Jan 5, 2019

బలీయమైన మత విశ్వాసాలు



హక్కులను వదులుకోవడానికి సిద్ధపడిన మహిళలు
                  మత విశ్వాసాలు చాలా బలీయమైనవి. మత విశ్వాసాలను నమ్మేవారు హక్కులను వదులుకొని బానిసలుగా బతకడానికి సిద్దపడతారు. ’‘మతం మత్తు మందు’’ అని కమ్యూనిస్టు సిద్ధాంత కర్త కారల్ మార్క్ అన్నారు. ‘‘మతం ఒక భ్రమ, అశాస్త్రీయమైనది’’ అని ఏంగెల్స్ అన్నారు. వారు అధ్యయనం చేసింది క్రైస్తవ, ఇస్లాం, యూదు మతాలనైనప్పటికీ మత విశ్వాసాలన్నీ ఆశాస్త్రీయమేనవే. ప్రపంచంలో  ఏ మతం మనుషులను మనుషులుగా చూడలేదు. మతాల పెద్దలు ప్రజాస్వామ్య, సామ్యవాద ఉద్యమాలను తొక్కేశారు. విజ్ఞాన పరిశోధనలను వెలుగులోనికి రానివ్వలేదు. కొన్ని మతాలు మనుషులను జాతులుగా విడగొట్టి హీనంగా చూస్తే, హిందూ మతం కులాల పేరుతో అంటరానితనం పాటించి అత్యంత దారుణంగా హింసించింది. ఇక్కడ చాలా కాలం మనువాద సిద్ధాంతం రాజ్యమేలింది.  ప్రపంచంలోని దాదాపు అన్ని మతాలు మహిళలను తక్కువగానే చూశాయి. చూస్తున్నాయి.  ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు కోపర్నికస్, గెలీలో, జాన్ కెఫ్లర్, బ్రూనో వంటి వారు క్రైస్తవులైనప్పటికీ ఆ మత పెద్దలే వారిని చిత్రహింసలకు గురిచేసి ప్రాణాలు తీశారు. వారి పరిశోధనా పత్రాలు, గ్రంథాలపై నిషేధం విధించారు. వాటిని తగులబెట్టారు. మత విశ్వాసాలు ప్రపంచ అభివృద్ధిని వందల ఏళ్లు వెనక్కు నెట్టేశాయి.  మన దేశం ఇప్పుడు రెండు మతాలకు సంబంధించి రెండు ప్రధాన సమస్యలను ఎదుర్కొంటోంది. ఆ సమస్యలు రెండూ మహిళల సమానత్వానికి సంబంధించినవే. 21వ శతాబ్దంలో భారత్ వంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇటువంటి సమస్యలను ఎదుర్కోవడం అత్యంత దారుణం. ఈ మత విశ్వాసాలు రాజకీయాలను కూడా ప్రభావితం చేసే స్థాయికి ఎదగడం బాధాకరం. దేశంలో న్యాయంపై మతంరాజకీయాలు  పై చేయి సాధించడానికి ప్రయత్నించడం దురదృష్టకరం.       
                      కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018 సెప్టెంబర్ 28న ఐదుగురు జడ్జిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం  కీలక తీర్పు ఇచ్చింది.  చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా తీర్పును చదివారు. ‘‘చట్టాలు,సమాజం అందరినీ గౌరవించాలి. దైవత్వం లింగ విబేధాలు చూపించదు. అన్ని వయస్సుల మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లవచ్చు. భారత దేశంలో మహిళలను దేవతలతో కొలుస్తారు. అలాంటప్పుడు లింగ బేధం చూపలేం. మహిళను తక్కువగా చేసి చూడలేం. మతం అనేది ప్రాథమిక జీవన విధానంలో భాగం. మతం విషయంలో మహిళలకు సమాన హక్కులు ఉండాల్సిందే. శారీరకమైన మార్పులను సాకుగా చూపి మహిళలపై వివక్ష చూపించడం సరికాదు. మహిళలను శబరిమల ఆలయంలోకి ప్రవేశించడాన్ని నిరాకరించడం అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25లను ఉల్లంఘించినట్లే’’ అని ఆ తీర్పులో పేర్కొన్నారు.  ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు ఈ తీర్పుతో అంగీకరించగాఏకైక మహిళా జడ్జి జస్టిస్‌ ఇందూ మల్హోత్రా భిన్నమైన అభిప్రాయాన్ని వెల్లడించడం విశేషం. సతీసహగమనం లాంటి సామాజిక రుగ్మతలు మినహా మతపరమైన విధానాలను తొలగించే దానిపై నిర్ణయం తీసుకునే అంశం కోర్టుకు సంబంధించినది కాదన్నారు. దేశంలో లౌకిక వాతావరణాన్ని కల్పించేందుకు బలంగా నాటుకుపోయిన మతపరమైన ఆచారాల్లో మార్పు చేయవద్దన్నారు. సుప్రీం కోర్టు తీర్పుని దేవస్థానం బోర్డు స్వాగతించింది.  తీర్పుపై బోర్డు రివ్యూ పిటిషన్ కూడా వేయదలుచుకోలేదు.
అయితే అయ్యప్ప భక్తులు ఈ తీర్పుని వ్యతిరేకించారు. కేరళ రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు చేశారు. మహిళల చేత కూడా చేయించారు. ఆందోళనలు చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆలయంలో ప్రవేశించడానికి ప్రయత్నించిన మహిళలను అడ్డుకున్నారు.  వారిపై దాడులు కూడా చేశారు. దాంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఎవరి హక్కులనైతే కాపాడటానికి అత్యున్నత న్యాయస్థానం ప్రయత్నిస్తోందో వారు కూడా ఆ హక్కులు వద్దనడం మత మౌఢ్యానికి నిదర్శనం. ఈ నేపధ్యంలో స్త్రీ-పురుష సమానత్వంసామాజిక సంస్కరణలపై ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకునేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌  ‘‘వనితా మతిల్‌’’ పేరుతో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు.  2019 జనవరి 1వ తేదీ సాయంత్రం సముద్ర తీరం వెంబడి రహదారులపై   ఉత్తరాన కాసర్‌గాడ్‌ నుంచి దక్షిణాన తిరువనంతపురం వరకు 620 కిలోమీటర్ల పొడవున దాదాపు 40 లక్షల మందికి పైగా మహిళలు  భారీ మానవహారంలో పాల్గొన్నారు. మహిళా శక్తి ప్రదర్శనలో కేరళ ప్రభుత్వం చూపిన చొరవ అభినందనీయం.
చివరకు  జనవరి 2వ తేదీ తెల్లవారుజామున 3.45 గంటలకు కొందరి రక్షణతో 50 ఏళ్ల లోపు వయసున్న ఇద్దరు మహిళలు బిందు అమ్మిని(40) కనకదుర్గ(39) తొలిసారిగా ఆలయం లోపలకు  ప్రవేశించారు. దీంతో రెచ్చిపోయిన హిందూ మత సంస్థలు, అయ్యప్ప భక్తులు ఆందోళణకు దిగారు. ఈ నెల 3వ తేదీ కేరళ బంద్ కు పిలుపు ఇచ్చారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటలకు రాజకీయ రంగు పులుముకున్నది.
         ఇక రెండవది ముస్లింలకు చెందిన ట్రిపుల్ తలాక్ అంశం. ఇది కూడా స్త్రీ-పురుష సమానత్వానికి చెందినదే. ముస్లింలలో భర్తలు భార్యలకు విడాకులు ఇవ్వడం అత్యంత సులభమైన పని.  ఏకపక్షమైనది. న్యాయస్థానంతో సంబంధం లేకుండా ఎలాంటి కారణం చెప్పకుండా ఏకపక్షంగా భర్త మూడు సార్లు తలాక్ చెప్పి ఇచ్చే విడాకులను తలాక్ అంటారు. మరో మూడు రకాలుగా కూడా భార్యాభర్తలు విడిపోతారు. అయితే ఈ తలాక్ పద్దతే అత్యంత దారుణమైనది. భార్యను నిరాశ్రయురాలిని చేస్తుంది. భర్తకు భార్య తలాక్ పద్దతిలో విడాకులు ఇచ్చే అవకాశం లేదు. ట్రిపుల్ తలాక్‌ను సుప్రీంకోర్టు 2017లో రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. అయినా ఈ సంప్రదాయం ఇంకా కొనసాగుతోంది. ఈ తీర్పు వెలువడిన తరువాత కూడా దేశవ్యాప్తంగా దాదాపు 45 మంది భర్తలు తమ భార్యలకు తలాక్ చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు వారికి అండగా నిలవలేకపోయింది. తలాక్ చెప్పిన భర్త మరో పెళ్లి చేసుకుంటున్నాడు. సరైన చట్టాల రూపకల్పన ద్వారా స్త్రీ-పురుషులిద్దరికీ సమాన న్యాయం అందించవలసిన బాధ్యత పార్లమెంటుపై ఉంది. ముస్లిం పర్సనల్ లా తప్ప అన్నివర్గాల పర్సనల్ లాలను పార్లమెంటు సంస్కరించింది. ముస్లిం పర్సనల్ లా సంస్కరణ కోసం ముస్లిం మహిళలే దశాబ్ద కాలంగా ప్రయత్నాలు చేశారు. వారు సంఘటితమై సమాన న్యాయం కోసం ఖురాన్ బోధనలురాజ్యాంగ నిబంధనలపై అవగాహనను పెంచేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వానికి వినతి పత్రాలు కూడా అందజేశారు. సంప్రదాయ ముస్లిం మతపెద్దలు ముస్లిం మహిళల డిమాండ్లను అసలు పట్టించుకోలేదు.  హిందూక్రైస్తవజైన్ మహిళలతో సమానంగా ముస్లిం మహిళలకు కూడా న్యాయం అందించాలన్న అంశంపై దేశంలోని రాజకీయ పార్టీలలో ఏకాభిప్రాయంలేదు. ఈ నేపధ్యంలో ముస్లిం మహిళలకు న్యాయం చేసే తలాక్ బిల్లు (ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు) 2018 డిసెంబర్ 27  లోక్‌సభలో 245 ఓట్లతో  ఆమోదం పొందింది. అయితే పలు  విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.  ఈ బిల్లుని డిసెంబర్ 31న కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశ పెట్టింది. అయితే విపక్ష పార్టీల సభ్యులు బిల్లును అడ్డుకున్నారు.  దీనిపై సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ సభను జనవరి 2కు వాయిదా వేశారు. రాజ్యసభలో ఈ బిల్లు భవితవ్యం అనిశ్చితిలో పడింది. ఈ బిల్లుకు యథాతథంగా మద్దతు ఇవ్వం అని కాంగ్రెస్ ప్రకటించింది. బిల్లుని జాయింట్ సెలక్షన్ కమిటీకి పంపాలని డిమాండ్ చేస్తోంది. వివిధ కారణాల రీత్యా విపక్షాలు ఈ బిల్లుకు మద్దతు తెలుపడంలేదు. పూర్తిగా వ్యతిరేకించడంలేదు. బిల్లులో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కొందరు ముస్లిం మహిళలు కూడా దీనిని వ్యతిరేకించి నిరసన ప్రదర్శనలు చేయడం శోచనీయం.
ఈ బిల్లుపై తలెత్తిన వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఆ కారణంగా ముస్లిం బాధిత మహిళలు నష్టపోతారు. మత విశ్వాసాలు ఎంత బలీయంగా ఉంటాయో, ప్రభుత్వాలను కూడా ఎలా ఇరుకున పెడతాయో, రాజకీయాలను కూడా ఎలా శాసిస్తాయో ఈ సంఘటనల ద్వారా స్పష్టమవుతోంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...