Aug 5, 2017

అమరావతి ప్రకటనపై 7న కీలక సమావేశం


సచివాలయం, ఆగస్ట్ 4: మహిళా సాధికారితకు సంబంధించిన అమరావతి ప్రకటనకు తుది రూపం ఇవ్వడానికి ఈ నెల 7వ తేదీ సోమవారం ఉదయం శాసనసభ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో  కీలక సమావేశం జరుగనుంది. శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొని వివిధ అంశాలను చర్చించి, తమతమ అభిప్రాయాలు తెలియజేస్తారు. విజయవాడకు సమీపంలోని పవిత్రసంగమం వద్ద ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు మూడు రోజులపాటు  జాతీయ మహిళాపార్లమెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ పార్లమెంట్ లో  అమెరికా, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలు, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రముఖ మహిళలతోపాటు దాదాపు 25 వేల మంది పాల్గొన్నారు. అప్పటి  ఉపన్యాసాలు, చర్చలు, సిఫారసులు, తీర్మానాల సారాంశంతో అమరావతి ప్రకటనను రూపొందించనున్నారు.  8 మంది ఎడిటోరియల్ బోర్డు సభ్యులతో పది అంశాలతో కూడిన ఒక ముసాయిదాని తయారుచేశారు. ఇందులో స్త్రీ విద్య, మహిళల న్యాయపరమైన హక్కులు, మహిళల ఆరోగ్యం, సమతుల ఆహారం, పారిశ్రామిక రంగంలో మహిళలు, పరిశోధన, నూతన ఆవిష్కరణల్లో మహిళలు, రాజకీయాల్లో మహిళలు, మహిళల సమాజిక భద్రత, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో మహిళల పాత్ర, మహిళల సామాజికాభివృద్ధి, మహిళల డిజిటల్ విద్...తదితర అంశాలు ఉన్నాయి. ముసాయిదాను  రూపొందించడంలో రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత దావ్రా ఎంతో కృషి చేశారు.  వివాదాలకు తావులేకుండా అంతర్జాతీయ స్థాయిలో విస్తృత అంశాల ప్రాతిపదికన ముసాయిదా ప్రకటనను తయారు చేశారు. ఈ ప్రకటనకు తుది రూపం ఇవ్వడానికి జరిగే కీలక సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియ, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ.ఆర్.అనురాధ, రాజధాని నగరాభివృద్ధి, నిర్వహణ సంస్థ ఎండీ లక్ష్మీ పార్థసారధి, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి సునిత, పాఠశాల విద్య శాఖ కమిషనర్ సంధ్య రాణి, దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ దుర్గాభవాని, రిజిస్ట్రార్ మమత, మాజీ రిజిస్ట్రార్ విజయలక్ష్మిసామాజిక శాస్త్రాల డీన్ కృష్ణ కుమారి, అకడమిక్ ప్రోగ్రామ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ జానకి, రెక్టార్ ఉమ వెన్నంఇన్నొవేషన్ సొసైటీ సీఈఓ ప్రొఫెసర్ వి.వల్లికుమారి, ప్రపంచ బ్యాంక్ ఆరోగ్యం, సమతులాహారం టెక్నికల్ కన్సెల్టెంట్ లక్ష్మీ దుర్గ, ఆంధ్రప్రదేశ్ మహిళా పారిశ్రామికవేత్తల సంఘం అధ్యక్షురాలు రమాదేవి తదితరులు పాల్గొంటారు. వీరందరూ ముసాయిదాలోని అన్ని అంశాలను చర్చించి ఈ సమావేశంలో తుది ప్రకటనను రూపొందిస్తారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...