Nov 1, 2023

చిత్రకళలో తెలుగు వెలుగు

విశ్వ నైరూప్య చిత్రకారుడు ఎస్వీకి జీవితసాఫల్య పురస్కారం

అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక చిత్రకళలో ఎన్నో సంచలనాలు సృష్టించిన తెలుగువాడు డాక్టర్ ఎస్వీ రామారావు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఎస్వీ చదువుకునే రోజుల నుంచే ఆ నాటి పత్రికలు భారతి, ఆంధ్రపత్రిక వంటి వాటికి పలు అంశాలపై వ్యాసాలు రాసేవారు. కవిత్వంలో కూడా చేయితిరిగిన దిట్ట ఎస్వీ.  పద్మశ్రీ అవార్డు పొందిన ఎస్వీ  తైలవర్ణంలో  అద్వితీయమైన చిత్రాలు గీసి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు. చిన్నప్పటి నుంచి చూసిన పరిసరాలు, ప్రపంచంలోని వివిధ సంస్కృతులు, సామాజిక అంశాలే ఆయన నైరూప్య చిత్రకళలో ప్రతిబింబిస్తాయి. దానికి తోడు రంగులు, ఆ రంగుల గీతలలు,  భాష తెలిసిన మేథావి. పుస్తక పఠనంతో పాటు తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేశారు. ఎస్వీ రామారావు 1936 జూన్ 12న కృష్ణా జిల్లా గుడివాడలో  శిరందాసు గంగయ్య, లక్ష్మమ్మలకు జన్మించారు. ఆయన పూర్తి పేరు శిరందాసు వెంకట రామారావు.ఆయనకు ఒక సోదరుడు, ఇద్దరు సోదరీమణులు. 12 ఏళ్ల వయసులోనే ఆయన చిత్రాలు గీయడం మొదలుపెట్టారు. దానికి తోడు ఆ వయసులోనే ఆయనకు గుడివాడలోనే ప్రముఖ చిత్రకారుడు కె.వేణుగోపాల్ గురువుగా దొరికారు. ఆయన ప్రోత్సాహంతో చిత్రకళలో మెళకువలు తెలుసుకున్నారు. చిత్రకళ పట్ల ఆసక్తిని పెంచుకున్న ఎస్వీని చూసి కలప వ్యాపారి అయిన తండ్రి తొలుత ఆందోళన చెందారు. ఇంటికి పెద్ద కుమారుడైన ఎస్వీ తండ్రి కోరికమేరకు 1954లో  బీకాం పూర్తి చేశారు. చరిత్రపై ఆసక్తితో ప్రైవేటుగా బీఏ కూడా పూర్తిచేశారు.  1955 నాటికి  చిత్రకళలో ఆయన  నాలుగు డిప్లొమాలు పూర్తి చేశారు. 

కలకత్తాలోని శాంతినికేతన్ లో శిక్షణ పొందాలన్న కోరిక ఆయనకు ఉండేది. అయితే, అది సాధ్యంకాలేదు. చిత్రకళపట్ల కుమారుని ఆసక్తిని గమనించిన  తండ్రి గంగయ్య చివరకు మద్రాస్  లోని ఓ సినిమా సంస్థలో అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ గా చేర్పించారు. ఆ సినిమా సంస్థలో మంగళగిరి చెందిన కారుమంచి వెంకటసుబ్బయ్య కూడా భాగస్వామి. అక్కడ ప్రఖ్యాత సినిమా ఆర్ట్ డైరెక్టర్ మాధవపెద్ది గోఖలే సలహాతో 6 ఏళ్ల  గవర్నమెంట్ డిపార్ట్ మెంట్ ఫైన్ ఆర్ట్స్ కోర్సు ఎంట్రన్స్ రాశారు. ఆ పరీక్షలో ఎస్వీ ప్రతిభను గుర్తించిన ఆ కళాశాల ప్రిన్సిపాల్ అతనిని నేరుగా మూడవ సంవత్సరంలోకి ప్రవేశం కల్పించారు. అక్కడ నుంచి ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. వివిధ రంగా ప్రముఖులతో పరిచయాలు పెరిగాయి. ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వం, నడవడి అందరినీ ఆకర్షిస్తాయి. 

మద్రాస్ లో  నిష్ణాతులైనవారి వద్ద  చిత్రకళలో  వివిధ రీతులను నేర్చుకున్నారు. వాటర్ , ఆయిల్, టెంపేరా కలర్స్ లో  చిత్రాలు గీసేవారు.పెద్దలతో పోటీపడిమరీ బొమ్మలు గీయడం మొదలుపెట్టారు. జాతీయ స్థాయి పోటీలలో విజేతగా నిలిచారు. దేశంలో చాలా మ్యూజియంలవారు ఎస్వీ చిత్రాలను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అయితే, ఎస్వీ తన పేరుతో కాకుండా పెన్ నేమ్ ‘ఆర్యదేవ’ పేరుతో మాత్రమే చిత్రాలు గీసేవారు. ఆయన భారత్ లో ఉన్నంత కాలం ఆ పేరుతోనే చిత్రీకరించారు.మద్రాస్ మ్యూజియం, కేరళ మ్యూజియం, ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్, హైదరాబాద్ లోని సాలార్ జంగ్ మ్యూజియంలలో ఆయన చిత్రాలు  ఆర్యదేవ పేరుతోనే ఉన్నాయి.

కామన్ వెల్త్ దేశాల చిత్రకారులు 325 మందితో పోటీపడి  కామన్ వెల్త్ ఫెలోషిప్ సాధించారు. ఆధునిక చిత్రకళను అధ్యయనం చేయడానికి 1962లో   ఎస్వీ రామారావు లండన్ వెళ్లారు.  అక్కడ లండన్ యూనివర్సిటీకి చెందిన స్లేడ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో  1965లో కోర్సు పూర్తి చేశారు. లితోగ్రఫీ ఆర్ట్ లో ఎస్వీ దిట్ట. అందులో కొత్తపుంతలు తొక్కారు. లితోగ్రఫీ ఆర్ట్ లో  మాస్టర్ గా  లండన్ లో పేరుగడించారు. 1965లో లితోగ్రఫీ ఆఫ్ ద ఇయర్ గా నిలిచారు.కొత్త కొత్త రంగులు, రేఖలతో ఆయన ఎన్నో అద్భుతాలు సృష్టించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఎస్వీని  ‘గాడ్ గివెన్ కలరిస్ట్’ అని విమర్శకులు కొనియాడారు. అప్పుడే ఆయన చిత్రకళను ప్రశంసిస్తూ లండన్ టైమ్స్ కూడా రాసింది. లండన్ వెళ్లినప్పటి నుంచి ఆయన తన పేరుతోనే చిత్రాలు గీయడం మొదలుపెట్టారు.  ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులు పికాసో, డాలి వంటి వారి చిత్రాల సరసన ఎస్వీ రామారావు చిత్రాలకు స్థానం లభించింది.  1965లో   కామన్ వెల్త్ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో‘ఈ ఏడాది మేటి చిత్రకారుడు’ వంటి అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు.ప్రపంచం మొత్తం ఎస్వీని గుర్తించింది.  ఆ తర్వాత అనేక దేశాలలో పర్యటించారు. తన చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆయన  వెయ్యికి పైగా చిత్రాలు గీశారు. భారత ప్రభుత్వం  2001లో   జాతీయ అవార్డు  పద్మశ్రీతో సత్కరించింది.

 50 ఏళ్లుగా ఎస్వీ  అమెరికాలోనే స్థిరపడ్డా తరచూ భారత్ వస్తుంటారు. ఆయన భార్య డాక్టర్ సుగుణ వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. కుమార్తె పద్మావతి హాస్పిటాలజీలో పీజీ చేసి అదే వృత్తిలో స్థిరపడ్డారు.  పద్మావతి నృత్యకళాకారిణి కూడా. కుటుంబం అమెరికాలో ఉంటున్నప్పటికీ ఎస్వీ  ఒక్కోసారి ఎక్కువ కాలం ఇక్కడే ఉండి చిత్రాలు గీస్తుంటారు. 2008 నుంచి 2015 వరకు ఢిల్లీలోనే ఉండి, అనేక బొమ్మలు గీశారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా తదితర నగరాలలో తన చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.  మొదట అమెరికాలోని  ఒహాయో రాష్ట్రం  సిన్సనాటిలో  యూనివర్సిటీ ఆఫ్ సిన్స నాటిలో టీచింగ్ అసిస్టెంట్ గా పని చేశారు. కెంటకీ రాష్ట్రం బౌలింగ్ గ్రీన్ లోని  వెస్ట్రన్ కెంటకీ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్ ఆఫ్ ఆర్ట్ గా చేసి పదవీవిరమణ చేశారు. పుస్తకాలు చదవడానికి అలవాటుపడిన ఆయన చిత్రకారుడైనా లైబ్రరీ సైన్స్ పై మక్కువతో టెన్నెసీ రాష్ట్రం నేషవిల్ సిటీలోని వేండర్ బిల్ట్ యూనివర్సిటీలో  లైబ్రరీ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. 1980 నుంచి చికాగోలోనే ఉంటున్నారు. ఆయన రాసిన తెలుగు కవితలు మూడు సంకలనాలుగా, ఇంగ్లీషు కవితలు ఒక సంకలనంగా వెలువడ్డాయి. ఆయన రచనలు ఇంగ్లీషు, హిందీ భాషలలోకి కూడా అనువాదం అవుతున్నాయి. 

ఎస్వీ గీసిన చిత్రాలు మద్రాస్ లో ఉన్నప్పుడే హాట్ కేకుల్లా అమ్ముడుపోయేవి. అయితే, అలా అమ్ముడుపోతున్నాయని అవే చిత్రాలు గీసేవారు కాదు. వెంటనే  స్టైల్ మార్చేవారు.కొత్త వన్నెల్లో చిత్రాలు గీసేవారు. అలా గీతలను, రంగులను, కళా రూపాలను మార్చేస్తుండేవారు.అదే ఆయన ప్రత్యేకత. అలా చేయడం వల్లే అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చినట్లు ఎస్వీ తెలిపారు.   అలాగే, అన్ని దేశాలలో ఆయన చిత్రాలను అమ్ముడు పోయేవి. అనేక దేశాల రాయబారులు ఆయన చిత్రాలను ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసేవారు. రాష్ట్రపతి అబ్దుల్ కలాం 5 నిమిషాలు మాత్రమే అపాయింట్ మెంట్ ఇచ్చి, 45 నిమిషాలు  ఆయనతోనే గడిపారు. రాష్ట్రపతి భవన్ లోని గార్డెన్ ని  తనే దగ్గరుండి తిప్పి చూపించారు. అంతేకాకుండా పార్లమెంట్ ఉభయసభల్లో  ఆయన గురించి ప్రశంసిస్తూ రాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

‘‘అన్ని శాస్త్రాలకంటే సాహిత్యం ద్వారానే మనిషి సంపూర్ణుడవుతాడు. తెలియనిది తెలుసుకుంటూ, తనకు  ఇష్టమైన రీతిలో రంగులను ఉపయోగిస్తాను. నవ్యచిత్రకళ  విశ్వజనీనం,  ఈ చిత్రకళలో రూపానికంటే రంగుకే ప్రాధాన్యం.చిత్ర విచిత్రమైన  రంగుల ఇంద్రజాలం ద్వారా విశిష్ట కాంతులను సృష్టించటం ఇందులోని  విలక్షణత. నవ్య చిత్రకళ  వాస్తవ వాదానికి చెందదు. సహజరూపాన్ని  బ్రద్దలుకొట్టి అందులోని ప్రాథమిక రూపాన్ని విశ్లేషణ పద్దతిలో చిత్రించటమే ఇందులోని ప్రధాన లక్షణం’’ అని ఎస్వీ రామారావు చెప్పారు.  చిత్రకళ ద్వారా తెలుగు ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన ఎస్వీ రామారావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  గుర్తించి వైఎస్ఆర్ జీవితసాఫల్య పురస్కారం-2023కు ఎంపిక చేసింది. నవంబరు 1న విజయవాడలో ఆయనకు ఈ అవార్డు అందజేస్తారు.  

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914




No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...