Mar 28, 2024

మానవత్వం పరిమళించే మంచి డాక్టర్

ప్రజల మనిషి, ఎంపీ డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్

 

   "వైద్యో నారాయణోహరిః" అన్న ఆర్యోక్తికి నిలువెత్తు నిదర్శనం డాక్టర్ సంజీవ్ కుమార్.  సమాజంలోని వేలమంది నిరుపేదల గుండె చప్పుళ్లను వింటూ, ఆపరేషన్ల ద్వారా ప్రాణాలు పోస్తూ పేదరికంపై పోరాడుతున్నారు. వైద్యవృత్తికి న్యాయం చేయాలన్న దృఢసంకల్పంతో ఉచిత ఆపరేషన్లు చేశారు.  ఉచిత పెన్షన్లు అందజేశారు. బ్రతుకు బ్రతకనివ్వుఅన్న సామాజిక స్పృహ వారి ప్రతి చర్యలో కనబడుతూ ఉండేది. పేద విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు మొదలగు సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలోని దారిద్య్రానికి ఆపరేషన్ చేస్తున్నారు. వైద్యుడిగా ఎంతో పేరు గడించిన ఆయన  కర్నూలు జిల్లా ప్రజలకే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజానికానికి సేవ చేయాలన్న మహోన్నత సంకల్పంతో 2019లో రాజకీయాలలోకి ప్రవేశించారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికలలో కర్నూలు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి  విజయం సాధించారు. లోక్ సభలో అడుగుపెట్టి కర్నూలు ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడే అనేక మంచి పనులు చేశారు. ఉన్నత చదువులు చదివిన ఆయన అనర్ఘళంగా ఇంగ్లీషులో మాట్లాడగలిగి ఉండి కూడా మాతృ భాష ఔన్నత్యాన్ని చాటిచెప్పాలన్న ఉద్దేశంతో డాక్టర్ సంజీవ్ కుమార్ పార్లమెంటులో తెలుగులో మాట్లాడారు. చేనేత రంగం, టెక్స్ టైల్ రంగాలలోని అనేక సమస్యలను పార్లమెంటులో లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం చేనేత రంగంపై దృష్టి సారించేవిధంగా కృషి చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతితోపాటు తన ప్రాంతమైన కర్నూలుకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పేదలకు ఉచితంగా మందులు అందజేయడానికి కృషి చేశారు. పేదలకు అతి తక్కువ ధరలకు జన ఔషధి మందులు అందజేయడంలో, జన ఔషధి మందుల షాపులు అధిక సంఖ్యలో  ఏర్పాటుచేయడం  ద్వారా యువతకు ఉపాధి కల్పించడంలో ఎంపీగా  ఆయన కృషి ఎంతో ఉంది.

 డాక్టర్ సంజీవ్ కుమార్ గారి బాల్యం:


వస్త్ర వ్యాపారరంగంలో ప్రముఖులైన  శ్రీ శింగరి శ్రీరంగం
, రంగమ్మ పుణ్య దంపతులకు 3-1-1967వ తేదీన  కర్నూలు నగరంలో డాక్టర్ సంజీవ్ కుమార్ గారు జన్మించారు. ఆరుగురి సంతానంలో రెండవ వారు సంజీవ్ కుమార్. బాల్యం నుంచి ఆయన  చాలా హుషారుగా, చురుకుగా ఉంటూ ఆట పాటలతోపాటు చదువులో  ప్రతిభ కనపరిచేవారు.

 కుటుంబ నేపథ్యం :

 శింగరి శ్రీరంగం గారి కుటుంబంలో సంజీవ్ కుమార్ ఒక్కరే డాక్టర్ కాదు. ఆయన ఇద్దరు సోదరులు, ముగ్గురు సోదరీమణులు మొత్తం ఆరుగురూ డాక్టర్లే. విద్య ప్రాధాన్యతను గుర్తించి వారిని చదివించిన ఘనత అంతా వారి అమ్మానాన్నలదే. పిల్లలు అందరూ ప్రభుత్వ కాలేజీలలో MBBS సీట్లు సాధించడం విశేషం. అంతే కాదు, కోడళ్ళు, అల్లుళ్ళు కూడా డాక్టర్లే. మనవళ్ళు, మనవరాళ్లు  కూడా డాక్టర్లే. ఈ కుటుంబంలో  మొత్తం 21 మంది డాక్టర్లు ఉన్నారు. కర్నూలు జిల్లాలో  వారిది ఓ పెద్ద డాక్టర్ల కుటుంబంగా ప్రసిద్ధికెక్కింది. ఇది బహుశా ఆంధ్ర ప్రదేశ్ వైద్య రంగంలోనే ఒక  అరుదైన రికార్డుగా చెప్పుకోవచ్చు. వీరిలో అత్యధికులు బంగారు పతకాలు సాధించినవారు కావడం మరొక విశేషం.

 డాక్టర్ సంజీవ్ కుమార్ – డాక్టర్ వసుంధరల వివాహం

  సంజీవ్ కుమార్ గారు 4-3-1992న డాక్టర్ వసుంధర గారినిపెళ్లి చేసుకున్నారు. ఆమె ఆయుష్మాన్ హాస్పిటల్ లో స్త్రీ వ్యాధి నిపుణులుగా పని చేస్తున్నారు. వారికి ముగ్గురు సంతానం. కుమార్తె కుమారి డాక్టర్  సౌమ్య కూడా తండ్రి బాటలోనే పయనించి మొదటి ప్రయత్నంలోనే  కర్నూలు మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించి, కోర్స్ పూర్తి చేశారు. ఇద్దరు కుమారులు అక్షయ్ ద్వితీయ సంవత్సరం ఎంబీబీఎస్, అభిరామ్ మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్నారు.

 ప్రతిభాశాలియైన విద్యార్థి :

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు డాక్టర్ సంజీవ్ కుమార్ తొలి నుంచి చదువులలో ప్రతి తరగతిలో ప్రథములుగా నిలుస్తూ, ఉన్నత శిఖరాలు అధిరోహించారు. 1971-1982 మధ్య కాలంలో కర్నూలు సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చదివారు. అక్కడ 1 నుండి 9 వ తరగతి వరకు 1ST Rank, 10వ తరగతిలో 2ND Rank సాధించారు. విద్యార్థి దశలోనే ఆయనలో నాయకత్వ లక్షణాలు కనబడ్డాయి. పదవ తరగతిలో స్కూల్ ప్యూపుల్ లీడర్ గా ఎన్నికై అందరి ప్రశంసలను పొందారు. 1982-84లో కర్నూలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. డిస్టింక్షన్ లో ఉత్తీర్ణులయ్యారు. చదువులలో ఉత్తమ శ్రేణి ఫలితాలు సాధిస్తూనే విద్యార్థి సంఘ ఎన్నికలలో చురుకుగా పాల్గొనే వారు. కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలలో తన మిత్రుల విజయంలో ముఖ్య పాత్ర పోషించి, కింగ్ మేకర్ అయ్యారు.

 కర్నూలు మెడికల్ కాలేజీలో  MBBSలో బంగారు పతకం

1984-1990లో MBBS చదివారు. మొదటి ప్రయత్నంలోనే కర్నూలు మెడికల్ కాలేజీలో  MBBS సీటు సాధించారు. అక్కడ కూడా డిస్టింక్షన్ లో ఉత్తీర్ణులయ్యారు. MBBS ఫైనల్ పరీక్షలలో గైనకాలజీ  విభాగంలో విశ్వవిద్యాలయ స్థాయిలో 1st Rankతో బంగారు పతకం సాధించారు. జనరల్ సర్జరీ విభాగంలో 2ND RANKతో అగ్రస్థానంలో నిలిచారు.  ఇక్కడ కూడా విద్యార్థి సంఘ ఎన్నికలలో ముఖ్యమైన భూమిక పోషించారు.  1992-1995 మధ్య కాలంలో కర్నూలు మెడికల్ కాలేజీలో MS జనరల్ సర్జరీ చదివారు. MS ప్రవేశ పరీక్షలో విశ్వవిద్యాలయ స్థాయిలో 5TH Rank సాధించారు. యూనివర్సిటీ 1ST Rankతో MS పూర్తి చేశారు.

  ఉస్మానియా మెడికల్ కాలేజీలో MChలో డిస్టింక్షన్

1998-2000 : MCh యూరాలజీ సూపర్ స్పెషాలిటీ కోర్సు ప్రవేశపరీక్షలో రాష్ట్ర స్థాయి 2nd Rank సాధించి, హైదరాబాదులోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదివారు. MCh Final పరీక్షలలో డిస్టింక్షన్ లో ఉత్తీర్ణులయ్యారు. ప్రతిభ, అణుకువ ఉంటే దేనినైనా సాధించవచ్చని మన డాక్టర్ గారు విద్యార్థి దశ నుండే నిరూపించి భావితరాలకు మార్గదర్శకులయ్యారు.

 వైద్యసేవలో నిష్ణాతుడు

అత్యధిక సంఖ్యలో లేజర్, లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేసిన ఘనత డాక్టర్ సంజీవ్ కుమార్ ది. ప్రజల మనిషిగా, ఉత్తమ వైద్యులుగా పేరు గడించారు.  1990-1992 మధ్య కాలంలో  కర్నూలు నగరం నరసింగరావుపేటలో  బెంగుళూరు హాస్పిటల్అనే సర్జికల్ క్లినిక్ స్థాపించి, వేల సంఖ్యలో  శస్త్రచికిత్సలు నిర్వహించారు. రెండు వేల రూపాయలకే ఆపరేషన్అన్న నినాదంతో వేలాది మంది పేదల గుండెలలో  పేదల డాక్టరుగా నిలిచిపోయారు. 2000- 2005 మధ్య కాలంలో కర్నూలు నగరం జిప్సన్ కాలనీలో  బెంగుళూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్అనే సర్జికల్ హాస్పిటల్ స్థాపించి యూరాలజీ, లాప్రోస్కోపిక్ విభాగాలలో పేరు గడించారు.

 2006 నుంచి 2022 వరకు

కార్పొరేట్ స్థాయి వైద్యం పేదలకు కూడా అందించాలన్న సంకల్పంతో ఆయుష్మాన్ ద ఫ్యామిలీ హాస్పిటల్ను కర్నూలు వెంకటరమణ కాలనీలో స్థాపించారు. ఇది కార్పొరేట్ ఆస్పత్రి అయినా, ఫీజులు మాత్రం అందరికీ అందుబాటులో ఉంటాయి. అదే దీని ప్రత్యేకత. అది డాక్టర్ సంజీవ్ కుమార్ గారికి మాత్రమే సాధ్యమైంది. పలు సర్జికల్ విభాగాలలో ఆపరేషన్లు చేస్తున్నారు. ఈ  ఆస్పత్రి ద్వారా ఆయన  ప్రజలకు బాగా చేరువయ్యారు. హస్తవాసి మంచిదిఅన్న పేరు పొందారు.పేద ప్రజలకు సంజీవనిని  అందిస్తూ తన పేరును  సార్థకం చేసుకున్నారు.

 వంశ పారంపర్యంగా సేవా తత్పరత

మానవ సేవే మాధవ సేవఅన్న భావం వారి రక్తంలోనే ఉంది.  అమ్మానాన్నల నుండి ఆయనకు అది వారసత్వంగా వచ్చింది. సమస్త దానాలలోకెల్లా గొప్ప దానం భూదానం. దాని ప్రాముఖ్యతను గుర్తించి శ్రీ శ్రీరంగంగారు తన సోదరులతో కలిసి పత్తికొండ గ్రామంలోని పెద్దల ఆస్తి  ఏడు ఎకరాల భూమిని 145 కుటుంబాలకు ఉచితంగా ఇచ్చారు. అదే నేడు ఆంజనేయ నగర్గా రూపుదిద్దుకొని పత్తికొండ పాతపేటలో ఉంది. సమాజంలో వెనుకబడిన వర్గాలవారిని ఆదరించడంలో తాము ముందుంటామని నిరూపించుకున్న కుటుంబం డాక్టర్ గారిది.

 పేదప్రజల గుండె చప్పుడు డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్

తండ్రి లక్షణాలు పుణికిపుచ్చుకున్న డాక్టర్ సంజీవ్ కుమార్ గారు పేద ప్రజల గుండె చప్పుడై  పలుసేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

పెన్షన్లు: మిత్రుడు వేమయ్య, సోదరుడు అచ్యుతరావుతో కలిసి గత రెండున్నర సంవత్సరాలుగా 30 నిరుపేద కుటుంబాలకు నెలకు రూ. 1000/- చొప్పున పెన్షన్ అందిస్తున్నారు.

 ఉచిత వైద్య శిబిరాలు ఉచిత శస్త్రచికిత్సలు : ఆరోగ్యమే మహాభాగ్యంఅన్న సూత్రాన్ని గుర్తించిన డాక్టరు గారు 2008 నుండి 2016  వరకు ఆయుష్మాన్ ఫ్యామిలీ హాస్పిటల్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా 416 ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపీణీ  చేశారు.

 2016లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున మెడికల్ క్యాంపులు : ఆనంద జ్యోతి సేవా ట్రస్ట్, బుట్టా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఒకే రోజు ఏడు ఉచిత మెడికల్ క్యాంపుల ద్వారా 7,520 మందికి ఉచిత వైద్యం అందించారు. వలసలకు పేరొందిన కర్నూలు, కల్లూరు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, దేవనకొండ, పత్తికొండ గ్రామాలలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు.

 ఆనందజ్యోతి పథకం-100 ఉచిత క్యాంపులు 500 ఉచిత ఆపరేషన్లు : 2018లో ఈ పథకం ప్రారంభించారు. ఇప్పటివరకు 62 ఉచిత సర్జరీ క్యాంపులు నిర్వహించి, 375 ఉచిత ఆపరేషన్లు చేశారు. ఆరోగ్యశ్రీ పథకంలో లేనివ్యాధులకు కూడా ఈ పథకం ద్వారా ఉచితంగా శస్త్ర చికిత్సలు చేశారు. ఈ పథకాన్ని నిర్విరామంగా కొనసాగించాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు.

విద్యార్థులకు ప్రోత్సాహకాలు:  మనిషిలో దాగిన శక్తిని వెలికి తీయటకు గల ఏకైక మార్గం ప్రోత్సాహకాలివ్వడం.ప్రతి సంవత్సరం పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు  ప్రోత్సాహకాలు అందిస్తూ వారికి  బాసటగా నిలుస్తున్నారు. 2016 MBBS ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో  1ST RANK సాధించిన  మాచాని హేమలతకు మిత్రులతో కలిసి పౌర సన్మానం చేశారు. రాజకీయ ఉద్దండులు, మేధావులు, వేలాది  మంది జొహరాపురం ప్రజలు ఆమెను దీవించారు. గ్రామీణ నిరుపేద కుటుంబం నుండి వచ్చిన ఆణిముత్యాన్ని గౌరవించి బడుగు బలహీన వర్గాలలో మనోధైర్యాన్ని నింపారు.

ఉద్యోగమేళాలు:  పలు ఉద్యోగమేళాల ద్వారా నిరుద్యోగులకు బాసటగా నిలిచారు.

పోటీ పరీక్షలకు కోచింగ్: ప్రతిభావంతులైన విద్యార్థులకు బ్యాంకింగ్, సివిల్స్ ప్రవేశ పరీక్షలకు కోచింగ్ఇప్పిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు.

వివాహ పరిచయ వేదికలు: గత మూడు సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలకు ఉచిత వివాహ పరిచయ వేదికలు నిర్వహించారు.

ఆపత్కర పరిస్థితులలో మానవత్వం :  కర్నూలు వరదల సమయంలో వందల మందికి ఆయుష్మాన్ ఆసుపత్రిలో ఆశ్రయం కల్పించి భోజన వసతి సమకూర్చారు. ఉచిత వైద్య సేవలు అందించారు. "ఆపద సమయాలలో వెన్ను తట్టి నిలిచి ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు"  అని నిరూపించారు.

సంఘ సేవ:  కుల సంఘాలలో, బలహీన వర్గాలలో ఐకమత్యం సాధించేందుకు ఆంధ్ర ప్రదేశ్ లోని  13 జిల్లాలు పర్యటించి సంఘీయులను విశేషంగా చైతన్య పరిచారు. కర్నూలు ఫోర్ట్ లయిన్స్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా సేవలు అందించారు.

లలిత కళలలో ఉచిత శిక్షణ : తన చుట్టూ ఉన్న ప్రజలు సంతోషంగా ఉండాలన్న మనస్తత్వం ఆయనది. కులమతాలు, ఆర్థిక స్తోమతలకు అతీతంగా అన్నివర్గాల ప్రజలకు లలితకళలలో, POPA ద్వారా, ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. జిల్లా స్థాయి ఉద్యోగస్తులు కూడా  తమ పిల్లలను ఈ శిక్షణా తరగతులకు పంపిస్తున్నారంటే శిక్షణా ప్రమాణాల స్థాయిని మనం అర్థం చేసుకోవచ్చు. తోటి మానవులకు సేవ  చేయటమే తన జీవన విధానంగా చేసుకున్న డాక్టర్ గారు అన్ని వర్గాల వారికి ఆత్మబంధువు అయ్యారు. సేవలతో సమాజ నిర్మాణానికి నడుంకట్టి ముందడుగు వేస్తున్న డా. సంజీవ్ కుమార్ గారు ఆదర్శప్రాయులు.

 రాజకీయరంగ ప్రవేశం

శింగరి శ్రీరంగ వంశాబ్ద  శింగరి సంజీవ కుమార్ శ్రీరంగం రంగమ్మల పుత్ర రత్నం! ఆయన పేరులోనే ఆదర్శం, సేవా గుణం సమ్మిళతములై ప్రకాశిస్తున్నాయి. అందుకే జీవం పొసే సంజీవ కుమార్గా, ప్రముఖ వైద్యులుగా కీర్తి గడించారు. సామాన్యుల కష్టాలు గుర్తెరిగిన కుటుంబం వారిది. అందుకే వంశపారంపరంగా వచ్చిన పొలాన్ని నిలువనీడ లేక నిరాశ్రయులైన వారికి వారి పెద్దలు ధారాదత్తం చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదప్రజల ఇళ్లలో దీపం వెలిగించారు. గాంధీ జయంతి రోజున గాంధేయవాదిగా 'ఆనంద జ్యోతి ట్రస్ట్'ను నెలకొల్పి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ట్రస్ట్ ద్వారా కర్నూలు ఆడపడుచుల జీవితాల్లో ఆనందాన్నినింపారు సంజీవ్ కుమార్, వసుంధర దంపతులు. శ్రీమతి డాక్టర్ వసుంధర స్త్రీవ్యాధి నిపుణురాలిగా పేదమహిళలకు ఉచితంగా వైద్యం చేస్తూ మహిళలకు విశేష సేవచేస్తున్నారు. నిజాయితీగా వైద్య సేవలు చేస్తూ సామాన్యులకు చేరువయ్యారు. బెంగళూరు హాస్పిటల్లో  రెండు వేలకే శస్త్ర చికిత్సలు నిర్వహించి పేదల డాక్టరుగా  ఖ్యాతి గడించారు. నమ్మకానికీ, నైపుణ్యానికీ  మారు పేరుగా వెలిసింది ఆయుష్మాన్ హాస్పిటల్’.  చిన్న-పెద్ద, బీద-ధనిక అను వ్యత్యాసం చూపకుండా, 'నేను మీ అందరి వాడిని' అని నిరూపించుకున్నారు. అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. భాయి భాయి అన్న నినాదంతో అన్ని కులాలను, మతాలను, వర్గాలను ఏకం చేసి ముందుకు నడిపిస్తున్నారు. ఎందరో  కళాకారులను, సామాజిక కార్యకర్తలను, యువతరాన్ని ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులకు చేయూత నిస్తున్నారు.  డాక్టర్ సంజీవ్ కుమార్ రాజకీయాలలో స్థిరపడి, ప్రజలకు ఇంకా చేరువై సేవచేయాలని 2019లో రాజకీయాలలోకి ప్రవేశించారు. లోక్ సభ సభ్యుడయ్యారు. రాజకీయాలలో కొనసాగాలన్న ఉద్దేశ్యంతో   హాస్పిటల్ ను 2022లో మూసివేశారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...