ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తినలో ఆంధ్రుల సత్తా మరోసారి చాటారు. 68 ఏళ్ల వయసులో కూడా పోరాట పటిమ ప్రదర్శించారు. ధర్మపోరాట దీక్ష ఉద్యమాన్ని ఉదృతం చేశారు. ఢిల్లీ సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా నినాదాలతో హోరెత్తింది. స్వామి కార్యంతోపాటు స్వకార్యం అన్నట్లు, రాష్ట్ర సమస్యకు జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించడంతోపాటు బిజేపీఏయతర రాజకీయ పార్టీల మధ్య బంధాన్ని పఠిష్టం చేసి విజయం సాధించారు. మనకి దేశ వ్వాప్తంగా భరోసా లభించింది. సమాఖ్య వ్యవస్థ బలపడటానికి అవకాశం ఏర్పడింది. ఈ క్రెడిట్ వంద శాతం చంద్రబాబుకే దక్కుతుంది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఆయన ఎండగడుతూనే ఉన్నారు. మొదట రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో ధర్మపోరాట దీక్షలు చేశారు. అన్ని దీక్ష సభలలో 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రధాని అభ్యర్ధిగా వచ్చిన మోడీ తిరుపతిలో ఇచ్చిన హామీలకు సంబంధించి వీడియోను ప్రదర్శించారు. 2018 ఏప్రిల్ 20న తన పుట్టిన రోజున విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఆహారం తీసుకోకుండా ధర్మపోరాట దీక్ష చేశారు. దేశ చరిత్రలో ముఖ్యమంత్రిగా పుట్టినరోజున రాష్ట్రం కోసం నిరశన దీక్ష చేసి చంద్రబాబు నాయుడు తన ప్రత్యేకతను చాటుకున్నారు. 'నమ్మక ద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం' అనే నినాదంతో ఏప్రిల్ 30న తిరుపతిలో ధర్మపోరాట దీక్ష బహిరంగ సభ నిర్వహించారు. అప్పటికి సరిగ్గా నాలుగు ఏళ్ల క్రితం ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోడీ 2014 ఏప్రిల్ 30న శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని తారకరామా స్టేడియంలో ప్రత్యేక హోదా ఇస్తామని, రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అందువల్ల ఆ రోజు అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ తరువాత మే 22న విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కశాశాల మైదానంలో, జూన్ 29న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జెఎన్టీయూ ప్రాంగణంలో, జూలై 29న ఒంగోలులో, సెప్టెంబర్ 29న తాడేపల్లిగూడెంలో, అక్బోబర్ 30న కడప జిల్లా ప్రొద్దుటూరులోని బొల్లవరం సమీపంలో, నవంబర్ 20న నెల్లూరు ఎస్ విజీఎస్ కాలేజ్ గ్రౌండ్లో, డిసెంబర్ 26న అనంతపురంలో ధర్మపోరాట దీక్షలు చేశారు. కేంద్ర ఉలిక్కిపడేలా సభలు నిర్వహించారు. అన్ని చోట్ల ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, జనం భారీ స్థాయిలో తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. అన్ని సభలలో ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు విషయంలో కేంద్ర వైఖరికి చంద్రబాబు నాయుడు నిరసన తెలిపారు. పక్షపాత ధోరణిని ఎండగట్టారు. రాజధాని అమరావతి, పోలవరం బహుళార్ధ ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులివ్వాలని, కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని, విశాఖకు రైల్వే జోన్ కేటాయించాలని డిమాండ్ చేశారు. 11 విద్యాసంస్థలకు భూమి కేటాయించినా వాటి నిర్మాణానికి అరకొర నిధులు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా ఉండి ఉంటే 90 శాతం గ్రాంటు వచ్చేదని, 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని, ఏపీకి ఎందుకివ్వరు? అని ప్రశ్నించారు. నవ్యాంధ్రకు ఇచ్చినవి చట్టబద్ధమైన, న్యాయమైన హామీలని, వాటిని పూర్తిగా నెరవేర్చడం కేంద్రం బాధ్యత అని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చారని, సర్దార్పటేల్ విగ్రహానికి రూ.2500 కోట్లు ఇచ్చారని వివరించారు. కేంద్ర నమ్మకద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు దీక్ష చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తే కొరివితో తలగోక్కున్నట్లేనని కేంద్రాన్ని హెచ్చరించారు. ఫిబ్రవరి 11న దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ లో ధర్మపోరాట దీక్ష చేపట్టి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా నినాదాన్ని మరో సారి మారు మ్రోగించారు. దీక్షకు ముందు సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రాసిన లేఖలో ‘‘నాకు గౌరవం కాదు నేను కోరుకునేది నా రాష్ట్రానికి గౌరవం. 5 కోట్ల ఆంధ్ర ప్రజల ప్రతినిధిని, 175మంది సభ్యుల శాసనసభకు నాయకుడిని. నేను కోరేది నాకు న్యాయం చేయమని కాదు, నా రాష్ట్రానికి న్యాయం చేయమని. మా హక్కులు నెరవేర్చమని, విభజన చట్టంలో ఉన్న 18 అంశాలు అమలు చేయమని నేను డిమాండ్ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేసిన చంద్రబాబు హస్తినలో కూడా దీక్ష చేసి ప్రత్యేక హోదా అంశానికి జాతీయ స్థాయి ప్రాధాన్యత కల్పించారు. పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో ముఖ్యమంత్రి హోదాలో దీక్ష చేసి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. దేశం నలుమూలల నుంచి జాతీయ స్థాయి నేతలు, రాజకీయ ఉద్దండులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ, ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్, మూలాయం సింగ్, శరద్ యాదవ్, రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, శత్రుఘ్న సిన్హా వంటి వారు కదిలివచ్చి మద్దతు తెలిపారు. అయితే రాష్ట్రం కోసం జాతీయ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఉభయ కమ్యూనిస్టులు, వైఎస్ఆర్ కాంగ్రెస్, కొత్త పార్టీ జనసేన మద్దతు ప్రకటించలేదు.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914
No comments:
Post a Comment