సర్ పిట్టి త్యాగరాయ శెట్టి 1852 ఏప్రిల్ 27వ తేదీన మదరాసు చాకలిపేటలోని సంపన్న చేనేత కుటుంబంలో జన్మించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఏ.వరకు చదువుకున్నారు. తండియారు పేటలో మగ్గాలు పెట్టించి తాను స్వయంగా నేత నేసి, పది మంది చేత నేయించి అనేక బహుమతులు అందుకున్నారు. 1905లో ఆయన పర్యవేక్షణ కింద మదరాసులో చేతితో నాడి విసిరే త్రో షటిల్ మగ్గం స్థానంలో కుచ్చుతో నాడిలాగే షటిల్ మగ్గం రూపు దిద్దుకుంది. తండ్రి అయ్యప్ప చేస్తున్న తోళ్ళవాప్యారంలోకి దిగి మంచి పేరు గడించారు.
40 సంవత్సరాలు మద్రాసు నగర మేయర్ గా వుండి నగరాభివృద్ధి నిస్వార్థంగా చేసిన కృషికి గుర్తింపుగా కార్పొరేషన్ కార్యాలయం (రిప్పన్ బిల్డింగ్) ముందు త్యాగరాయ శెట్టి విగ్రహం ప్రతిష్టించారు. ఇది చేనేత వర్గీయులకెంతో గర్వకారణం. ఆయన స్మారకార్థం టి.నగర్ (త్యాగరాయ నగర్) అని పేరు పెట్టడం జరిగింది. 1921లో దివాన్ బిరుదు పొందారు. 1920లో లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడై ముఖ్యమంత్రి పదవి వరించి వచ్చినా సున్నితంగా తిరస్కరించారు. 1921లో సర్ బిరుదు వచ్చింది చేనేత వారి బిడ్డల విద్యాభివృద్ధికై 1897లో నార్త్ మదరాసు హిందూ హైస్కూలును స్థాపించారు. 1906నాటికి ఉన్నత పాఠశాల అయింది. 1950 నాటికి త్యాగరాయ కళాశాలగా రూపుదిద్దుకుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలేజీకి 45,000 రూపాయల విరాళం యిచ్చింది. 1921 లో ఏర్పడిన అఖిల భారత పద్మశాలి సంఘానికి, చేనేత ఉద్యమాలకు పేద చేనేత విద్యార్థులకు ధారాళంగా ధన సహాయం చేసిన ధర్మమూర్తి త్యాగరాయ శెట్టి. 1925, జూన్ 30న తన 73వ ఏట ఆయన కన్నుమూశారు. ఆయన వారసత్వం పోకుండా కుమారులు కుమార స్వామి శెట్టి, బెంగాల్ రాయ్ శెట్టి చేనేత కాంగ్రెస్ కార్యక్రమాలకు యితోధికంగా సహకరించేవారు. మదరాసులో నిర్వహించిన పలు కార్యక్రమాలకు, ప్రత్యేకించి 1951 సత్యాగ్రహానికి, చిన్నా పెద్ద మీటింగులకు త్యాగరాయ కాలేజి కేంద్రస్థానంగా నిలిచింది.
- గోలి హనుమంత రావు
No comments:
Post a Comment