Jul 5, 2025

రాజ్యాధికారానికి దూరమైతే అభివృద్ధిలో వెనుకబడతారు

మంగళగిరి:  ఏ జాతి ప్రజలు రాజ్యాధికారానికి దూరమౌతారో, ఆ జాతి ప్రజలు అభివృద్ధి సాధించడంలో వెనకబడతారని  పద్మశాలీ క్షత్రియ పరిషత్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు,  హైకోర్టు అడ్వకేట్  కొసనం శ్రీనివాసరావు చెప్పారు.  అలాగే అభివృద్ధిలో వెనుకబడిన జాతుల ప్రజలు రాజ్యాధికారం కోల్పోతారన్నారు. చేనేత కార్మిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.  అభివృద్ధి, రాజ్యాధికారం అనేవి పరస్పరం ఒకదానిపై మరోటి ఆధారపడిన అంశాలుగా పేర్కొన్నారు.  ఒకటి లోపిస్తే మరొకటి లోపిస్తుందని, ఒకటి సాధిస్తే మరొకటి సాధించగలం అన్నారు. అలాగే ఒక సామాజిక వర్గ అభివృద్ధిని, రాజ్యాధికారాన్ని సమన్వయ పరిచేది ఆ సామాజిక వర్గం ప్రజల ఆత్మగౌరవం, ఐకమత్యం, సమిష్టి నిర్ణయాలు, కలిసి నడవడం అని వివరించారు.  ఆత్మగౌరవంతో ఐకమత్యం వస్తుందని, ఐకమత్యం ఉన్నవారు సమిష్టి నిర్ణయాలు చెయ్యగలరని, సమిష్టి నిర్ణయాలు కలిసి నడిచేలా  చేస్తాయని తెలిపారు. కలిసి నడిచినప్పడే మన సామాజిక వర్గానికి సామాజిక న్యాయం ప్రకారం దక్కవలసిన రాజ్యాధికారం సాధించగలమని, మన సామాజిక వర్గం ప్రజల అభివృద్ధికి కావలసిన భారీ ప్రణాళికలు ప్రభుత్వంతో అమలు చేయించుకోవాలని పద్మశాలీ సామాజిక వర్గానికి ఆయన పిలుపు ఇచ్చారు.

వ్యక్తిగత ప్రయోజనాలు చాలా చిన్నవని, సామాజిక వర్గం ప్రయోజనాలు చాలా విస్తృతమైనవి, విలువైనవన్నారు.  గతంలో ప్రగడ కోటయ్య నాయకత్వంలో చేనేత కాంగ్రెస్ ఒక పిలుపునిస్తే రాష్ట్రంలో  చేనేత కులవృత్తికి అవసరమైన 5 సహకార స్పిన్నింగ్ మిల్లులు ఆవిర్భవించాయని గుర్తు చేశారు. అనేక వ్యవస్థల నిర్మాణం జరిగిందన్నారు. బ్రిటిష్ పాలనలో చేనేత వృత్తికి, సామాజిక వర్గానికి జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటూ మన సామాజిక వర్గం వికసించిందని కొసనం శ్రీనివాసరావు తెలిపారు. చేనేత సామాజిక వర్గమే రాష్ట్రంలో అతిపెద్ద సంఘటిత సామాజిక , రాజకీయ శక్తిగా రాజకీయ పార్టీల గుర్తింపు పొందిందని తెలిపారు.  కాలక్రమంలో దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న దశలో మన తొలితరం నాయకులు కొంతమంది అస్తమించడం, కొంతమంది వృద్ధాప్యం వలన రాజకీయ ఉధృతి తగ్గిందన్నారు. దేశ పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఆధునిక వస్త్ర ఉత్పత్తి రంగంలో మన సామాజిక వర్గాన్ని మిళితం చేయలేక పోవడం, ముందు చూపుతో సామాజిక వర్గానికి దిశా నిర్దేశం చేసే నాయకత్వ లోపం ఏర్పడిందన్నారు.  పారిశ్రామిక అభివృద్ధిని  అందిపుచ్చుకోవడంలో మనవాళ్లు వెనుకబడిపోయారన్నారు.  చేనేతలోనే మనవాళ్ళు ఉండడం మనల్ని ఆర్థికంగా బలహీన పరిచిందన్నారు.  ఆ విధంగా బలహీనపడి  రాజకీయ ప్రాతినిధ్యం కోల్పోయామని తెలిపారు. 

అయితే, గత కొన్ని సంవత్సరాలుగా మనలో ఆత్మగౌరవం ఉన్నప్పటికీ ఐకమత్యం లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.  మనకు రాజ్యాధికారం లేకపోయినా, మన సంఖ్యాబలం ఉన్న నియోజకవర్గాలలో వేరే సామాజిక వర్గం వారు పాలకులుగా మారినా, మన వ్యక్తిగత ప్రయోజనాలు ఎవరో ఒకరు నెరవేర్చుతున్నారు కదా సామాజిక ఐకమత్యం, సమిష్టి నిర్ణయాలతో పనేముందనే ధోరణి కనిపిస్తుందని, ఇది మంచిది కాదన్నారు. నేడు మన వ్యక్తిగత ప్రయోజనాలు ఎవరో ఒకరు నేరవేర్చుతున్నారు కదా అని మనం అంతటితో తృప్తి చెంది మన సంఖ్యాబలం ఉన్న నియోజకవర్గాలలో రాజ్యాధికారం వదులుకుంటే మన సామాజిక వర్గం ప్రజల విస్తృత ప్రయోజనాలు దెబ్బ తింటాయన్నారు. మన సామాజిక వర్గం ప్రజల అభివృద్ధికి అవసరమైన వ్యవస్థల నిర్మాణం మనం చెయ్యలేమని పేర్కొన్నారు. అందువల్ల,  మనం సామాజిక వర్గం ప్రజల విస్తృత ప్రయోజనాలు సాధన, అభివృద్ధి, రాజ్యాధికారం కోసం మనం ఐకమత్యంగా సమిష్టి నిర్ణయాలు చేసి, కలిసి ఉద్యమాలు చెయ్యడం ఎంతైనా అవసరం అని కొసనం శ్రీనివాసరావు అన్నారు. 

No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...