Jul 20, 2018


గ్యాస్ డెలీవరీ బాయిస్ కు టిప్ ఇవ్వవద్దు

మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
  • వినియోగదారుల్లో అవగాహనకు చర్యలు
  • వినియోగదారుని సమక్షంలో గ్యాస్ తూకం వేసి ఇవ్వాలి
  • గ్యాస్ పూర్తిగా వినియోగించుకోవాలి
  • దీపం పథకం వారికి 2వ సిలిండెర్
  • వినియోగదారులను దృష్టిలోపెట్టుకొని సేవలు


            సచివాలయం, జూలై 20: గ్యాస్ డెలీవరీ బాయిస్  టిప్ డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాలు వస్తున్నాయని, వారికి గ్యాస్ డీలర్లు జీతాలు ఇస్తారని, అందువల్ల వారికి టిప్పు ఇవ్వవలసిన అవసరంలేదని గ్యాస్ కంపెనీల వారు వినియోగదారులకు అవగాహన కల్పించాలని  పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ లోని తన ఛాంబర్ లో శుక్రవారం ఉదయం మంత్రి ప్రభుత్వ రంగ ఎల్.పీ.జీ.సంస్థల ప్రతినిధులు, పౌరసరఫరాల శాఖ, తూనికలు, కొలతల శాఖ అధికారులు, రాష్ట్రంలోని ఎల్పీజీ డీలర్ల ప్రతినిధులతో గ్యాస్ కు సంబంధించిన అంశాలను సమీక్షించారు. గ్యాస్ డోర్ డెలివరీ ఛార్జీలను ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు చెల్లిస్తాయని, బిల్లులో నమోదు చేసిన ధర మాత్రమే చెల్లించాలని, అదనంగా చెల్లించవద్దని వినియోగదారులకు తెలియజేయాలన్నారు. అదనంగా వసూలు చేస్తే సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. గ్యాస్ డెలీవరీ బాయిస్  తమ వెంట తూనిక మిషన్ తీసుకువెళ్లి వినియోగదారుని సమక్షంలో తప్పనిసరిగా గ్యాస్ సిలండర్ ని తూకం వేసి ఇవ్వాలని, ఈ విషయమై కూడా వినియోగదారులకు అవగాహన కల్పించాలని మంత్రి చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో ఏజన్సీలు తక్కువగా ఉన్నాయని, అక్కడ ఏజన్సీలు పెంచాలన్నారు. డీలర్ల వద్దకు వెళ్లి ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి? ఎంత మంది డెలివరీ బాయిస్ ఉన్నారు? ఎన్ని తూనిక మిషన్లు ఉన్నాయి? తనిఖీ చేయాలని చెప్పారు. రాష్ట్రంలోని డీలర్ల సంఖ్య, వారి వద్ద ఉంటే డెలివరీ బాయిస్, తూనిక మిషన్ల వివరాలు ఆగస్ట్ 14వ తేదీ లోపల అందజేయాలని మంత్రి చెప్పారు. వినియోగదారులను దృష్టిలోపెట్టుకొని సేవలు అందించాలన్నారు. దీపం కనెక్షన్ కింద ఒక్క సిలండర్ మాత్రమే ఇస్తున్నందున, పూర్తిగా గ్యాస్ వినియోగించుకోకుండానే వినియోగదారులు మరో సిలెండర్ తీసుకుంటున్నారని, అలా తీసుకోవడం వల్ల తిరిగి ఇచ్చే సిలిండర్ లో 1 నుంచి 2 కిలోల గ్యాస్ మిగిలిపోతుందని, ఆ విధంగా వినియోగదారులు నష్టపోతున్నారని, అందువల్ల వారికి రెండవ సిలిండర్ ఇవ్వాలని మంత్రి చెప్పారు. గ్యాస్‌ను నిర్ధేశించిన ధరకు సరైన తూకంతో వినియోగదారులకు అందుతుందా? లేదా? అన్నది  ప్రభుత్వం రంగా సంస్థల అధికారులు, పౌరసఫరాల శాఖ, తూనికలు కొలతల శాఖ అధికారుల ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిరంతరం తనిఖీలు చేయాలని చెప్పారు.  అవకతవకలు జరిగినట్లు తేలితే తక్షణం తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్యాకేజీ కమోడిటీస్ నిబంధనల ప్రకారం సరఫరా కంపెనీ పేరు, అడ్రస్, ఎంఆర్పీ,  ప్యాకింగ్ తేదీ, గ్యాస్ పరిమాణం మొదలైన తప్పనిసరి వివరాలను ప్రతి సిలెండర్‌పై కనిపించేవిధంగా  లేబుల్స్  అతికించాలని అయిల్ కంపెనీల ప్రతినిధులను మంత్రి ఆదేశించారు. భద్రత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న సిలెండర్లలో మాత్రమే గ్యాస్ నింపాలని, కాలం చెల్లిన సిలిండర్లను వినియోగదారులకు సరఫరా చేయవద్దని చెప్పారు.  గ్యాస్ పంపిణీ, అదనపు వసూళ్లు, తూకం వేయకుండా సిలెండర్ల డెలివరీ వంటి అంశాలకు సంబంధించి  1100 కు ఫిర్యాదు చేయాలని మంత్రి ప్రత్తిపాటి వినియోగదారులను కోరారు. 
           
           ప్రభుత్వ రంగ ఎల్.పీ.జీ.సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ మంత్రి ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తామని చెప్పారు. ఆగస్ట్ 14 నాటికి మంత్రి అడిగిన అన్ని వివరాలు అందజేస్తామన్నారు.  9 ఫిల్లింగ్ కేంద్రాలలో ఎలక్ట్రానిక్ విధానం అమలులోకి వచ్చినట్లు తెలిపారు. సిలిండర్లకు 5 సంవత్సరాలకు ఒకసారి రంగువేయిస్తున్నట్లు చెప్పారు. నోటిఫికేషన్ విడుదల చేశామని, గిరిజన ప్రాంతాల్లో అదనంగా డీలర్లను నియమిస్తామన్నారు. కొన్ని చోట్ల డీలర్లకు సొంత స్థలం లేక ఆగిపోయినట్లు తెలిపారు. దీపం కనెక్షన్ వారికి రెండవ సిలిండర్ ఇస్తామని చెప్పారు. ఈ సమావేశంలో  పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్, లీగల్ మెట్రాలజీ ఐజీపీ ఈ.దామోదర్, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ విజయ కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...