Sep 5, 2020

ఒకే ఒక్క పోలీస్ - ఉమేష్ చంద్ర IPS

నీతినిజాయితీకి మారు పేరు

 ఎంతో మందికి స్ఫూర్తి ...

ఇప్పటి కీ ఆయనే అందరికీ మార్గదర్శకం..

చదలవాడ ఉమేష్ చంద్ర

పోలీస్ వర్గాలలో ఈ పేరు చెబితే చాలు వాళ్ళ రోమాలు నిక్కబొడుస్తాయి .. రక్తం పోటెత్తుతుంది, కానీ ఇప్పటి యువతరానికి పెద్దగా తెలియదు,

 మహా అయితే హైదరాబాద్ అమీర్ పేట, ఎస్.ఆర్.నగర్ ఏరియాల్లో ఉండేవాళ్ళకి

ఉమేష్ చంద్ర స్టాట్యూ దగ్గరఅని అడ్రస్ లాండ్ మార్క్ గా చెప్పడానికి తెలుసేమో " !

 మరి ఎవరీ ఉమేష్ చంద్ర ?

నక్షలిజం, ఫ్యాక్షనిజం, రౌడీయిజం లాంటి ఇజాలకు తన పోలీసిజం రుచి చూపించిన ఒక్క మగాడు ..

దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ లాంటి పదాలకు ప్రాణం పోస్తే ఆయన రూపం 

మనకు తెలుగు సినిమాలలో చాలా మంది పులులు సింహలు ఉన్నారు, కానీ నిజజీవితంలో కడప పులిఅని పేరుగాంచిన పోలీస్ అధికారి ఉమేష్ చంద్ర..

ఆయన అమర మరణం చెంది నేటికి 17 సంవత్సరాలు .. ఆయన కథేంటో చూద్దాం ..

ఉమేశ్ చంద్ర మార్చి 19, 1966 న గుంటూరు జిల్లా పెదపూడి గ్రామములో వేణుగోపాల రావు, నయనతార దంపతులకు జన్మించారు.

1991లో IPS కి ఎన్నికై, 1991-92 లో జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందారు, మొదట 1992 నుండి 1994 వరకు వరంగల్లులో ASP గా పని చేశారు. వరంగల్లులో పనిచేసిన కాలంలో జనజాగృతిఅనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు,

దాని ద్వారా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో వరంగల్లు గ్రామాల్లో పాతుకుపోయిన నక్షలిజాన్ని రూపుమాపడానికి కృషిచేస్తూ మొదటి పోస్టింగుతోనే

నక్షల్స్ కు బద్దవిరోధి అయ్యారు.తరువాత కడప జిల్లాలో ఫాక్షనిజంతో కరుడుగట్టిన పులివెందుల ఏరియాకి గా బదిలీ చేయబడ్డారు, అక్కడ పనిచేసింది కేవలం 4 నెలలు మాత్రమే కానీ తన చర్యలతో అక్కడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారు.

 మనం కేవలం సినిమాల్లో చూసే పోలీస్ హీరోయిజాన్ని పులివెందుల్లో చూపించారు, చిన్న చిన్న గుండాల నుండి బడా బడా ఫ్యాక్షనిస్టులకు కంటికి నిద్రలేకుండా చేసారు, అర్ధారాత్రులు, తెల్లవారుజాము ఇలా విశ్రాంతి అనేదే లేకుండా రైడింగులు చేస్తూ దొరికిన వాడిని దొరికినట్లుగా అరెస్టులు చేస్తూ ప్రజలకి ఒక భరోసా కల్పించారు, మామూలుగా సినిమా హీరోల పైన, రాజకీయనాయకుల పైన పాటలు వ్రాస్తారు.అలాంటిది పోలీసు అధికారి పై పాటలు వ్రాసారు.

అదికూడా కేవలం నాలుగు నెలల కొంచెం సమయంలోని ఆయన చేసిన పనికి ఈ ఒక్కటి చాలు ఆయన శాంతిని నెలకొల్పడానికి చేసిన పనులు అక్కడ ప్రజలను ఎంతగా ఆకట్టుకున్నాయో తెలియడానికి

ఫిబ్రవరి 1995 లో వరంగల్లు ప్రత్యేక విధుల అధికారిగా నియమితులయ్యారు, ఈసారి నక్షలిజం పై విరుచుకుపడ్డారు, వరంగల్లులో తొలిసారిగా ప్రజలు కష్టం వస్తే అన్నలను కాకుండా పోలీసులను కలవడం మొదలుపెట్టారు.

ఈమధ్య కాలంలో బాగా వినిపిస్తున్న ఫ్రెండ్లీ పోలీస్ ని అప్పట్లోనే ఆయన ఆచరించి చూపించారు

ప్రజలతో మమేకమై పోలీసులపై సంఘములోగల దురభిప్రాయములు తొలగించారు. ఎంతో మంది నక్సలైట్లను పట్టుకొనుటలో సఫలమయ్యారు.

 1995 జూన్ లో పోలీస్ సూపరింటెండెంట్ గా పదోన్నతి పొంది కడప జిల్లాకు తిరిగి వచ్చారు. తరువాత జూన్ 1997 న కరీంనగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా బదిలీ అయ్యారు, ఈ రెండు సంవత్సరాలలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎంతో మంచిచేసింది, ఆయన్ని కడప ప్రజలు ఎంతలా అభిమానించారంటే ఆయన బదిలీ ఆపమని ధర్నాలు కూడా చేసారు, ఆయన బదిలీ అయి వెళుతున్న రోజు ప్రజలు ఆయనికి పలికిన వీడ్కోలు అంతకుముందు గానీ, ఆ తరువాత గానీ ఎక్కడా ఏ పోలీసు అధికారికి జరగలేదు

ఉమేశ్ చంద్ర సెప్టెంబరు 4, 1999 న హైదరాబాదు యస్సార్ నగర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగగా నలుగురు నక్సలైట్లు కాల్పులు జరిపారు. అంగ రక్షకుడు,  డ్రైవరు వెంటనే మరణించారు. ఉమేశ్ చంద్ర కారు దిగి నక్సలైట్లను తరిమి వెంటాడారు.

ఆయన వద్ద గన్ లేదని గ్రహించిన నక్సలైట్లు ఆగి రెండు సార్లు కాల్పులు జరిపారు. గుండు దెబ్బలు తిని పడిపోయిన ఉమేశ్ చంద్ర వద్దకు వచ్చి సమీపము నుండి కాల్చి పారిపోయారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...