పచ్చి బాలింత పోటీ పరీక్షకు హాజరై చరిత్ర సృష్టించింది
మనసుపెట్టి కష్టపడితే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చని నిరూపించింది ఓ గిరిజన యువతి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు యువతీయువకులు తెలుసుకోవలసిన ఓ చదువుల తల్లి జీవితం. రెండు రోజుల బిడ్డతో పోటీ పరీక్షకు హాజరై విజయం సాధించింది.స్వతంత్ర భారతంలో 77 ఏళ్ల తర్వాత తమిళనాడులో మొట్టమొదటి మహిళా గిరిజన న్యాయమూర్తిగా రికార్డుకెక్కింది. ఆ ఎస్టీ యువతి పేరు వి. శ్రీపతి. తమిళనాడులోని తిరువన్నామలై దగ్గర జువ్వాది పర్వతశ్రేణుల మధ్య ఉన్న గిరిజన గూడెం పులియూర్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల శ్రీపతి తండ్రి కాలియప్పన్, తల్లి మల్లిక. శ్రీపతికి ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. చెన్నై నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఏమాత్రం సౌకర్యాలు లేని ఆ గ్రామంలో ఆమె తల్లిదండ్రులు పోడు వ్యవసాయం చేసుకుని జీవించేవారు. వారు ఎక్కడికైనా వెళ్లడానికి బస్సు ఎక్కాలంటే 15 కిలో మీటర్లు నడవాలి. అంతటి మారుమూల గిరిజన గ్రామం అది. వారిది ‘మలయలి’ అనే అత్యంత వెనుకబడిన గిరిజన తెగ. ఆ తెగలో అమ్మాయిలను చదివించడం, బయటకు పంపడం పట్ల అనేక ఆంక్షలు ఉన్నాయి. శ్రీపతి తల్లిదండ్రులు వాటిని పట్టించుకోలేదు. పిల్లలను చదివించాలన్న కోరిక వారిలో బలీయంగా. ఆ గూడెంలో పాఠశాలలు అందుబాటులో లేకపోవడం, కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంతో పిల్లల చదువు కోసం వారు తిపట్టూరు జిల్లా ఎలగిరి హిల్స్ కు దగ్గరలోని 'అత్నావర్' అనే పల్లెకు వలస వెళ్లారు. అక్కడ కూడా పోడు వ్యవసాయమే చేసేవారు. పిల్లలు చదువు ముఖ్యమనుకున్నారు. యలగిరి హిల్స్ లో మంచి స్కూల్ ఉందని సంతోషించారు.శ్రీపతి ప్రాథమిక విద్య, ఇంటర్ అక్కడే అభ్యసించింది. కలియప్పన్ పర్యాటక ప్రదేశాల్లో హౌజ్ కీపింగ్ వంటి పనులు చేసేవారు. శ్రీపతి చదువులో బాగా రాణించింది. మంచి మార్కులతో ఉత్తీర్ణురాలవుతూ ఉండేది. చదువంటే ఎంతో ఇష్టం. ఉన్నత చదువులు చదవాలన్నది ఆమె కోరిక.ఇంటర్ లో మంచి మార్కులతో పాసైంది. ఆమె పట్టుదలను చూసి తల్లిదండ్రులు ఆమెను తిరువణ్ణామలైలో అయిదు సంవత్సరాల "లా" కోర్సు చేర్పించారు. కుటుంబ నేపథ్యం, బంధువుల ఒత్తిడి వల్ల శ్రీపతికి చిన్న వయసులోనే వెంకట్రామన్ అనే యువకుడితో పెళ్లి చేశారు. పెళ్ళైనా ఆ చదువుల తల్లి శ్రీపతి చదువు మాత్రం ఆపలేదు. పట్టుదల వీడలేదు. డాక్టర్ అంబేడ్కర్ లా విశ్వవిద్యాలయంలో పీజీ చేసింది. అప్పుడే తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు జూనియర్ సివిల్ జడ్జి ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్షకు ప్రకటన జారీ చేశారు. అప్పటికే ఆమె గర్భవతి. అయినా పట్టువదల కుండా ఆ పోటీ పరీక్షకు అప్లై చేసింది. సరిగ్గా పరీక్ష సమయానికి డెలివరీ డేట్ వస్తుందని ఆందోళన చెందింది. తల్లిదండ్రులు, తనకు ఇష్టమైన టీచర్ మహాలక్ష్మి, భర్త వెంకట్రామన్ శ్రీపతికి ధైర్యం చెప్పారు. పోటీ పరీక్షకు ప్రిపేర్ అవ్వమని ప్రోత్సహించారు. శ్రీపతి ఆ పరీక్షని ఓ యజ్ఞంలా భావించింది. తల్లి మల్లిక అండతో రాత్రి పగలు చదివి పరీక్షకు సిద్ధమైంది. ఓ పక్క పరీక్ష తేదీ, మరో పక్క డెలీవరీ డేట్ దగ్గర పడుతున్నాయి. పరీక్ష తేదీ కంటే డెలివరీ సమయమే రెండు రోజులు ముందు వచ్చింది. అయినా, పుస్తకాలు వదలలేదు. ప్రిపరేషన్ కొనసాగించింది. 2023 నవంబరు 27 శ్రీపతి పండంటి పాపకు జన్మనిచ్చింది. రెండు రోజులకే 29న పరీక్ష. పరీక్ష రాయాలని శ్రీపతి పట్టుబట్టింది. జాగ్రత్త కావాలని డాక్టర్లు చెప్పినా వినలేదు. తాను కష్టపడి చదివిన చదువు వృధా కాకూడదని అనుకుంది. తల్లిదండ్రులు, భర్త సహకారంతో పసిగుడ్డుతో ప్రయాణమైంది. యలగిరి హిల్స్ నుంచి కారులో పచ్చి బాలింత శ్రీపతి చెన్నైకి నాలుగున్నర గంటల ప్రయాణం చేసి పోటీ పరీక్ష రాసింది. విజయం సాధించింది. 2024 ఫిబ్రవరి 15న సివిల్ జడ్జి పోస్టుకు ఎంపికైంది. రాష్ట్రంలో జడ్జి అయిన మొట్టమొదటి గిరిజన మహిళగా నిలిచింది. యువతకు ఆదర్శ మహిళ అయింది.
తమిళనాడు ప్రభుత్వ ‘ద్రవిడ మోడల్’ విధానంలో రూపొందించిన ‘ద తమిళ మీడియం యాక్ట్’ ప్రకారం తమిళ మీడియంలో చదివిన విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 20 రిజర్వేషన్ కల్పిస్తారు. ఈ చట్టం శ్రీపతి జడ్జిగా ఎంపిక కావడానికి ఉపయోగపడిందని భావిస్తున్నారు. ఎందరు చెప్పినా వినకుండా ప్రాణాలకు తెగించి 200 కిలో మీటర్లు ప్రయాణించి పరీక్ష రాసిన రెండు రోజుల బాలింత శ్రీపతి సంకల్పాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆ రాష్ట్ర క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్, తెలంగాణ మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, సినీ ప్రముఖులు కమల్ హాసన్ వంటి పలువురు ప్రముఖులు ప్రశంసించారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చదువు ఆపకుండా, పోటీ పరీక్షలకు సిద్ధమై విజయం సాధించిన శ్రీపతికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అభినందనలు.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914
No comments:
Post a Comment