Jun 7, 2023

చేనేత వర్గాలకు పెరుగుతున్న ప్రాధాన్యం


ఆంధ్రప్రదేశ్ లో  చేనేత వర్గాల ఐక్యతకు తోడు రాజకీయ మార్పుల నేపథ్యంలో ఆ వర్గాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం మూడు లక్షల మంది ప్రత్యక్షంగా, 8 లక్షల మంది పరోక్షంగా  చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రంలో పద్మశాలీయులతోపాటు 19 చేనేత కులాలకు


చెందిన వారు 75 లక్షలకుపైగా ఉన్నారు. వ్యవసాయం తరువాత అతి ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది చేనేత రంగం. అయినా వారికి చట్ట సభలలో తగిన స్థానం కరువైంది. జనాభా ప్రాతిపదికన వారికి కనీసం 20 శాసనసభ స్థానాలు దక్కాలి. రాష్ట్రంలోని 175 మంది శాసనసభ్యుల్లో చేనేత కులాల నుంచి ఒక్కరు కూడా లేరు. 
రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన కులాలవారే పోటీ పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. శతాబ్దాలుగా చేనేతకు, చేనేత కులాలకు ప్రసిద్ధిచెందిన మంగళగిరి శాసనసభా స్థానం నుంచి కూడా గత ఎన్నికల్లో ఆ రెండు కులాలవారే పోటీపడ్డారు.  కర్నూలు నుంచి డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్ ఒక్కరే లోక్ సభ సభ్యులుగా  ఎన్నికయ్యారు. అంటే చేనేత వర్గాలకు ఎంత అన్యాయం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. దానికి ప్రధాన కారణం చేనేత కులాల మధ్య ఐక్యత లేకపోవడం, నాయకత్వం లోపం. ఈ కులాల నుంచి, ముఖ్యంగా చేనేత వృత్తికి  చెందినవారు ఎమ్మెల్యేలుగా లేకపోవడంతో చేనేతపై అవగాహనలేని ఇతర కులాలవారు చేనేత శాఖా మంత్రులు అవుతున్నారు.  అందువల్ల చేనేత రంగం  అభివృద్ధి కుంటుపడుతోంది. చేనేత కులాల వారు, చేనేత కార్మికులు ఆర్థికంగా, వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం లేకుండాపోయింది. చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టేవారులేరు. వారి సమస్యలను ఇతర కులాలు, వృత్తులకు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ద్వారా పరిష్కరించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. వీరి సమస్యల పరిష్కారం పట్ల వారు ఆసక్తి చూపించే అవకాశాలు చాలా తక్కువ. చేనేత వృత్తికి సంబంధించిన నూలు, సిల్క్, రంగులు, రసాయనాలు ముడిసరుకులు వంటి వాటి ధరలు, చేనేత ఉత్పత్తులు, అమ్మకాలు, ఎగుమతులు, పన్నులు, సబ్జిడీలు, సౌకర్యాలు.... వంటి సమస్యలు తెలుసుకోవడానికి వారికి సమయం ఉండదు. ఈ కారణంగా కూడా చేనేత సమస్యలు రోజురోజుకు పేరుకుపోతున్నాయి. ఈ రంగం నుంచి రాజకీయంగా నాయకత్వం లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అతి కొద్దిమంది మాత్రమే ఈ రంగం నుంచి రాజకీయంగా ఎదిగారు. రాజకీయ, అధికార భాగస్వామ్యం కోసం చేనేత వర్గాల బలం ఇంకా పెరగవలసి ఉంది. ఆ విషయాన్ని చేనేత కులాలు గుర్తించాయి. అందరినీ ఏకంచేసి ఒక్కతాటిపైకి తీసుకురావడానికి చేనేత సంఘాలు ప్రయత్నిస్తున్నాయి.    రాష్ట్రంలో పద్మశాలి, దేవాంగ, జాండ్ర, పట్టుశాలి, సాలి, స్వకులశాలి, కురిమిసెట్టిశాలి,  సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు, తొగటశాలీలు, తొగుల వీరక్షత్రియ,  కరికాలభక్తులు, సాధనాసూరులు, అచ్చుకట్లవాళ్ళు, దూదేకుల, కైకాల,  కుర్ని, ఖత్రి,  నీలి, నీలకంఠి, కోష్ఠి, నక్కల, పట్కార్, కైకోలన్, సెంగుండం, సెంగుంతర్,  సాలివన్, నెస్సి మొదలైన  దాదాపు 19 కులాల వారు ఏపీలో ఉన్నారు. ఈ కులాల్లో అధిక కులాలు అంత్యంత వెనుకబడిన కులాల(ఎంబీసీ) జాబితాలో ఉన్నాయి. కొన్ని కులాల వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. రాజకీయ నాయకులు పెద్దగా వారిపట్ల దయచూపరు. కొంతమంది ఉన్నతాధికారులు వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటారు. 

చేనేత నేతలు ప్రగడ కోటయ్య, దామర్ల రమాకాంతరావు, కొండాలక్ష్మణ్ బాపూజీ,పుచ్చల సత్యనారాయణ, గోలి వీరాంజనేయులు వంటి వారి తర్వాత ఈ రంగం కోసం పోరాడే నేతలు తగ్గిపోయారు. ఏపీలో నిమ్మల కిష్టప్ప, మురుగుడు హనుమంతరావు, గంజి చిరంజీవి వంటి వారికి తోడు బుట్టా రేణుక, డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్, పోతుల సునీత, పంచుమర్తి  అనురాధ,చిల్లపల్లి మోహన రావు, జింకా విజయలక్ష్మి, బండారు ఆనంద ప్రసాద్, శల కోటివీరయ్య, విశ్వనాధ్, జగ్గారపు శ్రీనివాస్, ఆకాశపు స్వామి, గుత్తికొండ ధనుంజయ, రాజపంతుల నాగేశ్వరావు, పిల్లలమర్రి బాలకృష్ణ  వంటివారు తోడయ్యారు. అయితే, వీరిలో కొందరికి నేరుగా చేనేత రంగంతో సంబంధంలేదు. ముఖ్యంగా చేనేత వృత్తి, కార్మికుల సమస్యపట్ల అవగాహన కలిగి, పోరాట సామర్థ్యం కలిగినవారు తక్కువ మంది ఉన్నారు. చేనేత వర్గాల తరఫున బలంగా పోరాడే వారి సంఖ్య ఇంకా పెరగవలసిన అవసరం ఉంది.

చేనేత వర్గాల నుంచి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధిగా గెలవకపోతే ఏ ప్రభుత్వంలో కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా చేయగలిగింది ఏమీలేదు.  చేనేత కులాల వారికి పరిస్థితి పూర్తిగా అర్ధమైంది.  తమ కులాల నుంచి శాసనసభ్యులను గెలిపించుకోకపోతే పరిస్థితి ఇంకా దిగజారుతుందని వారు గ్రహించారు. ఈ నేపథ్యంలో చేనేత కుల సంఘాలు పునరేకీకరణ అవసరాన్ని గుర్తించాయి. గతంలో క్రియాశీలకంగా ఉన్న  వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ తోపాటు  ఇతర చేనేత కుల సంఘాలను బలోపేతం చేయడం ద్వారా రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాజకీయాలకు అతీతంగా కలసి పనిచేయాలని తీర్మానించారు. అన్ని చేనేత కులాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి రాజకీయ అధికారంలో భాగం చేజిక్కించుకోవడానికి  తీవ్రంగా కృషి చేస్తున్నారు. రాష్ట్రంలోని దాదాపు 35 చేనేత సంఘాలను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి తోడు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ, టీడీపీ కూడా చేనేత వర్గాలను, వారి ఓట్ల శాతాన్ని గుర్తించాయి. దాంతో గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ కేటాయించడంతో డాక్టర్ శింగరిసంజీవ్ కుమార్ కర్నూలు నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. మురుగుడు హనుమంతరావు, పోతుల సునీతలను వైసీపీ శాసన మండలి సభ్యులను చేసింది. అలాగే, చిల్లపల్లి మోహనరావుని, ఆ తర్వాత గంజి చిరంజీవిని ఆప్కో చైర్మన్లు గా చేసింది. మరో పక్క పంచుమర్తి అనురాధను  శాసనమండలి సభ్యురాలిగా టీడీపీ గెలిపించుకుంది. రాష్ట్రంలో 45 శాసనసభ నియోజకవర్గాల్లో గెలుపు-ఓటములు నిర్ణయించగల స్థితిలో చేనేత కులాల వారు ఉన్నారు. ఈ పరిస్థితులను గమనించి 2024 ఎన్నికల్లో ఇరు పార్టీలు పోటీపడి మరీ చేనేత వర్గాలకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఎవరికి వారు చేనేత వర్గాలను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు.  దీనిని సద్వినియోగం చేసుకుని రాజకీయంగా ఎదగాలన్న ప్రయత్నంలో చేనేత కులాలవారు ఉన్నారు.  కాగా,   15 శాసనసభ, 5 లోక్ సభ స్థానాలను  కేటాయించాలని వారు రాజకీయ పార్టీలను డిమాండ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చేనేత వర్గాలు, కులాలు, సంఘాల  ఐక్యతను కొనసాగిస్తూ, ఎన్నికలలో పోటీ చేసే చేనేత కులాల వారికి పార్టీలతో సంబంధం లేకుండా సంపూర్ణ మద్దతు పలకడానికి,  ఆర్థిక సహాయం అందించడానికి కూడా ఆయా సంఘాలు సిద్ధంగా ఉన్నాయి.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...