో ర్యాంకులు ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. ఆయా జిల్లాల్లో పనితీరు, ఆచరణలో ఎంఓయూల ప్రగతి, పారిశ్రామిక అనుమతులు, మౌలిక వసతుల కల్పన, ప్రోత్సాహకాల చెల్లింపు తదితర అంశాల ఆధారంగా ర్యాంకులు ఇస్తారని, ఈ విధంగా ర్యాంకులు ఇచ్చే విధానం మొదలు పెట్టిన రాష్ట్రం దేశంలో మనదే మొదటిదని వివరించారు.
పారిశ్రామికీకరణకు నిబంధనలు సరళతరం
రాష్ట్రంలో పారిశ్రామిక విస్తరణకు భూకేటాయింపు, అనుమతుల నిబంధనలను సరళతరం చేసినట్లు, పెట్టుబడులు రాబట్టడానికి ఈ రంగంలో చాలా మార్పులు చేసినట్లు మంత్రి తెలిపారు. పరిశ్రమ స్థాపించడానికి కావలసిన 39 అనుమతులు 21 రోజుల్లో ఇస్తున్నట్లు చెప్పారు. వాటిలో 34 అనుమతులు 10 నుంచి 15 రోజుల్లోనే ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు అయిదు రకాల ముఖ్యమైన పారిశ్రామిక ప్రోత్సాహకాలను త్వరితగతిన ఆన్ లైన్ లోనే చెల్లించే ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రోత్సహకాలకు సంబంధించి ఇప్పటి వరకు 7939 దరఖాస్తులు ఆన్ లైన్ పోర్టల్ ద్వారా అందుకున్నట్లు తెలిపారు. 2014 జూన్ నుంచి ప్రోత్సహకాల కింద రూ.2567.11 కోట్లు ప్రభుత్వం విడుల చేసినట్లు మంత్రి వివరించారు. పెండింగ్ లో ఉన్న వాటిని కూడా త్వరగా పరిష్కరించమని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
మన రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి పెద్ద పెద్ద కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు. రూ.10 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే మెగా పరిశ్రమల్లో ఉపాధి ఆధారంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి నూతన నిబంధనలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఎంఓయులను అమలు పరచడానికి ప్రభుత్వం తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన ఎంఓయూలకు సంబంధించి 137 పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించినట్లు తెలిపారు. అటు రైతులకు ఉపయోగపడే, ఇటు ఉపాధికి అవకాశాలు ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రంగంలో రూ.10,747.88 కోట్ల పెట్టుబడులతో 1,09,886 మందికి ఉపాధి లభించే 340 ఎంఓయూలు జరిగినట్లు చెప్పారు. వాటిలో రూ.1,141.17 కోట్ల పెట్టుబడులతో 26,801 మందికి ఉపాధి కల్పించిన 115 ప్రాజెక్టులు ఉత్పత్తి ప్రారంభించినట్లు తెలిపారు. మిగిలినవి కూడా వివిద దశల్లో ఉన్నట్లు చెప్పారు. ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ పాలసీని రూపొందించి టెక్స్ టైల్, సిల్క్ టెక్స్ టైల్ పార్కులను ప్రోత్సహించనున్నట్లు మంత్రి చెప్పారు. పారిశ్రామిక రంగంలో ఎస్సీ,ఎస్టీలను, మహిళలను ప్రోత్సహించడంలో భాగంగా వారికి అదనంగా ప్రోత్సహకాలు ఇస్తున్నట్లు తెలిపారు. వెనుకబడిన జిల్లాల్లో దాదాపు రూ.6,500 కోట్ల వరకు పెట్టుబడులు రాబట్టడానికి ‘వెనుకబడిన జిల్లాల ఆల్ట్రా మెగా ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ పాలసీ’ని రూపొందించినట్లు చెప్పారు. ఆటోమొబైల్ రంగంలో అతి పెద్ద సంస్థ అయిన కియా మోటార్స్ రూ.13,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడానికి నూతన పాలసీ ఉపయోగపడిందన్నారు.
విశాఖలో 2016, 2017లో జరిగిన రెండు భాగస్వామ్య సదస్సుల్లో అన్ని విభాగాల్లో 1569 ప్రాజెక్టులకు సంబంధించి ఎంఓయులు జరిగాయని చెప్పారు. వీటి ద్వారా రూ.16,87,845 కోట్ల పెట్టుబడులు, 30,74,933 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రి వివరించారు. వాటిలో ఇప్పటికే రూ.32,735 కోట్ల పెట్టుబడులతో 137 ప్రాజెక్టులు ప్రారంభమైనట్లు, 80,981 మందికి ఉపాధి లభిస్తున్నట్లు చెప్పారు. రూ.5,00,732 కోట్ల పెట్టుబడితో 13,02,902 మందికి ఉపాధి లభించే 311 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నట్లు మంత్రి వివరించారు.
No comments:
Post a Comment