ప్రజా రాజధాని అమరావతిని ఆత్మగౌరవానికి చిహ్నంగా,సంతోషాలకు నిలయంగా నిర్మించాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యం. విజయదశమికి అమరావతి పాలన నగర నిర్మాణ పనులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. విజయదశమికి నిర్మాణ పనులు ప్రారంభించి2019 మార్చి 31 నాటికి రాజధానిలో పాలనా నగరాన్ని సిద్ధం చేయాలన్న కృతనిశ్ఛయంతో సీఆర్డీఏ ఉంది. లండన్ కు చెందిన ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ ఆగస్టు 15 నాటికి శాసనసభ, 30 నాటికి హైకోర్టు భవంతుల తుది ఆకృతులను అందజేస్తుంది. తుది ఆకృతులకు సంబంధించి నూతన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలకు ప్రెజెంటేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) దాదాపు పూర్తి చేసింది. ప్లాట్ల హద్దుల్లో రాళ్లు కూడా పాతుతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్,మంచినీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల కల్పన రెండేళ్లలో పూర్తి అయ్యేవిధంగా ఏర్పాట్లు కూడా చేస్తోంది.ప్రధాన అనుసంధాన రోడ్డుతో కలుపుకొని నగరం లోపల 8 రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.714కోట్ల వ్యయంతో మరో 3 ప్రధాన రోడ్ల నిర్మాణానికి అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) టెండర్లు పిలిచింది. రాజధాని పరిధిలో రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్ వ్యవస్థ, విద్య, వైద్యం, నివాస,తాగునీరు, ఆతిధ్యం, రవాణా, విద్యుత్, కేబుల్ నెట్ వర్క్...వంటి సౌకర్యాలను సమకూరిస్తే ప్రైవేటు నిర్మాణాలు ఊపందుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావడంతో అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నిర్మాణాలు మొదలుపెట్టాయి. దీనికి తోడు కొన్ని నిబంధనలకు లోబడి పాత లేఅవుట్లకు సీఆర్డీఏ అనుమతి ఇవ్వడం, కొత్త లేఅవుట్ విధానం రూపొందిస్తుండటంతో అమరావతి, దాని చుట్టుపక్కల స్తబ్ధత నెలకొన్న రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడిప్పుడే పుంజుకోవడం మొదలుపెట్టింది. రాజధాని అమరావతి అభివృద్ధికి, పారిశ్రామిక ప్రగతికి సహాయ సహకారాలు అందించేందుకు జపాన్ ముందుకొచ్చింది. ఈమేరకు జపాన్ ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వ శాఖ (మేటి), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహనకు వచ్చాయి. ముఖ్యంగా నాలుగు రంగాల్లో మూడేళ్ల పాటు సహకారానికి జపాన్ అంగీకరించింది.అమరావతిని అభివృద్ధి చేయడంతో పాటు, పారిశ్రామిక క్లస్టర్లు– లాజిస్టిక్ నెట్వర్క్, మానవ వనరుల అభివద్ధి, స్మార్ట్ ఎనర్జీ రంగంలో రాష్ట్రానికి అండగా నిలవనుంది. రాజధాని ప్రాంతానికి సంబంధించి డేటా సెంటర్, క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫాం, రాడార్ ద్వారా విపత్తుల నిరోధక వ్యవస్థ, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ,తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థల ఏర్పాటుకు జపాన్ సహకారం అందించనుంది. సీఆర్డీఏ ప్రాంతానికి సమీకృత ట్రాఫిక్, రవాణా వ్యవస్థపై అధ్యయనానికి అవసరమైన సహకారం అందించేందుకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ఇప్పటికే సన్నద్ధమైంది. రాష్ట్రం ప్రభుత్వం అభ్యర్ధన మేరకు అమరావతిలో స్పోర్ట్స్ సిటీ జోన్,ఎలక్ట్రానిక్ సిటీ అభివృద్ధికి ఎంఎల్ఐటీ మద్దతుగా నిలవనుంది.అమరావతి నిర్మాణానికి జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోపరేషన్ (జెబిక్) కూడా నిధులు అందించే అవకాశం ఉంది.
నీరుకొండ గ్రామం వద్ద 200 ఎకరాల్లో ప్రతిష్టాత్మక ఎస్ఆర్ఎం యూనివర్శిటీ అమరావతి క్యాంపస్ ని, ఐనవోలు గ్రామ సమీపంలో మరో ప్రతిష్టాత్మక విట్ విశ్వవిద్యాలయం క్యాంపస్ ని ప్రారంభించాయి. రూ.12 వేల కోట్లతో బీఆర్ శెట్టి గ్రూపు రాజధాని ప్రాంతంలో ఆరోగ్య నగరాన్ని నిర్మించడానికి సిద్ధమైంది. రాజధానిపరిధిలోని దొండపాడు గ్రామంలో ఆగస్ట్10న బీఆర్ఎస్ మెడిసిటీ వైద్య వర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఆగస్ట్ 16న ఇండో-యూకే వైద్య సంస్థకు శంకుస్థాపన చేయనున్నారు. మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మించనున్నారు.వ్యాలీ స్కూల్, కెఎఫ్ఐ, చిరెక్, ఆర్ఎన్ పోడార్ స్కూల్,నలందా, చిన్మయా విద్యాలయ, రామకృష్ణ మిషన్ స్కూల్,గ్లిండన్, పొదార్ ఇంటర్నేషనల్, రయాన్ గ్లోబల్ స్కూల్ వంటి సంస్థలతో కూడా సీఆర్డీఏ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రపంచశ్రేణి ప్రమాణాలతో కూడిన పాఠశాల విద్య కోసం దేశం మొత్తం అమరావతి వైపు చూసేలా ప్రఖ్యాత విద్యా సంస్థలను ఇక్కడికి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ధీరూభాయ్ అంబానీ ట్రస్టు తమ విద్యా సంస్థను అమరావతిలో నెలకొల్పుతామని హామీ ఇచ్చింది.అమరావతిలో స్టార్ హోటళ్లు నెలకొల్పడానికి రాడిసన్, లీలా,తాజ్, జీఆర్టీ, పార్క్, నోవాటెల్ వంటి 16 బ్రాండ్లు ఆసక్తి కనబర్చాయి. హోటళ్లతోపాటు కన్వెన్షన్ సెంటర్లను కూడా నిర్మిస్తారు. అమరావతిని ప్రపంచంలోనే నెంబర్ నగరంగా రూపొందించే క్రమంలో అత్యంత ఆధునిక హంగులు సమకూర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మౌలిక వసతుల అభివృద్ధి, గృహ నిర్మాణం, వాణిజ్యాభివృద్ధి, ఆరోగ్య రక్షణ, విద్య ప్రాజెక్టులు, పర్యాటకం, దాని అనుబంధ ప్రాజెక్టులు,పరిశ్రమలు, సేవల రంగం వంటివి ఒకేసారి 13 ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రైవేటు కార్పొరేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ దేశంలో అగ్ర స్థానంలో నిలిచింది.
రాజధానిలో అత్యంత ఆకర్షణీయంగా, పర్యాటకులను ఆకర్షించేవిధంగా ఒక కాలువ తవ్వాలని సీఆర్డీఏ నిర్ణయించింది. ఆ కాలువకు ఇరువైపులా పచ్చదనం, పూల మొక్కలతో కళకళలాడేవిధంగా రూపొందిస్తారు. ఈ కాలువ కృష్ణా నది నుంచి ప్రారంభమై పరిపాలన, న్యాయ నగరాలు చుట్టూ తిరిగి మళ్లీ నదిలో కలిసేవిధంగా తవ్విస్తారు. నది నుంచి కాలువలోకి నీళ్లు వెళ్లడానికి పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తారు. ఈ కాలువపై అక్కడక్కడా బ్రిడ్జీలను ఆకర్షణీయంగా రూపొందించడంతోపాటు దీనిని రవాణాకు కూడా ఉపయోగపడేవిధంగా ఏర్పాటు చేయడానికి సర్వే చేస్తున్నారు.
శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్.
No comments:
Post a Comment