Nov 17, 2016

రిటైల్ రంగాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం


v రూ.5,142 కోట్ల పెట్టుబడులు, 25 వేల ఉద్యోగ అవకాశాలు
v ఏపీ రిటైల్ పాలసీ 2015 – 2020
v ఇటువంటి పాలసీని రూపొందించిన మొదటి రాష్ట్రం
v మలేషియా ‘పెమండు’తో ఒప్పందం

          పెట్టుబడులను ఆకర్షించడంలో, ఉద్యోగ అవకాశాల కల్పనలో రిటైల్ రంగం కీలకం కానుంది. రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఈ రంగం ప్రధాన భూమిక పోషించనుంది. ప్రధాన ఆర్థిక వృద్ధి కారకాలలో ఇది కూడా ఒకటిగా ప్రభుత్వం గుర్తించింది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలోపెట్టుకొని  రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రిటైల్ పాలసీ 2015-2020 ని రూపొందించింది. దేశంలో ఇటువంటి పాలసీని రూపొందించిన మొదటి రాష్ట్రం ఏపీ. ప్రస్తుతం దేశంలో ఉన్న రిటైల్ మార్కెట్ 2020 నాటికి రెండింతలవుతుందని అంచనా. అందులో ఏపీ పాత్ర కీలకంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే వ్యాపార అనుకూల విధానాలు, కల్పించే సౌకర్యాల వల్ల 2021 నాటికి రాష్ట్రంలో కనీసం రూ.5,142 కోట్ల పెట్టుబడులు, 25 వేల ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. రిటైల్ రంగానికి సంబంధించి ఉత్పత్తులు స్వయం సహాయక గ్రూపులు, సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఇ) నుంచి సరఫరా అవుతాయి. ప్రైవేటు రంగం నుంచి పెట్టుబడులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కిరాణా షాపులు వంటి వాటిలో పెట్టుబడులు పెడతారు.

‘పెమండు’తో ఒప్పందం
ఈ రంగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న మలేషియాలోని పెమండు (ఫర్మామెన్స్ మేనేజ్ మెంట్ అండ్ డెలీవరీ యూనిట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ మలేషియా) విధానాలను రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు పెమండుతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం(ఎంఓయు) కూడా కుదుర్చుకుంది. స్థిరమైన అభివృద్ధికి ఉపయోగడే ప్రభుత్వం గుర్తించిన అత్యంత ప్రాధాన్యత కలిగిన కీలక రంగాలలో పెమండు సహాయపడుతుంది. ఈ ఒప్పందంలో భాగంగా మొదటి దశలో రాష్ట్ర ప్రభుత్వ, పెమండు బృందాలు విద్య, రిటైల్ రంగాలపై అద్యయనాలు, పరిశోధనలు మొదలుపెట్టాయి. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఈ బృందాలు అధ్యయనం చేశాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పర్యటించి, ప్రభుత్వ ఉన్నతాధికారులు మొదలుకొని వివిధ శాఖల అధికారులను, సిబ్బందిని, కార్మిక శాఖ, పరిశ్రమలు, వాణిజ్య, మునిసిపల్ శాఖల అధికారులను కలిశారు. రిటైల్ రంగానికి సంబంధించి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, సమస్యలు, సమస్యలకు మూల కారణాలను సమగ్రంగా అధ్యయనం చేశాయి.
రాష్ట్ర రిటైల్ రంగం ప్రధానంగా ఎదుక్కొనే సమస్యలను పెమండు గుర్తించింది. నగరాలు, పట్టణాలు ప్రణాళికాబద్దంగా ఏర్పాటు కానందున రిటైల్ జోన్స్ ఏర్పాటు చేయడానికి తగినంత స్థలం లేదు. ఈ రంగానికి అనుకూలమైన మౌలిక సదుపాయాలు లేవు. ప్రస్తుతం ఉన్న రిటైల్ జోన్స్ అసంఘటితంగా, అక్కడక్కడ ఉన్నాయి. వాటికి సమీపంలో వాహనాల పార్కింగ్ కు స్థలాలు లేవు. దానికితోడు గిడ్డంగులు కూడా అందుబాటులో లేవు. ప్రైవేటు వ్యాపారులను, పెట్టుబడులను ఆకర్షించేవిధంగా ప్రభుత్వ చట్టాలు, నిబంధనలు లేవు.  రిటైల్ వ్యాపారులు లైసెన్సులు పొందే విధానాలు వారికి అనుకూలంగా లేవు. పెట్టుబడులు సమకూర్చుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు.
         పెమండు బృందం సమస్యలకు పరిష్కారాలు కనుగొని, అభివృద్ధికి మార్గాలు, కొత్తకొత్త ఆలోచనలతో ఈ రంగంలో ఆశించిన ఫలితాలు సాధించడానికి ఆచరణాత్మకమైన కార్యక్రమాలను రూపొందించింది. దిగువ స్థాయి నుంచి ప్రతి దశలో ఆచరణకు అవకాశం ఉన్న వ్యూహాత్మక ప్రణాళికలను రచించింది. మొత్తం రిటైల్ రంగం అభివృద్ధి ప్రక్రియలో ప్రధానంగా 3 దశలు ఉంటాయి. వీటిని వివరించడానికి పెమండు బృందం వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ షాపు కూడా నిర్వహించింది. రాష్ట్రంలో రిటైల్ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందడానికి, భారీ స్థాయిలో శీఘ్ర ఫలితాలను ఇచ్చే అంశాలను గుర్తించింది. ఆచరణలో ఉత్తమ ఫలితాలు పొందడానికి పెమండు బిగ్ ఫాస్ట్ రిజల్ట్స్(బీఎఫ్ఆర్) విధాన్ని ఉపయోగిస్తోంది. ఈ విధానంలో 8 దశలు ఉన్నాయి. రిటైల్ రంగానికి కావలసిన నిధులను అంచనా వేసి, వాటిని సమకూర్చుకునే విధానాలను రూపొందించింది.

ప్రధాన  సిఫారసులు
1.ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ ఫెసిలిటేషన్ సెంటర్ (ఏపీఎంఎఫ్ సీ) ఏర్పాటు
2. జిల్లా సేకరణ కేంద్రం (డీసీసీ) ఏర్పాటు
3. అత్యంత ప్రధానమైన నగరాలలో రిటైల్ పార్కుల ఏర్పాటు
4. ఎంపిక చేసిన మునిసిపాల్టీలలో సెమీ అర్బన్, గ్రామీణ రిటైల్ పార్కుల ఏర్పాటు
5. విధానపరమైన సంస్కరణల ద్వారా ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు సమకూర్చుకునే అవకాశం కల్పించాలి. వ్యాపారానికి అనుకూల పరిస్థితులు కల్పించాలి.
6.రిటైల్ వ్యాపారం రిజిస్ట్రేషన్ విధానాన్ని సరళీకరించాలి. (సింగిల్ డెస్క్ పాలసీ)
7.మండల్ నోడల్ స్టోర్స్(ఎంఎన్ఎస్) ఏర్పాటు చేయాలి.
8. కిరాణా షాపులలో సౌకర్యాలు మెరుగుపరుచుకునే అవకాశం కల్పించాలి.
రిటైల్ రంగాన్ని అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. సింగిల్ డెస్క్ విధానం ద్వారా లైసెన్స్ పొందడం సులభతరం చేసింది. చిన్న వ్యాపారులకు రుణాలు పొందే అవకాశం కల్పించింది. మిగిలిన  సిఫారసులను కూడా అమలు చేసి రిటైల్ రంగంలో పెట్టుబడులు రావడానికి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

జారీ చేసినవారు :  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.


4 కోట్లు దాటిన స్మార్ట్ పల్స్ సర్వే

·       కోటి 27 లక్షలకు పైగా కుటుంబాలను కలసిన ఎన్యూమరేటర్లు
·       దేశంలో ఇటువంటి సర్వే చేస్తున్న మొదటి రాష్ట్రం
·       ప్రతి ఒక్కరి వేలి ముద్ర సేకరణ 

         రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాసాధికార సర్వే-2016(స్మార్ట్ పల్స్ సర్వే) లో నాలుగు కోట్ల మంది సర్వే పూర్తి అయింది. ఈ ఏడాది జూలై 8న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచే ఈ సర్వేను ప్రారంభించారు.  రాష్ట్రంలో 5.23 కోట్ల మంది జనాభా ఉండగా, నవంబర్ 1వ తేదీ మంగళవారానికి 4 కోట్ల మందికి పైగా వివరాలు సేకరించారు. ఈ-ప్రగతిలో భాగంగా ప్రభుత్వం ప్రజల ఆర్థిక, సామాజిక స్థితుల సమగ్ర సమాచారం సేకరిస్తోంది. అలాగే అర్హులకు మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ సర్వే ద్వారా సేకరించి, క్రోడీకరించిన సమాచారం నిజమైన బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ఉపయోగపడుతుందన్నది ప్రభుత్వ అభిప్రాయం. రియల్ టైమ్ గవర్నెన్స్ కు కూడా  ఇది దోహదపడుతుంది.  దాదాపు 30 వేల మంది ఎన్యూమరేటర్లు ఈ సర్వే నిర్వహిస్తున్నారు.  ప్రభుత్వంలోని 17 శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు. పది సంవత్సరాలకు ఒకసారి చేపట్టే జనాభా లెక్కల మాదిరిగా కాకుండా, ఈ సర్వే అంతకు మించి ప్రతి పౌరుని వాస్తవ పరిస్థితులకు అద్దంపట్టేలా వివరాలు సేకరిస్తున్నారు.  ఎన్యూమరేటర్లు ఎప్పటికప్పుడు సర్వే వెబ్ సైట్ లో లాగిన్ అయి, డేటాను ఎంటర్ చేస్తున్నారు. ఈ సర్వేలో ప్రతి వ్యక్తిని 32 రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. వాటిలో 12 ప్రశ్నలకు ఆధారాలతో సహా జవాబులు చెప్పాలి. కుటుంబ యజమాని, ఇంటి పరిస్థితి, స్థిర,చరాస్తులు, కుటుంబ సభ్యులు, విద్య, ఉపాధి, రేషన్ కార్డు, పింఛన్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాల ద్వారా ఆ కుటుంబం పొందే లబ్ది..మొదలైన వివరాలన్నింటినీ సేకరిస్తున్నారు. ఇవేకాకుండా ఇంటిలోని మౌలిక సదుపాయాలు, గదులు, త్రాగునీరు, విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆండ్రాయిడ్ ఫోన్, అప్పులు, వంటకు వాడే ఇంధనం, సొంత భూమి, ఇల్లు, వాహన వివరాలు, పిల్లల చదువులు, వారి ఉపాధి... వంటి సమాచారం కూడా నమోదు చేస్తున్నారు. సర్వేలో తొలుత కుటుంబ పెద్ద లేక అందుబాటులో ఉన్న వారి వేలిముద్ర మాత్రమే సేకరించారు. ఆ తరువాత ప్రతి వ్యక్తి వేలి ముద్ర సేకరిస్తున్నారు. గతంలో సర్వే చేసిన కుటుంబాలలోని ప్రతి వ్యక్తి వేలి ముద్రను ఆన్ లైన్ లోకి ఎక్కిస్తున్నారు. దాంతో అనుకున్న సమయానికంటే కొంత ఆలస్యం అవుతోంది. ఆధార్ వివరాలను ప్రతి వ్యక్తి మొబైల్ నెంబర్ తో అనుసంధానం చేస్తున్నారు.  ఇప్పటికే జారీ చేసిన ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే వీరు సరిచేస్తారు. ఆధార్ రికార్డులలో నమోదై, ఆ తరువాత చనిపోయినవారి పేర్లను తొలగిస్తున్నారు. ఈ సర్వే సమాచారం మొత్తాన్ని జియోట్యాగ్ చేస్తున్నారు.
సర్వే ప్రారంభంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. సాఫ్ట్ వేర్ వెర్షన్స్ లో మార్పులు చేయవలసి వచ్చింది.  అయితే ఇప్పుడు వాటిని  అధిగమించారు. కొంతమంది సిబ్బంది పుష్కరాలు, కరువు సహాయక చర్యలలో పాల్గొన్నందున కొన్ని జిల్లాలలో సర్వే పనులలో కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం అన్ని జిల్లాలలో సిబ్బంది చురుకుగా, వేగంగా సర్వే నిర్వహిస్తున్నారు.

  సీఎం డ్యాష్ బోర్డులో నమోదైన ప్రకారం జూలై 8వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ మంగళవారం రాత్రి 7.05 గంటల వరకు ఎన్యూమరేటర్లు 1,27,08,985 కుటుంబాలను కలసి, 4,00,00,173 మందిని సర్వే చేశారు. 5 నెలలలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తిగతంగా ఇంతమందికి చెందిన సామాజిక, ఆర్థిక అంశాల సమగ్ర సమాచారాన్ని సేకరించడం ఓ గొప్ప విజయం. సర్వే వివరాలలో కచ్చితత్వం ఉండేలా అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా వ్యవహరిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఈ సర్వేను సమీక్షిస్తూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశిస్తున్నారు.

దేశంలో మొదటి రాష్ట్రం
దేశంలో వ్యక్తిగతంగా ఇటువంటి సమగ్ర సర్వే చేస్తున్న మొదటి రాష్ట్రం ఏపీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. సీఎన్ బీసీ-టీవీ 18 సిస్కో డిజిటలైజింగ్ ఇండియా అవార్డును కూడా ఏపీ దక్కించుకుంది.               పరిపాలనలో సాంకేతికతను అత్యంత సమర్థవంతంగా జోడించిన ఘనత ఏపీదే. అందువల్లనే ఈ సర్వే ఇంత త్వరితగతిన పూర్తి అవుతోంది. ఈపాస్‌, పింఛన్ల పంపిణీ, భూగర్భ జలాల కొలత, ఆధార్‌ అనుసంధానం, రైతులు, డ్వాక్రా సంఘాల ఖాతాలను ఆన్‌లైన్‌ చేయటం, ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ వంటి చర్యలతో ఐటీ వినియోగంలో ఏపీ ముందంజలో ఉంది. ఈ-ప్రగతిలో భాగంగానే ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతుల సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం ఈ సర్వే ద్వారా సేకరిస్తోంది. పారదర్శక పాలన అందించడానికి,  సంక్షేమ పథకాలు అర్హులకు సక్రమంగా అందడానికి, మరిన్ని ప్రజా ప్రయోజనకర పథకాలు ప్రవేశపెట్టాడానికి వీలుగా సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఈ సర్వేను చేపట్టారు.  ఈ సర్వే ద్వారా సేకరించే సమగ్ర సమాచారం  ప్రజలకు, ప్రభుత్వానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 


జారీ చేసినవారు : సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

వాణిజ్య పన్నుల ఆదాయం రూ.8283.94 కోట్లు

 §  7 నెలల వివరాలు విడుదల
§  పెట్రో ఉత్పత్తుల నుంచి అత్యధిక ఆదాయం రూ.5110.68 కోట్లు
§  అత్యధికంగా విజయవాడ-II డివిజన్ నుంచి రూ.2666.26 కోట్లు
§  అత్యల్పంగా విజయనగరం డివిజన్ నుంచి రూ. 189.47 కోట్లు
§  అక్టోబర్ లో 24,77,174 వేబిల్లులు ఆన్ లైన్ లో జారీ
§  విస్తరిస్తున్న ఆన్ లైన్ కార్యకలాపాలు
           రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు 7 నెలలో వాణిజ్య పన్నుల ఆదాయం రూ. 8283.94 కోట్లు సమకూరింది. రాష్ట్రంలో ఆదాయపన్ను డివిజన్లు మొత్తం 13  ఉన్నాయి. ఆదాయంలో నాలుగు అంకెలతో మొదటి రెండు స్థానాలలో విజయవాడ-2, విశాఖపట్నం డివిజన్లు ఉన్నాయి. విజయవాడ-2 డివిజన్ నుంచి రూ.2666.26 కోట్లు రాగా, విశాఖపట్నం డివిజన్ నుంచి 1080.76 కోట్లు లభించింది. విజయవాడ-1 డివిజన్ నుంచి రూ.701.91 కోట్లు, చిత్తూరు నుంచి రూ. 587.86 కోట్లు, నెల్లూరు నుంచి రూ.550.88 కోట్లు, కాకినాడ నుంచి రూ. 587.12 కోట్లు, గుంటూరు నుంచి రూ.473.36 కోట్లు, అనంతపురం నుంచి రూ. 316 కోట్లు, ఏలూరు నుంచి రూ. 294.99 కోట్లు, నరసరావుపేట నుంచి రూ. 293.94 కోట్లు, కర్నూలు నుంచి 303.76 కోట్లు, కడప నుంచి రూ. 224.47 కోట్లు, విజయనగరం నుంచి 189.47 కోట్లు ఆదాయం అభించింది.  సర్కిళ్ల వారీగా చూస్తే అత్యధికంగా ఎల్ టీయు విజయవాడ-2 సర్కిల్ నుంచి రూ. 1715.34 కోట్లు వసూలు కాగా, అత్యల్పంగా వినుకొండ సర్కిల్ నుంచి రూ.5.32 కోట్లు వసూలైంది.
పెట్రో ఉత్పత్తుల నుంచి అత్యధిక ఆదాయం
ఉత్పత్తులవారీగా చూస్తే పెట్రో ఉత్పత్తులకు సంబంధించి అత్యధికంగా రూ.5110.68 కోట్లు వచ్చింది. ఆ తరువాత మద్యం ఉత్పత్తుల నుంచి రూ.4888.17 కోట్లు, సిగరెట్ ఉత్పత్తుల నుంచి రూ.407.32 కోట్ల ఆదాయం లభించింది. ఈ ఏడాది అక్టోబర్ వరకు 1,84,756 సంస్థలు రిజిస్టర్ అయ్యాయి. రాష్ట్రంలో ఆధార్ నెంబర్ కలిగి ఉన్న డీలర్లు 1,81,816 మంది ఉన్నారు.
అక్టోబర్ నెల వివరాలు
ఇదిలా ఉండగా, ప్రభుత్వంలోని అన్ని శాఖలలో మాదిరిగానే వాణిజ్య పన్నుల శాఖలో కూడా ఆన్ లైన్ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి.  ఈ శాఖలో లావాదేవీలు చాలా వరకు ఆన్ లైన్ లోనే జరిగిపోతున్నాయి. అక్టోబరు నెలలో ఆన్ లైన్ లో వ్యాట్(వీఏటీ) రిటర్న్ దాఖలు చేసినవారు 1,57,158 మంది, సీఎస్టీ రిటర్న్ దాఖలు చేసిన వారు 95,559 మంది ఉన్నారు. ఆన్ లైన్ లో 59,821 చెల్లింపులు జరిగాయి. 30,058 చెల్లింపులు మాన్యువల్ గా జరిగాయి. అక్టోబర్ లో 24,77,174 వేబిల్లులు ఆన్ లైన్ లో జారీ చేశారు.

జారీ చేసినవారు :  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.


రాష్ట్రంలో రూ.41,265 కోట్ల రుణాలు మంజూరు

§  తొలి త్రైమాసికంలో రుణప్రణాళిక లక్ష్యం 25 శాతం పూర్తి
§  అనంతపురం జిల్లాలో 34 శాతం
§  తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలలో అత్యధిక రుణాలు
§  పంట రుణాలు రూ. 21,062 కోట్లు మంజూరు
§  సంతృప్తికరంగా  బకాయిల వసూలు
          రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన రుణ ప్రణాళికలో మొదటి త్రైమాసికంలో రూ.41,265 కోట్ల రుణాలు మంజూరు చేశారు. 25 శాతం లక్ష్యం పూర్తి అయింది. రాష్ట్రంలో అన్ని విధాలా అత్యంత వెనుకబడిన ప్రాంతమైన అనంతపురం జిల్లాలో రూ. 3949 కోట్ల రుణాలు మంజూరు చేశారు. ఈ జిల్లాలో 34 శాతం లక్ష్యం పూర్తి చేశారు.  విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి 94వ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో రూ.1,65,538 కోట్ల రూపాయలతో 2016-17 రుణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రం ఆర్థిక వృద్ధి పెరుగుదలకు ఉపయోగపడే  ప్రాధమికమైన వ్యవసాయ రంగంతోపాటు, దాని అనుబంధ రంగాలకు, స్వయంసహాయ గ్రూపులకు చెందిన మహిళలకు, సూక్ష,చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణాలు ఇవ్వడానికి ఈ ప్రణాళికను రూపొందించారు. రాష్ట్రంలో ఈ రుణ ప్రణాళికను నాబార్డ్ (జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్) అనుబంధ సంస్థ అయిన నాబ్ కాన్స్ (నాబార్డ్ కన్సల్ టెన్సీ సర్వీస్) సమన్వయకర్తగా వ్యవహరిస్తుంది. రాష్ట్రాభివృద్ధిని దృష్టిలోపెట్టుకొని బ్యాంకుల సహకారంతో  రుణప్రణాళికను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.
లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్స్(ఎల్ డీఎంలు) పంపిన సమాచారం అధారంగా రూపొందించిన తొలి త్రైమాసిక (ఏప్రిల్, మే,జూన్) వివరాలను రాష్ట్ర ప్రణాళికా శాఖ విడుదల చేసింది. అత్యధికంగా రూ. 5,178 కోట్ల రుణాలు (27 శాతం) ఇచ్చిన తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో, రూ. 4,855 కోట్ల రూణాలు (28 శాతం) ఇచ్చిన కృష్ణా జిల్లా రెండవ స్థానంలో నిలిచాయి. చిత్తూరు జిల్లాలో రూ. 3,275 కోట్లు (28 శాతం), విశాఖపట్నం జిల్లాలో రూ. 3,921 కోట్లు (28 శాతం), కర్నూలు జిల్లాలో రూ. 2,680 కోట్లు (26 శాతం), నెల్లూరు జిల్లాలో రూ. 2,744 కోట్లు (25 శాతం), కడప జిల్లాలో రూ. 2,072 కోట్లు (24 శాతం), ప్రకాశం జిల్లాలో రూ. 2,756 కోట్లు ( 24 శాతం), విజయనగరం జిల్లాలో రూ. 1,016 కోట్లు (22 శాతం), పశ్చిమగోదావరి జిల్లాలో రూ. 3,866 కోట్లు (21 శాతం), శ్రీకాకుళం జిల్లాలో రూ. 1,049 కోట్లు (19 శాతం), గుంటూరు జిల్లాలో రూ. 3,903 కోట్లు (18 శాతం) రుణాలు మంజూరు చేశారు. మూడు నెలల కాలంలో 7 జిల్లాలలో 25 శాతానికి మించి రుణాలు మంజూరు చేశారు.

పంట రుణాలు రూ. 21,062 కోట్లు

      రుణ ప్రణాళికను విభాగాల వారీగా పరిశీలిస్తే, ఈ ఏడాది పంట రుణాల లక్ష్యం రూ. 60,000 కోట్లు కాగా, మొదటి మూడు నెలలలోనే రూ. 21,062 కోట్లు మంజూరు చేసి, 35 శాతం లక్ష్యం పూర్తి చేశారు. వ్యవసాయానికి సంబంధించి కాలపరిమితి రుణాలు రూ. 965 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలలో రూ. 1,209 కోట్లు రుణాలు మంజూరు చేశారు. , సూక్ష,చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ ఎంఇ)కు రూ. 4225 కోట్లు మంజూరు చేశారు.
        ఈ రుణాలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలతోపాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు  పెట్టుబడులు సమకూరుస్తాయి. అలాగే గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు మెరుగుపడటానికి, ఆర్థిక వృద్ధికి ఉపయోగపడతాయి.

సంతృప్తికరంగా  బకాయిల వసూలు
     ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రుణ బకాయిల వసూలు సంతృప్తికరంగా ఉంది.  మంజూరు చేసిన రుణ మొత్తానికి మించి బకాయిలు వసూలయ్యాయి. రూ. 41,265 కోట్ల రుణాలు ఇవ్వగా, రూ. 50,246 కోట్లు బకాయిలు వసూలయ్యాయి. స్వల్పకాలిక రుణాలు రూ. 20,753 కోట్లు, కాలపరిమితి వ్యవసాయ రుణాలు రూ. 2,033 కోట్లు వసూలయ్యాయి. వ్యవసాయ అనుబంధ రంగాలలో రూ.7,146 కోట్లు, , సూక్ష,చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించి రూ.6,810 కోట్లు వసూలయ్యాయి. ఈ రకమైన రుణ బకాయిల వసూలు ఆశాజనకమైన పరిణామంగా భావిస్తున్నారు.

జారీ చేసినవారు :  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.



Nov 16, 2016

అమరావతికి తరలివస్తున్న విద్యా సంస్థలు

v సచివాలయం తరువాత విశ్వవిద్యాలయాలతోనే నగర నిర్మాణం మొదలు
v అమరావతి విద్యానగరానికి పునాది
v 2017లో అడ్మిషన్లకు ‘విట్’ నోటిఫికేషన్ విడుదల
v ఫలితాలనిస్తున్న ప్రభుత్వ నిబంధనలు
v ఆరు పాఠశాలల నిర్మాణానికి సీఆర్ డీఏ టెండర్లు

         నూతన రాజధాని అమరావతిని వచ్చే అయిదేళ్లలో ప్రపంచ స్థాయి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగునంగా ప్రముఖ విద్యా సంస్థలు చొరవ చూపుతున్నాయి. తాత్కాలిక సచివాలయం నిర్మాణం  తరువాత  ఇక్కడ విద్యా నగరానికే పునాది పడింది. ప్రభుత్వంతోపాటు  ప్రైవేటు విద్యాసంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. భూ కేటాయింపులు, వెంటనే నిర్మాణాలు చేపట్టి, 2017కి అడ్మిషన్లు జరగాలన్న ప్రభుత్వ నిబంధనలు కూడా ఇందుకు ఒక కారణంగా భావించవచ్చు. అమరావతిలో మొట్టమొదటి విద్యా సంస్థకు ఈ నెల 3 శంకుస్థాపన జరిగింది. ఐనవోలు గ్రామంలో తమిళనాడుకు చెందిన  ప్రతిష్టాత్మకమైన వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రం మంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. ఈ విశ్వవిద్యాలయం కోసం ప్రభుత్వం 200 ఎకరాలు కేటాయించింది. తొలిదశలో 100 ఎకరాల్లో  నిర్మాణం చేపట్టారు. ఇక్కడ విశ్వవిద్యాలయంతోపాటు ఒక మెడికల్ కాలేజీని కూడా ప్రారంభిస్తారు. అమరావతిలో నిర్మించే ప్రాంగణంలో 2017 బీటెక్ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఇక్కడ 8 రకాల కోర్సులను ఆఫర్ చేస్తోంది.  మెకానికల్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్(సీఎస్ఈ), సీఎస్ఈ (డేటా ఎనలిస్టిక్స్), సీఎస్ఇ (నెట్ వర్క్ అండ్ సెక్యూరిటీ), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తోపాటు సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, పీహెచ్ డీ కోర్సులు ఉంటాయి.


భవిష్యత్ లో ఈ విశ్వవిద్యాలయంలో ప్రతి ఏటా 32 వేల మంది వరకు సాంకేతి విద్యను అభ్యసించే అవకాశం ఉంది. ఈ శంకుస్థాపనతో  మరిన్ని విద్యా సంస్థలు నిర్మాణాలు మొదలుపెట్టనున్నాయి. విద్యా సంస్థలన్నింటిని ఐనవోలు, నీరుకొండ పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అక్కడే భూములను కేటాయిస్తోంది.  

ఆరు పాఠశాలల నిర్మాణానికి సీఆర్ డీఏ టెండర్లు

         రాజధానిలో 160కి పైగా ప్రాథమిక పాఠశాలలు, వందకు పైగా ఉన్నత పాఠశాలలు, 27 జూనియర్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్యా సంస్థలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, వృత్తి విద్యా సంస్థలు మూడేసి చొప్పున ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రతిపాదన. 25 నుంచి 30 వరకు పాలిటెక్నిక్ ఇన్ స్టిట్యూషన్స్ నెలకొల్పాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అమరావతిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆరు పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు సీఆర్ డీఏ ఈ నెల 11న టెండర్లను కూడా  ఆహ్వానించింది.

        తమిళనాడు రాజధాని చెన్నైలోని ఎఫ్ఆర్ఎం విశ్వవిద్యాలయం అమరావతిలో తమ ప్రాంగణం శంకుస్థాపనకు సన్మాహాలు చేస్తోంది. ఐనవోలు గ్రామంలోనే ప్రభుత్వం తమకు కేటాయించిన స్థలాన్ని ఈ నెల 10న  ఆ విశ్వవిద్యాలయం ప్రతినిధులు పరిశీలించారు. తొలి దశలో ఈ విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం వంద ఎకరాల స్థలం కేటాయించింది. తరువాత మరో వంద ఎకరాలు కేటాయించే అవకావం ఉంది. వచ్చే విద్యా సంవత్సరం(2017-18) నుంచే ఇక్కడ తరగతులు ప్రారంభించాలని ఎంఓయులో ప్రభుత్వం పేర్కొంది. దాంతో నిర్మాణాలు చేపట్టడానికి ఆ సంస్థ ప్రతినిధులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 24 లేక 25 తేదీలలో ఇక్కడ శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. వచ్చే నెల ఏప్రిల్ నాటికి కొన్ని భవనాల నిర్మాణం  పూర్తి చేసి, తరగతులు ప్రారంభించాలన్న ఉద్దేశంతో వారు ఉన్నారు. ఈ విశ్వవిద్యాలయంలో తొలి దశలో 17 వేల మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుంది.

ప్రపంచస్థాయి వైద్య విద్యాలయం

               ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన మెగా వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మాతా అమృతానందమయి ట్రస్ట్ ఆధ్వర్యంలోని అమృత యూనివర్సిటీ ముందుకొచ్చింది. యూనివర్సిటీ ప్రతినిధులు గత ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంసిద్ధత తెలిపారు.  సంబంధిత ప్రాజెక్టు నివేదికను కూడా  వారు అందజేశారు. రూ.2,500 కోట్ల అంచనాతో విశ్వవిద్యాలయంతోపాటు 2,250 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నెలకొల్పుతారు. ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రీసెర్చ్-హెల్త్   కేర్ క్యాంపస్‌ను సైతం ఏర్పాటు చేస్తారు. తొలి దశ మొదటి ఏడేళ్లలో 18 వేల మంది విద్యార్థులకు, రెండో దశ పూర్తి అయ్యేసరికి 47 వేల మందికి అవకాశం ఉంటుంది. ఈ విశ్వవిద్యాలయానికి తొలి దశలో 150 ఎకరాలు, రెండవ దశలో 50 ఎకరాలు ఇవ్వాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఇంకా పలు ప్రఖ్యాత విద్యా సంస్థలకు స్థలాలు కేటాయించే అవకాశం ఉంది.

          అమరావతిలో ప్రతిష్టాత్మకమైన ఫిక్కీ (ఎఫ్ఐసీసీఐ - ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ చాంబ‌ర్స్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీ - భారతీయ పరిశ్రమలు, వాణిజ్య సమాఖ్య) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పై ఈ నెల 10న ఢిల్లీలో ఆ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. లండన్ లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ ప్రాంగణం కూడా ఇక్కడ నిర్మించే అవకాశం ఉంది. ఈ విషయమై ఆ విశ్వవిద్యాలయం ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు కూడా జరిపింది.   అమరావతిలో స్థలం ఇస్తే గీతం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ఆ విశ్వవిద్యాలయం ప్రో వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎన్.శివప్రసాద్ చెప్పారు. విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరులలో గీతం విశ్వవిద్యాలయ ప్రాంగణాలు ఉన్నాయి. దేశవిదేశాలకు చెందిన  ఉత్తమ విశ్వవిద్యాలయాలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దేశంలో టాప్ 20, ప్రపంచంలో టాప్ 20 విశ్వవిద్యాలయాలను ఏపీకి తీసుకురావల్లన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం. ఆ మేరకు ఇప్పటికే దేశవిదేశాలలోని పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకోవడం, భూములు కేటాయించడం జరిగిపోయాయి. నిర్మాణ పనులు కూడా ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. ఇండో-యూకే ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్ కు మొదటి దశలో 50,  రెండు దశలో 100 కలిపి మొత్తం 150 ఎకరాలు కేటాయించనున్నారు.  నేషనల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్(ఎన్ఐడీ)కి 50 ఎకరాలు, సెంట్రల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్ (సీఐటీడీ)కి ఐదు ఎకరాలు, ఆంధ్రప్రదేశ మానవ వనరుల అభివృద్ధి సంస్థకు 25 ఎకరాలు కేటాయించేందుకు సీఆర్‌డీఏ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాబోయే ఐదేళ్లలో అమరావతి ఒక ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా మారడం ఖాయమని భావిస్తున్నారు.
  
జారీ చేసినవారు:
రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగం,
  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.


సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలపై ప్రభుత్వం దృష్టి

Ø ఎంఎస్ఎంఇ పాలసీ 2015 -2020
Ø సబ్సిడీలు, రాయితీలు, రీయింబర్స్ మెంట్స్ తో భారీగా ప్రోత్సాహకాలు
Ø పారిశ్రామిక పార్కులలో 15 శాతం భూమి కేటాయింపు

             స్థానిక వనరులు, ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ-మైక్రో,స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్)ను ప్రోత్సహిస్తోంది.  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు ఆర్థిక, సామాజిక అభివృద్ధిని సాధించడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే చిన్నతరహా పరిశ్రమలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీటి కోసం ఈ ఏడాది బడ్జెట్ లో 25 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ రంగంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువమందికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంది. అంతే కాకుండా వెనుకబడిన ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాలలో యూనిట్లు నెలకొల్పడం ద్వారా ప్రాంతీయ అసమానతలు తొలగించడానికి వీలవుతుంది. ఉత్పత్తి, ఉపాధి విషయంలో  ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఖాదీ, వ్యవసాయాధారిత వంటి చిన్నచిన్న పరిశ్రమలను అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించడానికి వీలవుతుంది. యూనిట్ల స్థాపనకు నిరుద్యోగ యువతకు బ్యాంకుల నుంచి రుణం పొందడానికి, ఉత్పత్తి అయిన వస్తువుల మార్కెటింగ్ కు పరిశ్రమల శాఖ సహాయ సహకారాలు అందిస్తుంది. అంతేకాకుండా మూతపడిన పారిశ్రామిక యూనిట్లను పునరుద్దించడానికి చేయూతనందిస్తుంది.  ఉత్పత్తి అయిన వస్తువుల సరఫరా, చెల్లింపుల విషయంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలతో ఏవైనా సమస్యలు తలెత్తితే పారిశ్రామిక వసతుల కల్పన మండలి(ఐఎఫ్సీ-ఇండస్ట్రియల్ ఫెసిలిటేషన్ కౌన్సిల్) ద్వారా పరిష్కరించడానికి కృషి చేస్తుంది.
          ప్రభుత్వం రెండంకెల స్థిర అభివృద్ధిని సాధించాలన్న లక్ష్యంతో ఉత్పత్తి, ఉపాధికి ఎక్కువ  అవకాశాలున్న ఈ రంగంలో గత ఏడాదికంటే ఈ ఏడాది 30 శాతం ఎక్కువగా బ్యాంకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరం(2015-16)లో రాష్ట్రంలో సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ఆధారపడిన 3,76,634 మందికి రూ.16,960 కోట్లు బ్యాంకులు రుణాలుగా ఇచ్చాయి. ఈ ఏడాది రూ. 22 వేల కోట్ల రూపాయలు రుణాలుగా ఇవ్వాలని నాబార్డ్ (వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంకు), రాష్ట్రస్థాయి బ్యాంకింగ్ కమిటీలు నిర్ధేశించాయి.

ఎంఎస్ఎంఇ పాలసీ 2015 -2020
      ఈ రంగం ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వం ఎంఎస్ఎంఇ పాలసీ 2015 -2020ని రూపొందించింది. ఈ పాలసీ ద్వారా ఈ రంగానికి ప్రభుత్వం అనేక సబ్సిడీలు, రీయింబర్స్ మెంట్స్, రాయితీలు ప్రకటించింది. ఈ రంగంలో పరిశ్రమను నెలకొల్పితే రూ.20 లక్షలకు మించకుండా 15 శాతం పెట్టుబడి సబ్సిడీ ఇస్తారు. ఉత్పత్తి ప్రారంభమైన తరువాత 5 సంవత్సరాల వరకు వ్యాట్, సీఎస్టీ, ఎస్జీఎస్టీ తిరిగి చెల్లిస్తారు. వడ్డీ సబ్సిడీ రీయింబర్స్ చేస్తారు.  నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తారు. విద్యుత్ ఛార్జీలు రీయింబర్స్ చేస్తారు. పరిశ్రమకు ఉపయోగించడం కోసం కొనుగోలు చేసే స్థలం, షెడ్, భవనంపై స్టాంప్, బదిలీ డ్యూటీ వంద శాతం రీయింబర్స్ చేస్తారు. నిబంధనలకు అనుగుణంగా యూనిట్ స్థాపన కోసం భూమి కొనుగోలు చేస్తే రూ.10 లక్షలకు మించకుండా 25 శాతం వరకు రీయింబర్స్ చేస్తారు. బీసీ, ఎస్సీ,ఎస్టీలకైతే రూ.20 లక్షలు మించకుండా 50 శాతం వరకు రీయింబర్స్ చేస్తారు. వ్యవసాయ భూమిని పారిశ్రామిక ఉపయోగాల కోసం మార్పు చేసే చార్జీలలో రూ.10 లక్షల లోపు 25 శాతం వరకు రీయింబర్స్ చేస్తారు. పేటెంట్ రిజిస్ట్రేషన్ కోసం చేసే ఖర్చులు రీయింబర్స్ చేస్తారు. ఉద్యోగులు లేక కార్మికుల వృత్తి నైపుణ్యానికి సంబంధించి శిక్షణకు అయ్యే ఖర్చులను కూడా రీయింబర్స్ చేస్తారు. ఐఎస్ఓ-9000, బీఐఎస్ నాణ్యత ప్రమాణాల ధృవీకరణ పత్రం కోసం రూ.50 వేల వరకు సమకూరుస్తారు. ఉత్పత్తుల నాణ్యత విషయంలో బహుళజాతి కంపెనీలతో పోటీపడాలనేది దీని ముఖ్య ఉద్దేశం. ఉత్పత్తిలో ఎంఎస్ఎంఇ ఇతర రంగాలతో పోటీపడేవిధంగా టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడానికి, ఆధునీకరించడానికి ఒక్కో యూనిట్ కు రూ.2.50 లక్షల వరకు సమకూరుస్తారు. రాష్ట్రంలో ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) అభివృద్ధిపరిచే పారిశ్రామిక పార్కులలో ఎంఎస్ఎంఇ పరిశ్రమలకు 15 శాతం భూమిని రిజర్వు చేస్తారు. కొత్తగా ప్రారంభించే యూనిట్లకైతే మిషనరీ విలువలో పది శాతం ఆర్థిక సహాయం చేస్తారు. ఈ రంగంలో పరిశ్రమల సమస్యల పరిష్కారినికి ఒక డెస్క్ ను ఏర్పాటు చేశారు.

‘ఆంధ్రప్రదేశ్ రత్నాలు’ అవార్డులు
      ఈ రంగంలో ఉత్పాదక సామర్థ్యం, రక్షణ విధానాలు, నూతన పోకడలను గుర్తించి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ‘ఆంధ్రప్రదేశ్ రత్నాలు’ అనే అవార్డులను ప్రభుత్వం ఇస్తోంది. పారిశ్రామికవేత్తల మధ్య పోటీ తత్వాన్ని పెంపొందించడానికి ఈ అవార్డులు ఇస్తున్నారు.

జారీ చేసినవారు :  సమాచార పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం



10 లక్షల 19 వేల మంది రైతులకు వెబ్ ల్యాండ్ రుణాలు

  •    38 లక్షల 10 వేల ఎకరాలపై రూ.9,270 కోట్లు రుణాలు
  •    అత్యధిక రుణాలు పొందిన గుంటూరు, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాలు
  •    మొదటి స్థానంలో భీమవరం మండలం
  •    గత ఏడాది మొదటి 3 స్థానాల్లో వెనుకబడిన జిల్లాలే!
            రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 38,10,305 ఎకరాల వెబ్ ల్యాండ్ పై రూ.9,270 కోట్ల రుణాలు మంజూరు చేశారు. రికార్డుల డిజిటలైజేషన్ లో భాగంగా భూముల వివరాలన్నింటిని రెవెన్యూ శాఖవారు ఆన్ లైన్ లోకి ఎక్కిస్తున్నారు.  ఈ విధంగా ఆన్ లైన్ లో ఎక్కించిన భూములను వెబ్ ల్యాండ్ అంటారు. సర్వే ఇబ్బందులు, వంశపారంపర్య హక్కులకు సంబంధించి వివాదాలు ఉన్న భూములు తప్ప దాదాపు రాష్ట్రంలోని అన్ని భూముల వివరాలు ఆన్ లైన్ లోకి ఎక్కించారు. దీంతో అటు ప్రభుత్వానికి, ఇటు బ్యాంకులకు, ప్రజలకు వెసులుబాటు ఏర్పడింది.  రెవెన్యూ రికార్డులు డిజిటలైజేషన్ అయినందువల్ల రైతులు రుణాలు పొందడానికి ఎక్కువ ఇబ్బందులు పడవలసిన అవసరంలేదు.  వెబ్ ల్యాండ్ పై ఇచ్చిన రుణాల వివరాలను అన్ని బ్యాంకుల వారు ఏ రోజుకారోజు సీఎం డ్యాష్ బోర్డులో ఎక్కిస్తారు. ఏ జిల్లాలో ఏ బ్యాంకు ఎన్ని ఎకరాలపై ఎంత మంది రైతులకు, ఎంత రుణం ఇచ్చిందో పూర్తి వివరాలు అందులో పొందుపరుస్తారు. ఏ గ్రామంలో ఏ బ్యాంకు ఎంత మందికి, ఎంత రుణం ఇచ్చిందో అందరూ తెలుసుకునే అవకాశం ఉంది. పారదర్శకతకు ఇది ఓ పక్కా నిదర్శనం. 

మొదటి స్థానంలో గుంటూరు జిల్లా
         సీఎం డ్యాష్ బోర్డు ప్రకారం నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం వరకు రాష్ట్రంలోని 13 జిల్లాలలో 38,10,305 ఎకరాలపై 10,19,810 మంది రైతులకు  రూ. 9,270.89 కోట్లు రుణాలుగా ఇచ్చారు. అత్యధికంగా రుణాలు ఇచ్చిన జిల్లాలలో గుంటూరు, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాలు వరుసగా మూడు స్థానాలలో ఉన్నాయి. గుంటూరు జిల్లాలో రూ.1462.89 కోట్లు, కర్నూలు జిల్లాలో రూ.1163.95 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో రూ. 1161.07 కోట్లు రుణాలుగా ఇచ్చారు. రూ.160.33 కోట్ల రూణాలు పొంది విజయనగరం జిల్లా చివరి స్థానంలో ఉంది. మిగిలిన జిల్లాలను పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లాలో రూ. 289.12 కోట్లు, విశాఖపట్నం జిల్లాలో రూ. 230.80 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో రూ.554.41 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.673.33 కోట్లు, ప్రకాశం జిల్లాలో రూ.684.13 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ.430.65 కోట్లు, చిత్తూరు జిల్లాలో రూ.728 కోట్లు, కడప జిల్లాలో రూ. 705.91 కోట్లు, అనంతపురం జిల్లాలో 1026.30 కోట్లు రుణాలుగా ఇచ్చారు.

అత్యధిక రుణాలు పొందిన భీమవరం మండలం
       రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అత్యధికంగా రుణాలు ఇచ్చిన మండలాలను పరిశీలిస్తే పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం రూ.191.55 కోట్ల రుణాలతో మొదటి స్థానంలో నిలిచింది. గుంటూరు జిల్లా గుంటూరు మండలంలో 115.76 కోట్లు, కర్నూలు జిల్లా ఆదోని మండలంలో రూ. 81.11 కోట్లు, అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో రూ. 67.29 కోట్లు, శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలంలో రూ.25.44 కోట్లు, విజయనగరం జిల్లా సాలూరు మండలంలో రూ. 22.55 కోట్లు, విశాఖపట్నం జిల్లా విశాఖ రూరల్ మండలంలో రూ. 24.97 కోట్లు రుణాలు ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అర్బన్ మండలంలో రూ. 53.06 కోట్లు, కృష్ణా జిల్లా విజయవాడ అర్బన్ మండలంలో రూ. 64.72 కోట్లు, ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలో రూ. 44.28 కోట్లు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో రూ.47.05 కోట్లు, చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో రూ.34.41 కోట్లు, కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో రూ.55.26 కోట్లు రుణాలు ఇచ్చారు.

గత ఏడాది మొదటి 3 స్థానాల్లో వెనుకబడిన జిల్లాలే!
       ఇదిలా ఉండగా, గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో 17,75,722 మంది రైతులకు రూ.11,870.32 కోట్లు వెబ్ ల్యాండ్ రుణాలు ఇచ్చారు. గత ఏడాది మొదటి మూడు స్థానాలలో వెనుక బడిన జిల్లాలే ఉన్నాయి. రూ.2,412.64 కోట్ల రుణాలతో అనంతపురం జిల్లా మొదటి స్థానంలో, రూ.1,468.46 కోట్లతో ప్రకాశం జిల్లా రెండవ స్థానంలో, రూ.1,404.59 కోట్లతో కర్నూలు జిల్లా మూడవ స్థానంలో ఉన్నాయి.

జారీ చేసినవారు :  సమాచార పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం