Jun 19, 2017

గిరిజన ప్రాంతాల్లో మంచినీటి కోసం ప్రత్యేక నిధి నుంచి రూ.105 కోట్లు


సంక్షేమ శాఖల సమీక్షా సమావేశంలో సీఎస్ దినేష్ కుమార్
సచివాలయం,జూన్ 19: గిరిజన ప్రాంతాల్లో మంచినీటి అవసరాల కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ.105 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)దినేష్ కుమార్ చెప్పారు. సచివాలయం బ్లాక్ 1లోని సమావేశమందిరంలో సోమవారం సాయంత్రం వివిధ సంక్షేమ శాఖలు, గురుకుల పాఠశాలలు, విద్యార్థి వసతి గృహాలకు సంబంధించిన అంశాలను సమీక్షించారు. గిరిజన, ఎస్టీ ప్రాంతాల్లో రోడ్లు, నరేగా, నాబార్డ్ నిధుల వినియోగం, త్రాగునీటి సరఫరా,సోలార్ విద్యుత్, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో విద్యుత్ వినియోగం తదితర అంశాలను చర్చించారు. ఆయా శాఖల అధికారులు పరిస్థితులను వివరించారు. 7298 విశ్వవిద్యాలయాల కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలలో మొత్తం 15,78,759 మంది విద్యార్థులు విద్యనభ్యశిస్తున్నట్లు అధికారులు సీఎస్ కు వివరించారు. విద్యార్థుల స్కాలర్ షిప్ లకు సంబంధించి డిజిటల్ సిగ్నేచర్ ఆమోదించే విధంగా తాను ట్రెజరీ అధికారులతో మాట్లడతానని సీఎస్ చెప్పారు. సోలార్ విద్యుత్ వినియోగించే విధంగా పైలెట్ ప్రాజెక్ట్ కు 5 పాఠశాలను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ పాఠశాలల్లో బల్బులతోపాటు వంటకు కూడా సోలార్ విద్యుత్ ని వినియోగిస్తారు.  రాష్ట్రంలోని అన్ని  గురుకుల పాఠశాలలు, విద్యార్థి వసతి గృహాల్లో సాధారణ విద్యుత్ బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులు అమర్చాలని సీఎస్ ఆదేశించారు. ఆ విధంగా విద్యుత్ ని ఆదా చేయాలని ఆయన తెలిపారు.  ఈ బల్బుల మార్పిడి ప్రక్రియ జూలై నెల ఆఖరుకు పూర్తి చేయాలని చెప్పారు. ఈ ప్రక్రియను ముందుగా పూర్తి చేసిన జిల్లాలకు ఆగస్టు 15న అవార్డులు ప్రకటిస్తామన్నారు. ఎనర్జీ ఆడిట్ ని జూలై చివరకు పూర్తి చేయాలన్నారు.  గిరిజన, ఎస్టీలు నివశించే 575 ప్రాంతాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగా)నిధులతో గ్రావెల్ రోడ్లు వేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గిరిజన, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వినియోగించి ఆయా వర్గాలు నివశించే ప్రాంతాల్లో బీటీ రోడ్లు వేయించాలని చెప్పారు. ఎస్సీలు 500ల మందికి పైన, ఎస్టీలు 250 మందికి పైన ఉన్న ప్రాంతాల్లో బీటీ రోడ్లు వేయించాలన్నారు. అవసరమైతే నాబార్డ్, ఇతర నిధులు విడుదల చేస్తామని చెప్పారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...