Jun 1, 2023

సమాజానికి సహకార రంగమే ఆశాదీపం

* సహకారభూమి పక్షపత్రిక ఆవిష్కరణ సభలో మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి


విజయవాడ, మే 31: సహకార రంగం ప్రస్తుతం చాలా చురుగ్గా పనిచేస్తోందని, సహకార రంగంలో ఉపాధి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి శ్రీ  కాకాణి గోవర్ధనరెడ్డి చెప్పారు. సహకారభూమి జర్నల్ సహకార సంఘం లిమిటెడ్ నెం.జి.3211 విజయవాడ ఆధ్వర్యంలో సహకార సంఘాల కోసం ప్రచురించే "సహకారభూమి" పక్ష పత్రికను మంత్రి బుధవారం నగరంలోని శ్యామ్ నగర్ ఎన్జీవో కాలనీలోని సహకారభూమి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి కాకాణి ముఖ్య అతిథిగా మాట్లాడారు. సహకార రంగం పటిష్టతకు అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. ఒకప్పుడు గౌరవాభిమానాలతో వెలిగిపోయిన సహకార వ్యవస్థ రానురానూ రాజకీయ నాయకుల పునరావాస కేంద్రంగా మారిపోవడం దురదృష్టకరమన్నారు. తమ తండ్రి సహకార సంఘం నుంచి రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేసుకున్నారు. సహకార వ్యవస్థపై చాలామందికి సరైన అవగాహన లేదని, అలాగనే అధికారులకు కూడా తగినంత పరిజ్ఞానం లేకపోవడం వల్ల సహకార వ్యవస్థ దెబ్బతిన్నదని మంత్రి అన్నారు. సహకార వ్యవస్థను పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి 298 కోట్ల రూపాయలు నిధిని కేటాయించారని ఆయన చెప్పారు. అనుభవం ఉన్న సహకారవాదులు, జర్నలిస్టులు తీసుకొస్తున్న సహకారభూమి పత్రిక  విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వానికి, సహకార వ్యవస్థకు సహకారభూమి ఒక అస్త్రంగా నిలవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం, అలాగే సహకార మంత్రిత్వ శాఖ సహకారభూమి పక్షపత్రికకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి కాకాణి ఈసందర్భంగా ప్రకటించారు. సహకార రంగ పటిష్టతకు సహకారభూమి లాంటి పత్రికలు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. సహకారం అంటే అపకారం కాదనీ, సహకార రంగంలో ఎందరు సభ్యులు ఉంటే అందరి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఈ రంగం పని చేస్తుందని కొనియాడారు. సహకార రంగంలో నెలకొన్న స్తబ్దతను పోగొట్టేందుకు సహకారభూమి పత్రిక, ఇతర సమాచార మాధ్యమాలు కృషి చేయాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. సహకార రంగంలో ఉపాధి లభించాలంటే ఆ రంగ పటిష్టతకు కృషి చేయాలని, సహకార రంగం ఆధునికీకరణకు తమవంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. దీనికి అందరూ కలిసిరావాలని ఆయన కోరారు. సహకార వ్యవస్థ అంటేనే సహకారభూమి పత్రిక గుర్తురావాలని, ఆవిధంగా మీ కృషి కొనసాగాలని మంత్రి కాకాణి ఆకాంక్షించారు. 

కేడీసీసీ బ్యాంక్ చైర్ పర్సన్ తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సహకార రంగంలో తమ బ్యాంకు సాధించిన ప్రగతిని వివరించారు. సహకారభూమి పక్ష పత్రికకు తాము అన్నివిధాలా సహకరిస్తామని చెప్పారు. తమ పరిధిలోని సహకార సంఘాలన్నీ ఈ పత్రికకు చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు.

వైసిపి తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ సందేశమిస్తూ.. సహకార రంగంలో పత్రిక రావడం మూదావహమని, సీనియర్ జర్నలిస్టులు ఈ పత్రికను తీసుకురావడానికి సంకల్పించినందుకు అభినందించారు‌. సహకార రంగ పటిష్టతకు ఈ పత్రిక దోహదం చేయగలదని ఆకాంక్షించారు. సహకారభూమి వ్యవస్థాపకులు దాసరి కేశవులు మాట్లాడుతూ ఈ పత్రిక లక్ష్యాలను వివరించారు. చరిత్రలో సహకారభూమి ఒక మైలురాయిగా నిలవగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో ఆదర్శవంతంగా నడుస్తున్న ఎలకుర్రు కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ అధ్యక్షుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, పత్రికాధిపతి దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు గారి మనవడు కాశీనాథుని నాగేశ్వరరావుని ఘనంగా సన్మానించారు‌.

కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం నాయకుడు పి. జమలయ్య, సీనియర్ పాత్రికేయులు ఆకుల అమరయ్య, సహకారభూమి సంపాదకులు అక్బర్ పాషా, సహకారభూమి సొసైటీ కార్యదర్శి వీరమాచనేని రత్న ప్రసాద్, కోశాధికారి ఏ ఎల్లారావు, వ్యవస్థాపక సంపాదక మండలి సభ్యులు కెవి కృష్ణ, కె ఎస్ జ్యోతిశ్రీ, టీవీ నరసింహారావు, జివి రంగారెడ్డి, శిరందాసు నాగార్జున, డి.స్వాతి, మాధవి, రవీంద్ర రెడ్డి, సీతారామయ్య, వైద్య ప్రముఖులు, ప్రముఖ రచయిత డాక్టర్ జివి పూర్ణచంద్, సీనియర్ జర్నలిస్టులు, సహకార రంగ ప్రముఖులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...