Feb 14, 2017

జాతీయ మహిళా పార్లమెంట్ కు భారీ ఏర్పాట్లు

సర్వాంగసుందరంగా రూపుదిద్దుకున్న పవిత్ర సంగమ ప్రదేశం
            కృష్ణా నదీ తీరాన ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద ఈ నెల 10 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న  సదస్సుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవిదేశాలకు చెందిన దాదాపు 12 వేల మంది హాజరయ్యే ఈ సదస్సుకు అదే స్థాయిలో సౌకర్యాలు సమకూరుస్తున్నారు. వచ్చిన అతిధులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని అందుబాటులో ఉంచుతున్నారు. దాదాపు పది వేల మంది ఒకేచోట కూర్చోవడానికి అనువుగా అత్యంత ఆధునికంగా అతి పెద్ద సమావేశ హాలు నిర్మించారు.  కేవలం మూడు రోజుల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసినప్పటికీ  పటిష్టంగా  నిర్మించారు. సదస్సు ప్రదేశానికి ఎదురూగానే అతి పెద్ద డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం సదస్సు హాలు పక్కనే మరో డైనింగ్ హాలు ఏర్పాటు చేశారు. ఆ పక్కనే ముఖ్యమంత్రి సమావేశా హాలు, డైనింగ్ హాలు  నిర్మించారు. వాటన్నిటి లోపల ఏసీలను అమరుస్తున్నారు. మూడు రోజుల పాటు సాయంత్రాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం కోసం నదికి ఆనుకొని బహిరంగ ప్రదేశంలో అత్యంత ఆధునికంగా మరో పెద్ద స్టేజీ నిర్మించారు. అక్కడ కృష్ణా పుష్కరాలు సందర్భంగా నాటిన పూల మొక్కలు అంత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. సమీపంలోనే మీడియా సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
          రాష్ట్రం నుంచి, దేశం నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి అన్ని రంగాలకు చెందిన మహిళలు ఇక్కడ సమావేశమై వారివారి  సమస్యలను చర్చిస్తారు. సమస్యలకు పరిష్కారాలను సూచిస్తారు. కొన్ని ప్రధాన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఇటువంటి సదస్సు దేశంలో జరడం ఇదే మొదటి సారి.  ఇంతటి సదస్సుకు వచ్చే వారందరికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా వివిధ శాఖలకు చెందిన  వేల మంది సిబ్బంది పనులు చేస్తున్నారు. అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అందికీ ఉపయోగపడేవిధంగా తాత్కాలిక మరుగు దొడ్లు ఏర్పాటు చేశారు. శాశ్విత ప్రతిపదికన అత్యంత ఆధునికమైన 30 మరుగుదొడ్లు నిర్మించారు. వాటిలో పురుషులు, మహిళలతోపాటు దివ్యాంగులకు కూడా ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్నాయి. వాటికి సోలార్ విద్యుత్ సౌకర్యం కూడా కల్పించారు.  వీఐపీల కోసం ప్రత్యేకంగా 90 మరుగు దొడ్లు ఏర్పాటు చేశారు.  
         సదస్సు జరిగే సమయంలో విద్యుత్ కు ఎటువంటి అంతరాయం కలుగకుండా ఏడు ట్రాన్స్ ఫార్మర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేశారు.   నిర్వహణ ఏర్పాట్లు చూసే బాధ్యులు (ఈవెంట్ మేనేజ్ మెంట్ వారు) ముందు జాగ్రత్తగా దాదాపు 20 జనరేటర్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ శాఖ వారు కూడా మరో నాలుగు జనరేటర్లు అందుబాటులో ఉంచారు. డ్వాక్రా ఉత్పత్తులు అమ్మకాలకు 26 స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. డ్వాక్రా మహిళలు వీటిని నిర్వహిస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సదస్సు జరిగేవిధంగా ఏర్పాట్లు చేశారు. పవిత్ర సంగమ ప్రాంతాన్ని అత్యంత మనోహరంగా తీర్చిదిద్దారు.
వైద్య శిబిరాల ఏర్పాటు
         సదస్సుకు హాజరయ్యే వారికి అత్యవసరంగా వైద్యం అందించడం  కోసం వైద్య ఆరోగ్య శాఖ వారు రెండు మెడికల్ క్యాంప్ లు, ఆరు నుంచి పది బెడ్ లతో ఓ తాత్కాలిక మినీ ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మూడు రోజులు ఇక్కడ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. మొత్తం పది మంది  డాక్టర్లు విధులు నిర్వహిస్తారు. ఎవరికైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడితే సమీపంలోని కార్పోరేట్ ఆస్పత్రులకు తరలిస్తారు. అందుకోసం మూడు కార్పోరేట్ ఆస్పత్రులలో, ప్రభుత్వ ఆస్పత్రిలో పదేసి బెట్ల చొప్పున అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాటు చేశారు. అలాగే వివిధ విభాగాలలో డాక్టర్లు అందుబాటులో ఉండేవిధంగా కూడా ఆయా ఆస్పత్రులలోని డాక్టర్లకు విధులు నిర్ణయించారు. అంబులెన్స్ లను కూడా అందుబాటులో ఉంచుతారు. మెడికల్ అండ్ హెల్త్ కమిషనర్ శామ్యూల్ అనంద కుమార్ బుధవారం సాయంత్రం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసే ప్రదేశాన్ని సందర్శించారు.

       దేశ విదేశాల నుంచి వచ్చే వీఐపీలకు ప్రముఖ హోటళ్లలో వసతి ఏర్పాట్లు చేశారు. కొందరు అధికారులకు ప్రభుత్వ అతిధి గృహాలను కేటాయించారు. విద్యార్థులు, అధ్యాపకుల కోసం విజయవాడ నగరంలోని 46 ప్రాంతాలలో కాలేజీలు, పాఠశాలలను కేటాయించారు. ఆయా ప్రాంతాలలో వారికి సరిపోయేవిధంగా తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు.

భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు
ప్రముఖులు అనేక మంది వస్తున్నందున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్ అధికారులు దగ్గర ఉండి అన్ని పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ నగర  పోలీస్ కమిషనర్  గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు బుధవారం సాయంత్రం సంగమ ప్రదేశాన్ని సందర్శించి, ఏర్పాట్లనన్నిటినీ పరిశీలించారు. తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ముందు జాగ్రత్తగా పవిత్ర సంగమ ప్రాంతంలో సదస్సు ప్రదేశం లోపల, బైట మొత్తం 170 సీసీ కెమెరాలు అమరుస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...