రాష్ట్రం కోసం దీక్ష చేస్తే, ఖర్చులపై
దుష్ప్రచారం
మంత్రి కాలవ శ్రీనివాసులు
సచివాలయం, ఫిబ్రవరి 13: రాష్ట్రం కోసం ఢిల్లీలో చేసిన
ధర్మపోరాట దీక్ష ఖర్చుపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని సమాచార, పౌర
సంబంధాల శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా
కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర
ప్రజాప్రతినిధులు, ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాల వారు ఈ దీక్షలో పాల్గొన్నారని
తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి ఒకటి, రాయలసీమ నుంచి ఒకటి రెండు రైళ్లు పెట్టామన్నారు.
రైళ్లకు రూ.కోటీ 23 లక్షలు, ఏపీ
భవన్లో రూ. కోటీ 60 లక్షలు మొత్తం రూ.2 కోట్ల 83 లక్షలు ఖర్చయినట్లు మంత్రి వివరించారు.
అయితే ప్రతిపక్షాలు రూ.10 కోట్లు ఖర్చయినట్లు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
వారి విమర్శ తీరు కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లుందన్నారు. మనం రాష్ట్రం కోసం ఈ దీక్ష చేశామని చెప్పారు. 2011 సెప్టెంబరు 17న గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
నరేంద్ర మోదీ ‘సద్భావన మిషన్’ పేరుతో
మూడు రోజుల పాటు చేసిన ఖర్చు ధర్మపోరాట దీక్ష ఖర్చు కంటే చాలా ఎక్కువన్నారు. అది
ఆయన తన సొంతానికి, పార్టీ ప్రయోజనాల కోసం చేసిన దీక్షగా
పేర్కొన్నారు. మన
ధర్మపోరాటం ఏపీకి చెందిన ఐదు కోట్ల ప్రజల కోసం చేసిన దీక్ష అని మంత్రి కాలవ
అన్నారు.
No comments:
Post a Comment