Jul 16, 2018


లక్ష మందితో అవయవదాన ప్రతిజ్ఙకు యత్నం
మెప్మా ఎండి చిన తాతయ్య
మెప్మా, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, జీవన్ దాన్ ఫౌండేషన్ సమన్వయంతో అవయవదానంపై విస్తృత స్థాయి ప్రచారం
           సచివాలయం, జూలై 16: ఆగస్ట్ 6న అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో లక్ష మంది చేత అవయవ దాన ప్రతిజ్ఞ చేయించడానికి ప్రయత్నిస్తున్నట్లు మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) ఎండి చిన తాతయ్య చెప్పారు. సచివాలయం 2వ బ్లాక్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 13 జిల్లాలకు చెందిన మెప్మా అధికారులకు, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ డాక్టర్లకు ప్రజల్లో  అవయవ దానంపై అవగాహన కల్పిచడం ఎలా? అన్నదానికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మెప్మా, ఆరోగ్య విశ్వవిద్యాలయం, జీవన్ దాన్ ఫౌండేషన్ వారి సమన్వయంతో అవయవదానంపై అవగాహన కల్పించడానికి, పెద్ద ఎత్తున విస్తృత స్థాయిలో ప్రచారం చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏడాదికి 1200 మందికి అవయవదానం అవసరం వస్తోందని, 20 శాతం మంది అవసరాలు మాత్రమే తీర్చగలుగుతున్నామని వివరించారు. అవగాహన లేకపోవడం, మూడ నమ్మకాల వల్ల ఇలా జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం అత్యధిక మంది నుంచి అవయవదానానికి ఆమోదం తెలిపే పత్రాలు సేకరించడానికి పూనుకున్నట్లు తెలిపారు. సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత పరిస్థితులలో మనిషి ప్రాణాన్ని కాపాడుకునే అవయవాలను కృత్రిమంగా తయారుచేస్తున్నప్పటికీ, అవి పూర్తి స్థాయిలో మనిషిని కాపాడుకోలేక పోతున్నాయని తెలిపారు. 2017లో సుమారు 1,46,377 మంది రహదారిపై ప్రమాదాల్లో మరణించారని,  వారిలో  0.1 శాతం మంది మాత్రమే అవయవ దానం చేయగలిగారని వివరించారు.  ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయినవారి నుంచి అవయవాలు తీసుకోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని తెలిపారు.  ప్రతి నిముషానికి 10 మంది మరణిస్తున్నారని, వారిలో కొద్ది మాత్రమే మరణానికి ముందు అవయవదానం గురించి ఆలోచిస్తున్నారన్నారు. సాధారణ మరణాలలో కేవలం కళ్ళు మాత్రమే దానం చేయటానికి అవకాశం ఉంటుందని చెప్పారు. మన దేశంలో రోజువారీ మరణించేవారు అవయువదానం చేయగలిగితే ఎవరూ అవయవలోపంతో ఉండరని చిన తాతయ్య అన్నారు.
              డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ సివి రావు మాట్లాడుతూ అవయవ దానంపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ఈ కార్యక్రమం దారితప్పకుండా సరైన రీతిలో నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమమని చెప్పారు. మెప్మా సిబ్బంది, విశ్వవిద్యాలయం ఎస్ఎస్ఎస్ విభాగం డాక్టర్లు కలసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతున్నట్లు తెలిపారు. ఆగస్ట్ 6న  ఎంత ఎక్కవ మందితో అవకాశం ఉంటే అంత ఎక్కువ మందితో ప్రతిజ్ఞ చేయించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
               శిక్షణా కార్యక్రమంలో   జీవన్ దాన్ సీఈఓ  డాక్టర్ కృష్ణమూర్తి, విశ్వవిద్యాలయం ఎన్ఎస్ ఎస్  ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ కరుణామూర్తి,  ప్రోగ్రాం ఆఫీసర్లు, మెప్మా జిల్లా స్థాయి ఆరోగ్య, పౌష్టికాహార నిపుణులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...