Jul 23, 2025

ఆధునిక హంగులతో ‘బుద్ధునితో నా ప్రయాణం’








రెండున్నర గంటలు ప్రేక్షకులను కట్టిపడేసిన నాటకం


స్టేజీ నాటకానికి  ఆధునిక హంగులు అద్దారు. నాటకంను ప్రదర్శించే తీరులో నూతన పోకడలకు ప్రాధాన్యత ఇచ్చారు.  రికార్డ్ చేసిన నాటకాన్ని  30 మంది కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. భాష, భావం, సంగీతం, నృత్యాలతో బౌద్ధాన్ని స్టేజీపై ఆవిష్కరించారు.  ఎలక్ట్రానిక్ మీడియా ఆవహించిన ఈ రోజుల్లో వందల మంది ప్రేక్షకులను కదలకుండా రెండున్నర గంటలు కట్టిపడేసింది. నాటకాన్ని చూసినవారందరికీ ఓ కొత్త అనుభూతిని కలిగించింది. అదే ‘బుద్ధునితో నా(అంబేద్కర్) ప్రయాణం’ అనే నృత్యరూప నాటకం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన బుద్ధుడు ఆయన ధర్మం పుస్తకం ఆధారంగా ఈ నాటకాన్ని రాశారు. ఆ నాటి సామాజిక పరిస్థితులను, గౌతముడు బుద్ధుడిగా మారిన తీరు, బుద్ధుని బోధనల సారంతో బౌద్ధం-అంబేద్కరిజంని ఆవిష్కరించారు. బౌద్ధానికి, బుద్ధునికి, జీవితానికి సంబంధించిన అనేక ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు లభిస్తాయి. అంబేద్కర్ కలిగిన సందేహాలు ఎలా నివృత్తి అయ్యాయో, మనకి కూడా నివృత్తి అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జ్ఞనోదయం అవుతుంది.  ఇక ఆచరించడం అనేది మనపైనే ఆధారపడి ఉంటుంది. అతి సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ఎక్కవ భాగం వాడుక భాషలో ఈ దృశ్యరూపకాన్ని అద్వితీయంగా రూపొందించారు. కొన్ని దృశ్యాలు చాలా ప్రత్యేకంగా ప్రదర్శించారు. వాటిలో  గౌతముడు బుద్ధుడిగా మారిన సన్నివేశం చూపరులను బాగా ఆకట్టుకుంది. వేదికపై ఒకేసారి మూడు సన్నివేశాలు కనిపిస్తాయి. రికార్డ్ చేసిన నాటకం అయినా,  ప్రేక్షకులు గమనించలేనంగా నటీనటులు అందరూ  పెదాల కదలికను ప్రదర్శించారు. రికార్డ్ చేసిన నాటకం అయినందునే నిర్ణయించిన ప్రకారం 2.20 గంటలకు ముగుస్తుంది. 


బుద్ధుడి పాత్రధారి చాలా అందంగా ఉన్నారు. చక్కటి ముఖవర్చస్సు. బుద్ధుడిలోని ఆ శాంతం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత,  నడక,  నమ్రత, స్థిత ప్రజ్ఞత, మరణాన్ని జయించిన తేజస్సు ఆ నటుడిలో మూర్తీభవించింది. ఆయన మాటతీరు, అభినయం అద్వితీయం. నాటకం ఆద్యంతం, స్టేజీపై లైట్లు ఆఫ్ చేసిన సమయంలో కూడా ఆ నటుడి నటన ఒకేతీరుగా ఉండటం ప్రత్యేకం.  అంబేద్కర్ పాత్రధారి కూడా చాలా చక్కగా నటించారు. ఆయన నడవడి, మాటతీరు, సందేహాలు వ్యక్తం చేసే విధానం బాగా ఆకట్టుకున్నాయి.  బుద్ధుడు, అంబేద్కర్ ఇద్దరి వస్త్రధారణ బాగుంది. నాటకం మొత్తాన్ని మోసిన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు మొత్తం  ఆరుగురు నృత్య కార్మికులు, శ్రామికులు, కళాకారుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారు నాటకం మొత్తం శ్రమించారు. వారు అలుపెరుగకుండా, చెమటలు కక్కుతూ, ప్రేక్షకుల ఆసక్తి తగ్గకుండా నృత్యం చేశారు. కథంగా వారే నడిపారు.  దాదాపు రెండు గంటలు వారు నృత్యం చేయడంతోపాటు వివిధ రకాల పాత్రలు కూడా పోషించడం విశేషం. 

మైనస్ పాయింట్లు

నాటకం ఇతివృత్తం, ప్రదర్శన తీరు ఎంత అద్బుతంగా ఉన్నప్పటికీ క్లైమాక్స్‌లో హిందు మతాన్ని విమర్శించడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. మతం ఏదైనా(ఏదైనా) మత్తు మందులాంటిదే. అందులో సందేహంలేదు. అలాంటప్పుడు ఒక్క హిందు మతాన్నే విమర్శించడం సరైన ఆలోచన కాదని నాకు అనిపించింది. అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్నే ఎందుకు స్వీకరించారు.? అది మరో అంశం. అంబేద్కరిస్టులలో అత్యధిక మంది క్రైస్తవులు లేక ఆ మతానికి చెందిన కుటుంబాల నుంచి వచ్చినవారే. ఇది మరో పెద్ద అంశం. వాటిజోలికి  నేను వెళ్లడంలేదు.  సమాజానికి ఎంతో ఉత్తమమైన, విలువైన సందేశాలను అందించిన, బుద్ధుని బోధనలను అత్యంత ఆసక్తికరంగా చూపించి, వినిపించి, చివరకు  హిందు మతాన్ని విమర్శించిన తీరు అసలు బాగోలేదు. ఉత్తమ బోధనలతో శిఖర స్థాయికి వెళ్లిన ఆలోచనలు చివరి అయిదు నిమిషాలలో ఒక్కసారిగా దిగజారినట్లనిపించింది. ఈ సమాజానికి ఈ నాటకం అవసరం చాలా ఉంది. బౌద్ధం, అంబేద్కర్ భావజాలంతోపాటు ప్రపంచ మానవ జాతికి  కావలసిన అనేక అంశాలను అత్యంత సులువుగా అర్థం చేసుకునే విధంగా నాటకంని ప్రదర్శించారు. అందువల్ల, నాటక రచయిత, ప్రదర్శకులు ఈ విషయాన్ని తప్పక ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇక ముందు ముందు ప్రదర్శనలలో మార్పులు చేస్తే మంచిదని నా అభిప్రాయం.  నాటకంలో భాష 90 శాతం వ్యవహారికమే వాడారు. ఓ పది శాతం మాత్రం గ్రాంథికం వాడారు. దానిని కూడా వ్యవహారికంలోకి మార్చవలసిన అవసరం ఉందనిపించింది.

విజయవాడ మొగల్రాజ్ పురం సిద్దార్థ కాలేజీ ఆడిటోరియంలో జూలై 22 మంగళవారం  రాత్రి  బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్ధ కళాపీఠం, కామ్రేడ్ జీఆర్‌కే - పోలవరపు సాంస్కృతిక సమితి వారి సంయుక్త సహకారంతో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు ఈ నాటకాన్ని ప్రదర్శించారు.  వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా   వందల మంది  నాటకం చూసేందుకు వచ్చారు. వారిలో కమ్యూనిస్టు పార్టీలకు చెందిన వారితోపాటు ప్రగతిశీలవాదులు, ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు.  కదలకుండా కూర్చొని చూశారు. ఓ నాటకం పట్ల ప్రజలు  ఇంతటి ఆసక్తికనపరచడం, వారి ఆలోచనల స్థాయికి తగ్గకుండా నాటకాన్ని ప్రదర్శించడం గమనార్హం.సంతోషం.  

మరో మైనస్ పాయింట్

ముందుగా ప్రకటించిన ప్రకారం నాటకంని ప్రారంభించలేదు. గంట ఆలస్యంగా  నాటకాన్ని మొదలు పెట్టారు. నా దృష్టిలో  ఇది క్షమార్హం కాదు. ఎందుకో వివరిస్తాను.  బుద్ధుడు - అంబేద్కర్ లను  ఉన్నతమైన వ్యక్తులుగా ప్రపంచం గుర్తించింది. తెలుగు నేలపై  సామాజిక, రాజకీయ, తాత్విక కోణాలను స్పృశిస్తూ, వారిద్దరి గురించి, వాళ్ళు సమాజం కోసం పడిన తపన గురించి, సమాజానికి వారు చూపించిన సార్వకాలికమైన సత్యాలను, వారి జీవితాల్లో జరిగిన పలు సంఘటనలను సంగీత, సాహిత్య సమ్మేళనంతో నిండిన గొప్ప కళారూపంగా, అత్యంత ఆధునిక సాంకేతిక, సౌండ్ అండ్ లైటింగ్ విధానాలతో  ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసే విధంగా నాటకంని ప్రదర్శిస్తున్నట్లు రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా  ప్రచారం చేశారు. చేస్తున్నారు. ప్రదర్శిస్తున్నారు. బౌద్ధులు, బౌద్దాభిమానులు, అంబేద్కరిస్టులు, వామపక్ష వాదులు, అభ్యుదయ వాదులు, సామాజిక మార్పును కాంక్షించే  ప్రగతిశీలు అందరినీ ఈ నాటకం పేరుతో కూడకడుతున్నారు. ఇది చాలా మంచి పరిణాం. ఇప్పటికే రెండు రాష్ట్రాలలో మంచి గుర్తింపు పొందారు. దానిని దృష్టిలో పెట్టుకుని దూర ప్రాంతాల నుంచి కార్లు, బస్సులు, టూవీలర్ల పై వందల సంఖ్యలో ప్రేక్షకులు వచ్చారు. సమాజంలో ఓ విప్లవాత్మకమైన మార్పు రావాలన్న దసాశయంతో ఈ నాటకంని ప్రదర్శిస్తున్నారు. అందువల్ల ఒక్క క్షణం కూడా ఆలస్యం జరగకుండా సమయపాలన పాటించవలసిన అవసరం నిర్వాహకులకు ఉంది. 

-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

Jul 18, 2025

రూ.39,473 కోట్ల పెట్టుబడులకు ఆమోదం


అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న పారిశ్రామిక ప్రాజెక్టుల చుట్టూ సంబంధిత ఎకో సిస్టం వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎకో సిస్టం ద్వారా ఆయా ప్రాజెక్టులతో పాటు స్థానికులు, అనుబంధ సంస్థలకూ లబ్ది కలుగుతుందని సీఎం స్పష్టం చేశారు.  సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 8వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్ఐపీబీ ) సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, కె.అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్ లు హాజరయ్యారు. ఎస్ఐపీబీ సమావేశానికి సీఎస్ కె.విజయానంద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.  ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన, పర్యాటక రంగాలకు సంబంధించిన  రూ.39,473 కోట్ల విలువైన పెట్టుబడులకు  రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదాన్ని తెలియచేసింది. పరిశ్రమలు-వాణిజ్య రంగానికి చెందిన 11 ప్రాజెక్టులు, ఇంధన రంగంలో 7, పర్యాటక రంగంలో 3,  ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఒక్కోటి చొప్పున ప్రాజెక్టులు ఎస్ఐపీబీ ఆమోదం పొందాయి. మొత్తం 22 ప్రాజెక్టుల ద్వారా 30,899 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకూ జరిగిన ఎస్ఐపీబీ సమావేశాల్లో 109 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇందులో పారిశ్రామిక రంగానికి చెందిన 46 ప్రాజెక్టులు, ఇంధన రంగానికి చెందిన 41 ప్రాజెక్టులు, పర్యాటక రంగలో 11, ఐటీ లో 7, ఫుడ్ ప్రాసెసింగ్ 4 పరిశ్రమలకు చెందిన పెట్టుబడులు  ఎస్ఐపీబీ ఆమోదం పొందాయి.  ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా రూ.5,74,238 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. అలాగే 5,05,968 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.

సమీకృత ప్రణాళికతో పారిశ్రామిక ప్రాజెక్టులు

పారిశ్రామిక ప్రాజెక్టులకు సమీపంలో రహదారులు, పోర్టులు, ఎయిర్ పోర్టులు లాంటి మౌలిక సదుపాయాలతో పాటు ఆ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భూములు ఇచ్చిన రైతులు, స్థానికులకు ప్రయోజనం కలిగితేనే వారు సంతోషంగా భూములు ఇవ్వగలుగుతారని సీఎం పేర్కోన్నారు. భూములు కేటాయించిన ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా తమ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పర్యాటక ప్రాజెక్టుల విషయంలోనూ సమీకృత ప్రణాళికల్ని అమలు చేయాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. కేవలం నిర్దేశిత ప్రాజెక్టుకు మాత్రమే పరిమితం కాకుండా అనుబంధంగా కార్యకలాపాలు వచ్చేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. ప్రత్యేకించి సర్వీసు సెక్టార్ కూడా వచ్చేలా ప్రాజెక్టులను ఇంటిగ్రేట్ చేయాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. పీపీపీ విధానంలో చేపట్టే పర్యాటక ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ భూములను సేకరించి సిద్ధం చేసుకోవాలని అన్నారు. శ్రీశైలంలో దేవాలయంతో పాటు భారీ నీటి ప్రాజెక్టు కూడా ఉందని ఎక్కువ మంది పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఆస్కారం ఉండేలా సమీకృత పర్యాటక ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే శ్రీశైలం రహదారి విస్తరణపైనా దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఆతిథ్య రంగంలో కేవలం హోటల్ గదులకు మాత్రమే పరిమితం కాకుండా అనుబంధ వినోద కార్యకలాపాలు, సేవల రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు వచ్చేలా చూడాలన్నారు. మరో వైపు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎంత మందికి ఉద్యోగాలను కల్పించామో వివరాలు తెలిసేలా ఎంప్లాయిమెంట్ పోర్టల్ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

 ఎస్ఐపీబీ ఆమోదించిన 22 ప్రాజెక్టులు

అమరావతి: సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 8వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్ఐపీబీ) సమావేశం గురువారం జరిగింది. 

ఈ సమావేశంలో ఆమోదించిన ప్రాజెక్టుల వివరాలు:

1. ఫినామ్ పీపుల్ ప్రైవేటు లిమిటెడ్ - విశాఖలో రూ.205 కోట్లు పెట్టుబడి, 2500 ఉద్యోగాలు.

2. శ్రీజా మహిళా ప్రొడ్యూసర్ కంపెనీ-  చిత్తూరులో రూ.282 కోట్లు పెట్టుబడి, 1400 ఉద్యోగాలు.

3. రెన్యూ వ్యోమన్ పవర్ లిమిటెడ్ - కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రూ.1800 కోట్లు పెట్టుబడి, 380 ఉద్యోగాలు.

4. రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ -  కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రూ.3600 కోట్ల పెట్టుబడి, 760 ఉద్యోగాలు

5. జెఎస్ డబ్ల్యూ నియో ఎనర్జీ  - కడప జిల్లాలో రూ.2000 కోట్ల పెట్టుబడి, 1380 ఉద్యోగాలు

6. పీవీఎస్ రామ్మోహన్ ఇండస్ట్రీస్ - శ్రీకాకుళం జిల్లాలో రూ.204 కోట్లు పెట్టుబడి, 1000 ఉద్యోగాలు 

7. పీవీఎస్ గ్రూప్ - విజయనగరం జిల్లాలో రూ.102 కోట్ల పెట్టుబడి ,500 ఉద్యోగాలు

8. ఆర్వీఆర్ ప్రైవేట్ లిమిటెడ్-  నంద్యాల జిల్లాలో పంప్డ్ స్టోరేజి పవర్ ప్రాజెక్టు, రూ.4708 కోట్ల పెట్టుబడి, 1200 ఉద్యోగాలు 

9. ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ - విశాఖలో రూ.328 కోట్ల పెట్టుబడి, 1100 ఉద్యోగాలు

10. లాన్సమ్ లీజర్స్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్-  విశాఖలో రూ.86 కోట్ల పెట్టుబడి, 720 ఉద్యోగాలు

11. స్టార్ టర్న్ హోటల్స్ ఎల్ఎల్ పీ-  తిరుపతిలో రూ.165 కోట్ల పెట్టుబడి , 280 ఉద్యోగాలు

12. గ్రీన్ ల్యామ్ లిమిటెడ్ - తిరుపతి నాయుడుపేట సెజ్ లో రూ.1147 కోట్ల పెట్టుబడి, 1475 ఉద్యోగాలు  

13. యాక్సెలెంట్ ఫార్మా - తిరుపతి శ్రీసిటీలో రూ.1358 కోట్ల పెట్టుబడి, 1770 ఉద్యోగాలు

14. అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ - కర్నూలు జిల్లాలో (సోలార్ సెల్, పీవీ మాడ్యూల్ ఉత్పత్తి), రూ.6933 కోట్ల పెట్టుబడి, 2138 ఉద్యోగాలు

15. జెఎస్ డబ్ల్యూ ఏపీ స్టీల్ ప్లాంట్ - కడప జిల్లా స్టీల్ ప్లాంట్  రూ.4500 కోట్ల పెట్టుబడి( రెండు దశల్లో), 2500 ఉద్యోగాలు

16. రెన్యూ ఫోటో వోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్- అనకాపల్లి జిల్లా(ఫోటో వోల్టాయిక్ ప్లాంట్) రూ.3700 కోట్ల పెట్టుబడి,లు,1200 ఉద్యోగాలు 

17. లారస్ ల్యాబ్స్ - అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద రూ.5630 కోట్ల పెట్టుబడి, 6350 ఉద్యోగాలు

18. లులూ షాపింగ్ మాల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్- విశాఖ, విజయవాడలలో రూ.1222 కోట్లు పెట్టుబడి, 1500 ఉద్యోగాలు

19. ఏస్ ఇంటర్నేషనల్ - చిత్తూరు జిల్లా కుప్పంలో డైరీ యూనిట్ రూ.1000 కోట్ల పెట్టుబడి, 2000 ఉద్యోగాలు

20. బ్రాండిక్స్ ఇండియా అపారెల్ సిటీ ఇండియా- అచ్యుతాపురం సెజ్ లో ఫుట్ వేర్, టాయ్స్ తయారికీ అనుమతి

21. వీఎస్ఆర్ సర్కాన్ - శ్రీకాకుళం జిల్లాలో రూ.39 కోట్ల పెట్టుబడి, 246 ఉద్యోగాలు 

22. అవిశా ఫుడ్స్ అండ్ ఫ్యూయెల్స్ - కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో రూ.500 కోట్ల పెట్టుబడి, 500 ఉద్యోగాలు


Jul 17, 2025

అమరావతిలో సీఆర్డీఏ భూ కేటాయింపులు


అమరావతి: రాజధాని అమరావతిలో సీఆర్డీఏ పలు సంస్థలకు భూములు కేటాయించింది.  అమరావతి పరిధిలోని నిడమర్రు, రాయపూడి, తుళ్లూరు ప్రాంతాల్లో పలు సంస్థలకు ప్రభుత్వం ఈ భూములను కేటాయించారు. ఆ కేటాయింపుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 

క్వాంటం వ్యాలీకి 50 ఎక‌రాలు

లా యూనివ‌ర్శిటీకి 55 ఎక‌రాలు

ఐఆర్ సీటీసీకి ఒక ఎక‌రం

బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఫౌండేష‌న్ కు 21 ఎక‌రాలు

కోస్ట‌ల్ బ్యాంకుకు 0.4 ఎక‌రాలు

రెడ్ క్రాస్ సొసైటీకు 0.78 ఎక‌రాలు

శాఖమూరు పార్కులో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కు  6.8 ఎకరాలు  

కిమ్స్ ఆస్పత్రికి నిడమర్రులో 25 ఎకరాలు

రాయపూడిలో సీబీఐకి 3.50 ఎకరాలు

రాయపూడిలో ఏపీ కోఆపరేటివ్ బ్యాంకుకు 3 ఎకరాలు

తుళ్లూరులో ఫోరెన్సిక్ ల్యాబ్ కు 3 ఎకరాలు

గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి 12 ఎకరాలు

ఎంఎస్‌కే ప్రసాద్ క్రికెట్ అకాడమీకి 12 ఎకరాలు

ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు 2 ఎకరాలు

ఏపీ గ్రామీణ బ్యాంక్‌కు రెండు ఎకరాలు

బీజేపీ ఆఫీసుకురెండు ఎకరాలు

మందడంలో వివాంతా స్టార్ హోటల్ కు 2.5 ఎకరాలు

హిల్చన్ స్టార్ హోటల్  కు 2.5 ఎకరాలు

తుళ్లూరులో హయత్ రీజెన్సీ కి 2.5 ఎకరనాలు

లింగాయపాలెంలో నోవోటెల్ హోటల్ కు 2.5 ఎకరాలు

సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ కు రెండు ఎకరాలు

జియలాజిక‌ల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థకు రెండు ఎకరాలు

స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు ఐదు ఎకరాలు

ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కు మూడు ఎకరాలు 

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 0.4 ఎకరాలు

ఇంటిలిజెన్స్ బ్యూరో (SIB)కి 0.5 ఎకరాలు

బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కి 0.5 ఎకరాలు

గెయిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అంబికా అగర్ బ‌త్తి సంస్థ‌లకు  గతంలో చేసిన కేటాయింపులు రద్దు చేశారు. 

ఇప్పటివరకు 74 సంస్థలకు 947 ఎకరాల భూమి కేటాయించారు. వాటి నిర్మాణాలకు గడువులు విధించారు. 3 సంస్థలు 1 నెలలో, 15 సంస్థలు 2 నెలల్లో, 13 సంస్థలు 5 నెలల్లో, 17 సంస్థలు 6 నెలల్లో పనులు ప్రారంభిస్తాయి.

2014-19 మ‌ధ్య కాలంలో 130 సంస్థలకు 1270 ఎక‌రాలు కేటాయించ‌గా, గ‌త ప్ర‌భుత్వ చర్యల వల్ల ప‌లు సంస్థ‌లు వెన‌క్కి వెళ్లిపోయాయి. 

Jul 15, 2025

మంగళగిరి ఎయిమ్స్‌లో ఏం జరుగుతోంది?


మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్‌ తట్టుకోలేక ఓ జూనియర్‌ వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. ఆ విద్యార్థి ఇక్కడ చేరి ఏడాది పూర్తి అయింది. ఇది ర్యాగింగ్ కాదని, ఓ విద్యార్థినిని, ఆమెకు తెలియకుండా వీడియో తీయడం వల్ల జరిగిన గొడవని తెలుస్తోంది.  ఈ విషయం బయటకు పొక్కితే, పెద్ద కేసవుతుందని, ఆ విద్యార్థినీ, విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని,   దానిని ర్యాంకింగ్ గా డైవర్ట్ చేసినట్లు భావిస్తున్నారు. ఇది జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మక సంస్థ అయినందున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎయిమ్స్‌ యాజమాన్యం వారు, స్థానికంగా ప్రచారంలో ఉన్న వివరాల ప్రకారం,  తిరుపతికి చెందిన జూనియర్‌ విద్యార్థికి, సీనియర్ విద్యార్థులకు మధ్య జూన్ 23న గొడవ జరిగింది. ఆ విద్యార్థినిని 25వ తేదీ వరకు సీనియర్లు వసతి గృహంలో పలుమార్లు నిర్బంధించారు.  ర్యాగింగ్‌ పేరిట కొట్టారు. బెదిరించారు.  దీంతో మనస్తాపం చెందిన ఆ విద్యార్థి బ్లేడుతో చేయి కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తీవ్ర రక్తస్రావం కావడాన్ని గమనించిన తోటి విద్యార్థులు హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. తక్షణం చికిత్స అందించడంతో ఆ విద్యార్థి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయంపై ఢిల్లీలోని యూజీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. వెంటనే స్పందించిన యూజీసీ అధికారులు ఎయిమ్స్‌ అధికారులతో మాట్లాడారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్‌ ఉన్నతాధికారుల బృందం విచారణ జరిపింది. అంతర్గత విచారణ జరిపిన యాంటీ ర్యాగింగ్ కమిటీ  ర్యాగింగ్‌ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. ప్రాథమికంగా 15 మంది విద్యార్థులను బాధ్యులుగా తేల్చింది.  అయితే,  వారిలో ఇద్దరికి సంబంధంలేదని తర్వాత తేల్చారు. బాధ్యులుగా 13 మంది సీనియర్‌ విద్యార్థులను గుర్తించారు.  వారిలో ఒకరిని 18 నెలలపాటు, మిగిలిన వారిలో కొందరిని 12 నెలలు, మరి కొందరిని ఆరు నెలలపాటు  ఎకడమిక్ క్లాసుల నుంచి సస్పెండ్ చేశారు. అంతే కాకుండా, వారిని కోర్సు పూర్తి అయ్యేంతవరకు హాస్టల్ నుంచి బహిష్కరించారు.  అందరికీ రూ.25 వేలు చొప్పున జరిమానా విధించారు. 13 మందిని వసతి గృహం నుంచి ఖాళీ చేయించారు. విద్యార్థుల అందరితో అంతర్గత విచారణ పూర్తయిన తర్వాతే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు అధికార ప్రతినిధి డాక్టర్ వంశీ కృష్ణా రెడ్డి వివరించారు.  బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు స్వస్థలానికి తీసుకెళ్లిపోయారు.  అయితే, ర్యాగింగ్ చేసినవారిలో మంగళగిరి ఎయిమ్స్‌ డీన్‌ కుమారుడు ఒకరు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎయిమ్స్‌లో ఇంత జరిగినా వారం రోజుల వరకు బయటకు తెలియనివ్వలేదు. మీడియాకూ సమాచారం లేదు. యాజమాన్యానికి సన్నిహితంగా ఉండే ఒకరిద్దరు మీడియా ప్రతినిధులు కూడా ఈ ఘటనను  బయటకు వెల్లడించలేదు. అందువల్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై నిబంధనల ప్రకారం  పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎయిమ్స్‌ అధికార ప్రతినిధి చెప్పారు. ఫిర్యాదు రాతపూర్వకంగా ఇవ్వకుండా, మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాలేదు. ఆ విద్యార్థిని గానీ,  బాధిత విద్యార్థి గానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ నేపథ్యంలో అనుమానాలు ఇంకా ఎక్కువవుతున్నాయి.  ఈ ఘటనపై మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు అధికార ప్రతినిధి స్పష్టంగా సమాధానాలు చెప్పలేదు.  ర్యాగింగ్ చేసినవారిలో ఎయిమ్స్‌ డీన్‌ కుమారుడు ఉన్నారా? అన్న ప్రశ్నకు ఒకసారి లేదని ఖండించారు. మరోసారి, ఎవరున్నా అందరికీ ఒకే రకమైన పనిష్‌మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. ఇంతకు మించి చెప్పే అధికారం తనకు లేదని స్పష్టం చేశారు. అయితే, విద్యార్థుల భవిష్యత్తు రీత్యా వారి పేర్లను బయట పెట్టడంలేదని చెప్పారు.  కమిటీ కూడా అదే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మీడియా వారు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే,  విద్యార్థుల పేర్లు వెల్లడికాకపోవడంతో వారిలో ఎయిమ్స్‌ డీన్‌ కుమారుడు ఉన్నాడా? లేడా? అన్నది స్పష్టంగా తెలియడంలేదు.

మరో వైపు ఇది ర్యాగింగ్ కాదని,  ప్రేమ వ్యవహారం, సీనియర్ మహిళా విద్యార్థినిని జూనియర్ విద్యార్థి వీడియో తీయడం వల్ల జరిగిన గొడవగా చెబుతున్నారు. ఈ విషయం బయటకు తెలిస్తే, కాలేజీ పరువు పోతుంది. అలాగే, ఆ విద్యార్థిని భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. ఇది వాస్తవం.  అందువల్ల విద్యార్థిని విషయాన్ని  బయటకు వెల్లడికాకుండా జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ప్రశ్నించగా, అధికార ప్రతినిధి సమర్థించలేదు. ఖండించలేదు. విలేఖరులు అడిగిన ప్రశ్నలను విని ఊరుకున్నారు. స్పందించలేదు.  కాలేజీ పరువు, ప్రతిష్టలు, విద్యార్థుల భవిష్యత్తు రీత్యా తమకు సహకరించమని మాత్రం ఆయన విజ్ఞప్తి చేశారు. దక్షిణ భారతదేశంలోనే మొదటగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన  ప్రతిష్టాత్మక కాలేజీ అయినందున, ఇక్కడ పాలనా వ్యవహారాలను  సమర్థవంతంగా నిర్వహించవలసిన అవసరం  ఉంది. ఈ ఘటనతో ఇక్కడ అడ్మినిస్టేషన్ లో లోపం ఉన్నట్లు స్పష్టమవుతోంది.  దేశంలోని నలుమూలల నుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా విద్యార్థులు వచ్చి ఇక్కడ చేరుతుంటారు. విద్యార్థులలో డీన్‌ కుమారుడితోపాటు ఎవరున్నా క్రమశిక్షణతో మెలిగే విధంగా ఎయిమ్స్ యాజమాన్యం  పటిష్టమైన చర్యలు తీసుకోవలసి ఉంది. ఎయిమ్స్ ప్రతిష్టని నిలబెట్టడం బాధ్యతగా భావించాలి.  మళ్లీ ఇటువంటి సంఘటన మరొకటి జరిగితే కాలేజీ ప్రతిష్ట మంటగలిచే ప్రమాదం ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను ఇక్కడ చేర్చడానికి, అలాగే విద్యార్థులు కూడా  భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అంశాలన్నిటినీ దృష్టిలోపెట్టుకుని ఎయిమ్స్ యాజమాన్యం ఇక ముందు అత్యంత బాధ్యతగా వ్యవహరిస్తుందని ఆశిద్దాం.  

                                                      - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

Jul 5, 2025

రాజ్యాధికారానికి దూరమైతే అభివృద్ధిలో వెనుకబడతారు

మంగళగిరి:  ఏ జాతి ప్రజలు రాజ్యాధికారానికి దూరమౌతారో, ఆ జాతి ప్రజలు అభివృద్ధి సాధించడంలో వెనకబడతారని  పద్మశాలీ క్షత్రియ పరిషత్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు,  హైకోర్టు అడ్వకేట్  కొసనం శ్రీనివాసరావు చెప్పారు.  అలాగే అభివృద్ధిలో వెనుకబడిన జాతుల ప్రజలు రాజ్యాధికారం కోల్పోతారన్నారు. చేనేత కార్మిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.  అభివృద్ధి, రాజ్యాధికారం అనేవి పరస్పరం ఒకదానిపై మరోటి ఆధారపడిన అంశాలుగా పేర్కొన్నారు.  ఒకటి లోపిస్తే మరొకటి లోపిస్తుందని, ఒకటి సాధిస్తే మరొకటి సాధించగలం అన్నారు. అలాగే ఒక సామాజిక వర్గ అభివృద్ధిని, రాజ్యాధికారాన్ని సమన్వయ పరిచేది ఆ సామాజిక వర్గం ప్రజల ఆత్మగౌరవం, ఐకమత్యం, సమిష్టి నిర్ణయాలు, కలిసి నడవడం అని వివరించారు.  ఆత్మగౌరవంతో ఐకమత్యం వస్తుందని, ఐకమత్యం ఉన్నవారు సమిష్టి నిర్ణయాలు చెయ్యగలరని, సమిష్టి నిర్ణయాలు కలిసి నడిచేలా  చేస్తాయని తెలిపారు. కలిసి నడిచినప్పడే మన సామాజిక వర్గానికి సామాజిక న్యాయం ప్రకారం దక్కవలసిన రాజ్యాధికారం సాధించగలమని, మన సామాజిక వర్గం ప్రజల అభివృద్ధికి కావలసిన భారీ ప్రణాళికలు ప్రభుత్వంతో అమలు చేయించుకోవాలని పద్మశాలీ సామాజిక వర్గానికి ఆయన పిలుపు ఇచ్చారు.

వ్యక్తిగత ప్రయోజనాలు చాలా చిన్నవని, సామాజిక వర్గం ప్రయోజనాలు చాలా విస్తృతమైనవి, విలువైనవన్నారు.  గతంలో ప్రగడ కోటయ్య నాయకత్వంలో చేనేత కాంగ్రెస్ ఒక పిలుపునిస్తే రాష్ట్రంలో  చేనేత కులవృత్తికి అవసరమైన 5 సహకార స్పిన్నింగ్ మిల్లులు ఆవిర్భవించాయని గుర్తు చేశారు. అనేక వ్యవస్థల నిర్మాణం జరిగిందన్నారు. బ్రిటిష్ పాలనలో చేనేత వృత్తికి, సామాజిక వర్గానికి జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటూ మన సామాజిక వర్గం వికసించిందని కొసనం శ్రీనివాసరావు తెలిపారు. చేనేత సామాజిక వర్గమే రాష్ట్రంలో అతిపెద్ద సంఘటిత సామాజిక , రాజకీయ శక్తిగా రాజకీయ పార్టీల గుర్తింపు పొందిందని తెలిపారు.  కాలక్రమంలో దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న దశలో మన తొలితరం నాయకులు కొంతమంది అస్తమించడం, కొంతమంది వృద్ధాప్యం వలన రాజకీయ ఉధృతి తగ్గిందన్నారు. దేశ పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఆధునిక వస్త్ర ఉత్పత్తి రంగంలో మన సామాజిక వర్గాన్ని మిళితం చేయలేక పోవడం, ముందు చూపుతో సామాజిక వర్గానికి దిశా నిర్దేశం చేసే నాయకత్వ లోపం ఏర్పడిందన్నారు.  పారిశ్రామిక అభివృద్ధిని  అందిపుచ్చుకోవడంలో మనవాళ్లు వెనుకబడిపోయారన్నారు.  చేనేతలోనే మనవాళ్ళు ఉండడం మనల్ని ఆర్థికంగా బలహీన పరిచిందన్నారు.  ఆ విధంగా బలహీనపడి  రాజకీయ ప్రాతినిధ్యం కోల్పోయామని తెలిపారు. 

అయితే, గత కొన్ని సంవత్సరాలుగా మనలో ఆత్మగౌరవం ఉన్నప్పటికీ ఐకమత్యం లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.  మనకు రాజ్యాధికారం లేకపోయినా, మన సంఖ్యాబలం ఉన్న నియోజకవర్గాలలో వేరే సామాజిక వర్గం వారు పాలకులుగా మారినా, మన వ్యక్తిగత ప్రయోజనాలు ఎవరో ఒకరు నెరవేర్చుతున్నారు కదా సామాజిక ఐకమత్యం, సమిష్టి నిర్ణయాలతో పనేముందనే ధోరణి కనిపిస్తుందని, ఇది మంచిది కాదన్నారు. నేడు మన వ్యక్తిగత ప్రయోజనాలు ఎవరో ఒకరు నేరవేర్చుతున్నారు కదా అని మనం అంతటితో తృప్తి చెంది మన సంఖ్యాబలం ఉన్న నియోజకవర్గాలలో రాజ్యాధికారం వదులుకుంటే మన సామాజిక వర్గం ప్రజల విస్తృత ప్రయోజనాలు దెబ్బ తింటాయన్నారు. మన సామాజిక వర్గం ప్రజల అభివృద్ధికి అవసరమైన వ్యవస్థల నిర్మాణం మనం చెయ్యలేమని పేర్కొన్నారు. అందువల్ల,  మనం సామాజిక వర్గం ప్రజల విస్తృత ప్రయోజనాలు సాధన, అభివృద్ధి, రాజ్యాధికారం కోసం మనం ఐకమత్యంగా సమిష్టి నిర్ణయాలు చేసి, కలిసి ఉద్యమాలు చెయ్యడం ఎంతైనా అవసరం అని కొసనం శ్రీనివాసరావు అన్నారు. 

Jul 4, 2025

చేనేత కార్మికుడి నుంచి టీటీడీ చీఫ్ ఆడిట్ అధికారి వరకు


నాకు మంచి మిత్రుడు, ఇంటర్‌లో, డిగ్రీలో నా జూనియర్ అందె వెంకటేశ్వరరావు తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ ఆడిట్ అధికారిగా నియమితులయ్యాడు. చాలా సంతోషించాను.   అతి నిరుపేద చేనేత కుటుంబంలో పుట్టిన వెంకటేశ్వరరావు  ఓ పక్క నేత నేస్తూ, ఇంకో పక్క ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీలో మేం ఇద్దరం ఎకనామిక్స్ విద్యార్థులమే. ఇంటర్‌లోనూ,  డిగ్రీలోనూ క్విజ్‌లో మా ఇద్దరి టీమ్‌లే పోటీపడేవి. నేను మెట్రిక్ వరకు నేత నేశాను. అతను డిగ్రీ వరకు నేత నేసేవాడు.   డిగ్రీ పూర్తి అయిన  తర్వాత  వెంకటేశ్వరరావు ఆంధ్రా యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లోనే పీజీ చేశాడు. ఇక్కడో విషయం చెప్పాలి. సాధారంగా కాలేజీలో, యూనివర్సిటీలలో చేరిన తొలి రోజుల్లో విద్యార్థులకు హోమ్ సిక్ అంటే ఇంటి మీద బెంగ ఏర్పడుతుంది. తల్లిదండ్రులను చూడాలనిపిస్తుంది. కానీ, ఇక్కడ వెంకటేశ్వరరావు తల్లి కొడుకుని చూడకుండా ఉండలేక, మంగళగిరి నుంచి ఒక్కతే ఏకంగా విశాఖపట్నం వచ్చారు. అంత పేదరికంలో ఉండి కూడా ఆమె కొడుకు కోసం వ్యయప్రయాసలకోర్చి ఆంధ్రా యూనివర్సిటీ హాస్టల్ కు రావడం అక్కడి విద్యార్థులను ఆశ్చర్యానికి గురి చేసింది. తల్లి ప్రేమంటే ఇదే.  వెంకటేశ్వరరావు
ఆంధ్రాయూనివర్సిటీలో చదివే సమయంలో నేను నాగార్జునా యూనివర్సిటీలో లా చేశాను. ఆ తర్వాత వెంకటేశ్వరరావు కూడా నాగార్జున యూనివర్సిటీలో లాలో చేరాడు. నేను కూడా ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో బీజేఎంసీ, ఎంజేఎంసీ చేశాను.  2023లో  నాగార్జునా యూనివర్సిటీ లా డిపార్ట్ మెంట్ ఓల్డ్ స్టూడెంట్ మీట్ లో అందరం కలిశాం. ఆ ఫొటోనే ఇక్కడ పోస్ట్ చేశాను. వెంకటేశ్వరరావు మొదటి నుంచి మెరిట్ స్టూడెంట్. కష్టపడి ఇష్టంగా చదివే స్వభావం. సౌమ్యుడు. ఏ అవలక్షణాలు లేని ఉత్తముడు.    1996లో గ్రూప్ -1 సాధించాడు. ఆడిట్ డిపార్ట్ మెంట్ కు ఎంపికయ్యాడు. అయితే, వివిధ శాఖలలో, వివిధ హోదాలలో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. స్టేట్ ఆడిట్ డిపార్ట్ మెంట్‌లో  జాయింట్ డైరెక్టర్/చీఫ్ ఆడిట్ ఆఫీసరు హోదాలో  ఉన్న వెంకటేశ్వరరావుని ప్రభుత్వం టీటీడీ చీఫ్ ఆడిట్ ఆఫీసర్ గా నియమించింది. కష్టపడి చదువుకుంటే, విజయం తప్పక వరిస్తుందనడానికి నిదర్శనం వెంకటేశ్వరావు. చేనేత కార్మికుడి నుంచి టీటీడీ చీఫ్ ఆడిట్ ఆఫీసర్ గా ఎదిగి, యువతకు ఆదర్శంగా నిలిచిన  వెంకటేశ్వరరావుకు అభినందనలు.మంగళగిరి అంటే చేనేత (పద్మశాలీలు), లక్ష్మీనరసింహ స్వామి గుర్తుకు వస్తాయి. అలాగే, మంగళగిరిలో కష్టజీవులు ఎక్కువ. మంగళగిరిలో చేనేత వర్గానికి చెందిన అత్యధికులు చేనేత కార్మికుడిగా లేక పడుగులు చూస్తూ చదువుకున్నవారే.ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు. ఇటీవలే మంగళగిరికే చెందిన ఉడతా బసవరావు కర్నూల్ లోని రాయలసీమ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యాడు. బసవరావు కూడా  పడుగులు చేస్తూ ఎంతో కష్టపడి చదువుకున్నాడు. వెంకటేశ్వరరావు, బసవరావు క్లాస్ మీట్స్. మంచి మిత్రులు. 

మరో ముఖ్య విషయం చెప్పాలి. మంగళగిరిలో చేనేత వర్గానికి చెందిన వారే కాదు, అందరూ కష్టజీవులే. ఈ ఫొటోలో ఉన్న మా మిత్రుడు ఓబులాపురం వెంకటేశ్వర్లు మరో గ్రేట్ పర్సన్. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ న్యాయసలహాదారుగా ఉన్నాడు. వెంకటేశ్వర్లు చిన్నప్పటి నుంచి బార్బర్ వృత్తి చేసుకుంటూ చదివాడు. లా పూర్తి చేసేవరకు కూడా బార్బర్ షాపు నడిపాడు. సొంతంగా బార్బర్ షాపు నిర్వహిస్తూ, అదే వృత్తి చేస్తూ, డిగ్రీ, బీఎల్, ఎంఎల్ చదివి ఈ స్థాయికి చేరాడు. అందుకే మా మంగళగిరి అంటే, మాకు అంత గొప్ప. ఈ ఫొటోలో ఉన్న మరో మిత్రుడు అవ్వారు శ్రీనివాసరావు. మేమిద్దరం జర్నలిజంలో స్థిరపడ్డాం. ఇంటర్ లో మాది ఒకే బ్యాచ్.  శ్రీనివాసరావు బైపీసీ, నేను హెచ్ఈసీ. ఆ తర్వాత శ్రీనివాసరావు నాగార్జునా యూనివర్సిటీలో ఎంఏ ఆర్కీయాలజీ చేస్తే,  నేను లా చేశాను. ఆ తర్వాత మేం ఇద్దరం చాలా కాలం కలిసే జర్నలిస్టులుగా పని చేశాం. అవ్వారు శ్రీనివాసరావుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తమ జర్నలిస్టు అవార్డు కూడా ఇచ్చింది. 


Jul 2, 2025

కమ్మ వారి విశిష్టత

కమ్మవారి చరిత్ర 

కమ్మ అనేది  భారతదేశంలో ఒక బలమైన కులంగా విరాజిల్లుతోంది.  కమ్మ సామాజిక వర్గం వారు  ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో ఉన్నారు. కొంత మంది ఇంటి పేరు కమ్మ అని కూడా ఉంటుంది. ఈ కులంలోని వారు చివర చౌదరి లేదా నాయుడు అని గౌరవంగా పెట్టుకుంటారు.  మొదటి కమ్మ మహాసభ  1910లో కృష్ణా జిల్లా కౌతారంలో జరిగింది.  ఈ సభ నిర్వహణలో  కంఠంనేని వెంకట రంగయ్య, బొబ్బా పద్మ నాబయ్య కీలక పాత్ర పోషించారు. కమ్మ అన్న పదం సామాన్య శకం (క్రీస్తు శకం) ఒకటో శతాబ్దం నుంచి ఉంది. కమ్మ వారి పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర విషయంలో పలు సిద్ధాంతాలు, వాదనలు ఉన్నాయి. గుండ్లకమ్మ, పేరికమ్మ (కృష్ణా నది) నదుల మధ్య ఉన్న ప్రాంతాలను ప్రాచీన ప్రాంత విభాగమైన కమ్మనాడుగా పిలిచేవారు. ఆ ప్రాంతంతో కమ్మవారి మూలాలు ముడిపడివుండడంతో ఈ కులానికి కమ్మ అన్న పేరు వచ్చినట్టు చెబుతారు. 

 కమ్మ కులస్తులైన  కొందరు చరిత్రకారులు రాసిన  ప్రకారం వీరు సామాన్య శక పూర్వం గంగా మైదానంలోని కర్మ రాష్ట్రానికి చెందిన బౌద్ధులనీ, సా.శ.పూ. 184 సమయంలో రాజ్యానికి వచ్చిన పుష్యమిత్ర సుంగుని కాలంలో పెద్ద సంఖ్యలో దక్షిణాదిన ఉన్న కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి వలస వచ్చారనీ చెప్తారు. సంస్కృతంలోని కర్మ పదం పాళి భాషలోని కమ్మగా మారిందనీ, ఆ పదాన్నే వీరు వెంట తీసుకువచ్చి తమను కమ్మ కులస్తులుగా చెప్పుకున్నారనీ అంటారు. ఈ సిద్ధాంతం కృష్ణా పరీవాహక ప్రాంతాల్లోని బౌద్ధ సంస్కృతిని వారు కమ్మ రాష్ట్రం నుంచి తీసుకువచ్చారని పేర్కొంటోంది. సా.శ. పదో శతాబ్దం నుంచి కమ్మ వారు ఒక కులంగా ఉన్నట్టు ప్రస్తావనలు ఉన్నాయి. ఐతే, కమ్మనాడు సంబంధించిన మిగతా వర్గాలను కూడా చారిత్రకంగా కమ్మ బ్రాహ్మణులు, కమ్మ కాపులు, కమ్మ కోమటులు అని పిలిచేవారు. కాలక్రమములో ఈ భౌగోళిక సూచన కమ్మ వారికి మాత్రమే కుల నామమంగా మిగిలిపోయింది.

కమ్మ వారు ఎక్కువగా ఆంధ్ర పాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నారు. ఇక్కడ నుంచి వీరు ప్రపంచం వ్యాప్తంగా విస్తరించారు. కమ్మవారు ఆడ అయినా, మగ అయినా కష్టపడే స్వభావం కలిగినవారు. అందువల్లే వీరు  ఏ రంగాలోనైనా ఇట్టే ఇమిడిపోతారు. విద్య, వైద్యం, సాంకేతిక పరిజ్ఞానం, సాహిత్యం, సినిమా, వ్యాపారం... ఇలా రంగాల్లో అత్యున్నత స్థాయిలకు ఎదిగారు. అంతే కాకుండా వీరు సామాజిక చైతన్యం కలిగినవారు. కమ్యూనిస్టు పార్టీలలో కూడా  కమ్మ వారు చాలా కీలకమైన పదవులను అలంకరించారు.  తెలుగు దేశం పార్టీ పుట్టే వరకు కమ్మ వారు ఎక్కువ మంది కమ్యునిస్టు ఉద్యమంలోనే పని చేశారు.  గుంటూరు జిల్లాకు చెందిన కమ్మ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన త్రిపురనేని రామస్వామి చౌదరి కులాలకు వ్యతిరేకంగా గొప్ప సామాజిక ఉద్యమానికి నాయకత్వం వహించారు.   కమ్మవారి ప్రధాన వృత్తి వ్యవసాయం. వీరు వ్యవసాయం చేయడంలో దిట్టలు. అత్యుత్తమ వ్యవసాయ పద్దతులు అవలంబించేవారు.  కృష్ణా నది ప్రవహించే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో  వ్యవసాయంలో పట్టు సాధించి మంచి స్థితిమంతులుగా ఎదిగారు.  కమ్మ వారు శతాబ్దాలుగా వ్యవసాయం ప్రధాన వృత్తిగా కొనసాగింది. కృష్ణా డెల్టా ప్రాంతంలో 20 శాతం జనాభా, 80 శాతం వ్యవసాయ భూమి వీరిదేనని చెబుతారు.   వీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఆయా ప్రాంతాలలో భూములను వ్యవసాయం చేస్తూ సస్యశ్యామలంగా ఉంచుతారు. కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి వెళ్లిన కమ్మవారు తెలంగాణ, కర్ణాటకలలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. అక్కడి వారికి కూడా నూతన వ్యవసాయ పద్దతులను అలవాటు చేశారు. వారు క్రమంగా ఆయా ప్రాంతాలలో స్థితిమంతులుగా,  ఆర్థికంగా, వ్యాపారస్తులుగా స్థిరపడిపోయారు.  ఆ విధంగా వారూ లాభపడ్డారు. ఆయా ప్రాంతాలను అభివృద్ది చేశారు. కాల క్రమంలో కమ్మవారు చదువులలో, రాజకీయాలలో, సినిమా తదితర రంగాలతోపాటు అన్ని రకాల వ్యాపారాలలో బాగా రాణించారు. వారి పిల్లలు ఆడ, మగ ఉన్నత చదువులు చదివి విజ్ఞాన వంతులుగా ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రతిభను చాటుతున్నారు. అలాగే, వ్యాపారంలో కూడా వీరు బాగా రాణిస్తున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, జగ్గయ్య, కృష్ణ, శోభన్ బాబు, మురళీమోహన్, నాగార్జున, బాలకృష్ణ,  ఎల్.వి.ప్రసాద్,  డి.రామానాయుడు తదితరులు అగ్రకథానాయకులుగా, దర్శక, నిర్మాతలుగా  సినిమా రంగాన్ని ఏలారు. ఏలుతున్నారు. రామోజీరావు, కేఎల్ఎన్ ప్రసాద్.. వంటి వారు పత్రికా రంగాన్ని కూడా ఏలారు.

చారిత్రకంగా కాకతీయ సామ్రాజ్యంలో కమ్మ వారు సైన్యాధ్యక్ష హోదా నుంచి పలు కీలక సైనిక పదవుల్లో ఉండేవారు. కాకతీయ సామ్రాజ్యం పతనం చెందిన తర్వాత కాకతీయ సేనానులు కమ్మ నాయకులైన ముసునూరి ప్రోలయ నాయకుడి నాయకత్వంలో తిరుగుబాటు చేసి ఓరుగల్లు స్వాధీనం చేసుకున్నారు. సంక్లిష్టమైన దశాబ్దాల్లో  ముసునూరి నాయకులు ఓరుగల్లు రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించారు. దక్షిణ భారతదేశంలో హైందవ రాజవంశాలు పట్టు సంపాదించేందుకు అవకాశం కల్పించారు.  కమ్మ కులస్తులు  ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకున్న తర్వాత ఓరుగల్లు పేరును, ఓరుగల్లు తోరణం వంటి చిహ్నాలను తమ కుల సంఘాలు, కాలనీలు, ప్రదేశాలకు ఔన్నత్య సూచకంగా ఉపయోగించుకుంటున్నారు. ముసునూరి నాయకుల రాజ్యం పతనం తర్వాత విజయనగర సామ్రాజ్యం సైనిక విభాగంలో సామంత రాజులుగా కమ్మవారు ఉన్నారు.  విజయనగర సామ్రాజ్య విస్తరణలో భాగంగా నేటి తమిళనాడు ప్రాంతాలకు సైనికులు,  సైన్యాధ్యక్షులుగా పలు హోదాల్లో కమ్మ వారు వెళ్ళారు. అమరావతి కేంద్రంగా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పాలించారు. ఆయన హయాంలోనే మంగళగిరిలోని గాలిగోపురం నిర్మించారు. 

  గణనీయమైన సంఖ్యలో  తమిళనాడు ప్రాంతాల్లో స్థిరపడ్డ వీరు  అక్కడ వ్యవసాయ భూములను, కొత్తగా అడవులను కొట్టి సాగులోకి తెచ్చారు. హైదరాబాద్ సంస్థానాన్ని నిజాంలు పరిపాలిస్తున్న కాలంలో స్థానిక రాజకీయ సంతులన కోసం, రెవెన్యూ వృద్ధి కోసం కృష్ణా డెల్టా నుంచి వలస వచ్చిన కమ్మవారిని నిజాం సాగర్ ప్రాజెక్టు లబ్ధి ప్రాంతాల్లో ఉదారంగా భూములు, రెవెన్యూ హోదాలు ఇచ్చాడు. ఈ ప్రాంతాల్లో కూడా కమ్మవారు స్థిరపడి వ్యవసాయం చేశారు.  భూ సంస్కరణల ద్వారా, రైతాంగ పోరాటాల ద్వారా గ్రామాల్లో నివసించని భూస్వాములు, బ్రాహ్మణుల భూములు  గ్రామీణ రైతులైన మరికొందరు కమ్మవారికి దక్కాయి. వ్యవసాయ వలసల్లో కింది స్థాయి కమ్మ వ్యవసాయదారులు కృష్ణా డెల్టాలోని కొద్ది భూములను అమ్ముకుని తెలంగాణ, రాయలసీమల్లోని సాగునీటి సౌకర్యం లేని భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి, బోరు బావుల ద్వారా సాకులోకి తీసుకువచ్చారు. ఆ విధంగా కమ్మ వారు ఏ ప్రాంతానికి వెళ్లినా కష్టపడి, వ్యవసాయంలో వారికి ఉన్న ప్రావీణ్యం ద్వారా అక్కడి భూములను సాకులోకి తీసుకువచ్చి వారు ఆర్థికంగా లాభపడేవారు. ఆయా ప్రాంతాలు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు కారకులయ్యేవారు. అన్ని అంశాలలో మహిళది కూడా కీలక పాత్రగా ఉంటుంది.   నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు, కెసి కెనాల్, తుంగభద్ర, పెన్న నదుల ఆయకట్టుల్లో  మధ్య స్థాయి, సంపన్న కమ్మ వ్యవసాయదారులు విస్తారంగా భూములు కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చిన్న కమతాలు కలిగిన కమ్మ కుటుంబాలు తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలో, మంచి నీటివసతి కలిగిన చవకైన భూములు కొనుగోలు చేసి వలస వెళ్ళి  పెద్ద వ్యవసాయదారులుగా అభివృద్ధి చెందారు.

కమ్మ వారు 20వ శతాబ్ది రెండవ అర్థభాగం నుంచి పలు రంగాల్లో వ్యాపార, ఉద్యోగ హోదాల్లో రాణిస్తున్నా, పలు కుటుంబాల ఆర్థిక కేంద్రం వ్యవసాయం నుంచి తరలిపోయినా కృష్ణా డెల్టాలోని భూములను పూర్తిగా అమ్ముకోలేదు. పలువురు ఇతర వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాల కారణంగా స్వయంగా వ్యవసాయం చేసే పరిస్థితి లేకున్నా, ఇతర ప్రాంతాలకు వెళ్లినా ఇక్కడి ఈ భూములను అమ్ముకోలేదు.  కౌలుకు ఇచ్చి భూములపై తమ యాజమాన్యాన్ని కొనసాగిస్తూ రావడం ప్రత్యేక అంశంగా చెప్పుకోవచ్చు. భూమి విలువ, భూమి ప్రాధాన్యత తెలిసిన విజ్ఞులుగా గుర్తింపు పొందారు. 

వాసిరెడ్డి, శాయపనేని, పెమ్మసాని, రావెళ్ళ, యార్లగడ్డ, సూర్యదేవర వంటి కమ్మ వారి వంశాలు సంస్థానాలను పరిపాలించాయి. ఆధునిక యుగంలో  ఎన్టీఆర్ రాకతో రాజకీయ రంగంలో  వీరు బాగా రాణించారు. ఎన్టీఆర్ రాజకీయంగా ఓ ఊపు తెచ్చారు.   రాజకీయాలలో ఓ పట్టు సాధించారు. అందుకు ఉదాహరణగా తొమ్మిది సార్లు, ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడుని చెప్పుకోవచ్చు.  ఏపీలో 175 మంది ఎమ్మెల్యేలలో  35 మంది ఎమ్మెల్యేలతో  కమ్మ కులం టాప్ లో ఉంది. 

1960, 70 దశకంలో అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా  వెళ్లిన కమ్మవారు దేశానికి పేరు తెచ్చారు. వ్యాపారలలో గుర్తింపు పొందారు. తిరిగి వచ్చిన వారు వైద్యంలోనూ, ఇతర వ్యాపారాలలోనూ అత్యున్నత స్థాయికి ఎదిగారు. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ... తదితర ప్రాంతాలలో కమ్మ సామాజిక వర్గం వారి ఆస్పత్రులే ఎక్కువగా ఉన్నాయి.  జనాభా శాతం తక్కువైనా  సమాజంలో ప్రాధాన్యత కలిగిన వర్గంగా  కమ్మవారు కొనసాగడానికి వారంతా  దోహదపడ్డారు. 


- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914



Jul 1, 2025

వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్ మంజూరు చేయండి


విజయవాడ : వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్ మంజూరు చేయమని ఏపీ వెటరన్ జర్నలిస్టుల యూనియన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఈరోజు వెటరన్ జర్నలిస్టులు సమావేశంమై పలు తీర్మానాలు చేశారు.  ప్రధానంగా పెన్షన్, హెల్త్ కార్డుల గురించి చర్చించారు.   వెటరన్ జర్నలిస్టులు వెంకటరత్నం, ఎంవీ రామారావు, శిరందాసు నాగార్జున రావు మాట్లాడుతూ,    దేశంలో 16 రాష్ట్రాల్లో జర్నలిస్టులకు గౌరవ పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు.  మన రాష్ట్రంలో కూడా కనీసం 20 ఏళ్ల సర్వీసు ఉండి, 60 ఏళ్లు నిండిన, అక్రిడేషన్ కలిగిన   వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అక్రిడేషన్ కలిగిన వెటరన్ జర్నలిస్టులు రాష్ట్రంలో 400 మందికి మించి ఉండరని తెలిపారు. కనీసం రూ.20 వేలు పెన్షన్ ఇవ్వాలని వారు కోరారు. ఇది ప్రభుత్వానికి పెద్ద భారం కాదన్నారు.  365 రోజులు,24 గంటలు పనిచేసిన 60 ఏళ్లు నిండిన వెటరన్ జర్నలిస్టులు ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పారు. అనేక మంది చాలా దయనీయమైన స్థితిలో బతుకుతున్నట్లు తెలిపారు.  వారికి ఏ విధమైన ఆదాయ మార్గంలేక అనేక అవస్థలు పడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిలాగా పనిచేసిన వెటరన్ జర్నలిస్టులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 


అలాగే, వృద్ధాప్యంలో వెటరన్ జర్నలిస్టులు అనేక ఆరోగ్య సమస్యలతో బాధలు పడుతున్నట్లు తెలిపారు. అనేక మంది సీనియర్ జర్నలిస్టులు సమయానికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు.   పక్కన తెలంగాణతో సహా అనేక రాష్ట్రాలలో ప్రభుత్వ, కార్పోరేట్ ఆస్పత్రులతో సహా క్యాష్ లెస్ వైద్యంతోపాటు మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారని, ఆ విధంగా మన రాష్ట్రంలో వైద్యం అందించేందుకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. అలాగే, ప్రభుత్వం రూ.10 లక్షల జీవితా బీమా కల్పించాని విజ్ఞప్తి చేశారు.  జర్నలిస్టులకు గౌరవ పెన్షన్  కర్నాటక రూ.15వేలు, హర్యాణా, రూ.15వేలు, తమిళనాడు రూ.8వేలు, యూపీ  రూ.8వేలు, మహారాష్ట్ర - రూ.10వేలు, మణిపూర్ రూ.10వేలు, పంజాబ్ రూ.12వేలు, అస్సాం రూ.8వేలు, గోవా  రూ.8,500,  కేరళ  రూ.6వేలు  నెలనెలా  ఫించన్ ఇస్తున్నట్లు వివరించారు. సమావేశంలో జి.చంద్రశేఖర్,  ఆజాద్, స్వాతి, మారుతీ మోహన్ తదితరులు మాట్లాడారు.  అనంతరం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్దకు వెళ్లి  వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్ మంజూరు చేయమని కోరుతూ ఒక వినతి పత్రం ఇచ్చారు.


 ఏపీ వెటరన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గం

విజయవాడ ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన ఏపీ వెటరన్ జర్నలిస్ట్ యూనియన్ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తిరుపతికి చెందిన  టి.జనార్దన్ అధ్యక్షులుగా, గుంటూరుకు చెందిన గుంటూరు చంద్రశేఖర్ జనరల్ సెక్రటరీ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా తిరుపతికి చెందిన నరేంద్రరెడ్డి, అమరావతికి చెందిన జి.రామారావు, అనంతపురానికి చెందిన ఆజాద్, విజయవాడకు చెందిన కె.వెంకటరత్నం ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శులుగా అనంతపురానికి చెందిన వి.చంద్రశేఖర్, విజయవాడకు చెందిన స్వాతి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా పట్నాయక్(శ్రీకాకుళం), జియన్ రావు(అమలాపురం), ఎల్ ప్రసాద్(గుడివాడ), గణపతిరావు(విజయవాడ), జయరామిరెడ్ఢి(సత్యసాయి జిల్లా), శివరాంజనేయులు(అనంతపురం), తిమ్మప్ప (సత్యసాయి జిల్లా), మారుతీ మోహన్(అనంతపురం), సిహెచ్ వీఎన్ శర్మ( విజయవాడ), వేగి రామచంద్రరావు(విశాఖ) కోశాధికారిగా యం. వి.రామారావు ఎన్నికయ్యారు.



తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...