1.జగనన్న అమ్మ ఒడి
పేద విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఆర్థిక సాయం చేసేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకులాలు, జూనియర్ కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఏడాదికి రూ.15 వేల చొప్పున అందిస్తారు.
అర్హతలు:
లబ్ధిదారుల కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.12వేల లోపు ఉండాలి. విద్యార్థుల హాజరు కనీసం 75 శాతం ఉండాలి.
స్వచ్ఛంద సంస్థల ద్వారా చదువుకుంటున్న అనాథ పిల్లలు, వీధి బాలలు కూడా ఈ పథకం పరిధిలోకి వస్తారు. ఎంతమంది పిల్లలున్నా, ఒక్కో లబ్ధిదారునికి రూ.15 వేలు మాత్రమే ఇస్తారు.
2.వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ
పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించేందుకు ఈ పథకం తెచ్చారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబం ఏడాదికి రూ.5 లక్షల వరకూ పూర్తిగా ఉచిత వైద్యం పొందొచ్చు.
పుట్టుకతో చెవుడు ఉన్న చిన్నారులకైతే రూ.12 లక్షల వరకూ వైద్య బీమా వర్తిస్తుంది. క్యాన్సర్ బాధితులకు రూ.5 లక్షలకు మించి ఎంత వ్యయమైనా ప్రభుత్వమే భరిస్తుంది.
ఈ పథకం కింద హైదరాబాద్, చైన్నై, బెంగళూరుల్లోనూ కొన్ని ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునేందుకు అవకాశం ఉంది. చికిత్స తర్వాత కోలుకునేవారికి ఆరోగ్య సమస్య తీవ్రతను బట్టి రోజుకు రూ.225 నుంచి రూ.5వేల వరకూ సాయం అందిస్తారు.
అర్హతలు:
కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించకూడదు.
మాగాణి భూమి 12 ఎకరాలలోపు... లేదా మెట్ట గానీ, మెట్ట, మాగాణి కలిపి గానీ 35 ఎకరాలలోపు ఉన్నవారికే వర్తిస్తుంది.
ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులు, పెన్షన్దారులకు వర్తించదు.
నాలుగు చక్రాల వాహనం ఒకటికి మించి ఉండకూడదు.
మున్సిపాలిటీలో మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణానికి మించిన భవనం ఉండకూడదు.
3.వైఎస్ఆర్ పెన్షన్ కానుక:
60 ఏళ్లు దాటిన వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్జెండర్లు, డప్పు కళాకారులు, హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులు, కుష్ఠు వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారికి నెలవారీ పెన్షన్లు అందించేందుకు ఈ పథకం పెట్టారు.
కేటగిరినీ బట్టి రూ.2250 నుంచి రూ.10వేల వరకూ పెన్షన్ ఇస్తారు.
అర్హతలు:
కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.12వేల లోపు ఉండాలి.
మాగాణి భూమి 3 ఎకరాలలోపు... లేదా మెట్ట గానీ, మెట్ట, మాగాణి కలిపి గానీ 10 ఎకరాలలోపు ఉన్నవారికే వర్తిస్తుంది.
4.పేదలకు ఇళ్లు:
ఇళ్ల స్థలాలు లేని పేద కుటుంబాలకు ఉచితంగా ఇంటి స్థలం, పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఈ పథకం తెచ్చారు.
ఈ పథకం కింద అర్హులైన వారికి 1.5 సెంట్ల భూమిని కేటాయిస్తారు.
అర్హతలు:
రాష్ట్రంలో ఎక్కడా సొంత ఇల్లు గానీ, ఇంటి స్థలం గానీ ఉండకూడదు.
ఇతర కేంద్ర, రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల లబ్ధిదారులకు వర్తించదు.
వ్యవసాయ భూమి 2.5 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్టకు మించి ఉండకూడదు.
వార్షిక వ్యక్తిగత ఆదాయం పట్టణాల్లో రూ.3 లక్షలకు మించకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి.
5.జగనన్న చేదోడు:
సొంత షాపు ఉన్న రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీల (టైలర్ల)కు ఆర్థిక చేయూతను ఇచ్చేందుకు ఈ పథకం పెట్టారు.
లబ్ధిదారులకు ఏడాదికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు.
అర్హతలు:
బీసీ వర్గానికి చెందిన రజకులు, నాయూ బ్రాహ్మణులు, అన్ని కులాలకు చెందిన దర్జీ పనిచేసేవారు అర్హులు.
సొంతంగా షాపు ఉండాలి. వారి పేరు మీదే అది రిజిస్టరై ఉండాలి.
కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.12వేల లోపు ఉండాలి.
మాగాణి భూమి 3 ఎకరాలలోపు... లేదా మెట్ట గానీ, మెట్ట, మాగాణి కలిపి గానీ 10 ఎకరాలలోపు ఉన్నవారికే వర్తిస్తుంది.
పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించి విస్తీర్ణమున్న భవనం ఉండకూడదు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు, నాలుగు చక్రాల వాహనం (ఆటో, ట్యాక్సీ, ట్రాక్టర్కు మినహాయింపు ఉంది) ఉన్నవారు అనర్హులు.
6.వైఎస్ఆర్ నేతన్న నేస్తం:
చేనేత మగ్గాల మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు.
సొంత మగ్గం ఉన్న ప్రతీ కుటుంబానికి రూ.24వేల సాయం అందజేస్తారు. కుటంబంలో ఎన్ని చేనేత మగ్గాలున్నా, ఒక్క మగ్గానికి వర్తించే సాయమే ఇస్తారు.
అర్హతలు:
దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చేనేత కార్మికులై ఉండాలి.
సొంత మగ్గంపై పనిచేస్తూ, దానిపై జీవనోపాధి పొందుతున్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
ప్రాథమిక చేనేత సంఘాలు, మాస్టర్ వీవర్ షెడ్లలో పనిచేసే చేనేత కార్మికులు అనర్హులు.
కనీసం ఏడాదిగా సొంత మగ్గంపై పనిచేస్తున్నవారై ఉండాలి.
7.జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన:
ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు చేయూతను ఇచ్చేందుకు ఈ పథకం తెచ్చారు.
అర్హులైన విద్యార్థులకు అన్ని కోర్సులకు విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తారు.
వసతి దీవెన కింద వసతి, భోజన ఖర్చుల కోసం రూ.20వేలు ఇస్తారు. పాలిటెక్నిక్ కోర్సు చేస్తున్నవారికి రూ.15వేలు, ఐటీఐ కోర్సు చేస్తున్నవారికి రూ.10వేలు ఇస్తారు.
అర్హతలు:
కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల లోపు ఉండాలి.
కుటుంబానికి మాగాణి భూమి 10 ఎకరాలలోపు... లేదా మెట్ట గానీ, మెట్ట, మాగాణి కలిపి గానీ 25 ఎకరాలలోపు ఉన్నవారికే వర్తిస్తుంది.
పట్టణ ప్రాంతాల్లో 1500 చదరపు అడుగులకు మించి విస్తీర్ణమున్న భవనం ఉండకూడదు.
కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు (పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఉంది), ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, పెన్షనర్లు ఉండకూడదు.
8.వైఎస్ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్
పెట్టుబడి సాయం అందించడం ద్వారా రైతుల ఆర్థిక ఇబ్బందలను తగ్గించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
భూమి ఎంత ఉందన్నదానితో సంబంధం లేకుండా అర్హులైన రైతులకు పీఎం కిసాన్ కింద వచ్చే రూ.6 వేలతో కలిపి మూడు వాయిదాల్లో ఏడాదికి రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తారు.
భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.
అర్హతలు:
కౌలు రైతులైతే ‘పంట సాగుదారు హక్కు ఒప్పంద పత్రం’ సమర్పించడం తప్పనిసరి. అటవీ భూములను సాగు చేస్తున్నకౌలుదారులు... ఇనాం, డి-పట్టా, దేవాదాయ శాఖ భూములను సాగు చేస్తున్న రైతులు కూడా అర్హులే.
లబ్ధిదారుని కుటుంబంలో పెళ్లి కాని పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నా, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా పథకం వర్తిస్తుంది.
9.వైఎస్ఆర్ చేయూత:
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కోసం ఈ పథకం తెచ్చారు.
ఈ పథకం కింద ఒక్కో కుటుంబంలో ఓ మహిళకు ఏడాదికి రూ.18,750 వేల చొప్పున నాలుగేళ్లలో రూ.75వేల సాయం అందిస్తారు.
అర్హతలు:
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలై ఉండాలి.
కుటుంబ నెలవారీ ఆదాయం రూ.10వేల లోపు ఉండాలి.
మాగాణి భూమి 3 ఎకరాలలోపు... లేదా మెట్ట గానీ, మెట్ట, మాగాణి కలిపి గానీ 10 ఎకరాలలోపు ఉన్నవారికే వర్తిస్తుంది.
పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణానికి మించి భవనం ఉండకూడదు.
విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లకు మించకూడదు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు, నాలుగు చక్రాల వాహనం (ఆటో, ట్యాక్సీ, ట్రాక్టర్కు మినహాయింపు ఉంది) ఉన్నవారు అనర్హులు.
వైఎస్ఆర్ పెన్షన్ తీసుకుంటున్న వారు అనర్హులు.
10.వైఎస్ఆర్ వాహనమిత్ర:
స్వయం ఉపాధి కోసం కొత్తగా ఆటో, ట్యాక్సీ వంటివి కొనుక్కున్నవారికి ఆర్థిక సాయం అందించేందుకు ఈ పథకం పెట్టారు.
లబ్ధిదారులకు రూ.10 వేలు చొప్పున సాయం చేస్తారు.
అర్హతలు:
2020, మే 16లోగా వాహనం కొనుగోలు చేసి ఉండాలి.
భార్య పేరిట వాహనం కొనుగోలు చేసి నడుపుతున్నవారు కూడా అర్హులే.
లబ్ధిదారులకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండటం తప్పనిసరి.
ట్రాక్టర్, లైట్ లోడెడ్ వాహనాలకు ఈ పథకం వర్తించదు.
వీటితో పాటు డ్వాక్రా రుణాలకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా, రైతులకు వడ్డీ లేని రుణాలు, విదేశీ విద్య పథకం, వైఎస్ఆర్ లా నేస్తం, విద్యా కానుక, వైఎస్ఆర్ పెళ్లి కానుక, వైఎస్ఆర్ కంటి వెలుగు తదితర పథకాలను కూడా ఏపీ ప్రభుత్వం తెచ్చింది.
ఈ పథకాలకు గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా గానీ... గ్రామ, వార్డు సచివాలయానికి నేరుగా వెళ్లి గానీ ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చు. https://gramawardsachivalayam.ap.gov.in/ వెబ్పోర్టల్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. , వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్నవారికి ఏయే పత్రాలు ఎంత సమయంలోపు ఇవ్వాలనేది కూడా ప్రభుత్వం నిర్ణయించింది.
No comments:
Post a Comment